
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితుల అర్జీల పరంపర శుక్రవారం కూడా అనేక ఇక్కట్ల మద్య కొనసాగింది. కలెక్టరేట్కు వేలాదిగా బాధితులు శుక్రవారం కూడా అర్జీలతో చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ వీరెవర్నీ కలెక్టరేట్లోకి అనుమతించలేదు. రోజూలాగే మండుటెండలో రోడ్డు పక్కన ఫుట్పాత్లపై, మురుగుకాల్వగట్లపై అవస్థలు పడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకోవడంతో అధికారులు చేసేదిలేక హడావుడిగా బాధితులను లోపలికి అనుమతించారు.
అయితే, శుక్రవారం కౌంటర్లలో అర్జీలు తీసుకోబోమని తెగేసి చెప్పారు. అట్టపెట్టెలు ఏర్పాటుచేసి ఎవరికి వారు తమ అర్జీలను అందులో పడేసి వెళ్లిపోవాలన్నారు. మరోవైపు.. అప్పటివరకూ ఎండనపడి వచ్చిన బాధితులు చెట్ల నీడలో సేదతీరుతుండగా పోలీసులొచ్చి వారిని కనికరం లేకుండా తరిమేశారు. తమతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారంతా మండిపడుతూ.. సర్కారుకు శాపనార్ధాలు పెడుతూ వారంతా ఉసూరుమంటూ బయటకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment