
బాబా రామ్దేవ్ నేతృత్వంలోని ఎఫ్ఎంసీజీ (FMCG) సంస్థ పతంజలి ఫుడ్స్కు (Patanjali Foods) గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా ఒక బ్యాచ్లో తయారైన మొత్తం ఎర్ర కారం పొడి ప్యాకెట్లను (chilli powder) రీకాల్ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదేశించినట్లు పతంజలి ఫుడ్స్ తాజాగా ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలియజేసింది.
"ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 జనవరి 13 నాటి (2025 జనవరి 16న అందింది) ఆర్డర్ ప్రకారం బ్యాచ్ నెంబర్ AJD2400012 లో తయారైన పదార్థాలు (ఎర్ర కారం పొడి పాకెట్లు) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (కలుషితాలు, టాక్సిన్స్, అవశేషాలు) నిబంధనలు, 2011కి అనుగుణంగా లేనందున మొత్తం బ్యాచ్ను రీకాల్ చేయమని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ని ఆదేశించిందని తెలియజేస్తున్నాం" ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.
పతంజలి ఫుడ్స్ షేర్లు గురువారం (జనవరి 23) బీఎస్ఈలో దాదాపు అర శాతం తగ్గి రూ.1,855.30 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్పై సంవత్సర కాలంలో రాబడి దాదాపు 19 శాతం. పతంజలి ఫుడ్స్ గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్గా ఉండేది. 2019 డిసెంబర్లో రూ. 4,300 కోట్లకు పైగా వెచ్చించి బాబా రామ్దేవ్ కొనుగోలు చేశారు. గోధుమ పిండి నుండి నూనెలు, డెయిరీ.. పలు విభిన్న ఉత్పత్తులను ఎఫ్ఎంసీజీ సంస్థ విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment