1న ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ అళ్వార్ తిరుమంజనం ఘనంగా జరగనుంది. ఏప్రిల్ 5 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన చేసి, ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు.