
సాక్షి,పుత్తూరు రూరల్(తిరుపతి): ‘‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’’అన్న సామెత పుత్తూరు పట్టణంలో నారాయణ విద్యా సంస్థ నాటకాలకు తెరదీసింది. సదరు సంస్థ గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను ప్రలోభ పెడుతూ అడ్మిషన్ల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తోంది. నారాయణ స్కూల్ పేరుతో బస్సు ఒకటి పట్టణంలో తిరుగుతూ, అందులోంచి కొంత మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించామని, కరపత్రాలను పంచుతూ తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు రూ.3,500 అని, 6వ తరగతికి రూ.28 వేలు, 8వ తరగతికి రూ.30 వేలుగా చెబుతూ వాట్సాప్, ఫోన్ల ద్వారా ఊదరగొట్టేస్తున్నారు. కనీసం భవనం లేకుండా అడ్మిషన్లు ఏంటని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే చూపిస్తామంటూ నమ్మబలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొందరు అడ్మిషన్ ఫీజులు చెల్లించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పుత్తూరు పట్టణంలో ఎక్కడా భవనం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం నారాయణ విద్యా సంస్థకు పుత్తూరులో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తొందర పడి వేలాది రూపాయలను చెల్లించి మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.
‘నారాయణ’కు అనుమతులు లేవు
నారాయణ విద్యా సంస్థకు పుత్తూరు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేవు. దరఖాస్తు చేసుకోలేదు. అయినా పుత్తూ రు ప్రచారం నిర్వహిస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని డీఈఓ దృష్టికి తసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.
– ఎంఈఓ తిరుమలరాజు
Comments
Please login to add a commentAdd a comment