గ్యాస్ సిలిండర్‌తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర | Husband And Wife incident in karnataka | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్‌తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర

Apr 12 2026 4:40 AM | Updated on Apr 13 2026 11:08 AM

Husband And Wife incident in karnataka

కర్ణాటక: తప్పటడుగులతో భార్యాభర్తల సంబంధాలు అవహేళనకు గురవుతున్నాయి. ఎవరో ఒకరు పరుల వ్యామోహంలో చిక్కుకుని రక్తపాతానికీ వెనుకాడడం లేదు. ఇదే మాదిరిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆగ్రహించిన భార్య తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన బెళగావి నగరంలో తిళకవాడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యుడు అవినాశ్‌ సుప్పన్న (40) హత్యకు గురైన వ్యక్తి. ఈ కేసులో ఇతని భార్య లక్ష్మి (29), ఆమె ప్రియుడు కైలాస బాలక్రిష్ణ (43) అరెస్టయ్యారు.  

గ్యాస్‌ సిలిండర్‌తో బాది..  
వివరాలు.. అవినాశ్‌ 5న తన ఆయుర్వేదిక్‌ కేర్‌ సెంటర్లో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మాత్రం అధిక బీపీ వల్ల కిందపడి చనిపోయి ఉంటాడని నమ్మబలికింది. కేసు నమోదు చేసుకున్న తిళకవాడి పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేసి కనిపెట్టారు. లక్షి్మ, బాలక్రిష్ణ మధ్య అక్రమ సంబంధం ఉండగా, ఇది తెలిసి అవినాశ్‌ భార్యను మందలించాడు. 

బాలక్రిష్ణ వీరి ఇంటికి దగ్గరిలోనే ఓ మొబైల్‌ఫోన్ల షాప్‌ నడిపేవాడు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని భార్య, ప్రియుడు నిర్ణయించారు. అవినాశ్‌ తన క్లినిక్‌లో ఉండగా, పథకం ప్రకారం బాలక్రిష్ణ చొరబడి అక్కడి గ్యాస్‌ సిలిండర్‌తో తలపై, గుండెల మీద బలంగా కొట్టి హత్య చేసి వెళ్లిపోయాడని పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌ బోర్సే తెలిపారు. లక్ష్మి తనకు ఏం తెలీదని బుకాయించినా పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బెళగావిలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement