
ముదివేడు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
రాయచోటి టౌన్ : ముదివేడు రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ కోసం రైతుల భూములు లాక్కొని వారికి పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పరిహారం ఇవ్వకపోతే భూములను వెనక్కి ఇవ్వాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాసులు, రాజేష్, వెంకటరెడ్డి, మారపరెడ్డి, తిమ్మారెడ్డి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.