
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మోర్తాడ్: తన వదినమ్మ కనిపించడం లేదు.. ఎలాగైనా వెతికి పెట్టండి అంటూ రోజు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ అమాయకుడిగా నటించిన వ్యక్తే వివాహిత హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఏమి ఎరగని వాడిలా తిరుగుతున్న నిందితుడిని పక్కా వ్యూహంతో ఊచలు లెక్కించేలా చేశారు. సుంకెట్కు చెందిన అంజమ్మ(35) జనవరి 24న అదృశ్యం అయింది.
ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అంజమ్మ తన చిన్న మామ కుమారుడు నరేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ముదరడంతో నరేష్ పక్కా ప్లాన్తో ఆమెను పెర్కిట్ శివారులోని గుట్టపై హత్య చేశాడు. ఇదంతా చేసిన నరేష్ తనకు ఏమి తెలియనట్లు ఇంటికి చేరుకుని అంజమ్మ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు స్టేషన్కు వచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు.
అంతేకాక తరుచూ స్టేషన్కు వచ్చి తన వదిన మిస్సింగ్ కేసులో ఏమైనా వివరాలు తెలిశాయా అంటూ అడిగేవాడు. నరేష్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నరేష్ తప్పు ఒప్పుకొని పెర్కిట్ శివారులో దాచి ఉంచిన మృతదేహాన్ని చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment