Stock Market: సెన్సెక్స్‌ 80000 | Stock Market: Sensex crosses 80000 for first time | Sakshi
Sakshi News home page

Stock Market: సెన్సెక్స్‌ 80000

Published Thu, Jul 4 2024 4:52 AM | Last Updated on Thu, Jul 4 2024 8:36 AM

Stock Market: Sensex crosses 80000 for first time

సూచీల సరికొత్త రికార్డులు

బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లకు డిమాండ్‌  

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. 

ఉదయం సెన్సెక్స్‌ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్‌ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి.  
    
→ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు  (ఎన్‌పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్‌ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ బ్యాంక్, ఎస్‌బీఐలు 2% లాభపడ్డాయి.

→ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్‌సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. 

→ ఈ జూన్‌ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్‌... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్‌ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. 

→ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్‌ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది.  

→ సెన్సెక్స్‌ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ జీవితకాల గరిష్ట స్థాయి  రూ.445.43 లక్షల కోట్లకు చేరింది.  

వ్రజ్‌ ఐరన్‌ బంపర్‌ లిస్టింగ్‌  
వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ లిస్టింగ్‌ రోజే అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది. బీఎస్‌ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్‌ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.

సెన్సెక్స్‌ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్‌ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్‌ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. 
– శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement