బాలుడి కుటుంబ సభ్యులతో పీడియాట్రిక్ సర్జన్ సుకుమార్
కడప రూరల్: ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తాజాగా ఓ పేద కుటుంబానికి చెందిన చిన్నారికి అండగా నిలిచింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బీరాన్ఖాన్పల్లెకు చెందిన షేక్ నూర్బాషా, చాందిని దంపతుల కుమారుడు హబీబ్(2)కు పుట్టుకతో మల విసర్జన ద్వారం ఏర్పడలేదు. ఈ సమస్య 5 వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. హబీబ్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఏరోజుకారోజు పనికి వెళ్తే గానీ జీవితం గడవని పరిస్థితుల్లో కుమారుడికి వైద్యమెలా చేయించాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇంతలో ఈ జబ్బుకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో.. ఎంతో సంతోషించిన వారు వెంటనే తమ కుమారుడిని కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మొదటి దశ సర్జరీ చేసి.. పెద్ద పేగును తీసి బయటకు పెట్టారు. ఆ తర్వాత కడపలోని కేసీహెచ్ ఆస్పత్రిలో కూడా దీనికి చికిత్స చేస్తారని తెలియడంతో అందులో చేర్పించారు.
అక్కడి పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సుకుమార్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఇటీవల రెండో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్స.. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పూర్తవ్వడంతో హబీబ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుమారుడికి పునర్జన్మ లభించిందని.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment