
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన రాజధానిగా విశాఖ వర్థిల్లాలని సంపత్ వినాయక దేవాలయంలో జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ‘విశాఖ వందనం’ ప్రచార రథాన్ని రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ ప్రారంభించారు. నేటి నుంచి పరిపాలన కేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో దేవాలయాల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్న పరిపాలన సజావుగా సాగాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని లజపతిరాయ్ అన్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన విజయవంతంగా సాగాలని కాంక్షిస్తూ ప్రజలందరితో కలిసి శనివారం నుంచి దశలవారీగా సర్వమత ప్రార్థనలు చేస్తామన్నారు.
రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జేఏసీ తరఫున దేవాలయాలు, చర్చిలు, ముస్లిం ప్రార్థనా స్థలాల్లో సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో ఇటీవల తీర్మానించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment