
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ పాటించని వాహనాలపై కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. నిబంధనలు, ప్రమాణాలు పాటించని వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్ కార్డులు సస్పెన్షన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు రవాణా అధికారులు రంగంలోకి దిగారు. రవాణా అధికారులు నిర్వహించే పొల్యూషన్ టెస్ట్లలో ఫెయిలైయితే వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు.
వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు కాలుష్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ సూచించింది. పొల్యూషన్ పరీక్షలు చేయించి ప్రతి వాహనదారుడు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ పొందాలి. కార్లు, ఇతర వాహనాలకు కార్బన్ మోనాక్సైడ్ 0.3 శాతం, హైడ్రో కార్బన్ 200 పీపీఎంలోపు ఉండాలి. కాలుష్య ఉద్గారాలు ఇంతకు మించి ఉంటే రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. కాలం చెల్లిన వాహనాలపైనా అధికారులు దృష్టి సారించారు.