
సాక్షి, హనుమాన్ జంక్షన్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు మీద తిరుపతిలో గరుడ పూజ చేయిస్తానని 3500 రూపాయిలు నగదు వసూలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన హనుమాన్ జంక్షన్లోని సీతా మహాలక్ష్మి నర్శింగ్ హోంకు వెళ్లి పూజ నిమిత్తం 3500 రూపాయిలు ఇవ్వాలని కోరింది.
(చదవండి: అగ్నిప్రమాదం : రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే!)
అయితే ఆ ఆస్పత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు డా: దుట్టా రామ చంద్రరావుది కావడంతో సిబ్బందికి అనుమానం వచ్చి దుట్టా తనయుడు రవి శంకర్కు సమాచారం అందించారు. ఐఏఎస్ అధికారిణి సుజాత రావుకు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. ఆయన ఆసుపత్రికి వచ్చేసరికి మహిళ అక్కడ నుంచి ఉడాయించడంతో రవిశంకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మి కోసం గాలింపు చేపట్టారు. గత రాత్రి నకిలీ ఐఏఎస్ ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే నిందితురాలిని అరెస్టు చేయడంతో హనుమాన్ జంక్షన్ సీఐ రమణ, ఎస్ఐ మదీనా భాష, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విజయలక్ష్మి గతంలో ఐఏఎస్ అధికారిని సుజాత రావు పేరు చెప్పి నందిగామ, హైదరాబాద్, విజయవాడ, గన్నవరం ఏరియాల్లో నగదు వసూలు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
(పోరాడి ఓడింది..!)
Comments
Please login to add a commentAdd a comment