జీవనాడిపై దాడి! | Deferents Between Chandrababu And YS Jagan Focus On Polavaram | Sakshi
Sakshi News home page

జీవనాడిపై దాడి!

Published Thu, Jun 20 2024 3:09 AM | Last Updated on Thu, Jun 20 2024 3:09 AM

Deferents Between Chandrababu And YS Jagan Focus On Polavaram

పోలవరం ఉసురు తీసిందెవరు? ప్రాణం పోసిందెవరు?

చంద్రబాబు కమీషన్ల దాహం, అస్తవ్యస్థ పనుల పాప ఫలితం కాదా?

ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కిన బాబు

వరద మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌లను కట్టకుండా డయాఫ్రమ్‌వాల్‌ పూర్తి

భారీ వరదలతో దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌.. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు

సంక్లిష్టంగా మారిన పోలవరాన్ని గాడిలో పెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి

2021 జూన్‌ 11నే వరద మళ్లింపు

కాఫర్‌ డ్యామ్‌ల మధ్య అగాధాలు పూడ్చి యధాస్థితికి.. డయాఫ్రమ్‌వాల్‌ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టు పూర్తికి ప్రణాళిక

టీడీపీ హయాంలో తట్టెడు మట్టైనా ఎత్తని జలవిద్యుత్కేంద్రం పనులను కొలిక్కి తెచ్చిన జగన్‌ సర్కార్‌

కుడి, ఎడమ కాలువల అనుసంధానాలు పూర్తి.. ఎడమ కాలువలో సంక్లిష్టమైన పనులూ పూర్తి

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. గరిష్టంగా 194.6 టీఎంసీల సామర్థ్యంతో గోదావరిపై నిర్మిస్తున్న అతి పెద్ద జలాశయం ఇదే. కుడి, ఎడమ కాలువ ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించ వచ్చు. విశాఖ నగరం పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రాజెక్టులో నిర్మించే జలవిద్యుత్కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. 

పోలవరం పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం. దేశంలో ఈ స్థాయిలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు అవసరాలను తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరొకటి లేదు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన పోలవరాన్ని విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తామే వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న అధికారంలో ఉండగా చంద్రబాబు దక్కించుకున్నారు. 

2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని నమ్మబలికి కేంద్రానికి హామీ ఇచ్చారు. 2014 ఏప్రిల్‌ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం తెగేసి చెబితే దానికీ చంద్రబాబు తలూపారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఖరారు చేసిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను కమీషన్ల దాహంతో తుంగలో తొక్కి పనులు చేపట్టారు. వరదను మళ్లిం­చేలా స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించారు. 

చివరకు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయలేక ఇరువైఫులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ఈ నిర్వాకాల కారణంగా 2019 జూన్‌ తర్వాత గోదావరిలో పోటెత్తిన భారీ వరద కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీల మీదుగా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనులను అత్యంత సంక్లిష్టంగా మార్చింది. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ల పనులను చంద్రబాబు గాలికొదిలేసి డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం.  

జీవం తీసిన వారే బురద జల్లుతున్నారు   
తాజాగా పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు జీవనాడి లాంటి ప్రాజెక్టును వైఎస్‌ జగన్‌ విధ్వంసం చేశారంటూ నిస్సిగ్గుగా బుకాయించారు. కమీషన్లకు ఆశపడి పోలవరం జీవం తీసిన చంద్రబాబు దీన్ని కప్పిపుచ్చి జీవం పోసిన వైఎస్‌ జగన్‌పై బురద జల్లే యత్నం చేయడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.

అక్రమాలు అరికట్టి కీలక పనులు పూర్తి.. 
2019 మే 30న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ సర్కార్‌ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతర్‌ చేస్తూ రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు నాడు చంద్రబాబు సర్కార్‌ నామినేషన్‌పై కట్టబెట్టింది. వీటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా రూ.783 కోట్లను ఖజానాకు వైఎస్‌ జగన్‌ ఆదా చేశారు.  

రాత్రిపూట కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తున్న దృశ్యం  (ఫైల్‌) 

నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ స్పిల్‌వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్‌ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీస్‌ను పూర్తి చేశారు. ఎడమ కాలువలో వరాహ నదిపై అత్యంత పొడవైన అక్విడెక్టుతోసహా కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. జలవిద్యుత్కేంద్రం పనులను సైతం కొలిక్కి తెచ్చారు. 

ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. ఇక డయాఫ్రమ్‌వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2022 డిసెంబర్‌ నుంచి వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లు ఖరారు చేసి పనులు చేపట్టేలా సీడబ్ల్యూసీ ప్రణాళిక రచించింది. 

2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయమే రూ.33,168.23 కోట్లని, అందువల్ల 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రధాని మోదీకి నాడు సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలో తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలన్న వైఎస్‌ జగన్‌ వినతిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. 

అయితే అప్పటికే బీజేపీతో టీడీపీ–జనసేనకు పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో పోలవరానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపితే అది ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతుందని, అందువల్ల దాన్ని ఆపేయాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇలా అడ్డుపుల్ల వేయడంతో నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ పక్కన పెట్టింది.  

జలవిద్యుత్కేంద్రం
పోలవరం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి. ఎడమ వైపు ఉన్న కొండను తొలిచి 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ తవ్వి టర్బైన్లను అమర్చి విద్యుత్కేంద్రాన్ని పూర్తి చేయాలి.

2014–19: టీడీపీ హయాంలో
జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో కొండను తొలిచే పనుల్లో కేవలం 25 శాతం మాత్రమే చేసి టీడీపీ సర్కార్‌ చేతులు దులుపుకొంది.

2019–24: వైఎస్సార్‌ సీపీ పాలనలో 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలవిద్యుత్కేంద్రం పనులు శరవేగంగా సాగాయి. కొండను తొలిచే పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసి 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ను పూర్తి చేసింది. టర్బైన్లను అమర్చడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసింది. టర్బైన్ల తయారీ బాధ్యతను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. జలవిద్యుత్కేంద్రం పనులను దాదాపుగా కొలిక్కి తెచి్చంది. పోలవరం జలాశయం పనులు పూర్తయ్యేలోగా విద్యుదుత్పత్తి ప్రారంభించే విధంగా జలవిద్యుత్కేంద్రం పనులను వేగవంతం చేసింది.  

2014–19: టీడీపీ హయాంలో 
ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించకముందే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ను 1,396 మీటర్ల పొడవున పూర్తి చేసిన చంద్రబాబు 2018 జూన్‌ 11న జాతికి అంకితం చేశారు.  ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలంటే 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో ముంపునకు గురయ్యే 54 గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈమేరకు సీడబ్ల్యూసీ, పీపీఏకు హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్‌ 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు ప్రారంభించింది. 

అయితే రూ.484 కోట్లు ఖర్చు చేసి కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మిగతా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, కాఫర్‌ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసిన చంద్రబాబు సర్కార్‌ ఆ పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. 2019 జూన్‌లో ప్రారంభమైన గోదావరి వరద ప్రవాహానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారింది. దాంతో కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌వాల్‌ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో సగటున 26 మీటర్ల నుంచి 36.5 మీటర్ల లోతు వరకు భారీ అగాధాలు ఏర్పడ్డాయి.

2019–24: వైఎస్సార్‌ సీపీ పాలనలో 
ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే 8,446 కుటుంబాలకు రూ.1,670 కోట్లతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఆ తర్వాత ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లతోపాటు 2.1 కి.మీ. పొడవున అప్రోచ్‌ ఛానల్, 2.92 కి.మీ. పొడవున స్పిల్‌ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్‌ ఛానల్‌ను పూర్తి చేసి 2021 జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది.

స్పిల్‌ వే
గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వేను నిర్మించాలి. ప్రాజెక్టు పనుల్లో తొలుత పూర్తి చేయాల్సింది స్పిల్‌ వేనే. 1,118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించే స్పిల్‌ వేకు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చాలి. వరద వచి్చనప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా అత్యాధునిక హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను గేట్లకు అమర్చాలి. ప్రపంచంలో గరిష్టంగా వరద జలాలను దిగువకు విడుదల చేసే అతి పెద్ద స్పిల్‌ వే పోలవరంలోనే ఉంది.

2014–19: టీడీపీ హయాంలో 
2014 జూన్‌ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 2016 డిసెంబర్‌ 30న స్పిల్‌ వే పనులను ప్రారంభించారు. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మే 29 నాటికి స్పిల్‌ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్‌ వేలో కేవలం రెండు (39, 40) పియర్స్‌ను 30 మీటర్ల వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకు పెట్టి గేట్‌ అమర్చినట్లు 2018 డిసెంబర్‌ 24న చంద్రబాబు ఘనంగా ప్రకటించుకున్నారు.

2019–2024: వైఎస్సార్‌సీపీ పాలనలో
2019 మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది జూన్‌లో ప్రారంభమైన వరద ప్రవాహం నవంబర్‌ వరకూ కొనసాగింది. 2020 మార్చి నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి విరుచుకు పడింది. అయితే గోదావరి వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ రికార్డు సమయంలో స్పిల్‌ వేను పూర్తి చేశారు. లాక్‌డౌన్‌లోనూ జర్మనీ, జపాన్‌ నుంచి హైడాల్రిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను దిగుమతి చేసుకుని స్పిల్‌ వేకు 48 గేట్లను బిగించారు. 2021 జూన్‌ 11న గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా విజయవంతంగా మళ్లించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement