విశాఖలో మరో ఇద్దరికి కరోనా | Two more people test positive for coronavirus in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో మరో ఇద్దరికి కరోనా

May 24 2025 4:02 AM | Updated on May 24 2025 4:02 AM

Two more people test positive for coronavirus in Visakhapatnam

కోవిడ్‌ సోకిన వ్యక్తి కుటుంబంలోని మరొకరితోపాటు ప్రభుత్వ వైద్యుడికీ వైరస్‌  

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ 

సాక్షి, అమరావతి/కడప అర్బన్‌: విశాఖపట్నంలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలోనే మరొకరితోపాటు చికిత్స అందించిన ప్రభుత్వ వైద్యుడికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. 

కోవిడ్‌పై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సలహాలు, సూచనలు చేయలేదని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి దోమల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్‌ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ సిరి తదితరులు పాల్గొన్నారు.  

కడప రిమ్స్‌లో మరో కేసు 
కడప నగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) లో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన షేక్‌ చాంద్‌ గౌస్‌ బీబీ(75) అనే వృద్ధురాలు రెండురోజుల కిందట చేరింది. ఆమె కోవిడ్‌తో బాధ పడుతోందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. 

ఆమెను రిమ్స్‌లోనే ఎంఐసీయూ వార్డు నుంచి కోవిడ్‌ ఎంఐసీయూ వార్డుకు మార్చి వైద్యసేవలను అందిస్తున్నారు. వృద్ధురాలికి కోవిడ్‌ నిర్ధారణ జరిగిందని, తగు జాగ్రత్తలతో వైద్య పరీక్షలు చేయిస్తున్నామని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి తెలిపారు. కానీ, కడప రిమ్స్‌లో కోవిడ్‌ కేసు నమోదు కాలేదని  కడప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు తెలిపారు. 

బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్‌
శివాజీనగర: బెంగళూరుకు చెందిన తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్‌ పాజి­టివ్‌గా నిర్ధారణ అయింది. బెంగళూరు రూరల్‌ జిల్లాలోని హొసకోటకు చెందిన బాలుడికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు కలశపాళ్యలోని ప్రభుత్వ వాణి విలాస్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అనుమానంతో ఈ నెల 22న ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ (ఆర్‌ఏటీ) చేయగా, చిన్నారికి కరోనా సోకినట్లు తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సి­పల్‌ సెక్రటరీ హర్‌‡్ష గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement