బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్‌ బదిలీ

Apr 17 2025 1:51 AM | Updated on Apr 17 2025 1:51 AM

బాపట్

బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్‌ బదిలీ

బాపట్ల: బాపట్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రఖర్‌జైన్‌ను ఆర్టీజీఎస్‌ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రఖర్‌జైన్‌ గతేడాది ఆగస్టులో బాపట్ల జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది లంక గ్రామాలకు కృష్ణానది ముంపు సందర్భంగా ఆయన చేసిన సేవలకు ప్రశంసలు అందుకున్నారు. బాపట్ల జిల్లా జేసీగా ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు.

సబ్‌ జైలులో జిల్లా

జడ్జి పరిశీలన

రేపల్లె రూరల్‌: రేపల్లె సబ్‌ జైల్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సయ్యద్‌ జియావుద్దీన్‌ బుధవారం సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్యానెల్‌ న్యాయవాది గుమ్మడి కుమార్‌బాబు, సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షంతో

దెబ్బతిన్న పంటలు

యద్దనపూడి: యద్దనపూడి మండలంలోని పూనూరు, చింతగుంటపాలెం, గన్నవరం గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట కల్లాల్లో తడిసి ముద్ద కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షంతో మరింత నష్టం చేకూరిందని వాపోతున్నారు. సుమారు 2 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం పడటంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న, పందిళ్లపై ఉన్న పొగాకు పంటలు పూర్తిగా తడిసిపోయాయి. తద్వారా పంటకు బూజు, ఫంగస్‌ పట్టి పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

పిడుగురాళ్ల : పట్టణంలోని శ్రీ రామ తీర్థ సేవాశ్రమం బజార్‌లోని శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. బుధవారం గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్‌ శర్మ శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం కందుల శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం రూ. 17 లక్షలను ఆలయ పునర్నిర్మాణానికి అందించారు. వేలమంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కేరళకు తరలిస్తున్న

గోవులు పట్టివేత

మంగళగిరి: నగర పరిధిలోని కాజ టోల్‌గేట్‌ వద్ద 30 గోవులను పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి కేరళకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం వీహెచ్‌పీ నేతలు టోల్‌గేట్‌ వద్ద కాపలా వుండి 30 గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను, డ్రైవర్‌ అన్సారీని పట్టుకుని మంగళగిరి రూరల్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు గోవులను గో ఆశ్రమానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్‌ బదిలీ 1
1/1

బాపట్ల జేసీ ప్రఖర్‌జైన్‌ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement