
అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు
రేపల్లె రూరల్: కట్టుబాట్ల పేరుతో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షాన్ని చుట్టివచ్చేస్థాయికి ఎదిగారని, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగల సత్తా ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రేపల్లె పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో వేడుకలు నిర్వహించారు. మంత్రి కొలుసు మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం మహిళలు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించి వారి జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలని అన్నారు. నవంబర్ నుంచి 80 లక్షల మంది మహిళలకు రూ.35 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీపం–2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రూ. 9వేల కోట్లతో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. సమాజానికి మహిళలు అపారమైన సేవలు అందించారని వారిని ప్రతిరోజు గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 592 స్వయం సహాయక సంఘాలకు రూ.13.6 కోట్ల చెక్కును, పీఎంఈజీపీ కార్యక్రమం క్రింద 75 స్వయం సహాయక సంఘాలకు రూ.1.95 కోట్ల చెక్కును, రేపల్లె మెప్మా ద్వారా 169 స్వయం సహాయక సంఘాలకు రూ.13.5 కోట్ల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది మహిళలను రాష్ట్ర మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ, నెడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర్బాబు, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి, రేపల్లె మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎం.శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
స్టాల్స్ను ప్రారంభించిన మంత్రులు
మహిళలు, అంగన్వాడీలు, స్వయం సహాయక సంఘాల గ్రూపు సభ్యులు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలసి ప్రారంభించారు. స్వయం సహాయక సభ్యులు ఏర్పాటు చేసిన తినుబండారాలు స్టాళ్లను, చేనేత మహిళలు నేసిన నేత చీరల స్టాల్ను, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగ్లను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థినుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
జిల్లా ఇన్చార్జి మంత్రి
కొలుసు పార్థసారథి
స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.28.5కోట్ల చెక్కులు పంపిణీ
రేపల్లెలో ఘనంగా అంతర్జాతీయ
మహిళా దినోత్సవం
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు
Comments
Please login to add a commentAdd a comment