
సాక్షి, నల్గొండ: తనకు పెళ్లి కుదిరింది.. మరో తొమ్మిది రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పినా.. ఆ ప్రేమోన్మాది వినిపించుకోలేదు.. పైగా ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి నన్నే ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.. ఆపై శారీరకంగా కలవాలంటూ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. అయితే పరువు పోయిందని భావించిన ఆ యువతి గడ్డిమందు తాగి చివరకు ప్రాణాలు విడిచింది.
పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం లింగాలగూడెం గ్రామానికి చెందిన కదిరే శంకర్, మంగమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు మౌనిక(20) నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది.
చదవండి: Viveka Case: కావాలనే ఇరికించారు.. బెయిల్ ఇవ్వండి
ప్రేమించాలని మూడు నెలలుగా వేధింపులు
నల్లగొండ మండల పరిధిలోని జి.చెన్నారం గ్రామానికి చెందిన బొల్లం శ్రవణ్ మూడు నెలల నుంచి మౌనికను ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నాడు. ప్రేమించకపోతే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే క్రమంలో శ్రవణ్ ఈ నెల 9న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో మౌనిక ఇంటికి చేరుకున్నాడు.
ప్రేమించమని, శారీరకంగా కలవాలని చేయి పట్టుకోవడంతో మౌనిక కేకలు వేసింది. దీంతో శ్రవణ్ పారిపోతుండగా చుట్టు పక్కలవారు, తండ్రి శంకర్ గమనించి అతన్ని మందలించారు. ఈ ఘటనతో పరువుపోయిందని తీవ్ర మనస్తాపం చెందిన మౌనిక అదే రోజు సాయంత్రం గడ్డి మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా మౌనిక తమ్ముడు జాని గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతున్న మౌనిక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు శ్రవణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment