రామాలయానికి మాజీ సర్పంచ్ రూ.5లక్షల విరాళం
అశ్వాపురం: మండలంలోని మొండికుంటలో నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు సిద్ధమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే మాజీ సర్పంచ్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డి–సంధ్యారాణి దంపతులు శనివారం రూ.5 లక్షల విరాళం అందజేశారు. మొండికుంట గ్రామస్తుల చిరకాల కోరిక అయిన రామాలయ నిర్మాణాన్ని పూర్తిచేయడంలో చొరవ చూపడమే కాక విరాళం అందించిన మల్లారెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగం పేరుతో మోసం
పాల్వంచ: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని నవభారత్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కేటీపీఎస్ కాలనీకి చెందిన పోటు స్వాతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పోలంపల్లి రాజశేఖర్ రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
9 మందికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మిర్చి కూలీలు గాయపడ్డారు. సుదిమళ్ల గ్రామానికి చెందిన కూలీలు రొంపేడు గ్రామంలో మిర్చి కోసేందుకు ఆటోలో వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ఈ ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ గాయపడ్డారు. గ్రామస్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో సంధ్య, నాగమణి, లక్ష్మి, వీరమ్మ, నర్సమ్మ, రాజేశ్వరి, లావణ్య, కనకమ్మ, గురువమ్మ ఉన్నారు. వీరిలో సంధ్య, నాగమణి, లక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఖమ్మం సిఫారసు చేశారు.
మూడు ఆటోలు సీజ్
చండ్రుగొండ : పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న మూడు ఆటోలను శనివారం సీజ్ చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. చండ్రుగొండ నుంచి అన్నపురెడ్డిపల్లి వైపు వెఽళ్తున్న ఆటోలను తనిఖీ చేయగా ఒక్కో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ పేర్కొన్నారు. ఆటోల యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.
అప్పుల బాధతో ఆత్మహత్య
చింతకాని: మండలంలోని చిన్నమండవకు చెందిన తుపాకుల అగ్గిరాములు(43) అప్పుల బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన గత నాలుగేళ్లుగా కుటుంబ అవసరాలకు అప్పులు చేయగా అవి పెరగడంతో తీర్చే మార్గం లేక మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యాపిల్లలు నిద్రించాక ఇంటి వరండాలోని రేకుల షెడ్ పైప్కు చీరతో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచిన భార్య ఈ విషయాన్ని గమనించి స్థానికులను పిలవగా పరిశీలించే సరికి అగ్గిరాములు మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య ప్రభావతి శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు.
రోడ్డు రోలర్ చోరీపై
కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు రోలర్ చోరీ జరిగిందని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురానికి చెందిన భిక్షంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. ఏదులాపురానికి చెందిన భిక్షంరెడ్డి వద్ద రోడ్డు రోలర్ అద్దెకు తీసుకునేందుకు ఫిబ్రవరి 23న ముగ్గురు సంప్రదించారు. రూ.35 వేల అద్దెతో ఒప్పందం కుదరగా రూ.25వేలు పంపించారు. దీంతో ఆయన అదేరోజున వాహనాన్ని డ్రైవర్ అఫ్జల్తో మహబూబాబాద్ పంపించాడు. అయితే, ఆర్ఓబీ ప్రాంతంలో డ్రైవర్ వాహనాన్ని నిలపగా మరుసటి రోజు ఉదయంకల్లా కనిపించలేదు. ఈమేరకు ఫిబ్రవరి 25న మహబూబాబాద్ చేరుకున్న భిక్షంరెడ్డికి పాత ఇనుప సామాన్ల దుకాణం సమీపాన రోడ్డు రోలర్ కనిపించడంతో ఆరా తీయగా రూ.2.19 లక్షలకు ఓ వ్యక్తి విక్రయించాడని షాపు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
రామాలయానికి మాజీ సర్పంచ్ రూ.5లక్షల విరాళం
రామాలయానికి మాజీ సర్పంచ్ రూ.5లక్షల విరాళం
Comments
Please login to add a commentAdd a comment