గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవన్నారు. వీటిని నిర్వహించాలంటే ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని గుర్తుచేశారు. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుపోను మిగిలిన స్థలంలో పీపీపీ పద్ధతిలో లీజులకు ఆర్టీసీ స్థలాలను ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్ జి. రవివర్మ, ఈడీ జోన్ 3 నెల్లూరు నాగేంద్రప్రసాద్, ఆర్ఎం ఎం.రవికాంత్, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి కృషి
అద్దంకి రూరల్: మైనార్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం స్థానిక షాదీఖానాలో జరిగిన కార్యక్రమంలో రంజాన్ మాసం జేబు క్యాలెండర్ ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్లో రూ. 5434 కోట్లు ప్రకటించారన్నారు. సబ్ ప్లాన్ అమలుతో మైనార్టీలు అభివృద్ధి చెందుతారని తెలిపారు.
అవయదానంతో ముగ్గురికి కొత్త జీవితం
గుంటూరు మెడికల్: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. వివరాలు.. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. ఆమె పరిస్థితి విషమంగా మారి ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు విశాల హృదయంతో అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో జీవన్మరణ స్థితిలో ఉన్న ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు ఊపిరితిత్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిమ్స్ ఆసుపత్రికి, కిడ్నీ, లివర్లను ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు అందించారు. ఊపిరితిత్తులను గ్రీన్ చానల్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్కు తరలించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి, క్లస్టర్ మార్కెటింగ్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి అవయవదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన
వెంకటపాలెం (తాడికొండ): తుళ్ళూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. కార్యక్రమంలో సీఎం పాల్గొననున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
Comments
Please login to add a commentAdd a comment