
మద్దిపాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై రామోజీరావు బురద జల్లేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో కడియాల యానాదయ్య ఉన్నత పాఠశాల గ్రౌండ్ బురదమయమైందని, ఇక్కడ పోటీలు నిర్వహించడానికి కుదరదని ఈనాడు అసత్య కథనం వండివార్చింది. వాస్తవానికి ఈ పాఠశాల ఆటస్థలం బాగు చేయించేందుకు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు పెద్దిరెడ్డి కోటిరెడ్డి ఇటీవల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్లు ఎంపీ నిధుల నుంచి చెరో రూ. 5 లక్షలు మంజూరు చేశారు.
గ్రౌండ్ను పూర్తిగా లెవెల్ చేసేందుకు పంచాయతీ అనుమతుల కోసం అర్జీ ఇచ్చారు. సగానికి పైగా గ్రౌండ్ను మెరక చేశారు. ఇటీవల వచ్చిన తుపాను కారణంగా కొంతమేర పనులు జరగలేదు. మైదానంలో ఓ పక్క మాత్రమే బురద ప్రాంతం ఉండగా.. దానిని ఈనాడు బూతద్ధంలో చూపడానికి ప్రయత్నించింది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఇదే మైదానంలో కబడ్డీ, ఖోఖో, షటిల్, వాలీబాల్ నిర్వహిస్తున్నారు. అయితే క్రికెట్ను సమీపంలోని కారుమూడి వారిపాలెం(గుండ్లాపల్లి) హైస్కూలులో ఆడడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదే మైదానంలో ఆరు సచివాలయం పరిధిలోని టీంలు ఆడుతాయి. మిగిలిన 12 సచివాలయాల పరిధిలోని క్రికెట్ టీంలు ఆడేందుకు ఇనమనమెళ్లూరు, తెల్లబాడు హైస్కూళ్లలో క్రీడా మైదానాలను కేటాయించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. పచ్చ పత్రిక వక్రీకరించి రాయడం చూసి స్థానికులు ఛీకొడుతున్నారు. అబద్ధాల రాతలు మంచిది కాదని, నిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment