
సాక్షి,కౌడిపల్లి(సంగారెడ్డి): క్రిస్మస్ పండగ సందర్భంగా దైవ దర్శనం కోసం మెదక్ చర్చికి వెళ్లి స్కూటీపై తిరిగి వస్తున్న ముగ్గురు యువకులను కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం 765డి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై శివప్రసాద్రెడ్డి వివరాల ప్రకారం నర్సాపూర్ మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన అరిగె కిష్టయ్య, మంజుల కుమారుడు రంజిత్(19) జక్కపల్లి మోడల్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
వరసకు బావమరిది అయిన షాపూర్నగర్కు చెందిన పవన్, వరసకు తమ్ముడయిన ఆనంద్తో కలిసి శుక్రవారం ఇంట్లో చెప్పకుండా స్కూటీపై మెదక్ సీఎస్ఐ చర్చిని సందర్శించేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కౌడిపల్లి సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన ఆనంద్, పవన్ను చిక్తిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సకాలంలో రాని 108 వాహనం
ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న పీర్లతండా సర్పంచ్ భర్త గణేష్ బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన గంట వరకు వాహనం రాలేదని, సకాలంలో వచ్చి ఉంటే రంజిత్ బతికేవాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 108 సిబ్బందిని సంప్రదించగా, డీజిల్ అయిపోవడంతో రావడం ఆలస్యమైందని తెలిపారు.
చదవండి: ‘నేనేం పాపం చేశానమ్మా’.. ముళ్లపొదల్లో నెలలు నిండని శిశువు మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment