
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశముంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలియజేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఎల్ఐసీ వాటా విక్రయ అంశాన్ని పునఃపరిశీలించే వీలున్నట్లు తెలియజేశారు.
ఒకవేళ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనే చేపట్టేందుకు కట్టుబడితే.. ఇది ప్రగతిశీల విషయమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. ‘2022 ఎకనమిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా’పై నిర్వహించిన ఏడో జాతీయ సదస్సులో భాగంగా పాండే ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాదికి సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించే బాటలో ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి ప్రణాళికలు వేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment