
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్), పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ను విలీనం చేసుకోనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. వచ్చే 9–12 నెలల వ్యవధిలో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
సంస్థ స్వరూపాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు, గవర్నెన్స్ను మెరుగుపర్చుకునేందుకు ఈ కన్సాలిడేషన్ ఉపయోగపడగలదని ఒక ప్రకటనలో వివరించింది. అదానీ గ్రూప్లో అంబుజా సిమెంట్స్ భాగంగా ఉంది. 2023లో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్లో కంపెనీకి 58.08 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ సంస్థ పెన్నా సిమెంట్ను కొనుగోలు చేసింది.
విలీన స్కీము ప్రకారం ప్రతి 100 ఎస్ఐఎల్ షేర్లకు గాను అంబుజా సిమెంట్స్ 12 షేర్లను జారీ చేస్తుంది. అలాగే, పెన్నా సిమెంట్స్ ఈక్విటీ షేర్హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 321.50 లభిస్తుంది. ఎస్ఐఎల్, పెన్నా సిమెంట్స్ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్ షేరు ముఖవిలువ రూ. 2గా ఉంది.