
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి మరింత కఠినతర ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను 5 శాతం వరకూ పెంచాలని వీఈ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) యోచిస్తోంది. బీఎస్–4, బీఎస్–6 ప్రమాణాలతో పోలిస్తే రేట్ల పెంపు తక్కువ స్థాయిలోనే.. 3–5 శాతం శ్రేణిలో ఉండవచ్చని అనలిస్టులతో సమావేశంలో కంపెనీ ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మోడల్స్లో కూడా దశలవారీగా మార్పులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశాయి. యూరో–6 ప్రమాణాలకు సరిసమానమైన భారత్ స్టేజ్ 6 (బీఎస్–6) రెండో దశకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దడంపై దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ కసరత్తు చేస్తోంది.
ఇందుకోసం మరింత అధునాతనమైన పరికరాలను ఫోర్ వీలర్లు, వాణిజ్య వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉద్గారాల పరిశీలించేందుకు వాహనంలో సెల్ఫ్–డయాగ్నోస్టిక్ డివైజ్ కూడా ఉండాలి. ఒకవేళ ఉద్గారాలు నిర్దిష్ట స్థాయి దాటితే వార్నింగ్ లైట్ల ద్వారా తక్షణం సర్విసుకు ఇవ్వాలనే సంకేతాలను డివైజ్ పంపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment