‘నీట్‌’పై నోరు మెదపరేమి? | Student Unions Protest Against NDA Alliance Over NEET Paper Leak Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

Student Unions Protest: ‘నీట్‌’పై నోరు మెదపరేమి?

Published Fri, Jul 5 2024 4:26 AM | Last Updated on Fri, Jul 5 2024 10:59 AM

student unions protest against NDA alliance

ఎన్‌డీఏ కూటమిపై ఐక్య విద్యార్థి సంఘాల మండిపాటు

తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్‌ పేపర్‌లీక్‌ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్‌ వద్ద జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్‌డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్‌టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్‌ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.

ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్‌ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement