ఆయుధాల పందేరం! | Assam cabinet decides to grant arms license | Sakshi
Sakshi News home page

ఆయుధాల పందేరం!

May 31 2025 2:41 AM | Updated on May 31 2025 2:41 AM

Assam cabinet decides to grant arms license

రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవటం మొదలెట్టి 75 ఏళ్లవుతుండగా మన పాలకుల విపరీత పోకడలు దాన్ని కాస్తా భ్రష్టుపట్టించే దిశగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని సరిహద్దులకు సమీపంగా వుండే మారుమూల ప్రాంతాల్లోని స్థానిక తెగలకూ, నివాసితులకూ ఆయుధాల లైసెన్స్‌లుమంజూరు చేయాలని అస్సాం మంత్రివర్గం బుధవారం నిర్ణయించటం ఆ కోవలోనిదే. సరిహద్దు ఆవలి నుంచి చొరబడి బెదిరింపులకు దిగేవారి నుంచి రక్షణ కోసం, వ్యక్తిగత భద్రత కోసం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెబుతున్నారు. 

‘జాతి, నేల, స్థానికత’ కాపాడటం కోసమే ఇలా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్‌ పొడవునావుండే రెండు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల వాసులకు ఈ ఆయుధాల లైసెన్స్‌లు లభిస్తా యని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాలన్నిటా ముస్లింల జనాభా ఎక్కువ. ఇప్పుడు జనం చేతికి తుపాకులందితే మత ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా తుపాకులు మాట్లాడటం మొదలవుతుంది. ఇది ప్రభుత్వానికి మంచిదేనా? 1985 నుంచీ ఆ ప్రాంతాలవారు ఈ లైసెన్స్‌ల కోసం డిమాండ్‌ చేస్తుంటే గత ప్రభుత్వాలేవీ సాహసించలేదని, వాటికి ధైర్యంలేదని శర్మ వివరిస్తున్నారు. 

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది తమకు రక్షణ, భద్రత కల్పిస్తాయని, మౌలిక సదుపాయల కల్పనపై శ్రద్ధ పెడతాయని, తమ బతుకులు మెరుగుపరచటానికి అవసరమైన పథకాలు రూపొందిస్తాయని ఆశించబట్టే! ఇంతకూ ‘ధైర్యం లేని’ గత ప్రభుత్వాల్లో తాను మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలున్నట్టేనా? ఆ కాలాల్లోని ప్రభుత్వాలకు ‘ధైర్యం’ కలిగించేందుకు తాను చేసిందేమిటి? తాను విఫలమైన పక్షంలో దానిపై నిలదీయకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయినట్టు? 

దాదాపు పాతికేళ్లుగా శర్మ రాజకీయాల్లో వుంటున్నారు. ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2015లో కాంగ్రెస్‌ నుంచి తప్పుకోవటానికి కూడా కారణం ఆ సర్కార్‌కు ధైర్యం లేదని కాదు. తన రాజకీయ ఎదుగుదలకు అప్పటి సీఎం తరుణ్‌ గొగోయ్‌ అడ్డంకిగా మారటం! దీన్నంతటినీ రాహుల్‌గాంధీని కలిసి మొరపెట్టుకోవాలని శర్మతీవ్రంగా ప్రయత్నించారు. కానీ జనాదరణగల యువ నాయకుల కన్నా పీఠాధిపత్యం నెరపే వృద్ధ తరం నేతలకే పెద్దపీట వేసే సంస్కృతిగల కాంగ్రెస్‌లో అది సాధ్యపడలేదు. 

నేపథ్యం ఏమైనా బీజేపీలో శర్మ బాగా రాణించారు. ఏనాటినుంచో ఆ పార్టీలో వున్న నేతలను తలదన్నే విధంగా ప్రకటనలిచ్చి వివాదాస్పదుడూ అయ్యారు. అందువల్ల పార్టీలో ఆయన పట్టు పెరిగింది గనుకే 2021లో బీజేపీ అధిష్ఠానం శర్మను అస్సాం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కానీ గత ప్రభుత్వాలు తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వకపోవటానికి వాటికి ధైర్యం లేకపోబట్టే అని ఆయన దేని ఆధారంగా నిర్ణయానికొచ్చారో చెప్పలేదు. శర్మ చెబుతున్న ప్రకారం ఆ ప్రభుత్వాలు సాహసించలేక పోబట్టి చాలామంది స్థానిక తెగలవారు బయటి వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగి భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. అక్కణ్ణించి వలసలు పోవాల్సి వచ్చింది. మరి ప్రభుత్వాల వైఖరి వల్ల జనం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఆయన మౌనంగా మిగిలిపోవటం ఎందువల్ల?

హిమంత గ్రహించాల్సిన విషయం ఒకటుంది. గతంలో ప్రజల నుంచి ఎన్ని డిమాండ్లు వచ్చినా అప్పటి ప్రభుత్వాలు ఆయుధ లైసెన్సులివ్వకపోవటానికి కారణం ధైర్యం లోపించి కాదు. అది అనైతికమూ, రాజ్యాంగ విరుద్ధమూ అని విశ్వసించటం వల్ల! అమెరికాలో పౌరులెవరైనా ఆయు ధాలు కొనుక్కోవచ్చు. అందుకు కొన్ని నిబంధనలున్నా ఆచరణలో అవి ఏమవుతున్నాయో అక్కడ తరచు జరిగే ఉదంతాలు గమనిస్తే అర్థమవుతుంది. అక్కడ సగటున 100 మంది పౌరులకూ 120.5 తుపాకులున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు తుపాకీ మరణాలు 30,000 మించాయి. 

అకారణంగా లేదా భయపడి తరచు అవతలివారిని చంపుతున్న ఉదంతాలు ఎక్కువ. ఆ దేశంలో కూడా హిమంత ప్రభుత్వం ఏకరువు పెడుతున్న నిబంధల వంటివే వున్నాయి. మానసికంగా సక్ర మంగా వుండి అవతలివారి నుంచి ప్రాణభయం ఉన్న 21 ఏళ్లు పైబడినవారందరికీ లైసెన్సులిస్తా మని హిమంత చెబుతున్నారు. ఏదైనా కేసులో శిక్షపడినా, శాంతికి దోహదపడతామని గతంలో ప్రభుత్వానికి బాండు రాసిచ్చినా అనర్హులవుతారట. అంతేగాక మానసికంగా, శారీరకంగా సరైన స్థితిలో వున్నవారికే లైసెన్సులు జారీచేస్తారట. ఒకసారంటూ కళ్లెం వదిలాక ఇవన్నీ నిజాయతీగా, చిత్తశుద్ధిగా అమలవుతాయా? అనుమానమే!

అస్సాం మొదటినుంచీ సమస్యాత్మక రాష్ట్రం. అక్రమంగా చొరబడిన విదేశీయులను వెనక్కిపంపాలంటూ ఉవ్వెత్తున లేచిన విద్యార్థి ఉద్యమం, అటుతర్వాత ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థల ఆగడాలు తెలియంది కాదు. నిత్యం అపహరణలు, డబ్బు దండుకోవటం, హత్యలు ఒకప్పుడు చాలా అధికం. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్లు, పోలీసులు ఉల్ఫా ఆటకట్టించాక అవి చాలావరకూ తగ్గిపోయాయి. ఇప్పటికీ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తుంటారు. 

సమస్య వుందనుకుంటే మరింతమందిని నియమించి, పటిష్ఠమైన పర్యవేక్షణ అమలు చేయటం పెద్ద కష్టం కాదు. అందుకు భిన్నంగా లైసెన్సులిస్తామంటే ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కాదా? ఇలాంటి కారణాల వల్లే గతంలో ఛత్తీస్‌గఢ్‌లో సుప్రీంకోర్టు సల్వాజుడుంను రద్దుచేసింది. పైగా అస్సాంకు భారీయెత్తున పెట్టుబడులు తీసుకొస్తామని చెబుతూ శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి విధానం అమలు చేయటం సరైందేనా? హిమంత ఆలోచించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement