
న్యూఢిల్లీ: నౌకరీ.కామ్ మాతృ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ కొన్నేళ్లుగా స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రధానంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో, పీబీ ఫిన్టెక్ (పాలసీబజార్)లో పెట్టుబడులు భారీ రాబడి అందించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ సంజీవ్ బిక్చందానీ తాజాగా పేర్కొన్నారు.
గతేడాది (2024–25) ఫలితాల విడుదల సందర్భంగా వాటాదారులకు రాసిన లేఖలో ఈ అంశాలను వివరించారు. 2007లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లకు తెరతీసినట్లు తెలియజేశారు.
వివిధ ప్లాట్ఫామ్లపై గత 15 ఏళ్ల కాలంలో రూ. 3,959 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీటి అసలు విలువ దాదాపు 10 రెట్లు ఎగసి రూ. 36,855 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ప్రధానంగా జొమాటోలో రూ. 484 కోట్లు, పాలసీబజార్లో రూ. 591 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.