
క్షేత్రస్థాయి నివేదిక మేరకు నిర్ణయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూములకు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా వచ్చే డేటాతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అన్నారు. బుధవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో మండలంలోని వివిధ గ్రామాల్లో స్వామివారి దేవస్థానం భూముల శిస్తుల పెంపుదల నిమిత్తం ఏర్పాటు చేసిన అధికార సమావేశం రైతుల హాజరు శాతం తక్కువగా ఉండడం వల్ల వాయిదా వేశారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ, అగ్రికల్చర్, ఫిషరీస్ సిబ్బంది దేవస్థానం భూములపై ఇచ్చే వాస్తవ పరిస్థిల డేటాపై తదుపరి సమావేశం నిర్వహణకు ఆర్డీఓ పై విధంగా తెలిపారు. సదరు సమావేశానికి రైతులు శాతం సంతృప్తికరంగా ఉండాలని కూడా ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా దేవస్థానం కౌలు రైతులు ఒక వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడం వల్ల, మరో పక్క చెరువుల వల్ల వచ్చే వ్యర్థమైన నీటి వల్ల దేవస్థానం భూముల్లో వ్యవసాయం దెబ్బతిందని, గత 12 సంవత్సరాలుగా కనీసం పంట ఊడ్చలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, వ్యవసాయ భూములు తరుచూ ముంపులోనే మునిగి ఉంటున్నాయని ఆ పత్రంలో వారు వివరించారు. గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అంచనా వేసి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ–1 కొల్లాబత్తుల శుభాకర్, ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్బాబు, మాలే శ్రీనివాస నగేష్, దేవ రాజేంద్రప్రసాద్, ఉండపల్లి అంజిబాబు, పలువురు వీఆర్వోలు, వివిధ గ్రామాలకు చెందిన కౌలు రైతులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ను అవమానించిన యువకుడి అరెస్టు
శంఖవరం: గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన యువకుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు అందించిన వివరాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన యువకుడు శంఖవరం గ్రామానికి చెందిన పడాల వాసుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 14 అర్ధరాత్రి దాటిన తరువాత వాసు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానం కలిగించినట్లుగా పోలీసులు గుర్తించారు. దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజున అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించారు. అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, డిఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో సాంకేతిక, సీసీ ఫుటేజీల ఆధారంగా అనేక మంది అనుమానితులను విచారించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడు దుందుడుకు స్వభావంతో ఈ దారుణానికి ఒడిగటినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితునికి కఠిన శిక్ష పడేందుకు మరిన్ని సాంకేతిక ఆధారాలతో లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అన్నవరం డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
అన్నవరం: అన్నవరం దేవస్థానం ట్రాన్స్పోర్టు విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న కొల్లు పైడిబాబు (పెద్ద శ్రీను)ను ‘బ్రీత్ అనలైజర్’ పరీక్షలో మద్యం తాగినట్టు గుర్తించి తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. తదుపరి చర్యల కోసం ఈఓకు నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు
రాయవరం: స్థానికంగా 11 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన తేతల వెంకట శ్రీనివాస్రెడ్డి అలియాస్ కేబుల్ శ్రీనుపై ఎస్సై డి.సురేష్బాబు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రాయవరం మెయిన్రోడ్డులో అరెస్టు చేశామన్నారు. అనంతరం జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు తెలిపారు.