
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ సహాయంతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల గురించి జనం ఎంతో మంచిగా మాట్లాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ కో–ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రాంత నేతలతో మాట్లాడారు.
ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను దళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా వలంటీర్లు చక్కగా అందిస్తున్నారని ప్రశంసించారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోందని చెప్పారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవ వేతనం) కింద ఏటా రూ.1,200 కోట్లు చెల్లిస్తున్నారని తెలిపారు.
కనీస విద్యార్హతలతో, పారితోషికంతో పనిచేసే వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కొత్త వ్యవస్థకు వచ్చే నెల 15న నాలుగేళ్లు నిండుతాయన్నారు. ఈ నాలుగేళ్లలో ఈ కొత్త వ్యవస్థ పనితీరును నిష్పక్షపాతంగా సమీక్షిస్తే వలంటీర్లకు మంచి మార్కులే వస్తాయని చెప్పారు. అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలందించే ‘డెలివరీ సిస్టం’లో కీలకపాత్రధారులయ్యారని పేర్కొన్నారు.
ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదని చెప్పారు. రెండున్నర లక్షల మందికిపైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోందని తెలిపారు. సామాన్య జనానికి వారు చేసే సేవలకు గుర్తింపుగా దాదాపు రూ.250 కోట్ల విలువైన నగదు అవార్డులు ఇస్తోందన్నారు. 2019 అక్టోబర్లో ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా వలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment