బాపట్లటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా ఈ ఏడాది హైస్కూల్ మాస్టార్లే కొనసాగనున్నారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా గతంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను (ఎస్జీటీ)లను ఇన్విజిలేటర్లుగా నియమించేవారు. ఈసారి ఆ బాధ్యతల నుంచి ఎస్జీటీలను కూటమి ప్రభుత్వం తప్పించింది. హైస్కూల్లో పనిచేసే సబ్జెక్టు టీచర్లు, భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయకులకు ఇన్విజిలేషన్ బాధ్యతలను అప్పగించింది. మొదటి మూడు లాంగ్వేజీ పరీక్షలకు సబ్జెక్టు టీచర్లు ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తిస్తారు. తర్వాత జరిగే సబ్జెక్టు పరీక్షలకు భాషోపాధ్యాయులు, ఇతర సబ్జెక్టు టీచర్లు ఇన్విజిలేషన్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం నుంచి జిల్లాలోని 103 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షల నిర్వహణ ఇలా..
జిల్లాలోని 25 మండలాలు, నాలుగు మున్సిపాల్టీల పరిధిలో 16,799 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 8317 మంది, బాలురు 8482 మంది ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 103 మంది చొప్పున డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 29 మంది కేటగిరి కస్టోడియన్లు, 10 మంది రూట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు 1048 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. 103 మంది క్లర్క్లు, 206 మంది ఎఎన్ఎంలు, 206 మంది పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తున్నారు.
సీ కేటగిరి సెంటర్లపై ప్రత్యేక నిఘా
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 103 కేంద్రాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. ఇందులో ఏ–కేటగిరీ 33, బి–కేటగిరీ 41, సీ–కేటగిరీ 29 కేంద్రాలు ఉన్నాయి. సీ–కేటగిరీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా కనపరుస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు.
ఇన్విజిలేషన్ బాధ్యతల నుంచి ఎస్జీటీలను తప్పించిన ప్రభుత్వం
1048 మంది హైస్కూల్ ఉపాధ్యాయులకు బాధ్యతలు
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
హాజరుకానున్న 16,799 మంది విద్యార్థులు
103 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
ఏర్పాట్లు పూర్తిచేశాం
పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని మౌలిక వసతులు కల్పించాం. ఈ ఏడాది హైస్కూల్లో పనిచేస్తున్న 1048 మంది భాషోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాలను ఇన్విజిలేటర్లుగా నియమించాం. హైస్కూల్ సిబ్బంది కొరత ఉన్న ప్రాంతంలో ఎస్జీటీలను కూడా తీసుకున్నాం. విద్యార్థులు బాగా వచ్చిన ప్రశ్నలను మాత్రమే ముందుగా రాసుకోవాలి. కష్టమైన ప్రశ్నను రాయడానికి సిద్ధపడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి, భయానికి లోనుకావద్దు.
– శ్రీరామ్ పురుషోత్తమ్, డీఈఓ
సబ్జెక్టు టీచర్లే ఇన్విజిలేటర్లు