Molestation Assault On Engineering Student At Eluru - Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థిని బంధించి.. బలాత్కరించి.. చంపబోయాడు

Published Tue, Apr 25 2023 9:29 AM | Last Updated on Tue, Apr 25 2023 1:07 PM

Molestation Assault On Engineering Student At Elur - Sakshi

ఏలూరు టౌన్‌:ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిని నిర్బంధించి.. ఆమె వంటిపై వేడి నూనె పోసి గాయపర్చి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.  ఎస్పీ డీ.మేరీప్రశాంతి ఆదేశాలతో 24 గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్‌ స్టేషన్‌లో ఏలూరు దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ మీడియాతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

12 రోజులు నిర్బంధించి లైంగిక దాడి
దుగ్గిరాల గ్రామానికి చెందిన బాధితురాలు కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. నిందితుడు సదర్ల అనుదీప్‌ అదే గ్రా మానికి చెందిన వ్యక్తి. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న అనుదీప్‌ కాకినాడ వెళ్లి బాధితురాలిని కలుసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి వేలంగిణి మాత చర్చికి వెళ్లారు. నిందితుడు అనుదీప్‌ తాను వేసుకున్న క్రీస్తు మాలను ఈస్టర్‌ రోజున తీశాడు. కాగా, బాధితురాలిని 10వ తేదీ రాత్రి ఏలూరులోని దుగ్గిరాల జోసఫ్‌ నగర్‌లో గల నాన్నమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. అదేరోజు రాత్రి తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. మరుసటి రోజు మరోసారి కోరిక తీర్చాలంటూ బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనుదీప్‌ వేడిగా మరిగించిన నూనెను ఆమె వంటిపై పోయటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు చంపేందుకు ప్రయత్నించటంతో బాధితురాలు అతని నుంచి తప్పించుకుని అతని ఫోన్‌ లాక్కొని తండ్రికి ఫోన్‌ చేయగా.. వారు వచ్చి ఆమెను ఏలూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో చేర్పించారు. 

నిందితుడిపై హిస్టరీ షీట్‌
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అనుదీప్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం నిందితుడు అనుదీప్‌ను ఏలూరు కొత్త బస్టాండ్‌  సమీ పంలో అరెస్ట్‌ చేశామని చెప్పారు. నేరం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేయటంతో పాటు, ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేసే దిశగా త్వరలోనే చార్జిషీట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ఎస్పీ మేరీప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్‌ పై హిస్టరీ షీట్‌ తెరుస్తున్నట్టు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని, మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక దాడులకు పాల్ప డినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement