
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ వర్గానికి చెందిన రౌడీ మూక మరో వర్గంపై రాళ్లు, తల్వార్లతో దాడి చేసింది. కుల్సుంపురలోని ముస్తైద్పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హుస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. అటుగా వచ్చిన ఫిరోజ్ అలియాస్ అల్లూ వచ్చి రోడ్డుపై బైక్ ఎందుకు పెట్టావంటూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తన సోదరులు దర్వేష్ అలియాస్ బబ్బు, జాఫర్, మరికొంత మందితో కలిసి ఫరూక్ హుస్సేన్ ఇంటిని చుట్టుముట్టారు.
బైక్ని ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి కిటికీలు, టీవీ, మొబైల్ ఫోన్లు పగులగొట్టారు. అడ్డొచ్చిన ఫరూక్ కుమారుడిపై తల్వార్తో దాడి చేశారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. ఇంట్లోని మహిళలపై సైతం పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయితే, దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఫిర్యాదును స్వీకరించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. గాయాలపాలైన ఫరూక్ హుస్సేన్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. (చదవండి: నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి)
Comments
Please login to add a commentAdd a comment