కౌంటింగ్కు సర్వం సిద్ధం
● 28 టేబుళ్లు.. 17 రౌండ్లు
● 2,18,902 ఓట్ల లెక్కింపు
ఏలూరు (మెట్రో): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో గత నెల 27న పోలింగ్ జరిగింది.
69.50 శాతం పోలింగ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పు గోదావరి జిల్లాలో 42,446, పశ్చిమ గోదావరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్ నమోదు కాగా, బ్యాలెట్ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. ఈ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. టీడీపీ బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొందని భావిస్తున్నారు.
ఉదయం 7 గంటలకు..
కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్, రోల్ ఇన్చార్జి, షిఫ్ట్ ఇన్చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు.
సమగ్ర శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్ పేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లను నిషేధించామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈ పి.సాల్మన్రాజును కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment