Editorial.
-
ఖైదీలపై ఇంత వివక్షా!
జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు శిక్షనుంచి మినహాయింపు (రెమిషన్) ఇవ్వడానికి సంబంధించిన విధానం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతనీ, ఖైదీలు అడగటం లేదు గనుక ఆ మినహాయింపుపై ఆలోచించాల్సిన అవసరం లేదని భావించటం సరికాదనీ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఒక చట్టం రూపొందటం వెనక ఎంతో కృషి ఉంటుంది. దాని అవసరాన్ని గుర్తించటం తొలి మెట్టయితే ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. తొలుత చట్టం పూర్వరూపమైన బిల్లు ముసాయిదా రూపురేఖలపైనా, ఆ తర్వాత దాన్లో ఉండాల్సిన నిబంధనలపైనా, పరిహరించవలసినవాటిపైనా లోతైన చర్చలుంటాయి. చట్ట సభలోనూ, పౌర సమాజంలోనూ దాని మంచిచెడ్డలపై నిశిత పరిశీలన ఉంటుంది. తీరా చట్టం అయ్యాక ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృషి మొత్తం వృథా అవుతుంది. కొన్ని ప్రభుత్వాల ధోరణి మరీ అన్యాయం. ఖైదీల శిక్ష మినహాయింపుపై వాటికంటూ విధానమే ఉండదు. ఆ బాపతు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. ఇంతవరకూ శిక్ష మినహాయింపుపై విధానం లేని రాష్ట్రాలు రెండు నెలల్లో ఆ పని చేయాలనీ, అది వాటి బాధ్యతనీ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖైదీలు అడగలేదన్న సాకు చెల్లదన్నది తీర్పు సారాంశం.నిన్న మొన్నటివరకూ నూటయాభైయ్యేళ్ల నాటి నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) ఉండేది. దానిస్థానంలో నిరుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమల్లోకొచ్చింది. సీఆర్పీసీ లోని చాలా నిబంధనలు బీఎన్ఎస్ఎస్లోకి కూడా వచ్చాయి. కాకపోతే ఆ సెక్షన్ల క్రమసంఖ్యలు మారాయి. ఖైదీలకు శిక్షాకాలం నుంచి మినహాయింపునిచ్చేందుకు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచేందుకూ ప్రభుత్వానికి సీఆర్పీసీలోని సెక్షన్ 432 అధికారం ఇవ్వగా... బీఎన్ఎస్ఎస్లోని 473వ సెక్షన్ ఆ పని చేస్తోంది. చట్టం ఇంత స్పష్టంగావున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ సెక్షన్లకు అనుగుణంగా విధాన రూపకల్పన చేసిన ప్రభుత్వాలూ, అసలు దాని జోలికేపోని ప్రభుత్వాలూ కూడా శిక్ష మినహాయింపు ఇవ్వొచ్చన్న సంగతే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి.జైళ్లంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. అక్కడ నిర్బంధంలో ఉన్నవారంతా ఏదో తప్పు చేసేవుంటారన్న భావనలోనే చాలామంది ఉంటారు. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్నవారిలో కూడా చాలామందికి జరిగిన నేరంతో నిజంగా ప్రమేయం లేకపోవచ్చు. సకాలంలో తగిన న్యాయసహాయం అందకపోవటం వల్ల కావొచ్చు... ఆర్థిక స్థోమత లేకపోవటంవల్ల కావొచ్చు వారు ఈ ఉచ్చులో చిక్కుకుని ఉండొచ్చు. పలుకుబడి ఉన్నవారు తమ నేరాన్ని వేరేవారిపైకి నెట్టి వారు జైలుకు పోయేలా చేసిన సందర్భాలూ అప్పుడప్పుడు బయట పడు తుంటాయి. ఒకవేళ నిజంగా నేరంతో ప్రమేయం ఉన్న వ్యక్తికి సైతం అతడి హక్కులన్నీ హరించుకు పోవు. శిక్ష కారణంగా కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిచిపోతాయి. శిక్ష మినహాయింపు అర్హత పొందిన ఖైదీలకు ఆ వెసులుబాటును కల్పించకపోవటం అంటే ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించటమే, ఏకపక్షంగా వ్యవహరించటమే అవుతుంది. చట్టం ముందు పౌరులందరూ సమానులేనని, ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించరాదని ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించే రాజ్యాంగంలోని 14వ అధికరణ స్పష్టం చేస్తోంది. శిక్షలో మినహాయింపునకు అర్హత పొందినవారికి దాన్ని నిరాకరించటం అంటే ఈ అధికరణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. శిక్షకాలంలో మినహాయింపునివ్వటం కూడా విచక్షణా రహితంగా ఉండకూడదు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి నేర స్వభావంలో మార్పు వచ్చిందో లేదో గమ నించటం, సమాజంలో సాధారణ మనిషిగా జీవించ గలుగుతాడా అని చూడటం జైలు అధికారుల బాధ్యత.వారినుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికుంటుంది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని గుర్తుచేసింది. శిక్ష మినహాయింపునకు రూపొందించే నిబంధనలు ఖైదీలు వినియోగించుకోవటం అసాధ్యమైన రీతిలో కఠినంగా ఉండరాదని... అవి అస్పష్టంగా కూడా ఉండకూడదని సూచించింది. ఒకవేళ మినహా యింపునకు అర్హత లేనట్టయితే అందుకు గల కారణాలేమిటో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జైలు అధికారులు వివరించాల్సి వుంటుంది. అదే సమయంలో తన అనర్హతకు చూపిన కారణాలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఖైదీకి చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. ఒకవేళ బయటి కెళ్లాక ఖైదీ ప్రవర్తన సమాజానికి హాని కలిగే రీతిలో ఉన్నదని భావిస్తే శిక్ష మినహాయింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. అందుకుగల కారణాలను ఆ ఖైదీకి వివరించాలి.చట్టాలు చేయగానే సరికాదు. వాటిని వినియోగించటానికి అవసరమైన విధానాలను కూడా రూపొందించాలి. చిత్తశుద్ధితో వాటిని అనుసరించాలి. ఆచరణకు అనువైన విధానం లేనట్టయితే చట్టాల ఉద్దేశమే నీరుగారుతుంది. 2022 నాటి నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని 1,300కు పైగా జైళ్లలో 5,73,200 మంది ఖైదీలున్నారు. ఈ జైళ్లలో వాస్తవానికి 4,36,266 మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. జైళ్లు ఇలా కిక్కిరిసి ఉండటంవల్ల అవి సకల రుగ్మతలకూ నిలయాలవుతున్నాయి. నిస్సహాయుల పాలిట నరకాలవుతున్నాయి. చాలీచాలని సిబ్బందితో పర్యవేక్షణ అసాధ్యమై నిజంగా నేరం చేసినవారిని సంస్కరించటం మాట అటుంచి, అకారణంగా జైలుపాలైనవారు సైతం నేరగాళ్లుగా మారే ప్రమాదం పొంచివుంటోంది. తాజా తీర్పు ప్రభుత్వాల మొద్దునిద్ర వదిలించాలి. -
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్తో ప్రమేయం లేకుండా అఫ్గాన్కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్బ్యాంకును నిర్మలా సీతారామన్తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్టౌన్, డర్బన్లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్లో అంబేడ్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
న్యాయాన్యాయాలు
న్యాయం చేయటమే కాదు... చేసినట్టు కూడా కనబడాలంటారు. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్సభ మూజువాణీ ఓటుతో తీర్మానం ఆమోదించిన తీరు ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించింది. మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటి, వాటి తీవ్రత ఎంత... ఎథిక్స్ కమిటీ ఆ ఆరోపణలను పరిశీలించవచ్చునా లేదా వంటి సందేహాల వరకూ పోనవసరం లేదు. అసలు బహిష్కరణకు గురయ్యే సభ్యులు ఆ నిర్ణయంపై సభలో తమ స్వరం వినిపించటానికి అవకాశం ఇవ్వకపోవటం సబబేనా? మొన్న 4న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకూ సాగుతాయి. నివేదికపై శుక్రవారం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ విపక్షం వాకౌట్చేసింది. ఎథిక్స్ కమిటీలో మొయిత్రాకు అవకాశమిచ్చామని, కానీ అడిగిన వాటికి జవాబులివ్వకుండా ఆమె దూషణలకు దిగారని కమిటీ చైర్మన్ వినోద్కుమార్ సోంకార్, కమిటీలోని బీజేపీ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఫిర్యాదుకు సంబంధంలేని ప్రశ్నలతో వేధించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆ ప్రశ్నలున్నాయని మొయిత్రా కూడా ప్రత్యారోపణ చేశారు. ఒకవేళ మొయిత్రా చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే అనుకున్నా... అంతమాత్రాన సభలో తన వాదన వినిపించేందుకు ఆమె అనర్హురాలవుతారా? చట్టసభల్లో జరిగే చర్చలు, వాటి ప్రత్యక్ష ప్రసారాలు పాలక, విపక్ష సభ్యుల్లో ఎవరు ఎవరికంటే బాగా మాట్లాడుతున్నారో నిర్ణయించటానికి కాదు. తాము ఎన్నుకున్న సభ్యులు చర్చిస్తున్నదేమిటో, తీసుకుంటున్న నిర్ణయాలేమిటో, వాటిలోని మంచిచెడ్డలేమిటో తెలుసుకోవటం కోసం. మొయిత్రా కావొచ్చు...మరొకరు కావొచ్చు – చర్చ సందర్భంగా అప్రామాణికంగా లేదా అసంబద్ధంగా మాట్లాడితే వారి వాదనలోని డొల్లతనాన్ని ప్రజలే గ్రహిస్తారు. అది పాలకపక్షానికే మంచిది. సభలో అధికారపక్షానికి కావలసినంత మెజారిటీ వుంది. కనుక మొయిత్రాకు అవకాశమిచ్చినంత మాత్రాన కలిగే నష్టం ఏమీ లేదు. అసలు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశ ప్రారంభం రోజైన ఈనెల 4నే ప్రవేశపెట్టాలి. కానీ పాలక పక్షం శుక్రవారానికి వాయిదా వేసింది. అయినా ఈ వ్యవహారం ఇలా ముగియటం మన పార్లమెంటరీ వ్యవస్థ లోపాన్ని తెలియజెబుతోంది. నివేదికను కమిటీలోని ఆరుగురు అంగీకరించగా, నలుగురు దాన్ని వ్యతిరేకించారు. ఎథిక్స్ కమిటీ నిర్ణయం సబబే కావొచ్చు... అది మెజారిటీ ప్రకారమే తీసుకుని వుండొచ్చు. కానీ సభలో మొయిత్రాకు అవకాశమీయటంవల్ల ఎంపీగా ఆమె ప్రవర్తనలోని గుణదోషాలను పౌరులు తెలుసుకునే అవకాశం వుంటుంది కదా! దాన్ని నిరాకరించటం ఏం సబబు? మొయిత్రాపై వున్న ఆరోపణల పూర్వాపరాలు పరిశీలిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ఆమె తన పరిమితులు అతిక్రమించారా అన్న సందేహాలు కలుగుతాయి. సభలో వేయదల్చుకున్న ప్రశ్నలను సభ్యులు ఎక్కడి నుంచి అయినా ఎన్ఐసీలో లాగిన్ అయి, నేరుగా స్పీకర్కు చేరే విధంగా పోస్ట్ చేయొచ్చు. ఆ ప్రశ్నల అర్హతను స్పీకర్ నిర్ణయించాక అవి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెళ్తాయి. అనర్హ ప్రశ్నలను తొలగిస్తారు. ఇదంతా ఆమె నేరుగా చేసివుంటే ఇంత రచ్చయ్యేందుకు ఆస్కారం వుండేది కాదు. తన స్నేహితుడైన దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్వర్డ్ అందజేసి అందులో ప్రశ్నలు పోస్ట్ చేయించమని చెప్పారు. తన నియోజకవర్గ పనుల్లో తీరిక లేకుండా వున్నందున ఇలా చేయించానని మొయిత్రా సంజాయిషీ. మామూలుగా ఇది సబబు అనిపించదు. కానీ 800మంది ఎంపీల్లో అత్యధికులు ఇలాగే చేస్తున్నారని, ప్రతిదీ వారే చేయాలంటే అసాధ్యమని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధనేదీ లేదంటున్నారు. ఒకరిద్దరు సభ్యులు సైతం తామూ అలాగే చేస్తున్నామని చెప్పారు. ఎథిక్స్ కమిటీ మాత్రం ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చే చర్య అంటున్నది. పైగా లంచం తీసుకుని అదానీ సంస్థ లపై ఆమె ఈ ప్రశ్నలు వేశారని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఈ సందర్భంగా 2005లో ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రా పోస్ట్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ప్రస్తావించుకోవాలి. 11మంది ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు తాము ఇవ్వజూపిన డబ్బు తీసుకున్నారని ఆ పోర్టల్ తేల్చింది. వీరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీలకు చెందినవారున్నారు. ఇందులో 10 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభకు చెందినవారు. ఇదంతా ఒక చానెల్లో ప్రసారమైంది. ఆ ఎంపీలను సభ నుంచి బహిష్కరిస్తున్న సందర్భంలో మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ ఇందులో అవినీతికన్నా ఎంపీల బుద్ధిహీనత వెల్లడవుతోందన్నారు. అందుకు బహిష్కరణ శిక్ష విధించటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మొయిత్రా విషయంలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? అసలు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు విడిపోయిన ఆమె సహచరుడు జైఅనంత్ దేహద్రాయ్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు రాసిన లేఖ ప్రాతిపదిక. మొయిత్రా, దేహద్రాయ్లకు బోలెడు తగువులున్నాయి. పెంపుడు కుక్క విషయం మొదలుకొని ఎన్నిటిపైనో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అందువల్ల ఆ లేఖకు ఎంతవరకూ ప్రాధాన్యమీయవచ్చో ఆలోచిస్తే బాగుండేది. అలాగే ప్రభుత్వంపై మొయిత్రా తరచు నిశిత విమర్శలు చేస్తుంటారు గనుక, ఆ కారణంతోనే చర్య తీసుకున్నారన్న అపప్రద రాకుండా చూసుకోవాల్సింది. అసలు ఆమెకు సభలో మాట్లాడే అవకాశ మిస్తే ఆదరాబాదరాగా చేశారన్న నిందకు అవకాశం వుండేదే కాదు. – డా‘‘ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరం (డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
అమెరికా చదువు సంస్కృతులు
అమెరికా విద్యారంగంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, రాజకీయులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉండేది. యువ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చనువుగా ప్రవర్తించే వారు. పిల్లల విషయాలను చర్చించడానికి ఒక రోజయినా వారితో గడిపేవారు. నేటి విద్యార్థులు, యువత అతి తక్కువ సమయంలో ఊహించని, తీవ్రమయిన మార్పులకు గురవుతున్నారు. యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న వీరు జ్ఞానాన్ని గ్రహించటానికి పెనుగు లాడుతున్నారు. పాఠశాలలకూ సమస్యలున్నాయి. విపరీతంగా సాగదీయ బడిన ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణ పథకం, ఆశించిన స్థాయిని అందు కోలేని దూరవిద్య, కరోన మహమ్మారి కాలపు అలవాట్ల నుండి బయటపడలేని దుఃస్థితి అందులో కొన్ని. విద్యాలయాల వద్ద మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు మరో తీవ్ర సమస్య. బాంబుల, తుపాకుల ఉపయోగ సంస్కృతి సకారాత్మక నిర్ణయా లకు అడ్డుతగులుతున్నాయి. మహమ్మారి కాలంలో కోల్పోయిన పాఠ్యాంశాలను విద్యా ర్థులు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. రెండేళ్లలో తప్పిన సాంఘికీకరణ, పరిపక్వతలను సంపాదిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో విద్యార్థులు రెండేళ్ళు వెనుకబడ్డారని మానసికశాస్త్ర ఉపాధ్యాయుల అభిప్రాయం. అందుకే బళ్ళలో అంతా బాగుందనేవాళ్ళ సంఖ్య తగ్గింది. విద్యారంగం పిచ్చివాళ్ళ, తీవ్రవాదుల హస్తాల్లో చిక్కుకుందని కొన్ని పత్రికలు ప్రచారం కూడా చేస్తున్నాయి. అమెరికాలో విడాకులు పెరిగాయి. పిల్లలకు ఇద్దరు తల్లిదండ్రుల పెంపక అవకాశం లేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరే పిల్లలను పెంచవలసి వస్తోంది. 25 శాతం పిల్లలు ఇలాంటి వారే. ఏ దేశంలోనూ ఈ స్థితి ఈ స్థాయిలో లేదు. ఈ చేదునిజం అమెరికాలో సింగిల్ పేరెంట్ సంరక్షణ శిశువులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనితో సమాజం నష్టపోతోంది. ఈ పిల్లలు ప్రవ ర్తనా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వీరి సంఖ్య తక్కువ. వారిలో అవగాహన, బోధనాంశాలను అర్థం చేసుకోవడంలో తేడా ఉంటోంది. పిల్లల చదువు, భావిపౌరుల శ్రేయస్సుకు... అమెరికాలో పతనమయిన కుటుంబ, సామాజిక సంబంధాలను మెరుగుపర్చడమే మార్గం. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
వైద్యంలో వీరుడు
అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడిగా పేరొందిన డాక్టర్ సోహన్ సింగ్ అచ్చమైన తెలుగువాడు. గదర్ వీరుడు సోహన్ సింగ్ జోషీ స్ఫూర్తితో ఆయనకు ఆ పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. వైద్యంలో వీరుడిగా నిలిచారు. అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడు, హోమియోలో కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సోహన్ సింగ్ వైద్య వృత్తిలోనూ ‘గదర్’ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న సామాజిక కార్యకర్త. నరనరాన ప్రజా సేవలోనే తరించుతూ ఈ నెల 24న తన 76వ ఏట కన్నుమూశారు. అభ్యుదయ కవి పండితులు, పాత్రికేయ కురువృద్ధు తాపీ ధర్మారావు మనవరాలు విమలను సోహన్ సింగ్ పెళ్లాడారు. ఈమె ‘విశాలాంధ్ర’ దినపత్రిక సంపా దకునిగా పనిచేసిన తాపీ మోహనరావు కుమార్తె. మా తరం అంతా తాపీ మోహనరావు ఆధ్వర్యంలో పాత్రికేయ వృత్తి మెలకువలు దిద్దుకున్న వాళ్లమే. ఒక తెలుగువాడికి ‘సోహన్ సింగ్’ అని పేరు పెట్టడానికి కారణం, ‘గదర్ పార్టీ’ వీరులలో ఒకరైన ‘సోహన్ సింగ్ జోషీ’. దరిశి చెంచయ్య స్థాపించిన ఈ పార్టీ తెలుగునాట విప్లవోద్యమ బీజాలు నాటిందని మరచిపోరాదు. ఇంతటి పూర్వ చరిత్ర స్ఫూర్తితో ఎదుగుతూ, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. ఈ ఆచరణలో భాగంగానే ‘ధర్మకిరణ్ హోమియో రీసెర్చి ఫౌండేషన్’ను, అదే పేరిట హోమియో వైద్యశాలను, ఆదర్శ హోమియో ఫార్మసీ, కళాశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్లో తొలి హోమియో రీసెర్చి కేంద్రం ఏర్పా టుకు తన చొరవతో పథకం రచించగా దాన్ని కేంద్రం గుర్తించింది. పెక్కు శారీరక రుగ్మతలకు శాశ్వత పరిష్కా రాలు చూపిన ఘనాపాఠి సోహన్ సింగ్. ఎన్నో కుటుంబాలకు, స్కూళ్లకు 1999 నుంచి 2022 దాకా హోమియో మందుల ‘కిట్స్’ను అందించుతూ వచ్చారు. వైద్య సదుపాయాలు అందక పెక్కు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించారు. పెక్కు దేశీయ, రాష్ట్రీయ కేంద్రా లలోని వైద్య శాఖల సమన్వయ కర్తగా అమూల్యమైన సేవలందించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ హోమియో మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్కు దాదాపు 26 సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. హోమియో రీసెర్చి ఫౌండేషన్ ఫార్మా యూనిట్ ఆధ్వర్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే మందుల స్థానే దేశీయ నాణ్యమైన హోమియో మందుల ఉత్పత్తికి కృషి చేశారు. దేశీయ వృక్ష జాతుల నుంచి లభించే ముడి సరుకు ఆధారంగా హోమియో టించర్లను, టిష్యూ సాల్ట్స్ను ఉత్పత్తి చేయించారు. ‘‘సోహన్ సింగ్ కర్మయోగి, పని.. పని.. పని... తప్ప మరో ధ్యేయం, యావ లేని వైద్యుడు. కొందరు రోజుకు 24 గంటలేనా అని బాధపడతారు, కొందరు జీవితాలకు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే నెలలకు, సంవత్సరాలకూ కూడా లక్ష్యాలు పెట్టుకుంటారు. ఒకటి పూర్తవగానే ఇంకొకటి, అలా లక్ష్యాలను వెంటాడుతూనే ఉంటారు. పనే ప్రాణం, లేకపోతే వారికి ఊపిరాడదు! ఆ లక్ష్యాల నుండి ఎడబాటుండదు, తడబాటుండదు. వారికి వయస్సు విరోధి కాదు, రోగాలను గురించి తలచుకునే సమయం ఉండదు. వారెవరో కాదు, మన సోహన్ సింగ్. భారత హోమియోపతి వైద్యంలో సోహన్ సింగ్ చూడని లోతులూ లేవు, ఎక్కని ఎత్తులూ లేవు... తెల్లవారు జామున సుదూర ప్రయాణాలు చేసి ఆయన ఇచ్చే తెల్లపంచదార మాత్రల కోసం జనాలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆయన ఇచ్చే మందులు తన వ్యవసాయ క్షేత్రంలో పెంచిన మూలికల నుంచే తీసుకుని తన సొంత ఫార్మసీలోనే తయారు చేసుకుంటారు. అత్యుత్తమమైన వైద్య సేవలు అందించిన సోహన్ సింగ్ వైద్యనారాయణుడు, వైద్యులందరికీ ఆదర్శనీయులు’’ అని డాక్టర్ చెరుకూరి బాలచంద్రమోహన్, సతీమణి డాక్టర్ సత్యవతీ దేవిల అభిభాషణ. ‘ధర్మకిరణ్ హోమియో పరిశోధనా సంస్థ’ అధ్యక్షురాలు పి. నీలిమా సతీష్ మాటల్లో చెప్పాలంటే, ‘‘చెట్లను, మొక్కల్ని కాపాడుకోగల్గితే, అవి తిరిగి మనల్ని రక్షించి, పక్కవాటు రోగాలు రాకుండా కాపాడతాయి.’’ ఆరోగ్య ప్రదాయినిగా మన దేశంలో హోమియో వైద్య విధానాన్ని పెంచి పోషించి, ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యానికి అనితర సాధ్యంగా దోహదకారి అయి, మనందరి ఆరోగ్య భావి భాగ్యోదయాల్ని కాంక్షిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకున్న ప్రజా వైద్యుడు సోహన్ సింగ్కు ఇదే నివాళి! abkprasad2006@yahoo.co.in (సుప్రసిద్ధ హోమియో వైద్యుడు డాక్టర్ సోహన్ సింగ్ సెప్టెంబర్ 24న మరణించారు.) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
బంగ్లాదేశ్లో ఎవరి ప్రయోజనాలేంటి?
బంగ్లాదేశ్ను అస్థిరంగా ఉంచాలని అమెరికా చూస్తుంది. ఈ పరిస్థితి తన తూర్పు రాష్ట్రాల్లోకి లక్షలాది మంది వలసలకు కారణం అవుతుంది కాబట్టి దాన్ని భారత్ నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. చైనాకు సంబంధించినంతవరకూ, ఢిల్లీ హసీనాను ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె అధికారాన్ని నిలుపు కోవడంలో సహాయపడుతుంది. మరోవైపు, హసీనా వరుసగా నాలుగోసారి గెలుపొందే విషయం పట్ల అమెరికా ఉత్సాహంగా లేదు. బలమైన దేశీయ మద్దతు ఉన్న నాయకులు అమెరికా ఆదేశాలను తిప్పికొట్టడం దానికి కారణం. అమెరికాలాగా భారత్ కూడా, చైనా వ్యతిరేక శిబిరంలో బంగ్లాదేశ్ ఉండాలని కోరుకుంటోంది. అయితే బంగాళాఖాతంలో స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అమెరికాతో ఢిల్లీ ఎంత దూరం వెళ్తుందనేది అనిశ్చితం. 1975లో తమ వ్యవస్థాపక అధ్యక్షుడు షేఖ్ ముజీబుర్ రహమాన్ హత్య వెనుక అమెరికా హస్తం ఉందని బంగ్లాదేశ్లోని చాలామంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ముజీబుర్ రహమాన్ను పడగొట్టిన సైనిక తిరుగుబాటులో వాషింగ్టన్ పాత్ర పోషించిందా లేదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఈ దక్షిణాసియా దేశ తొలి సైనిక పాలకుడు జనరల్ జియావుర్ రహమాన్కు అమెరికా మద్దతునిచ్చింది. ఇప్పుడు, దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, హత్యకు గురైన అధ్యక్షుడి కుమార్తె, ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా, అమెరికా తనను పడగొట్టి తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని, జియావుర్ రహమాన్ వితంతువు అయిన ఖలీదా జియాను అధికారంలోకి తేవాలనుకుంటోందని ఆరోపిస్తున్నారు. ‘‘అమెరికన్లు నేను అధికారంలో కొనసాగాలను కోవడం లేదు,’’ అని ఆమె ఇటీవల ‘బీబీసీ’తో అన్నారు. ఇంకా దారు ణంగా, ఆమె ఏప్రిల్లో పార్లమెంటులో మాట్లాడుతూ, ‘‘ఎటువంటి ప్రజాస్వామ్య ఉనికిని కలిగి ఉండని ప్రభుత్వాన్ని ఇక్కడ తేవాలని అమెరికా భావిస్తోంది’’ అని ఆమె ఆరోపించారు. గత సంవత్సరం, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై వాషింగ్టన్, హసీనా ప్రభుత్వంలోని పలువురు అధికారులపై, భద్రతా దళాలపై ఆంక్షలు విధించింది. కానీ బంగ్లాదేశ్లో తమ అనుకూల సైనిక పాలనా కాలంలో, సరైన విచారణ లేకుండానే వందలాదిమంది తిరుగుబాటు సైనికులను ఉరితీసినప్పుడు మాత్రం ఇలాంటి చర్య లను అమెరికా చేపట్టలేదు. ఇటీవలే, రాబోయే జాతీయ ఎన్నికలను మలినపర్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటివారిని దేశంలో అడుగుపెట్టకుండా తిరస్కరిస్తానని అమెరికా బెదిరించింది. ఇలాంటి బెదిరింపులు బంగ్లాదేశ్లో కనీవినీ ఎరుగని రాజకీయ సుడిగుండాన్ని సృష్టించాయి. ఇది రాడికల్ ఇస్లామిక్ సంస్థలతో సహా అనేక శక్తులను నిద్రాణస్థితి నుండి బయటకు లాగి, దాదాపు 16.5 కోట్లమంది బెంగాలీలు గల దేశాన్ని కేవలం ఒక దశాబ్దం క్రితం కొత్త అఫ్గానిస్తాన్గా మార్చివేసింది. అయితే, చట్టవిరుద్ధమైన వ్యూహాలను ఉపయోగించినప్పటికీ, వాషింగ్టన్, ఢిల్లీ నుండి ఆమోదం పొందిన తర్వాత హసీనా వారిని దాదాపుగా అణచివేశారు. హసీనాపై అమెరికా ఆరోపిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల మూలాలు, తీవ్రవాద మతశక్తులపై ఆమె సాగించిన అణిచివేతలో దాగి ఉన్నాయి. వాస్త వానికి, ఆమె మరింత విస్తృతమైన వల వేశారు. అదేక్రమంలో తన రాజకీయ ప్రత్యర్థులను కూడా తుడిచిపెట్టారు. 1971 వరకు బంగ్లాదేశ్ భాగమై ఉన్న పాకిస్తాన్ లో సైనిక నియంతలకు మద్దతు ఇచ్చిన అమెరికా, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే పేరుతో హసీనాపై ఇప్పుడు లాఠీని ప్రయోగిస్తోంది. ఢాకాలో ఈ సిద్ధాంతం చెల్లుబాటవడం కష్టమే. వాషింగ్టన్ ప్రజాస్వామ్య చర్చ తమను మభ్యపెట్టడానికేననీ, దానిలో వారి సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయనీ బంగ్లాదేశీయులు భావిస్తున్నారు. నిజానికి, చైనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో హసీనాను తమవైపు తిప్పుకోవడమే అమెరికా అసలు లక్ష్యం. చైనా ప్రపంచ శక్తిగా ఎదగడం, మరింత ప్రభావం కోసం బీజింగ్ వ్యక్తపరుస్తున్న ఆకాంక్షను భగ్నం చేయడానికి అమెరికా యత్నిస్తోంది. బంగాళా ఖాతం సమీపంలో దాని స్థానం కారణంగా బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా మారింది. బంగాళాఖాతంలోని బంగ్లాదేశ్ ద్వీపంలో అమెరికా తమ నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఇద్దరు వామపక్ష పార్లమెంటు సభ్యులు ఇటీవల పేర్కొన్నారు. ఇటువంటి స్థావరం వల్ల ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు చైనా సముద్ర వాణిజ్య మార్గాన్ని అమెరికా సులభంగా నిరోధిస్తుంది. అది చైనా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే వాషింగ్టన్ కు అలాంటి ఆలోచనే లేదని ఢాకా లోని అమెరికా రాయబార కార్యాలయం నిర్ద్వంద్వంగా ఖండించింది. అమెరికాలాగా భారత్ కూడా, చైనా వ్యతిరేక శిబిరంలో బంగ్లా దేశ్ ఉండాలని కోరుకుంటోంది. అయితే వాషింగ్టన్ నిజంగానేబంగాళాఖాతంలో స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అమెరికాతో ఢిల్లీ ఎంత దూరం వెళ్తుందనేది అనిశ్చితం. దాని పెరట్లో అమెరికా సైనిక స్థావరం ఉండటం ఇష్టపడదు. హసీనా విషయానికి వస్తే, ఆమె భారత్, అమెరికాల ఒత్తిడికి తలొగ్గి, ‘పెద్దన్నలను’ తృప్తిపరచడానికి బీజింగ్కు సురక్షితమైన దూరంలో ఉండవచ్చు. బెంగాలీలు ఒక సమూహంగా ఏదైనా సైనిక కూటమిలో చేర డాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారత్ లేదా అమెరికా బంగ్లాదేశ్ వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి తగినంత డబ్బు ఇవ్వలేవు. ఈ పరిస్థి తుల్లో చైనా రక్షకుడిగా కనిపిస్తోంది. అత్యంత విభేదాలతో ఉండే బంగ్లాదేశీయులు అందరూ అంగీకరించే విషయం ఏదైనా ఉందంటే, అది ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే. కాబట్టి దేశాన్ని ఎవరు పాలించినా, చైనాతో బంగ్లాదేశ్ బలమైన బంధం కొనసాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో భారత ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయి. భారతదేశ ప్రధాన లక్ష్యం దాని తూర్పు పార్శ్వంలో భద్రత. హసీనా దశాబ్దాలుగా దీనికి సహాయం చేశారు. బంగ్లాదేశ్ రాజకీయ దృశ్యంలో అన్ని పువ్వులు వికసించడాన్ని అమె రికా చూడాలనుకోవచ్చు. కానీ ఇస్లామిక్ రాడికల్స్ పట్ల భారత్కు కని కరం లేదు. ఖలీదా జియాపై న్యూఢిల్లీ అవిశ్వాసంతో వ్యవహరిస్తుంది. బంగ్లా దేశ్ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఢిల్లీ చేసిన ఫిర్యాదులను తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖలీదా జియా తోసిపుచ్చి భారత్కు ఆగ్రహం తెప్పించారు. బంగ్లాదేశ్ను అస్థిరంగా ఉంచాలని అమెరికా చూస్తుంది. అయితే ఈ పరిస్థితి తన తూర్పు రాష్ట్రాల్లోకి లక్షలాది మంది వలసలకు కారణం అవుతుంది కాబట్టి దాన్ని భారత్ నిరోధించడానికి ప్రయ త్నిస్తుంది. చైనాకు సంబంధించినంతవరకూ, ఢిల్లీ హసీనాను ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె అధికారాన్ని నిలుపుకోవడంలో సహాయపడు తుంది. మరోవైపు, ఈ ఏడాది ఎన్నికల్లో హసీనా వరుసగా నాలుగో సారి గెలుపొందే విషయం పట్ల అమెరికా ఉత్సాహంగా లేదు. బల మైన దేశీయ మద్దతు ఉన్న నాయకులు అమెరికా ఆదేశాలను తిప్పి కొట్టడం దానికి కారణం. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, హంగరీకి చెందిన విక్టర్ ఓర్బన్ దీనికి ఉదాహరణలు. కాబట్టి దాని వినాశ కరమైన హింసాత్మక పాలన–మార్పు సూత్రాన్ని వదిలి వేసి, బ్యాలెట్ బాక్స్ ద్వారా పాలన మార్పును తేవడానికి అమెరికా యత్నిస్తోంది. దీంతో బంగ్లాదేశ్కు సంబంధించినంత వరకూ భారత్తో అమె రికా విభేదిస్తోంది. భారత్ ప్రణాళికలు విజయవంతమైతే, బంగ్లా దేశ్లో మళ్లీ అంత స్నేహపూర్వకంగా లేని పరిస్థితిని అమెరికా ఎదు ర్కొంటుంది. బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటినుంచి ఇది ఉనికిలో ఉన్నదే. విదేశీ ఒత్తిడికి తలొగ్గబోననీ, వాషింగ్టన్ పరోక్ష దూకుడుకు లొంగిపోననీ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తామనే వాక్చాతుర్యం కంటే నిశ్శబ్ద దౌత్యం, శిక్షకు సంబంధించిన ముప్పు హసీనాపై మెరుగ్గా పని చేస్తాయి. కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ బంగ్లా ప్రధాని మౌలికంగా అమెరికాకు వ్యతిరేకం కాకపోవచ్చు. వాస్తవానికి, ఆమె 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముస్లిం ప్రపంచానికి ఢాకా నుండి ప్రసంగాన్ని అందించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రహస్యంగా ఆహ్వానించ డానికి ప్రయత్నించారు. వ్యక్తిగత స్థాయిలో ఈ ఆసియా ఉక్కు మహిళ అమెరికాతో కుటుంబ సంబంధాలను కలిగి ఉన్నారు. ఆమె తన కోడలు అయిన అమెరికన్ మహిళను అరాధిస్తారు. ప్రతిపక్ష సభ్యుడు ఆమె మతాన్ని గురించి ప్రశ్నించినప్పుడు హసీనా పార్లమెంటులో తన కోడలిని బహిరంగంగా సమర్థించారు. బెంగాలీ సంస్కృతిలో, వ్యక్తి గత సంబంధాలు అధికారిక మర్యాదలను అధిగమిస్తాయి. బి.జెడ్. ఖస్రూ వ్యాసకర్త, పాత్రికేయుడు, యుద్ధ వ్యవహారాల నిపుణుడు (‘ద స్టేట్స్మన్’ సౌజన్యంతో) -
గండం గట్టెక్కిన అమెరికా
ఎట్టకేలకు ఒక పెను సంక్షోభం సమసిపోయింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని మింగేసే మూడో ముప్పుగా ఆర్థిక నిపుణులు అభివర్ణించిన అమెరికా గరిష్ఠ రుణపరిమితి (డెబిట్ సీలింగ్) సంక్షోభంపై పాలక డెమాక్రాటిక్ పార్టీ, విపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య చివరి నిమిషంలో కుదిరిన అవగాహన పర్యవసానంగా కథ సుఖాంతమైంది. నిజానికి కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఊహించని రీతిలో వచ్చిపడ్డాయి. కానీ అమెరికా సంక్షోభం అలా కాదు. అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబు మాదిరి కొన్ని నెలలుగా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా, అగ్రరాజ్యంగా ఉన్న అమె రికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవటమే ఈ సమస్యకు మూలం. తొలిసారి 1917లో గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు అమెరికన్ కాంగ్రెస్ అనుమతించగా, ఆ తర్వాత 1939లో, 1941లో రుణ సేకరణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సివచ్చింది. ఇక అది రివాజుగా మారింది. ఆ తర్వాత 2011 వరకూ 78సార్లు గరిష్ఠ రుణ పరిమితికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయాల్సివచ్చింది. అమెరికా ప్రస్తుత గరిష్ఠ రుణ పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు కాగా, దాన్ని మరింత పెంచేందుకు ప్రతినిధుల సభ, సెనేట్ తాజాగా అంగీకరించాయి. రుణ పరిమితిని పెంచే బదులు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలంటూ మొన్న ఏప్రిల్లో రిపబ్లికన్ పార్టీ పట్టు బట్టడంతో జో బైడెన్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో బైడెన్ సర్కార్ ప్రతిపాదించిన బడ్జెట్కు 4.8 లక్షల కోట్ల మేర కోత పెట్టే తీర్మానం ఏప్రిల్ నెలాఖరున ఆమోదం పొందింది. ఆ కోత తీర్మానం ద్వారా హరిత ఇంధన రంగ పెట్టుబడులకు ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న పన్ను మినహాయింపులకూ, విద్యార్థుల రుణాల మాఫీకీ రిపబ్లికన్లు మోకాలడ్డారు. ఈ చర్య అమెరికా పౌరులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తుపాకి గురిపెట్టడంతో సమానమని అమెరికా ఖజానా మంత్రి జానెట్ యెలెన్ మండిపడ్డారు. ఆ మాటెలావున్నా ప్రతి నిధుల సభ, సెనేట్ల ఆమోదం లభించకపోతే ఆపద్ధర్మంగా బైడెన్ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తనకు లభించే విశేషాధికారాలతో ప్రత్యేక చర్య తీసుకునే వీలుంటుంది. కానీ అది సంక్షోభాన్ని తాత్కాలికంగా ఒకటి రెండు నెలలు వాయిదా వేయగలదే తప్ప నివారించలేదు. ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితిని పోగొట్టలేదు. అందుకే సమస్యకు పరిష్కారం సాధ్యమా కాదా అన్న సంశ యంలో ప్రపంచం పడిపోయింది. ఇరు పార్టీల మధ్యా ఒప్పందం కుదరకపోతే అమెరికా తన రుణాలను చెల్లించలేని స్థితిలో పడేది. టీచర్లు, పబ్లిక్ రంగ సంస్థల కార్మికులతో సహా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిపేయాల్సివచ్చేది. పింఛన్లు, అనేకానేక సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ఆపాల్సివచ్చేది. కేవలం తాను చెల్లించక తప్పని రుణాలకూ, వడ్డీ చెల్లింపులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సివచ్చేది. దాని సెక్యూరిటీలు పల్టీలు కొట్టేవి. సారాంశంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేది. ఒక అంచనా ప్రకారం స్వల్పకాల దివాలా అయినా కనీసం 5 లక్షల మంది ఉద్యోగులకు అది ముప్పుగా పరిణమించేది. మరింత కాలం కొనసాగితే అనేకానేక వ్యాపారాలూ మూతబడి 83 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యేవి. అంతేకాదు, అది కార్చిచ్చులా వ్యాపించి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేది. ఇరుపక్షాలూ పరిణతి ప్రదర్శించటం వల్ల ప్రస్తుతానికైతే అంతా సర్దుకుంది. కానీ మున్ముందు ఇదంతా పునరావృతం కాకమానదని గత చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుల్లో ఉంది. కరోనా మహమ్మారి లక్షలాదిమంది ప్రాణా లను బలితీసుకోవటంతోపాటు మహా మహా ఆర్థిక వ్యవస్థలనే తలకిందులు చేసింది. దాన్నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు సాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ పొరుగునున్న చిన్న దేశం ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగారు. కొన్ని నెలల్లో సమసిపోతుందనుకున్న ఆ దురాక్రమణ యుద్ధం ఏణ్ణర్థం నుంచి ఎడతెగకుండా సాగుతోంది. ఇదే అదునుగా రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికా యూరోప్ దేశాలన్నిటినీ ఏకం చేసి ఉక్రెయిన్కు సైనికంగా, ఆర్థికంగా అండదండలందిస్తోంది. అదే సమయంలో రష్యాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. తమ సమస్త అవసరాలకూ రష్యాపై ఆధారపడక తప్పని యూరోప్ దేశాలు ఈ ఆంక్షల పర్యవసానంగా ఒడిదుడుకుల్లో పడ్డాయి. జర్మనీ ఆర్థిక మాంద్యంలో పడింది. ఈలోగా గోరుచుట్టుపై రోకటి పోటులా ఈ రుణ గరిష్ఠ పరిమితి సంక్షోభం వచ్చిపడింది. తన శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తున్నవారికి రిపబ్లికన్లతో ఒప్పందం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి షాక్ ఇచ్చారు. రిపబ్లికన్లకు చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్తీ తన పార్టీలోని అత్యుత్సాహులను కట్టడి చేయగలిగారు. అయితే అమెరికా డాలర్తో, అక్కడి ఫైనాన్షియల్ మార్కెట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ముడిపడివున్న సంగతిని ఆ దేశం మరువ కూడదు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు విశ్వసనీయత లేకపోవటంవల్ల తప్ప ఇందులో తన ప్రయోజకత్వం ఏమీ లేదని అది గుర్తించాలి. తాజా ఒప్పందం పర్యవసానంగా 2025 జనవరి వరకూ గండం గట్టెక్కినట్టే. ఆ తర్వాతైనా సమస్యలు తప్పవు. ఇప్పటికైనా అమెరికా సొంతింటిని చక్కదిద్దుకునే చర్యలు మొదలెట్టాలి. హద్దూ ఆపూలేని వ్యయానికీ, పన్నులకూ కళ్లెం వేసి హేతుబద్ధ విధానాలను రూపొందించుకోవాలి. -
‘మేడిన్ ఇండియా’ బంగా!
భారత్ మూలాలున్నవారు ప్రపంచ యవనికపై తళుక్కున మెరవటం ‘అలవాటైపోయిన’ వర్తమానంలో కూడా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద చదువులు చదివిన అజయ్ బంగాను అమెరికా ప్రతిపాదించిందంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతీయ మూలాలున్నవారే. కుదిరితే రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న వివేక్ రామస్వామి సైతం ఇక్కడివారే. ఇక కోకా కోలా మొదలు అనేకానేక బహుళజాతి సంస్థలకు చాన్నాళ్లనుంచి భారతీయ సంతతికి చెందినవారు సారథ్యం వహించారు, వహిస్తున్నారు. మునుపటంత కాకపోయినా ఇప్పటికీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులనూ, వాటి తలరాతలనూ నిర్దేశించటంలో ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వర్ధమాన దేశానికి చెందిన ఒక వ్యక్తి అలాంటి సంస్థలకు నేతృత్వం వహించటమంటే సాధారణం కాదు. ఆ రెండు సంస్థలూ ఆవిర్భవించిన నాటినుంచీ వాటిపై వస్తున్న ప్రధాన విమర్శ– ఎప్పుడూ సంపన్న దేశాల నుంచీ, ప్రధానంగా అమెరికా నుంచీ మాత్రమే వాటి సారథులను ఎన్నుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం తీవ్రంగా దెబ్బతిన్న అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం కోసం బ్రెటెన్వుడ్స్ సదస్సు జరగ్గా, అందులో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్లు ఉనికిలోకొచ్చాయి. ప్రపంచ బ్యాంకుకు ఆది నుంచీ అమెరికా పౌరులే అధ్యక్షులు. అలాగే ఐఎంఎఫ్ ఉపాధ్యక్ష పదవి కూడా ఆ దేశానిదే. ఐఎంఎఫ్ అధ్యక్ష పదవి మాత్రం యూరోపియన్ దేశాలకు చెందినవారిది. నిజానికి ఇప్పుడు అమెరికా ఎంపిక చేసిన బంగా ఇక్కడివారే అయినా, ప్రస్తుతం పూర్తి స్థాయి అమెరికా పౌరుడు. సుపరిపాలన... సంప్రదింపులు... పాలుపంచుకోవటం అనేవి ప్రపంచబ్యాంకు మూల సూత్రాలు. కానీ ఆ మూడింటిని రుణం కోసం వచ్చే వర్ధమాన దేశాధినేతలకు ప్రవచించటం తప్ప సంస్థ పాటించదన్న విమర్శ చాన్నాళ్లుగా ఉంది. అందులో 189 సభ్యదేశాలుంటాయి. సంపన్న దేశాలైన అమెరికా, యూరోప్ దేశాల పెట్టుబడులు అధికం గనుక, బ్యాంకులోని ప్రధాన భాగస్వామ్య ఆర్థిక సంస్థలన్నీ ఆ దేశాలకు సంబంధించినవే గనుక బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఆ దేశాలకే సొంతం. అయితే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న డిమాండ్ మొదటినుంచీ ఉంది. గతంలో అమెరికా నిర్ణయించినవారిలో కొందరికి ఆర్థికరంగ నేపథ్యమే లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ ఎజెండాలోకొచ్చిన వర్తమానంలో ప్రపంచ బ్యాంకు దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలనీ, రుణాలిచ్చే క్రమంలో అదొక షరతుగా ఉండాలనీ కొన్నేళ్లుగా ఉద్యమ కారులు కోరుతున్నారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉండగానే రాబోయే జూన్లో పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న డేవిడ్ మల్పాస్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినీ. పర్యావరణంతో సహా ప్రపంచాన్ని వేధిస్తున్న కీలక అంశాల విషయంలో ట్రంప్ అభిప్రాయాలే ఆయనవి కూడా. నిరుడు సెప్టెంబర్లో ఒక సదస్సు సందర్భంగా శిలాజ ఇంధనాలవల్ల భూగోళానికి జరిగే ప్రమాదంపై ప్రశ్నించినప్పుడు ‘నేను శాస్త్రవేత్తను కాదు’ అని జవాబిచ్చి అందరి ఆగ్రహానికీ గురయ్యారు. నిజానికి అంతక్రితమే ప్రపంచ బ్యాంకుపై ఆర్థికరంగ నిపుణులకు ఆశలు పోయాయి. పేరులో తప్ప నిజంగా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే, దాన్ని నడిపించే లక్షణాలు బ్యాంకుకు సన్నగిల్లాయని వారి అభిప్రాయం. దాని నిబంధనలు, అదిచ్చే రుణాలకుండే షరతులు కఠినమైనవి. రుణ మంజూరులో అలవిమాలిన జాప్యం. ఇప్పుడు ధైర్యంగా సత్వర నిర్ణయాలు తీసుకునే కెనడాకు చెందిన సీడీపీక్యూ, ఎన్డీబీ(గతంలో బ్రిక్స్ బ్యాంక్), ఎన్ఐఐఎఫ్, అమెరికాకు చెందిన ఐడీఎఫ్సీ వంటివి రంగంలోకొచ్చాయి. అయితే ఫలానా ప్రాజెక్టుకు లేదా సంస్థకూ ప్రపంచ బ్యాంకు అప్పిచ్చిందంటే అది భారీ ప్రాజెక్టు, అన్నివిధాలా మేలైందని అభిప్రాయపడేవారు చాలామందే ఉంటారు. అయితే బంగాయే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన నూరుశాతం ‘మేడిన్ ఇండియా’వాడు. ప్రపంచ మార్కెట్లను శాసించే అమెరికాకు చెందిన ‘వాల్ స్ట్రీట్’నుంచి నేరుగా వస్తున్నవాడు. ఈసారి మహిళను ప్రోత్సహించదల్చుకున్నామని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ప్రకటించిన కొన్ని గంటలకే బంగా ఎంపికను ప్రకటించటం అందరినీ ఒకింత ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు కారణం ఉంది. బ్యాంకు పేదరిక నిర్మూలన లక్ష్యం నుంచి పర్యావరణ పరిరక్షణ వైపు పోవటం బ్యాంకులోని వర్ధమాన దేశాలకు నచ్చటం లేదు. ఇందువల్ల తమ అభివృద్ధి ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడతాయన్నది వాటి అభిప్రాయం. భారత్కు చెందిన బంగా ఈ విషయంలో అందరినీ ఒప్పిస్తారనీ, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణలో విజయం సాధిస్తారనీ అమెరికా విశ్వ సిస్తోంది. భారత్ మార్కెట్ ఆవిర్భవించి విస్తరిస్తున్న తొలి దశలో దాన్ని చాలా దగ్గరగా చూసిన అనుభవం బంగాకు ఉన్నదని ఆ దేశం భావన. దాదాపు దశాబ్దకాలం నుంచి మాస్టర్కార్డ్ సారథిగా ఆ సంస్థ విస్తరణలో, దాని రెవెన్యూ పెంపులో బంగా పాత్ర ప్రధానమైనది. అదీగాక 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సు సందర్భంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలనుద్దేశించి బహిరంగ లేఖ రాసిన డజను మంది సీఈఓల్లో ఆయనొకరు. ఇక పర్యావరణ పరిరక్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించదల్చుకున్న ప్రపంచ బ్యాంకుకు బంగాను మించిన అర్హుడు మరొకరుండరని అమెరికా భావించటంలో ఆశ్చర్యమేముంది? -
న్యాయం’పై నెతన్యాహూ కక్ష
అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొచ్చారు. పార్లమెంటు వెలుపల అయి దారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి. నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏదేమైనా చట్టం చేసితీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు... న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వా నిది పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడివుండాలన్నదే ఆయన మాటల్లోని సారాంశం. తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడొచ్చు. కనీస మెజారిటీతో...అంటే పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టునుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమి షన్ పనిచేస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి. మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలన్న డిమాండ్ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్ట్బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్ పౌరుల ఆవాసాలున్నాయి. వీటిని మరింత పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించలేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వ సంకల్పం ఏమిటో అర్ధమవుతోంది. ఇప్ప టికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణఇజ్రాయెల్కు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యంవహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమం. ఇందువల్ల పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం. ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదోవంతుమంది అరబ్బులు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్బ్యాంక్లో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణ యాలు చేయాల్సిన నేపథ్యంలో మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది. స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు. -
Covid Alert: మళ్ళీ ప్రమాదఘంటికలు
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటి దాకా కఠిన నిబంధనలు, లాక్డౌన్లు, సామూహిక పరీక్షలతో జీరో–కోవిడ్ విధానాన్ని అనుసరించిన చైనా గత నెలలో జనా గ్రహంతో హఠాత్తుగా ఆంక్షలు సడలించేసరికి పరిస్థితి అతలాకుతలమైంది. కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరిగి, ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఫార్మసీల్లో మందులు ఖాళీ. శవాల గుట్టలతో శ్మశా నాల్లో తీరిక లేని పని. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్లోనూ కేసులు ఉన్నట్టుండి పెరుగుతుండ డంతో, భారత్ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ జరిపి, కొత్త వేరియంట్లపై కన్నేయాలని భారత సర్కార్ ఆదేశించడం సరైన చర్య. ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్షాసమావేశంతో అప్రమత్తత బావుంది. కాకపోతే, 80 కోట్ల చైనీయులకు కొత్తగా కరోనా సోకే ముప్పు, లక్షలాది మరణాల అంచనా, భారత్లో కరోనా చాటు రాజకీయాలే ఆందోళనకరం. కరోనా విషయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితం కానంత వరకు, ఏ ఒక్కరూ సురక్షితం కానట్టే. ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా, ఇట్టే వ్యాపించే ఈ మహమ్మారితో ప్రతి ఒక్కరికీ ముప్పే. ఇది రెండేళ్ళుగా వైద్యనిపుణులు ఘోషిస్తున్న మాట. కానీ, చైనా మూర్ఖత్వం ఇవాళ మిగతా ప్రపంచానికి శాపమైంది. కరోనా నియంత్రణలో పాశ్చాత్య ప్రపంచం కన్నా తామే గొప్ప అని చైనా చెప్పుకుంటూ వచ్చింది. పొరుగున భారత్ సహా ప్రజాస్వామ్య ప్రపంచమంతా అనుసరిస్తున్న పద్ధతులకు భిన్నంగా లోపభూయిష్ఠ ‘జీరో–కోవిడ్’ విధానాన్ని చైనీయులపై బలవంతాన రుద్దింది. తొలినాళ్ళలో అది ఫలితమిచ్చినా, టీకాలతో, లాక్డౌన్లు ఎత్తేసి జీవనం సాగించడమే ప్రత్యామ్నా యమని ప్రజలకు వివరించడం నిరంకుశ సర్కారుకు కష్టమైపోయింది. తీరా ప్రత్యామ్నాయ వ్యూహం కానీ, క్రమంగా సాధారణ పరిస్థితి తేవడం కానీ చేయక ఒక్కసారిగా ఆంక్షల గేట్లు ఎత్తేయడం ఘోర తప్పిదమైంది. ఒక్క నెలలో 10 లక్షల పైగా కేసులు బయటపడ్డాయి. మూడేళ్ళ క్రితం ప్రపంచానికి కరోనాను అంటించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న చైనా నేటికీ ఆ మహమ్మారి నుంచి బయటకు రాలేకపోవడం విధి వైచిత్రి. ఈ దుఃస్థితికి స్వయంకృతాపరాధాలే కారణం. అతి జాతీయవాదంతో దేశీయంగా తయారైన టీకాలనే చైనా వాడడం, తీరా అవి సమర్థంగా పనిచేయకపోవడం, ఇప్పటికీ చైనా జనాభాలో అధిక శాతం మందికి టీకాకరణ జరగకపోవడం, వాస్తవాలను బయట పెట్టకపోవడం – ఇలా చైనా చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. మూడేళ్ళలో మూడు ప్రధాన కరోనా వేవ్లు చూసిన పొరుగు దేశం భారత్ ఈ విషయంలో మెరుగ్గా వ్యవహరించింది. శాస్త్రీయ శోధనకు ప్రభుత్వ సహకారం, దేశీయ టీకాల పనితనం, దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో టీకాకరణ, పలు విమర్శ లున్నా కోవాగ్జిన్ను ప్రోత్సహించడం కలిసొచ్చాయి. అయితే, మన దగ్గర కరోనా రాజకీయాలకూ కొదవ లేదు. తాజా కరోనా భయాన్ని సైతం అధికారపక్షమైన బీజేపీ రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ 100 రోజుల పైగా చేస్తున్న ‘భారత్ జోడో యాత్ర’కు బాణం గురి పెట్టింది. విమానయానాలు సహా దేశమంతటా కరోనా నిబంధనలపై మాట్లాడని కేంద్ర వైద్య మంత్రి తీరా త్వరలో దేశ రాజధానికి చేరనున్న ప్రతిపక్ష నేత పాదయాత్రకు కోవిడ్ ప్రోటోకాల్ సాకుతో లేఖ రాయడం చిత్రమే. ‘టీకాలు వేసుకున్నవారే రాహుల్తో యాత్ర చేయాలి, యాత్ర చేసినవారు ఐసొలేషన్లో ఉండా’లంటున్న పెద్దలు రాజస్థాన్, కర్ణాటకల్లో బీజేపీ యాత్రలను మాత్రం విస్మరించడమేమిటి? కేంద్రం కరోనా మార్గదర్శకాలివ్వాల్సింది యావత్ భారత్కే తప్ప ఒక్క భారత్ జోడో యాత్రకు కాదు. చైనాలో విస్తృతంగా వ్యాపిస్తూ, సంక్షోభం సృష్టిస్తున్న బీఎఫ్.7 కరోనా వేరియంట్ ఇప్పటికే గుజరాత్లో బయటపడింది. అలాగే, టీకా వేసుకున్నా ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ సోకడం ఆగట్లేదట. ఈ మాటలు ఆందోళనకరమే. అయితే, 2021 మధ్యలో మన దేశంలో సంక్షోభం రేపిన డెల్టా వేరియంట్తో పోలిస్తే, ఈ ఏడాది మొదటి నుంచి మన దగ్గరున్న ఒమిక్రాన్ ఆ స్థాయి కల్లోలం రేపలేదు. ఆ మాటకొస్తే ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్.7 భారత్లో సెప్టెంబర్ నుంచే ఉందని కథనం. మనకు సహజ వ్యాధినిరోధకతా వచ్చింది. దేశంలో పెరిగిన కరోనా వైద్య వసతుల రీత్యా మనం మరీ బెంబేలెత్తాల్సిన పని లేదు. కానీ మాస్క్ధారణ, గుంపులకు దూరంగా ఉండడం, భౌతిక దూరం, చేతులకు శానిటైజర్ లాంటి ప్రాథమిక జాగ్రత్తలను మళ్ళీ ఆశ్రయించక తప్పదు. చైనా దెబ్బతో కొత్త వేరియంట్లు తలెత్తే ముప్పుంది. గతంలో చైనాలో కరోనా మొదలైనప్పుడు అలక్ష్యం చేసి, మనతో సహా ప్రపంచం పీకల మీదకు తెచ్చుకుంది. ప్రస్తుతానికి మన పరిస్థితి బాగున్నా రానున్న సెలవులు, పెరగనున్న పర్యటనలతో అప్రమత్తత కీలకం. కరోనా పరీక్షలు పెంచి, కొత్త వేరియంట్లపై కన్నేసి ఉంచాలి. కరోనా టెస్టింగ్, కేసుల ట్రేసింగ్, ట్రీటింగే ఇప్పటికీ మహా మంత్రం. దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరే బూస్టర్ డోస్ వేయించుకున్నందున ప్రభుత్వం ప్రజల్ని చైతన్యపరిచి, ప్రోత్సహించడం అవసరం. ఏమైనా, ఒక విషయం తప్పక గుర్తుంచు కోవాలి... కరోనా కథ ఇంకా కంచికి చేరలేదు. మన జాగ్రత్తే మనకు రక్ష. ప్రమాదఘంటికలు మోగుతున్న వేళ అవసరానికి మించి సంసిద్ధంగా ఉన్నా తప్పు లేదు కానీ... అత్యవసరమైనదాని కన్నా తక్కువ సిద్ధపడితేనే తిప్పలు – అది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా! -
గ్రహణాలు వీడాలి!
దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది. దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు. ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు. సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు. హైదరాబాద్ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు. ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం. ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. -
స్వాతికిరణం సిండ్రోమ్
మజ్రూ సుల్తాన్పురి అప్పుడప్పుడే కవిత్వం రాసి పేరు సంపాదిస్తున్నాడు. సుల్తాన్పూర్లో ఇది కొందరికి కడుపులో గులామ్ బులామ్ రేపింది. ఆ ఊళ్లోనే ఉండే మసియుద్దీన్ మసీ అనే కవిని రెచ్చగొడితే అతను మజ్రూ వెంటబడ్డాడు. మజ్రూ ఏం రాసినా వెక్కిరిస్తూ రాసేవాడు. మజ్రూ బాగా క్షోభ పడ్డాడు. ఇబ్బంది పడ్డాడు. కొన్నాళ్లకు భవిష్యత్తును వెతుక్కుంటూ సుల్తాన్పూర్ నుంచి బాంబే వెళ్లాడు. సినీ గేయరచయిత అయ్యాడు. సూపర్ హిట్ పాటలు రాశాడు. సర్వోన్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు. ఇవాళ్టికీ మనం రోజూ మజ్రూని వింటూనే ఉన్నాం. మరి మసియుద్దీన్ మసి సంగతి? మంట వెలిగినట్టు మసి వెలుగునా? మనం కూడా తక్కువ తిన్లేదు. మహా పండితుడు చిన్నయసూరి ఎంతో శ్రమించి, మేధను కరిగించి ‘బాల వ్యాకరణం’ రాస్తే, ఫస్ట్ ఎడిషన్ వచ్చి రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుంటే శిష్టు కృష్ణమూర్తి అనే కవి దానిని ‘కాపీ’ అని గగ్గోలు లేవదీశాడు. (అబ్రాహ్మణుడైన) చిన్నయ సూరికి అంత సామర్థ్యం ఎక్కడ చచ్చింది అన్నాడు. ఆ కాలంలోని ఒకరిద్దరు గట్టి పండితులు ఈ విమర్శకు వత్తాసు పలికితే చిన్నయసూరి మౌనంగా ఉండిపోయాడు. సత్యాన్ని ఎంత అణుచుదామని చూసినా అది పొట్ట మీదే నేలక్కరుచుకుంటుంది తప్పితే వీపు మీద కాదు. తెలుగు భాషాకాశంలో భాస్కరుడు చిన్నయసూరి. గగ్గోలుదారులు ఆ మార్తాండ తేజానికి నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోయారు. పి.శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల సంచలనం. ఒక పరిణీత తప్ప దానిని మరొకరు రాయలేరని చదువరులు గ్రహిస్తారు. ‘అబ్బే... ఆ నవలను గోరా శాస్త్రి రాశాడండీ’ అని ఆయన అకౌంట్లో వేయడానికి చూసే పెద్దమనుషులు ఉన్నారు. గోరా శాస్త్రి తెచ్చిన ‘తెలుగు స్వతంత్ర’లోనే ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆలూరి బైరాగి ‘నూతిలో గొంతుకలు’ వచ్చాయి. అయితే వాటిని గోరా శాస్త్రి రాయలేదట. ‘తెలుగు స్వతంత్ర’లోనే వచ్చిన పి.శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ మాత్రం గోరా శాస్త్రి రాశాడట. ఇంతా చేసి గోరా శాస్త్రి శబ్ద నాటికలు తప్ప ఒక్క గొప్ప నవలను అటెంప్ట్ చేయలేదు. ఆయనకు నవల రాసే ఆసక్తి ఉంటే రాసే చేయి ఊరకే ఉండేది కాదు. కళాకారుల లోకంలో కీర్తి అనే వెలుతురుతో పాటు కల్మషం అనే నీడ కూడా ఉంటుంది. సృజన లోకంలో రాణించాలనుకున్నవారు, రాణించేవారు, వెలిగినవారు, వెలగలేక ఆరిపోయిన, స్టేక్హోల్డర్స్ అయిన పాఠకులతో సహా ఈ వెలుగు నీడల ప్రభావానికి ఏదో ఒక సందర్భంలో గురి కాకుండా పోలేదు. శ్రీశ్రీని తగ్గించి శ్రీరంగం నారాయణబాబును నిలబెట్టాలని ఒక వర్గం ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీయే మిగిలాడు. చలంను తెలుగు సరిహద్దుల నుంచి తరిమి కొట్టగలిగారుగానీ తెలుగు హృదయాల నుంచి కాదు. చిన్నబుచ్చేకొద్దీ జాషువా పద్యం ఎదిగి పండింది. అయినా సరే మనం గత పాఠాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. ‘సాగర సంగమం’లో తన కళా వికాసానికి వీలు దొరకని కమలహాసన్ తన ఫెయిల్యూర్కి కుంగిపోతాడు. ఎవరినీ నిందించడు. కానీ ‘స్వాతికిరణం’లో మమ్ముట్టి అలా కాదు. ఆస్తిపాస్తి, పేరు, కీర్తి అన్నీ ఉన్నా తన సమ కళాకారులనే కాదు ఎక్కువ–తక్కువ ప్రతిభ ఉన్నవారిని చూసి కూడా ఓర్వలేకపోతాడు. అతడి ఈర్ష్య ఎంత తీవ్రమైనదంటే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక బాలకళాకారుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఎదుటివారి ప్రాణాలు తీసేంత, పిచ్చివాళ్లను చేసేంత, జడిసి సాధన విరమింపజేసుకునేంత, వగచి ఒంటరితనంలోకి వెళ్లేంత ఈర్షా్య ద్వేషాన్ని కలిగి ఉండటం నుంచి కళాలోకం– ఆ అసూయాపరుల సంఖ్య ఎంత తక్కువైనా కానీ– ఎదగలేక పోతున్నది. సోషల్ మీడియా వచ్చాక ఈ వెర్రి శ్రుతి మించిపోతోంది. నాలుగు వ్యూస్ కోసం ‘తేనెమనసులు రామ్మోహన్ని సూపర్స్టార్ కృష్ణ ఎలా తొక్కేశాడో తెలుసా?’ అనే థంబ్నెయిల్ పెడితే ‘అవునవును... మాకు తెలుసు’ అని డయపర్ల వయసు దాటని వారు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఇద్దరూ ఒకే సినిమాతో బయలుదేరినా కృష్ణ పద్మాలయ చేరడానికీ, రామ్మోహన్ మాసిన గడ్డంతో రాక్ క్యాజిల్లో తారసపడటానికీ కారణం ఎవరికి వారే! మనమే మన గమ్యం. మన ఫలితం. విషాదం ఏమంటే ఈ ‘స్వాతికిరణం సిండ్రోమ్’ ఇప్పుడు అన్ని సామాజిక దొంతరల్లోనూ నిండి కనపడటం! గతంలో ‘నువ్వు బాగుపడితే చూడాలని ఉంది’ అని వీధిలో వాళ్లు కూడా అనేవారు. ఇప్పుడు ‘నువ్వెలా బాగుపడతావో చూస్తాను’ అని ఆత్మీయులే అనుకుంటున్నారు. ఏదో లాటరీ తగిలి రాత్రికి రాత్రి బాగుపడితే ఈర్ష్య పడటం సరే. కానీ కష్టపడి పిల్లాడు ర్యాంకు తెచ్చుకున్నా, అమ్మాయికి మంచి సంబంధం కుదిరినా, లోన్ పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నా, అప్పోసప్పో చేసి కారు ఇంటికి తెచ్చుకున్నా, మొగుడూ పెళ్లాలు కొట్లాడుకోకుండా ఉన్నా, పిల్లలు బుద్ధిగా మాట వింటూ ఉన్నా, ఆఖరికి మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నా కుతకుతలాడిపోయేవారు, లోలోపల కీడు కోరుకునేవారు, బంధాలను అనుబంధాలను తెంపుకుపోయేవారు, చెడు ప్రచారానికి పూనుకునేవారు, చేతలతో కాకపోయినా మాటలతో హాని చేద్దాం అనుకునేవారు ఉంటే ఇది ఏమి సంస్కారం? ఇది ఏమి సమాజం? ఈర్ష్యతో ఒకరి చెడుకు చేసే ‘అసత్య వాదన మహాపాపం’ అన్నది వేదం. ‘గీబత్’ (చాడీలు), ‘తొహమత్’ (లేనివి కల్పించడం) చేసేవారికి నిష్కృతి లేదు అంది ఇస్లాం. ‘ఈర్ష్య పడువాని ఎముకలు కుళ్లును’ అన్నది బైబిల్. ప్రేమించేంత ఐశ్వర్యం లేనప్పుడు హాని చేయలేనంత పేదరికంలో ఉందాం! లోకం అదే బతుకుతుంది. -
దీపస్తంభాల వెలుగులో...
చీకటి తెరలు కరిగిపోయే వేళ, వెలుగు రేకలు ప్రసారమయ్యే క్రమంలో దృగ్గోచరాలపై ఒక స్పష్టత వస్తుంది. లోకం మీద, దాని నడవడి మీద అవగాహన కుదురుకుంటుంది. భారత రిపబ్లిక్ ‘అనే నేను’ పేరుతో ప్రజాపాలన ప్రారంభమై డెబ్బయ్ రెండేళ్లు గడిచింది. ఈ కాలంలో అధికారం చెలాయించిన నాయకుల చిత్తశుద్ధిలో తరతమ భేదాలున్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ప్రభావం ఫలితంగా కొందరు పాలకులు నిండు మనసుతో, మరికొందరు అర్ధమనస్కంగా సామాజిక పరివర్తన క్రమానికి లంగరెత్తక తప్పలేదు. ఫలితంగా ‘నిమ్న’ జాతి పొరల్ని చీల్చుకుంటూ సామాజిక నిచ్చెనమెట్లను ఒక్కొక్కటే ఎక్కుకుంటూ కొందరు అధోజగత్ సహోదరులు ‘సోషల్ డెమోక్రసీ’ అనే అంతస్థుకు చేరుకోగలిగారు. చదువు అనే చేదోడు లభించిన కారణంగా వారికీ అధిరోహణ సాధ్యమైంది. ఇరుగుపొరుగు పరిసరాలు వారికిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిచ్చెన కింది మెట్టు మీద నిలబడి ఉన్నప్పుడు విన్న కాకమ్మ కథల డొల్లతనం ఇప్పుడు వెల్లడవుతున్నది. అద్భుతాలుగా వినిపించిన స్వాములోర్ల ప్రతిమల కంటే, సర్దార్ల విగ్రహాల కంటే సమున్నతమైన శిఖర సమానమైన మూర్తిని మనోనేత్రంతో వాళ్లు చూడగలుగుతున్నారు. ఆ మూర్తి చూపుడువేలు ప్రబోధం వారికిప్పుడు సరైన రీతిలో అర్థమవుతున్నది. ఇన్నాళ్లూ మన నాయకులూ, బోధకులూ చెబుతున్నట్టుగా అంబేడ్కర్ కేవలం దళిత నాయకుడు కాదు. జాతీయ నాయకుడు. నేటి దేశావసరాలకు గాంధీ, నెహ్రూల కంటే అంబేడ్కర్ ఎక్కువగా సరితూగగలడని నిరూపణవుతున్నది. ఆయనను కేవలం రాజ్యాంగ రచయితగానే మన పాఠ్య పుస్తకాలు మనకు పరిచయం చేశాయి. కానీ, ఈనాటి సామాజిక, రాజకీయ సమస్యలను కూడా ఏడెనిమిది దశాబ్దాలకు పూర్వమే దర్శించి భాష్యం చెప్పిన మహోపాధ్యాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన పుట్టిన తేదీ ఏప్రిల్ 14. రోజురోజుకూ ఈ తేదీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. భారతీయ సమాజం విద్యాప్రపూర్ణమవుతున్న కొలదీ, వివేకపూరితమవుతున్న కొలదీ ఈ తేదీ మరింత కాంతులీనబోతున్నది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏప్రిల్ 14వ తేదీతో ముడిపడిన మరో ఉత్తేజభరితమైన వృత్తాంతం కూడా ఉన్నది. ఉస్మానియా విద్యార్థి నాయకుడైన జార్జిరెడ్డిని పెత్తందారీ శక్తులు కుట్రపూరితంగా మట్టుపెట్టిన రోజది. అది జరిగి ఇప్పటికి యాభయ్యేళ్లయింది. జార్జిరెడ్డిని గురించి ఆనాటి పరిశీలకుల్లో రెండు రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. జార్జిరెడ్డి ఇంకొంతకాలం జీవించి ఉంటే, రాజకీయాల జోలికి – గొడవల జోలికీ వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దేశానికి ఐన్స్టీన్ వంటి ఒక గొప్ప శాస్త్రవేత్త లభించి ఉండేవాడని కొందరు అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్లో జార్జి గోల్డ్మెడలిస్ట్. పరిశోధక విద్యార్థి. జార్జి పరీక్ష పేపర్లు దిద్దడానికి ఉస్మానియా ప్రొఫెసర్లు తటపటాయిస్తే, వాటిని బొంబాయి యూనివర్సిటీకి పంపించారట. జార్జి సమాధానాలు చదివిన అక్కడి ప్రొఫెసర్ ఒక్కసారి ఈ యువ మేధావిని వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న కోరికతో హైదరాబాద్కు వచ్చి వెళ్లారట. జార్జిరెడ్డి బతికి వుంటే ఇండియాకు ఇంకో చేగువేరా లభించి ఉండేవాడని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. గ్రామీణ పేద రైతు కుటుంబాల నుంచీ, బీసీ, ఎస్సీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ స్థాయికి అప్పుడప్పుడే చేరుకుంటున్న రోజులవి. పెత్తందారీ, సంపన్న వర్గాల పిల్లల్లో కొందరు గూండా తండాలను వెంటేసుకుని యూనివర్సిటీలో అరాచకం సృష్టిస్తున్న రోజులు. గ్రామీణ విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయడం, అవమానించడం, వారిపై దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ దశలో యూనివర్సిటీలో ప్రవేశించిన జార్జి గ్రామీణ విద్యార్థులను సంఘటితం చేసి, వారికి అండగా నిలబడ్డాడు. వారికి తిరగబడడం నేర్పించాడు. జార్జి స్వయంగా బాక్సర్. ధైర్యశాలి. అతని ధాటికి గూండా గ్యాంగ్లు హడలిపోయేవి. ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందం’ పేరుతో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జార్జి విజయబావుటా ఎగరేశాడు. ఈ దశలోనే జార్జిరెడ్డి హత్య జరిగింది. విద్యార్థిలోకంపై ఈ హత్య తీవ్రమైన ప్రభావం చూపింది. అనంతర కాలంలో జార్జిరెడ్డి స్ఫూర్తితో వందలాదిమంది విద్యార్థులు విప్లవకారులుగా తయారయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత కథ అందరికీ తెలిసిందే. అణచివేతను, అవమానాలను స్వయంగా అనుభవించి కృషితో, సాహసంతో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ధీశాలి. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించే వ్యక్తిగా ఆయన పేరును విస్మరించడానికి వీల్లేని దశకు ఆయన ఎదిగారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సామాజిక పరివర్తనకు దోహదపడే బాటలు వేశారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగున పడి దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతికి ఆయన రాజ్యాంగంలో చోటు కల్పించారు. భిన్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలతో కూడిన ఈ దేశాన్ని ఒక సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలదొక్కుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ భావన మాత్రమే కాదు. సామాజిక భావన కూడా! ఆర్థిక భావన కూడా! అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల వెనుకబడిపోయిన విశాల ప్రజానీకం మిగిలిన వారితో పోటీపడగలిగే స్థాయికి చేరుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా రాజ్యాంగ పీఠిక ఈ దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అద్దంపడతాయి. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వేచ్ఛ, అవకాశాల్లోఅందరికీ సమానత్వం, వ్యక్తిగత గౌరవాన్ని జాతి సమగ్రతను సంరక్షిస్తూ అందరి నడుమ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం రాజ్యాంగ లక్ష్యాలుగా పీఠికలో సంకల్పం చెప్పుకున్నారు. ఈ రాజ్యాంగ లక్ష్యాలను ఇప్పటికే సంపూర్ణంగా సాధించి ఉన్నట్లయితే సమాజంలో ఇంత విపరీతమైన వ్యత్యాసాలు ఉండేవి కావు. రాజ్యాంగం నిర్దేశించినట్లు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించి ఉన్నట్లయితే జార్జిరెడ్డి వంటి యువకులు విప్లవ మార్గం వైపు మొగ్గు చూపేవారు కాదు. అంతరాలు లేని రాజ్యాన్ని సృష్టించాలని ఆ మార్గంలో వెళ్లిన వేలాదిమంది యువకులు ఆత్మబలిదానాలు చేశారే తప్ప గమ్యం మాత్రం ఇంతవరకూ కనుచూపు మేరలోకి రానేలేదు. అదే లక్ష్యసాధన కోసం అంబేడ్కర్ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకోసం దారిచూపే పవిత్ర గ్రంథంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. పాలకుల సహాయ నిరాకరణ వలన రాజ్యాంగ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరకపోయినా కొంతమేరకైనా సత్ఫలితాలనిస్తున్నాయి. నెమ్మదిగానైనా సామాజిక పరివర్తన జరుగుతున్నది. నాణ్యమైన విద్యను దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలకు ఉచితంగా అందజేసి ఉన్నట్లయితే పరివర్తన మరింత వేగంగా జరిగేది. దోపిడీ – పీడనా లేని సమాజాన్ని కాంక్షించేవారెవరైనా సరే, మనిషి మనిషిగా ఆత్మగౌరవంతో బతకగలిగే వ్యవస్థను కోరుకునేవారు ఎవరైనా గానీ, పేదరికం లేని కరువు కాటకాలు లేని రోజులు రావాలని కోరుకునేవారందరూ కూడా, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య కావాలని నినదించేవారందరూ కూడా ఆ దిశలో పడుతున్న ప్రతి అడుగునూ స్వాగతించాలి. ప్రేమించాలి. అభినందించాలి. ఆ అడుగు విప్లవకారులదైనా, ప్రజాస్వామికవాదులదైనా సరే! కేంద్ర ప్రభుత్వాలదైనా, రాష్ట్ర ప్రభుత్వానిదైనా సరే! ఒక్కో ముందడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుందని మరిచిపోరాదు. అంబేడ్కర్ జయంతికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. 70 శాతం మంత్రిపదవులను బలహీనవర్గాలకు కేటాయించారు. ఇన్ని పదవులు ఈ సెక్షన్లకు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇది అభినందించదగిన సందర్భం కాదా? ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకు కేటాయించారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే చర్య కాదా? దేశవ్యాప్తంగా దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్న వారిలో దళితులు, మహిళలే అత్యధికంగా ఉన్నారంటూ దశాబ్దాలుగా జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. ఆ సవాల్కు జవాబుగా ఒక దళిత మహిళకే హోంశాఖను అప్పగించడాన్ని మనం స్వాగతించలేమా? ఇలా అప్పగించడం వరుసగా ఇది రెండవసారి కూడా! హోం, రెవెన్యూ, వైద్యం–ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్, పురపాలన, పరిశ్రమలు, రవాణా – ఇలా కీలకమైన శాఖలన్నింటినీ ఈ వర్గాలకే కేటాయించడాన్ని ఇదివరకెప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలోగానీ, వేరే రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ చవిచూసి ఉన్నామా? గతంలో యాదవ – కురుబ కులాలకు కలిపి జాయింట్గా ఒకటి, గౌడ – శెట్టిబలిజలకు కలిపి జాయింట్గా ఒకటి, పొలినాటి వెలమ – కొప్పుల వెలమలకు కలిపి ఒకటి చొప్పున కేటాయించే సంప్రదాయాన్ని వదిలిపెట్టి విడివిడిగా మంత్రి పదవులిచ్చారు. రాయలసీమలో జనాధిక్యం కలిగిన బోయలకూ, ఉత్తరాంధ్రలో అధికంగా వుండే తూర్పు కాపులకూ, సముద్ర తీరం వెంబడి నివసించే మత్స్యకారులకూ మంత్రి పదవులు దక్కాయి. ఎక్కువ మంత్రి పదవులను ఇవ్వడమే కాకుండా కీలక శాఖలను కట్టబెట్టడం సాధికారత సాధనలో ఒక గొప్ప ముందడుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు యాభై శాతం కుర్చీలను కట్టబెట్టింది. మొత్తం స్థానిక సంస్థల పదవుల్లో యాభై శాతాన్ని మహిళలకు రిజర్వు చేసింది. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం, నామినేటెడ్ పనుల్లో యాభై శాతం ఈ వర్గాలకు కేటాయింపును చట్టబద్ధం చేసింది. ఈ మొత్తంలో కూడా సగం మహిళలకు! ఈ చర్యలు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైనవే కదా! గమ్యాన్ని మరింత దగ్గర చేసేవే కదా! విద్య – వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విప్లవాత్మకమైనవిగా ఇప్పటికే నీతి ఆయోగ్, కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రశంసించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ వీటి గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. వ్యవసాయ రంగంలో చిన్న కమతాలు లాభదాయకం కాదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తల నుంచి సోషలిస్టు ఆర్థికవేత్తల వరకూ అందరూ అభిప్రాయ పడతారు. దీనికి పరిష్కారంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని కొందరు సూచిస్తున్నారు. సమష్టి వ్యవసాయాన్ని మరికొందరు సూచిస్తున్నారు. ఇవేవీ కూడా భారతీయ వ్యవసాయ సంస్కృతికి సరిపడేవి కావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్లు చిన్న కమతాలకు శ్రీరామరక్షగా నిలబడగలుగు తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని కూడా స్వాగతించలేమా? రాజ్యాంగం నిర్దేశించిన గమ్యాన్ని ముద్దాడే దిశగా పడే ప్రతి అడుగునూ స్వాగతించడం, అభినందించడమే అభ్యుదయమవుతుంది. వ్యతిరేకించడం అభివృద్ధి నిరోధకమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిజమే, ఓట్లు చీలవు!
కొన్ని రకాల జంతువులు, పక్షులు రాబోయే భూకంపాన్ని ముందుగానే పసిగట్టగలుగుతాయి. వాటికున్న అయస్కాంత శక్తి వల్ల అది సాధ్యమవుతుంది. పసిగట్టిన క్షణాల నుంచి వాటి ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయట! ఈ బెటాలియన్లో ప్రముఖంగా చెప్పుకోదగినవి జాగిలాలు, గబ్బిలాలు. అధికార సౌధపు గోడలకు గబ్బిలాల మాదిరిగా నిరంతరం వేలాడాలని కోరుకునే రాజకీయ పక్షులు కొన్ని ఉంటాయి. రాబోయే రాజకీయ ప్రకంపనల్ని ఈ పక్షులు పసిగట్ట గలుగుతాయి. మూడేళ్ల కిందట వచ్చిన ఒక పెను ప్రకంపన కారణంగా ఈ పక్షుల గూడు చెదిరింది. ఇంకో రెండేళ్లకు అటువంటి ప్రకంపనే మరోసారి తప్పదని వాటి మాగ్నెటిక్ తరంగాలు అలారం బెల్స్ మోగిస్తున్నాయి. పక్షుల్లో విపరీత ప్రవర్తన మొదలైంది. కంపనాన్ని నిరోధించగలిగే మార్గాలపై అన్వేషణ మొదలైంది. కార్యాచరణ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం మొన్నటి సూపర్ విక్టరీని మరోసారి నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షులు ఈ సంగతిని ఎప్పుడో పసిగట్టి ఉంటాయి. ఈ రాబోయే పరిణామాన్ని నిరోధించడానికి అవసరమని తాము భావించిన, అందు బాటులో ఉన్న అన్నిరకాల క్షుద్రపూజలను ప్రారంభించాయి. వారి పెంపుడు మీడియా నిర్నిద్ర గాత్రంతో భౌ కొడుతున్నది. మరోపక్క చడీచప్పుడు లేని రాజకీయ కౌటిల్యం చాప కింద ప్రవహిస్తున్నది. బేతాళ మాంత్రికోపాసన మొదలైంది. అధికార పార్టీని ఓడించడానికి సమస్త వ్యక్తులూ, శక్తులూ ఏకం కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ, పవన్ పార్టీ నుంచి కమ్యూనిస్టుల వరకూ అందరూ ఏకమై తనను గెలిపించే చారిత్రక కర్తవ్యాన్ని భుజాల మీద మోయాలని ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం తెర వెనుక తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గంటను మాత్రం తన హితుడైన పవన్ కల్యాణ్ మెడలో వేసి తెర ముందు నిలబెట్టారు. సాలార్జంగ్ మ్యూజియంలోని ప్రాచీన మ్యూజికల్ గడియారంలో గంటకోసారి ఓ మరుగుజ్జు బొమ్మ వచ్చి, గంటలు మోగించి వెళుతుంది. పవన్ కల్యాణ్ పీరియాడికల్గా వచ్చి గంట మోగించి ఓట్లు చీలనివ్వబోమని ప్రకటించి వెళుతున్నారు. ‘ఒక్కొక్క ఓటేసి చందమామా...’ అని పాడుకుంటూ ఓట్లు ఏరుకోవలసిన పరిస్థితి ప్రతిపక్ష శిబిరానికి ఏర్పడింది. ఈ దురవస్థ స్వయంకృతం. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మనుషుల్ని విభజించింది. బలహీనుల్ని ద్వేషించింది. మేడల్నీ, మిద్దెల్నీ ప్రేమించింది. వాడలనూ, గూడేలనూ చిన్న చూపు చూసింది. పంట పొలాలనూ, పారే జలాలనూ కూడా కుల కలుషితం చేశారు. వీచే గాలుల్లో, విచ్చుకునే పువ్వుల్లో విద్వేషపు విషగంధం కలిపారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టడ మేమిట’ని ఈసడించుకున్నారు. బీసీలను జడ్జీలుగా నియమించ రాదంటూ కేంద్రానికి ఉత్తరాలు రాశారు. నామినేటెడ్ పదవుల్లో బలహీన వర్గాలకు ఎక్కడైనా ఒకచోట కొంచెం కొసరు వాటా మాత్రం దక్కేది. పేద కుటుంబాల్లోని పిల్లల చదువును అటకెక్కించారు. పేదవాడికి రోగం రాకడ, ప్రాణం పోకడ అన్న చందంగా ప్రజారోగ్య వ్యవస్థను వ్యాపారమయం చేశారు. ఈ మూడేళ్లు ప్రభుత్వ పాలన అందుకు వ్యతిరేక దిశలో సాగింది. కుల మతాలకు అతీతంగా మనుషుల్ని ఐక్యం చేసే ప్రయత్నం జరిగింది. చారిత్రక దురన్యాయం కారణంగా వెనుక బడుతున్న వారికి చేయందించి నడిపించే ప్రయత్నం జరిగింది. డబ్బు లేని కారణంగా చదువుకోలేని నిస్సహాయతను తొలగించ డానికి నడుం కట్టారు. అభివృద్ధి క్రమంలో ఆఖరుమెట్టు పైనున్న వాడు కూడా సమాన స్థాయిలో నిలబడి పోటీ పడగలిగే రోజు కోసం విద్యావ్యవస్థను సమాయత్తం చేస్తున్నారు. అందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. నాణ్యమైన విద్య అందరికీ లభించేలా పాదు చేస్తున్నారు. పది పదిహేనేళ్లపాటు ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయగలిగితే నేటి బలహీన వర్గాల ప్రజలు ఏ ప్రత్యేక రక్షణలూ, ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి చేరుకోగలుగుతారు. మనుషుల మధ్య విభజన రేఖలు చెరిగిపోతాయి. ఇంత గొప్ప ఆలోచనతో విద్యా సంస్కరణలను వై.ఎస్. జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి పేదింటి తలుపును కూడా ‘వారి’ ఫ్యామిలీ డాక్టర్ నెలకోసారి తట్టే రోజులు చేరువలో ఉన్నాయి. అందుక వసరమైన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవం ఇనుమడించేలా దేశంలో ఎక్కడా లేని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రభుత్వ సాయంతో త్వరలో 30 లక్షల మంది మహిళలు గృహ యజమానులు కాబోతు న్నారు. పిల్లల చదువులకు సంబంధించిన నిర్ణయాధికారం ‘అమ్మ ఒడి’ రూపంలో ఆమెకు సంక్రమించింది. చిల్లర ఖర్చులకు కూడా భర్తలపైనో, పిల్లలపైనో ఆధారపడే నడి వయసు మహిళల చేతుల్లో ఇప్పుడు నాలుగు రాళ్లు కనబడుతున్నాయి. వారు మదుపు చేస్తున్నారు. రాబడి కోసం పోరాడుతున్నారు. ఆ కళ్లల్లో ఇప్పుడు సాధికారతా కాంతుల్ని చూడగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సరికొత్త తిరుమంత్రం – సాధికారత. ప్రజా సంక్షేమం అనే భావన ఒక దశను దాటి సాధికారతా సాధన దశలోకి ప్రవేశిస్తున్నది. మనిషి మనిషిగా తన కాళ్లపై తాను బలంగా నిలబడగలిగే స్థితిలోకి చేరు కోవడమే– ఎంపవర్మెంట్, సా«ధికారత సాధించడం! వర్గ పోరాటాలు, కులయుద్ధాల ప్రసక్తి లేకుండా సమసమాజ స్థితికి చేరుకునేందుకు ప్రజా స్వామ్యం పరిచిన బాట సాధికారత. వైఎస్ జగన్ ప్రభుత్వం వివిధ సామాజిక క్షేత్రాల్లో వెదజల్లిన సాధికారతా విత్తనాలు ఇప్పుడు మొలకెత్తు తున్నాయి. మరోపక్క ఏకకాలంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసల్నీ, స్థానిక ప్రజల అభిమానాల్నీ చూరగొన్నాయి. ఈ నేపథ్యమే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని ప్రతిపక్ష శిబిరాన్ని కలవ రపెడుతున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి యాభై శాతానికి పైగానే ఓట్లు రాగల క్షేత్రస్థాయి వాస్తవికత ప్రతిపక్షానికి అవగతమైంది. అందుకే తన పాత ద్విముఖ వ్యూహానికి మరింత పదును పెట్టే పనిలో అది నిమగ్నమైంది. వీలైనన్ని పార్టీలను తమ కూటమిలోకి లాగే ప్రయత్నాలను ఒకపక్క చేస్తూనే, మరోపక్కన శరపరంపరగా అధికారపక్షంపైకి నిందారోపణల్ని కురిపిస్తున్నారు. రెండు పత్రికలు, ఐదారు చానళ్లతో కూడిన ఎల్లో మీడియా, దానికి అనుబంధంగా ఒక అక్షౌహిణి సైన్యంతో ఏర్పాటైన ఎల్లో డిజిటల్, ఎల్లో సోషల్ మీడియా కార్ఖానాలు ఇప్పుడు మూడు షిఫ్టులూ పనిచేస్తు న్నాయి. టన్నులకొద్దీ అసత్యాలనూ, వార్తా వ్యర్థాలనూ సొసైటీలోకి వదులుతున్నాయి. ప్రతి వార్తకూ, ప్రతి సంఘట నకూ వక్రీకరణ భాష్యం నిత్యకృత్యమైంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ఆవరించి ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే ఎల్లో మీడియా వేలెత్తి చూపిస్తున్నది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి మొదటి వారం నుంచే ఎండలు భగ్గుమన్నాయి. గృహ వినియోగం, వాణిజ్య వినియోగం అంచనాలకు మించి పెరిగింది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా చేసిన ఫలితంగా వినియోగం భారీగా పెరిగింది. బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించింది. ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా చాలా దేశాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. ఫలితంగా బొగ్గు ఆధారిత ధర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు దొరకడమే గగనం. దొరికినా టన్నుకు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ధర పలుకుతున్నది. ఆ ధరలకు కొనుగోలు చేయడమంటే డిస్కమ్లకు ప్యాకప్ చెప్పడమే! ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు, గ్యాస్ ధరలకు యుద్ధం మరింత ఆజ్యం పోసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విద్యుత్ వినియోగ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉన్నదని ఇంధన శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉన్నది. ఇంకో 55 మిలియన్ యూనిట్లు లోటు. పవర్ ఎక్స్ఛేంజీల్లో ఈ మొత్తం లోటు మేరకు కొనుగోలు చేయాలనుకుంటే రోజుకు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాల్సిందే. ప్రభుత్వం అందుకు సిద్ధపడినా కూడా ఆ మేరకు ఎక్స్ఛేంజిల్లో కూడా లభ్యత లేదు. దొరికినంత మేరకు కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తున్నామని ఇంధన శాఖ అధికారి చెప్పారు. ఈ నెలాఖరు నాటికి వరి కోతలు మొదలవుతాయి కనుక వ్యవసాయ డిమాండ్ పడిపోతుందనీ, వచ్చే నెల మొదటి వారానికల్లా ఈ సంక్షోభం తగ్గిపోతుందనీ చెబుతున్నారు. ఒక ప్రకృతి వైపరీత్యం, ఒక యాక్సిడెంట్ లాగా ముంచు కొచ్చిన సమస్య ఇది. తాత్కాలికమైనది. అభివృద్ధి చెందిన పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లే పవర్ హాలిడే లను ప్రకటించాయి. ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో గంటల తరబడి అప్రకటిత కోత అమలవుతున్నది. మెయిన్టెనెన్స్ పేరుతో చెన్నైలోనూ కోతలు విధిస్తున్నారు. సొంత బొగ్గు గనులున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే అడపాదడపా అప్రకటిత కోతలు తప్పడం లేదు. దేశమంతా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను జగన్ తలకు చుట్టేందుకు ఎల్లో సిండికేట్ ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నదో చూస్తూనే ఉన్నాము. వైజాగ్లో ఎన్సీసీ అనే సంస్థకు భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని రద్దు చేయాలన్నది ఎల్లో మీడియా డిమాండ్. కానీ అమరావతిలో మాత్రం రద్దు చేయకూడదట! ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల ఫలితంగా త్వరలో మరో శ్రీలంక మాదిరిగా కాబోతున్నదని ఎల్లో మీడియా చేస్తున్న బృందగానం వింటూనే ఉన్నాము. బాబు హయాంలో చేసిన అప్పుల గురించి కానీ, ఈ మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఆర్థికాభివృద్ధిని గురించి కానీ ఎల్లో మీడియా మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరం రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు. 2021– 22లో అది 2,07,771కి పెరిగింది. దీని గురించి మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–2019) జీఎస్డీపీ వృద్ధి రేటు 5.36 శాతం. 2021–22లో అది 11.43 శాతం. దేశంలోనే అత్యధికంగా వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. జీఎస్డీపీ పెరగడ మంటే... ఆర్థిక కార్యక్రమాలు పెరగడం, ఉత్పత్తులు, సేవలు పెరగడం, ద్రవ్య చలామణీ పెరగడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమని అర్థం. గత ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. 52 వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల ఆదాయంగా సమకూరింది. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పురోగామి రాష్ట్రంగా ఉన్నదని ఈ గణాంకాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. కానీ ఎల్లో సిండికేట్కు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఓడించిన ఆంధ్రప్రదేశ్లో లంకాదహన దృశ్యమే కనిపిస్తున్నది. వారికి కనువిందు చేస్తున్నది. అసత్య ప్రచారాలతో అధికార పార్టీ ఓటింగు బలాన్ని ఎంతో కొంత తగ్గించే తాపత్రయానికి తోడు ప్రతిపక్షం ఓట్లు చీలకుండా, చంద్రబాబు పెట్టబోయే మహాకూటమి జోలెలోనే పడాలన్నది మరో వ్యూహం. ఇక్కడ రాజకీయ నాయకులు మరిచిపోతున్న విషయం ఒకటున్నది. అలయెన్స్లూ, ఐక్య సంఘటనలూ రాజకీయ పార్టీలకే కాదు... ప్రజలకూ ఉంటాయి. ఆ విషయం గతంలో అనేకసార్లు నిరూపణయింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ స్వయంగా ఓటమి పాలై కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఇందిరాగాంధీ ‘కాంగ్రెస్(ఐ)’ పేరుతో చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జాతీయ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. బ్రహ్మా నందరెడ్డి అధ్యక్షుడిగా ఉండేవారు కనుక ‘రెడ్డి కాంగ్రెస్’గా పిలిచేవారు. ముఖ్యమంత్రిగా ‘రెడ్డి కాంగ్రెస్’ నేత వెంగళరావు ఉన్నారు. కాంగ్రెస్ అతిరథ మహారథులంతా ‘రెడ్డి కాంగ్రెస్’లోనే ఉన్నారు. మరికొందరు జనతా పార్టీలోకి వలసపోయారు. ప్రతిపక్ష యోధానుయోధులు, అధికార పక్షం నుంచి వచ్చిన అతిరథులతో కూడిన జనతా పార్టీ బలీయంగా కనపడింది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ ప్రచార పోరు! ఇందిరా కాంగ్రెస్ను ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు టిక్కెట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ అధికారంలో ఉండగా సామాన్య ప్రజలకు చేసిన మేలును వారు మరిచిపోలేదు. ‘గరీబీ హఠావో’ ఉద్యమాన్ని వారు మరిచిపోలేదు. సంపన్నుల సేవలో తరిస్తున్న బ్యాంకుల మెడలు వంచి, వాటిని జాతీయం చేసి సామాన్య ప్రజలకు రుణాలిప్పించిన జ్ఞాపకమూ చెదిరిపోలేదు. ఇందిరమ్మ పార్టీ గుర్తు కూడా కొత్తది. పెద్దగా ప్రచారం చేసే నాధుడు లేడు. అయినా, బలమైన స్థానిక నాయకత్వమున్న రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీదాబిక్కీ జనమంతా ఒక్కటైనారు. తమ ఓట్లను చీలనివ్వలేదు. ఇందిరమ్మ గుర్తును తెలుసుకొని, బ్యాలెట్ పేపర్లో వెతికి పట్టుకొని మరీ ఓట్ల వర్షం కురిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ‘మహా కూటమి’గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఓట్లకు కోతపెట్టిన ‘ప్రజారాజ్యం’ ఒక్కటే విడిగా పోటీ చేసింది. ‘మహాకూటమి’కి ధీటుగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా మహత్తర కూటమిగా ఐక్యమై, రాజకీయ కూటమిని మట్టి కరిపించారు. తమకు మేలు చేసే, తమ శ్రేయస్సుకు బాటలు వేసే ప్రభుత్వాల మీద జరిగే కుట్రలనూ, కుయుక్తులనూ జనం గమనిస్తారు. ‘ఓట్లు చీలనివ్వం’ అనే మాట పవన్ కల్యాణ్, చంద్రబాబు చెప్పడం కాదు... ప్రజలే చెబుతారు. సామాజిక వర్గాల సంయుక్త అలయెన్స్ను వారే ప్రకటించుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అగ్రవర్ణ అభ్యుదయ వర్గాలతో కూడిన అఖండమైన ఓటు బ్యాంకును చెదరనివ్వరు! వారి ఓట్లు చీలవు!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇది ప్రజల బడ్జెట్.. ఆత్మనిర్భర బడ్జెట్
ఇది ప్రజల బడ్జెట్. మరింత ఇన్ఫ్రా, మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు, మరింత వృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్. పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఇందులోని ప్రధాన హైలైట్. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందింది. ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు, టాయిలెట్, నల్లా నీరు, గ్యాస్ కనెక్షన్ల కలను సాకారం చేయనుంది. ఆధునిక ఇంట ర్నెట్ కనెక్టివిటీకీ ప్రాధాన్యమిచ్చింది. యువతకు మెరుగైన భవిష్యత్తుకు భరోసానిచ్చింది. హిమాచల్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల వంటి కొండ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తోంది. రైతులకు డ్రోన్లు, వందే భారత్ ట్రైన్లు, డిజిటల్ కరెన్సీ, 5జీ సేవలు, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ తదితరాలతో యువత, మధ్యతరగతికే గాక పేద, దళిత, వెనకబడ్డ వర్గాలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. గంగా ప్రక్షాళనతో పాటు నది పరీవాహక రాష్ట్రాల్లో సహజ సాగును ఈ బడ్జెట్ ప్రోత్సహించనుంది. అగ్రి స్టార్టప్లకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ప్యాకేజీ వంటివి రైతు ఆదాయాన్ని బాగా పెంచేవే. వారికి రుణ హామీతో పాటు మరెన్నో పథకాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. రక్షణ బడ్జెట్లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమకే రిజర్వ్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని రంగాలూ మనస్ఫూర్తిగా స్వాగతించిన ’ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్’ ఇది! -
సొంత గూటికి... మహారాజా!
సరిగ్గా ఏడు దశాబ్దాల తర్వాత మహారాజా సొంత గూటికి చేరారు. 1932లో జేఆర్డీ టాటా పూనికతో ‘టాటా ఎయిర్లైన్స్’గా ఆరంభమై, జాతీయీకరణతో 1953లో ప్రభుత్వం చేతికొచ్చి, మహారాజా చిహ్నంతో పాపులరైన భారత విమానయాన సంస్థ ఎయిరిండియా ఇప్పుడు మళ్ళీ టాటాల చేతికే వచ్చింది. ప్రభుత్వం అధికారిక అప్పగింతలతో కొత్త శకం ఆరంభమైంది. గత ఏడాది అక్టోబర్లో జరిగిన విక్రయంలో దాదాపు రూ. 18 వేల కోట్లకు టాటా సంస్థ తన బిడ్డను మళ్ళీ చేజిక్కించుకుంది. దాంతో పాటు సంస్థ తాలూకు రూ. 15,300 కోట్ల మేర ఋణభారాన్ని భుజానికెత్తుకుంది. రోజుకు రూ. 20 కోట్ల మేర నష్టపోతున్న ఈ సంస్థను మళ్ళీ గగనతలంలో దూసుకుపోయేలా చేయడం ఇప్పుడు టాటాల ముందున్న పెనుసవాలు. అటు ఎయిరిండియా, ఇటు దేశ విమానయాన రంగం, వివిధ రంగాలు – వ్యాపారాల్లో ప్రభుత్వ పాత్ర... అన్నిటా ఇది ఓ కీలక ఘట్టం. మోదీ గద్దెనెక్కిన తరువాత గడచిన ఎనిమిదేళ్ళలో విజయవంతంగా పూర్తయిన తొలి ప్రైవేటీకరణ ప్రయత్నం ఇదే. కానీ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా కలిసొచ్చిందేమీ లేదు. పేరుకు రూ. 18 వేల కోట్లకు కొన్నా, అందులో రూ. 2,700 కోట్లే ప్రభుత్వానికి ఇచ్చేది. మిగతా రూ. 15,300 కోట్లు ప్రభుత్వమిచ్చిన అప్పుగా టాటా దగ్గరే ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటీకరణ సాగుతున్న తీరుపై విమర్శలూ అనేకం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు గడించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ఇప్పటి దాకా కేవలం రూ. 9,330 కోట్లే వచ్చినట్టు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ‘పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) వారి లెక్క. అవన్నీ అటుంచితే, ఈ విక్రయం ద్వారా వెలువడ్డ సిగ్నల్స్ను మర్చిపోలేం. నిజానికి, ఎయిరిండియా ప్రైవేటీకరణ చాలాకాలంగా వినపడుతున్నదే. ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన సంస్థ ఇది. 1932 అక్టోబర్లో మొదలై, టాటాలు నడుపుతున్న సంస్థలో స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం ప్రవేశించింది. మొదట 49 శాతం వాటా తీసుకుంది. 1953లో మిగతా వాటాను కూడా కొని, జాతీయీకరణ జరిపింది. తర్వాత కొన్ని దశాబ్దాలు ఎయిరిండియాదే హవా. ఆర్థిక సరళీకరణ, ఆ పైన పెరిగిన ప్రైవేట్ సంస్థల పోటీతో గత ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఈ ప్రభుత్వరంగ సంస్థ నిర్వహణలో అనేక లోటుపాట్లూ చోటుచేసుకున్నాయి. నష్టాలను తగ్గించుకోవడం కోసం 2007లో అంతర్జాతీయ విమానాలు నడిపే ఎయిరిండియాను, దేశీయ విమానయాన ‘ఇండియన్ ఎయిర్లైన్స్’లో కలిపారు. అయినా సరే, అప్పటి నుంచి ఇప్పటి దాకా లాభమన్నది కళ్ళజూడలేదు. చివరకు అన్నీ కలిసి సంస్థను ప్రైవేటీకరణ బాట పట్టించాయి. వాజ్పేయి సారథ్యంలో 2001లోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణకు తొలి ప్రయత్నం చేసింది. 40 శాతం వాటాలు విక్రయించాలనుకొని విఫలమైంది. మోదీ సర్కార్ మొదటి విడత పాలనలో 2018లో 76 శాతం మేర వాటా అమ్మాలనుకుంది. ఒక్కరైనా ముందుకు రాలేదు. 2020 జనవరిలో పాక్షికంగా కాక వాటాలను పూర్తిగా అమ్మేస్తామంటూ, తాజా ప్రయత్నం ప్రారంభించింది. ప్రభుత్వ వాటాలుంటే దాని పెత్తనమూ ఉంటుందనీ, స్వేచ్ఛగా సంస్థ నిర్వహణ సాధ్యం కాదనీ ఇంతకాలం సంశయిస్తూ వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇది నచ్చింది. ఎట్టకేలకు ఇప్పటికి అమ్మకం పూర్తయింది. ఇప్పటికే అనేక సంస్థలు పోటీపడుతూ, కరోనా కష్టాలతో మథనం తప్పనిసరి అయిన వేళ ఎయిరిండియాను టాటాలు చేపట్టడం గమనార్హం. తాము పురుడు పోసిన సంస్థను మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవడం భావోద్వేగభరిత ఘట్టమే అయినా, అందులోని సవాళ్ళు అనేకం. ఒకపక్కన పాతబడుతున్న విమానాలు, మరోపక్క వేల సంఖ్యలో ఉద్యోగులు వారసత్వంగా సంక్రమించాయి. కనీసం ఏడాది పాటు ఉద్యోగులెవరినీ తొలగించబోమని హామీ ఇచ్చిన టాటాలు నష్టాల్లో ఉన్న సంస్థను ఓ గాడిన పెట్టాలంటే అసాధారణ కృషి అవసరం. విమానయాన రంగంలో ఇప్పటికే ఒకటికి రెండు సంస్థల్లో టాటాల పెట్టుబడులున్నాయి. దేశంలో ఇప్పుడు మిగిలిన ఏకైక ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ ‘విస్తారా’లో, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణాలకు తోడ్పడే విమానయాన సంస్థ ‘ఎయిర్ ఏషియా’ భారతీయ శాఖ (ఎయిర్ ఏషియా ఇండియా)లో టాటాలకు భాగముంది. ఇప్పుడు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లలో నూటికి నూరుపాళ్ళ యాజమాన్యం, క్షేత్రస్థాయి నిర్వహణ సంస్థ ‘ఎయిరిండియా – శాట్స్’లో 50 శాతం వాటా వచ్చింది. ఒకే గొడుగు కింది విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియాలు మూడూ పోటాపోటీ పడాల్సిన గమ్మల్తైన పరిస్థితి. అందుకే, ఏదో ఒక దశలో వీటన్నిటినీ ఒక్కటి చేసినా, ఆశ్చర్యం లేదు. ఏమైనా, ప్రైవేటీకరణతో గూటిలోని గువ్వ పిల్లకు కొత్త రెక్కలొస్తాయా? ఈ కరోనా కాలంలో ఎయిరిండియాకు టాటా ఎలాంటి బూస్టర్ షాట్ ఇస్తుంది? జవాబుల కోసం ఇంకొంతకాలం వేచి చూడాలి. ప్రభుత్వమేమో ప్రైవేటీకరణ లక్ష్యంలో భాగంగా ఖజానాకు మరింత సొమ్ము సమకూర్చు కోవడానికి మార్చి ఆఖరున ‘భారత జీవిత బీమా సంస్థ’ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇస్యూ గడువు పూర్తయ్యే దాకా ఆగకతప్పదు. అభ్యంతరాలు, అడ్డంకుల మధ్యనే భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ముందుకు సాగే సూచనలూ కనిపిస్తు న్నాయి. అనివార్యతలెలా ఉన్నా, ప్రజా ప్రయోజనాల్ని కాపాడాల్సిన ప్రభుత్వ సారథ్యంలోని స్వేచ్ఛా విహంగాలు ప్రైవేటు చేతిలో పతంగులుగా మారిపోవడానికి దారి తీసిన పరిస్థితులే తీరని దుఃఖం! -
పంచముఖ పంజాబీ చిత్రం
ఎన్నికలు రెండు, మూడు నెలల్లో ఉన్నాయనగా రాజకీయాలు వేడెక్కడం మామూలు. ఎత్తులు, కొత్త పొత్తులతో రంగస్థలం రంజుగా మారడమూ సాధారణం. కానీ, పంజాబ్లో శరవేగంతో మారుతున్న సమీకరణాలు ఎవరూ ఊహించనివి అనే చెప్పాలి. మరోసారి గెలుపు పక్కా అనుకున్న పంజాబ్లో కాంగ్రెస్ కష్టాల్లో పడడం, ఆ రాష్ట్రంలో ‘ఆప్’ క్రమంగా పాగా వేస్తుండడం, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన మాజీ సీఎం అమరీందర్ సింగ్తో – శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్) అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సాతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం, రైతు సంఘాలు కలసి ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం – ఇవన్నీ ఫిబ్రవరి, మార్చిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని చకచకా మార్చేస్తున్నాయి. నిన్నటి దాకా రెండున్నర పార్టీల రణస్థలి లాంటి రాష్ట్రం ఇప్పుడు కొత్త ఆటగాళ్ళతో క్రిక్కిరిసి, ఉత్కంఠ రేపుతోంది. ఏడాది పైగా సాగిన రైతు ఉద్యమంతో కొత్త సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత పంజాబ్లో జరిగిన తాజా తొలి ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. సోమవారం వెలువడ్డ పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 2016 నుంచి ఇప్పటి దాకా మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న బీజేపీని రెండో స్థానానికీ, అలాగే కాంగ్రెస్ను మూడో స్థానానికీ నెట్టేస్తూ, 35 స్థానాలకు గాను 14 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుపొందింది. 2016 కన్నా బీజేపీ స్కోరు 8 తగ్గి, 12 వార్డుల దగ్గర నిలిచింది. బీజేపీ ప్రస్తుత మేయర్ – ఇద్దరు మాజీ మేయర్లు ఓడిపోవడం, తొలిసారి అక్కడ మునిసిపల్ బరిలోకి దిగుతూనే ‘ఆప్’ పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ఢిల్లీ ముఖ్యమంత్రి – ‘ఆప్’ సారథి అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పాలంటే, ‘‘పంజాబ్లో మారుతున్న పరిస్థితులకు ఇది సూచన’’. ప్రతిసారీ కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగే చండీగఢ్ ఎన్నికలు ఈసారి ‘ఆప్’ రాకతో, త్రిముఖ పోటీగా మారడం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ను పంజాబ్ అంతటికీ బారోమీటర్ అనలేం. కానీ, ఒక్క చండీగఢ్లోనే కాదు... రాష్ట్రం మొత్తం మీద కొత్త రాజకీయ ఆటగాళ్ళు పెరిగారు. కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ, కేంద్ర బీజేపీ సర్కారుపై పోరాడిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం)లో భాగమైన 22 రైతు సంఘాలు కలసి తాజాగా ‘సంయుక్త సమాజ్ మోర్చా’ (ఎస్ఎస్ఎం) పేరిట ఓ రాజకీయ పార్టీ పెట్టాయి. సీనియర్ రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ కొత్త రాజకీయ కూటమి తాలూకు ముఖచిత్రం. పంజాబ్లోని 117 స్థానాలకూ పోటీ చేస్తామని ఈ రైతు సంఘాల పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కానీ, కొన్ని రైతు సంఘాల ఈ రాజకీయ రంగ ప్రవేశాన్ని సాక్షాత్తూ వాటన్నిటికీ గొడుగు సంస్థ లాంటి ఎస్కేఎం వ్యతిరేకించింది. ప్రజా ఉద్యమానికి పరిమితులున్నా, అలా కొనసాగినప్పుడు జనంలో ఉండే గౌరవం, ప్రతిష్ఠ వేరు. పార్టీ పెట్టేసరికి ఉద్యమాన్నీ రాజకీయ దృష్టితోనే చూస్తారనేది కొట్టిపారేయలేం. మరి, ఉద్యమం ద్వారా రైతులను ఏకం చేయగలిగిన సంఘాలకు రేపు ఎన్నికలలో ఓట్లు రాలతాయా అన్నది చెప్పలేం. ఏడెనిమిది నెలల క్రితం పంజాబ్లో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొంత అయోమయంలో పడింది. పంజాబ్ పీసీసీ సారథిగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను బరిలోకి దింపి, సీఎం స్థానంలోని కెప్టెన్ అమరీందర్ సింగ్ను పొమ్మనకుండా పొగబెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వమే! తీరా అమరీందర్ ఇప్పుడు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంత కుంపటి పెట్టుకొని, బీజేపీతో కలసి కాంగ్రెస్ను మట్టి కరిపించే పనిలోకి సీరియస్గా దిగారు. దళిత సిక్కు చరణ్జిత్ సింగ్ చన్నీని సీఎం పీఠమెక్కించి, ఓటర్ల కులసమీకరణాల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారుతుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మరోపక్క సొంత ప్రభుత్వం పైనే విమర్శల బ్యాట్ జళిపిస్తున్న సిద్ధూ ఆ పార్టీకి చెప్పుకోలేని తలనొప్పిగా తయారయ్యారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలన్నిటిలో జరిగిన తాజా ‘ఔట్లుక్ – హన్సా రిసెర్చ్’ పంజాబ్ మనోగతం సర్వేలో సీఎం అభ్యర్థిగా మంచి మద్దతే లభించడం కాంగ్రెస్కు కాస్తంత ఊరట. చతికిలబడ్డ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం – పంజాబ్ బరిలో కీలక అంశాలు కానున్నాయని సర్వేల మాట. అమరీందర్, బీజేపీ నేతలేమో జాతీయ భద్రతను అస్త్రంగా ఎంచు కుంటారు. అందుకే, ఇటీవల జరిగిన పవిత్ర స్థలాల అపవిత్ర యత్నం, నిందితుల్ని కొట్టి చంపడం, బాంబు పేలుడు ఘటనల్లో కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తగినంత మంది అభ్యర్థులైనా లేని బీజేపీ ఇప్పటికే జాట్ సిక్కు రైతుల కోపానికి గురై, ఎలాగోలా ఉనికి నిలుపు కోవాలని తపిస్తోంది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తమలోకి కలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక, సర్వం తానే అయిన కేజ్రీవాల్ ప్రచారం చూసి, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలనకు పంజాబీలు సిద్ధపడతారా అన్నదీ ప్రశ్నే. ఏమైనా, కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బీజేపీ, రైతు పార్టీల పంచముఖ పోరులో ఏ ఒక్క పార్టీకో సొంతంగా మెజారిటీ వస్తుందా అన్నది ఇప్పటికైతే సందేహమే. ముఖచిత్రం మారుతోంది. అనిశ్చితి పెరుగుతోంది. ఓ ‘ఆప్’ ఎమ్మెల్యే అన్నట్టు, చండీగఢ్ మునిసిపల్ ఎన్నికలు రానున్న అసెంబ్లీ పోరుకు ట్రైలర్. ఈ ట్రైలర్ను బట్టి చూస్తే, సినిమా మరింత ఆసక్తికరంగా ఉండనుంది. దాని కోసం మార్చిలో రిజల్ట్స్ రిలీజ్ దాకా వేచిచూడక తప్పదు. -
భారీ పోరుకు... బూస్టర్!
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆదేశాలు... ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ ఎక్కువవుతున్న భయాలు... వీటన్నిటి మధ్య ప్రధాని మోదీ శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన కొత్త టీకా విధాన ప్రకటన నైతిక స్థైర్యాన్ని నింపవచ్చు. నియమిత రెండు డోసులే కాక, అదనపు మూడో డోస్ను బూస్టర్ డోస్గా ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా దేశమంతటా చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఆ ప్రకటన – క్రిస్మస్ హెల్త్గిఫ్ట్. భారత్ బయోటెక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకాను 12 ఏళ్ళు పైబడ్డవారికి వేయవచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన కాసేపటికే మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. నూటికి 50 మందిలో టీకా రోగనిరోధకతను ఒమిక్రాన్ తోసిపుచ్చినట్టు దేశంలో ప్రాథమిక డేటా. అందుకే, బూస్టర్డోస్లు, టీనేజర్లకు టీకాలతో కరోనాపై పోరాటపటిమనీ, పరిధినీ పెంచడం స్వాగతించాలి. పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటి నుంచి చీకటి పడ్డాక మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నా రంటే, ఒక విధమైన ఉత్కంఠ! ఒమిక్రాన్ కేసులు, లాక్డౌన్ పుకార్ల మధ్య శనివారమూ అదే పరిస్థితి. చివరకు మోదీ 15 – 18 ఏళ్ళ మధ్యవయసు పిల్లలకు టీకాలు, ఫ్రంట్లైన్ వర్కర్లు – ఆరోగ్య సంరక్షణ వర్కర్లు – తీవ్ర అనారోగ్య సమస్యలున్న 60 ఏళ్ళు పైబడ్డ పెద్దలకు ‘ముందు జాగ్రత్త డోస్’ (ప్రపంచమంతా బూస్టర్ అంటున్న మూడో డోస్)లు జనవరి నుంచి ఇస్తామనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే కాస్తంత ఆలస్యమైందని కొందరు అంటున్నా, కనీసం ఒమిక్రాన్ వేళ ధైర్యమిచ్చే ప్రకటన చేశారనే భావన కలిగింది. ప్రస్తుతం దేశంలో నెలకి 30 కోట్ల పైగా (కోవిషీల్డ్ 25 – 27 కోట్లు, కోవాగ్జిన్ 5–6 కోట్ల) డోస్లు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రాల వద్ద 18 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయట. 11 రాష్ట్రాల్లో దేశ సగటు కన్నా తక్కువగా టీకాకరణ జరుగుతోంది. తాజా ప్రకటనతో నాలుగు వారాల తేడాతో వేసే రెండు డోసుల కోవాగ్జిన్ టీకా, మూడు డోసుల డీఎన్ఏ ఆధారిత టీకా జైకోవ్–డి... ఈ రెండిటికీ మనదేశంలో 12 ఏళ్ళు పైబడ్డవారికి వాడేందుకు అనుమతి ఉన్నట్టయింది. జైడస్ క్యాడిలా తయారీ జైకోవ్–డికి ఆగస్టులోనే భారత్లో అనుమతి లభించింది. అదింకా మార్కెట్లోకి రాలేదు. అంటే, దాదాపు ఏడాదిగా విపణిలో ఉన్న కోవాగ్జిన్ ఒక్కటే మన టీనేజర్లకు శరణ్యం. అటు జైకోవ్–డి విషయంలో కానీ, ఇటు కోవాగ్జిన్ విషయంలో కానీ ఈ నిర్ణీత వయసు వారిపై ఆయా టీకాల సామర్థ్యంపైనా, సురక్షితమేనా అన్నదానిపైనా సరైన పరిశోధన పత్రాలు లేవు. బాహాటంగా సమాచారమూ లేదు. తయారీ సంస్థల పత్రికా ప్రకటనలే ప్రజలకు ఆధారం కావడం విచిత్రం. నిజానికి, 2 ఏళ్ళు పైబడిన పిల్లలకు సంబంధించిన డేటాను భారత్ బయోటెక్, 12 ఏళ్ళు పైబడిన వారి డేటాను జైడస్ క్యాడిలా సమర్పించాయి. కానీ, 15 – 18 ఏళ్ళ మధ్యవయస్కులకే టీకాలు పరిమితం చేస్తూ మోదీ ప్రకటనకు కారణాలేమిటో తెలియదు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో సరఫరా సరిగ్గా లేదు. టీకాల కొరత ఉంది. పైపెచ్చు పిల్లలకూ, టీనేజర్లకూ కరోనా తీవ్రంగా వచ్చే అవకాశం తక్కువనీ, అత్యధిక రిస్కున్నవారికి సైతం అన్ని దేశాల్లో టీకాకరణ పూర్తి కాలేదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 22న కూడా పేర్కొంది. అందుకే, అర్హులైన వయోజనులందరికీ టీకాలు వేయడం పూర్తయ్యే దాకా భారత్లో టీనేజర్లకు ఓకే చెప్పరని భావించారు. ప్రభుత్వ విధానానికి మార్గదర్శనం చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం పదే పదే సమావేశమైనా, బాహాటంగా ఏమీ చెప్పలేదు. ఎట్టకేలకు ప్రధానే స్వయంగా కొత్త నిర్ణయం ప్రకటించే ఘనత తీసుకున్నారు. టీకాల సరఫరా సమృద్ధిగా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ఇప్పటికే పసిపిల్లలకూ, టీనేజర్లకూ టీకాలు వేసేస్తున్నాయి. మన దేశ తాజా కోవిడ్ టీకా విధానంపై అది సహజంగానే ప్రభావం చూపింది. ఆ మాటకొస్తే, ఐరోపాలోని అనేక దేశాలతో పాటు కెనడా, బహ్రయిన్, ఇజ్రాయెల్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా లాంటివి కూడా ఇప్పటికే 12 ఏళ్ళ లోపు వారికి టీకాలకు ఓకే అనేశాయి. భారత్లో వయోజనుల్లో 40 శాతం మందికి (38 కోట్ల మందికి) పూర్తిగా టీకాలేయడం అవనే లేదు. అందుకే, వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, ఇప్పటికీ తొలగిపోని డెల్టా వేరియంట్ ముప్పు నేపథ్యంలో – 18 ఏళ్ళ లోపు వారి కన్నా వయోజనులకే మరింత రిస్కుంది అనేది మరో వాదన. మొత్తం మీద టీకాకరణలో కొత్త దశలోకి కొత్త ఏడాది అడుగిడనున్నాం. రెండో డోస్ వేసుకున్నా 8 నుంచి 9 నెలల్లో రోగనిరోధకత తగ్గుతుందన్న అధ్యయనాలతో ‘ముందు జాగ్రత్త’ పేరుతో కొందరికి బూస్టర్ డోసులూ వేయనున్నాం. మొదటి డోస్ వేసుకొని రెండో డోసుకు రాని వారిని ఒప్పించడంతో పాటు, అవసరార్థులకు బూస్టర్ డోస్ వేయడం ఇప్పుడున్న సవాలు. వ్యాధి లక్షణాలు కనపడ్డ 5 రోజుల్లోగా తీసుకుంటే, అమెరికా, బ్రిటన్లలో ఆసుపత్రి కష్టాలు, మరణాలను 89 శాతం తగ్గిస్తున్నాయంటున్న యాంటీ వైరల్ మాత్రల్నీ అనుమతించవచ్చేమో ఆలోచిస్తే మంచిదే! సమస్యల్లా – దేశ జనాభా మొదలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల దాకా అందరూ కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించడం, రిస్కు లేని దేశాల నుంచి వస్తున్నవారు అసలు నిబంధనల్నే పాటించక పోవడం! దేశంలో తాజా కేసుల పెరుగుదలకు అదే కారణమని అధికారులు మొత్తుకుంటున్నారు. కానీ, మాస్కులు తీసేసి, భౌతిక దూరమైనా లేకుండా, గుంపులుగా తిరుగుతున్నవారికి ఏమని చెప్పాలి? ఎన్నిసార్లని జాగ్రత్తల బుద్ధి గరపాలి? కరోనాపై పోరులో అదే పెను సమస్య! -
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్లో అస్సాం రైఫిల్స్కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
జీవనయానం వలస ప్రయాణం
చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్, అరుణాచల్లోని ఈగల్నెస్ట్ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి. మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! -
షేడ్స్ ఆఫ్ రెడ్!
మనం జనజీవన స్రవంతిగా పిలుచుకునే లోకంలో ఆర్కే అనే పేరు అంత సుపరిచితమైనదేమీ కాదు. అధికార పదవుల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు. వ్యాపారాలు చేసి వేలకోట్ల టర్నోవర్ సాధించడం వంటి ఘనతలేమీ లేవు. చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారిచ్చే ‘పద్మశ్రీ’ బిరుదు రాలేదు. ప్రైవేట్వాళ్లు బహూకరించే ‘సేవారత్న’ కూడా లేదు. జీవన సాఫల్య పుర స్కారం లేనేలేదు. అయినప్పటికీ ఆయన మరణవార్తకు తెలుగు మీడియా తగిన ప్రాధాన్యమిచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక స్కూల్ టీచర్ పెద్దకొడుకు అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే. వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం ఎన్ఐటీ)లో ఇంజనీరింగ్ చదివాడు. అప్పట్లో తెలి వైన విద్యార్థులకే ఇంజనీరింగ్లో సీటు దొరికేది. ఆర్ఈసీలో ఆ సీటు సంపాదించడమంటే మరింత నాణ్యమైన సరుకని అర్థం. ‘జనజీవనస్రవంతి’లోనే అతను కొనసాగి ఉన్నట్లయితే ‘నాణ్య మైన’ జీవితాన్నే గడిపి ఉండేవాడు. జీవన సాఫల్య పురస్కారా ల్లాంటివి కూడా లభించి ఉండేవేమో! ఆ రోజుల్లో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులపై కమ్యూనిస్టు తీవ్రవాద భావజాల ప్రభావం బలంగా ఉండేది. చేగువేరా వేగుచుక్కలా కనిపించేవాడు. జార్జిరెడ్డి ఆదర్శం ఉత్తే జితం చేసేది. వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ బాట వెంట పయనమయ్యారు. ఉద్యోగాలు, విలాసవంత మైన జీవితావకాశాలను తృణప్రాయంగా వదిలేశారు. వారిలో ఆర్కే ఒకరు. సమష్టిగా ప్రజలందరికీ చెందవలసిన భూమి, ప్రకృతి, సహజ వనరులపై కొందరి పెత్తనమేమిటనే ప్రశ్నలోంచే కమ్యూ నిస్టు సిద్ధాంతం పుట్టింది. ఆ కొంతమంది వ్యక్తుల ‘దోపిడీ’ కారణంగానే అత్యధిక ప్రజానీకం పేదరికంలో మగ్గవలసి వస్తున్నదని అది నిర్ధారించింది. అటువంటి ‘దోపిడీ వ్యవస్థ’ను కూలదోసి, సమసమాజాన్ని ఏర్పాటుచేసే మార్గాలను ఉపదేశిం చింది. అనుసరించవలసిన ఆ మార్గాలపై ఏర్పడిన భిన్నాభిప్రా యాల ఫలితంగా పార్లమెంటరీ కమ్యూనిస్టులూ, విప్లవ కమ్యూనిస్టులుగా చీలిపోయారు. ఈ రెండు భాగాల్లోనూ మరో రెండు డజన్లకు పైగా చీలికలున్నాయి. విప్లవ కమ్యూనిస్టుల్లో ప్రధాన పాయగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఆర్కే పొలిట్ బ్యూరో సభ్యుడు. తెలంగాణ నుంచి బెంగాల్ వరకు 8 రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల పాటు మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య నడుమ యుద్ధం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జీవితాలు కల్లోలిత మయ్యాయి. వేలాదిమంది ప్రజలు, పోలీసులు, విప్లవకారులు ఈ కల్లోలానికి బలయ్యారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు జరిగితే ఈ హింసాకాండను కొంతమేరకు కట్టడి చేయొచ్చని కొందరు తటస్థ మేధావులు భావించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ చర్చల సమ యంలోనే ఆర్కే మీడియా దృష్టిని ఆకర్షించారు. చర్చల్లో మావోయిస్టు బృందానికి నాయకత్వం వహించారు. ఫలితంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లోకి అందరికంటే ఎక్కువ మీడియా సంపర్కం ఆర్కేకు ఏర్పడింది. ఆయన ఫొటోలు, జీవిత విశే షాలు మీడియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన వివరాలను మీడియా ప్రజలకు తెలియజేయగలిగింది. ఆర్కే మరణవార్త మావోయిస్టు పార్టీ స్థితిగతులపై చర్చను రేకెత్తిస్తుంది. ఆ చర్చ కమ్యూనిస్టు మూలసిద్ధాంతాలను కూడా తడుముతుంది. ప్రస్తుత ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ సిద్ధాంతాలు ఏ మేరకు నప్పుతాయనే అంశం కూడా చర్చల్లోకి రాకుండా ఉండదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకొని వందేళ్లయింది. వందేళ్లలో సమాజంలో అసమానతలు తగ్గాయా? తగ్గలేదు పెరిగాయని స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు సాక్ష్యాధారాలతో లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉమ్మడి సంపద ఎంత ఉంటుందో ఒక్క శాతం కుబేరుల సంపద అంతకంటే ఎక్కువగా ఉందట. మన దేశంలో 119 మంది బిలియనీర్ల సంపద 130 కోట్ల మంది తలరాతలు రాసే భారతదేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువట. కనీస వేతనంపై పనిచేసే ఒక కార్మికుడు మన దేశంలోని ఒక కార్పొరేట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ సంపాదించినంత డబ్బు సంపాదించాలంటే 941 ఏళ్ళ పాటు పనిచేయాలట. కోవిడ్ తర్వాత ఈ అసమానతలు మరింత పెరిగాయి. ఆక్స్ఫామ్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంక్షోభంలో కోల్పోయిన సంపదను కుబేరులు ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. మెజారిటీ పేదవర్గాల ప్రజలు కోలుకోవడానికి మాత్రం ఇంకో పదేళ్లయినా పడు తుందట. అసమానతలు మరింత పెరిగే విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమ లను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి కారుచౌకగా కట్ట బెడు తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచు కున్న ప్రబుద్ధులను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తు న్నారు. లేదా రాజ్యసభ సభ్యత్వమిచ్చి సత్కరిస్తున్నారు. రైతు లకు అండగా ఉన్న భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. కార్మికులతో 12 గంటలపాటు పని చేయించుకు నేందుకు అనువుగా లేబర్ చట్టాలను మార్చారు. ఉద్యోగ భద్రత ఊసు మాత్రం అందులో లేదు. రైతులు ససే మిరా అంటున్నా వినకుండా వ్యవసాయ చట్టాలను మోసు కొచ్చారు. ఈ చట్టాల అంతిమ ధ్యేయం మెజారిటీ రైతులను వ్యవసాయరంగం నుంచి వెళ్లగొట్టడమేనని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను జీపుతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాలు తీశాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు. ఇప్పటికీ సదరు కేంద్ర మంత్రి పదవిలోనే కొన సాగుతున్నాడు. వారం రోజులపాటు మీనమేషాలు లెక్కించి గానీ అతడి కుమారుడిని అదుపులోకి తీసుకోలేదు. అదే, మైనా రిటీ మతస్థుడైన సూపర్స్టార్ కొడుకు విషయంలో ఆగమేఘాల మీద చట్టం తన పని తాను చేసుకొనిపోయింది. జాతీయస్థాయి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి వామ పక్ష రాజకీయాలకు అనువైన కాలమిది. కానీ దేశంలో మావోయి స్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ అవసానదశకు చేరుకుం టున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యూహాల్లోనూ, ఎత్తుగడ ల్లోనూ ఆ పార్టీలు దశాబ్దాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. అదే పరంపర ఇప్పుడూ కొనసాగుతున్నది. కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ లాంటి యువ నాయకులను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్కు ఎర్రరంగు పులమాలని రాహుల్ గాంధీ ఉత్సాహ పడుతున్నారు. కానీ మధ్యేవాదమే కాంగ్రెస్ బలమనే చరిత్ర పాఠాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఫలితంగా మత శక్తుల ప్రాబల్యం పెరిగినప్పుడు కాషాయరంగు పూసుకోవడం, వాటికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఎర్రరంగు కోసం వెతకడం వంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయి ప్రత్యామ్నా యంగా నిలబడగలిగే అవకాశాలను ఆయనే స్వయంగా దెబ్బతీసుకుంటున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరంటే ప్రాంతీయ పార్టీలే. ఇదొక విచిత్ర పరిస్థితి కానీ యథార్థం. ఇప్పుడు కేంద్ర విధానాలపై గొంతు విప్పుతున్నది ప్రాంతీయ పార్టీలే. తాజా విద్యుత్ సంక్షోభంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వా తనే జాతీయ ప్రతిపక్ష నేతలు మేల్కొన్నారు. ఇప్పుడు అధి కారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తున్నాయి. నిఖార్సయిన లౌకిక విధానాలను అవలంబిస్తున్నాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాలను సాధికార శక్తులుగా మలిచేందుకు తరతమ తేడాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అందరి కంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పైసా ఖర్చు లేకుండా ఉన్నతస్థాయి వరకూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ప్రైవేట్ స్కూళ్లలో ఉండే వసతులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్య క్రమంలో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. ప్రతి క్లాస్కూ ఒక టీచర్, ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్ ఉండేవిధంగా ఏర్పాటు చేసింది. మాతృభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లిషును ప్రాథమిక స్థాయి నుంచే బోధనాభాషగా ప్రవేశపెట్టింది. ఫలితంగా రాబోయే తరం పేద విద్యార్థులు నిండైన ఆత్మవిశ్వాసంతో సంపన్నుల పిల్లలతో సమాన స్థాయిలో పోటీపడి నెగ్గగలుగు తారు. విజేతలు కాగలుగుతారు. సాధికార శక్తులుగా తమను తాము నిర్మించుకోగలుగుతారు. అప్పుడు వనరుల అసమాన పంపిణీ వ్యవస్థను వారు సవాల్ చేయగలరు. ఒక ప్రత్యా మ్నాయ సంస్కృతిని నిర్మించగలరు. ప్రభుత్వ వైద్య రంగంలో సోషలిస్టు క్యూబాను తలపించే విధమైన విస్తరణనూ, ఆధునికీకరణనూ ప్రభుత్వం ప్రారం భించింది. ప్రతి కుటుంబాన్నీ, ప్రతి రోగినీ నెలలో ఒకసారైనా వైద్యుడే స్వయంగా వారివద్దకే వెళ్లి పలకరించే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ రంగం కూడా. ఒక విప్లవాన్ని ప్రసవించ బోతున్నది. ఊరూరా నెలకొంటున్న ఆర్బీకే సెంటర్లే ఈ ప్రస వానికి మంత్రసానులు. చిన్న రైతును స్వయంపోషకం గావించ గలిగే మహత్తర సామర్థ్యంతో ఆర్బీకే సెంటర్లు పనిచేయ నున్నాయి. నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార విభాగం ఉన్నతాధికారులు, ఏపీ అధికారులను పిలిపించుకొని మరీ ఆర్బీకేల ప్రజంటేషన్ తిలకించారు. హర్షధ్వానాలు చేశారు. సగం జనాభాగా ఉన్న మహిళా శక్తిని ఎంపవర్ చేయడాన్ని ఒక అతి ప్రాధాన్యాంశంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దేశిం చుకున్నది. చంద్రబాబు వాగ్దాన భంగం వల్ల మరణావస్థకు చేరిన ‘మహిళా పొదుపు సంఘా’లను ఈ ప్రభుత్వం పునరు జ్జీవింపజేసింది. నడివయసు మహిళలకు అండగా నిలబడి, వారు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి నామినేషన్ పదవుల్లోనూ, పనుల్లోనూ రిజర్వేషన్ కల్పిం చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏ విధంగా ఉండాలి? పేద వర్గాల పట్ల అనుకూలంగా కదా ఉండవలసింది! ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిస్టు పార్టీల్లో ముఖ్యంగా ఒక పార్టీ వైఖరి ఆశ్చర్యం గొలుపుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రాజధాని భూసమీకరణలో దాగివున్న కుంభకోణాన్ని అంగీకరించడానికి ఈ పార్టీ నిరాకరిస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒడంబడికలో ఇమిడి ఉన్న దుర్మార్గమైన అంతర్జాతీయ స్కామ్ను అంగీక రించడానికి తటపటాయిస్తున్నది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజధాని ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రైతులూ, డ్వాక్రా మహిళల పట్ల చంద్రబాబు వాగ్దాన భంగాన్ని విస్మరిస్తున్నది. మహిళలూ, బలహీన వర్గాల పట్ల బాబు వ్యతిరేక వైఖరి పలుమార్లు బహిరంగంగా వ్యక్తమైనప్పటికీ ఆ పార్టీ తప్పు పట్టలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం వరస మారింది. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజానుకూల కార్యక్రమాలను చూడటానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకుంది. అలా వాల్చిన కనురెప్పల మాటున వారికొక గొప్ప సత్యం సాక్షాత్కరించింది. డ్రగ్స్ మాఫియాతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందట. బట్టకాల్చి మీద వేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అడ్డగోలు ఆరోపణ ఇది. దాన్నే మన కామ్రేడ్ నారాయణ ‘కోరస్’గా అందుకున్నారు. కమ్యూనిస్టులు కూడా నిరాధా రమైన ఎంగిలి ఆరోపణలు చేయవచ్చునా? ఒక్క వర్షానికే కొట్టుకొనిపోయే రోడ్లువేసి కాంట్రాక్టర్ల జేబులు నింపడాన్ని అభివృద్ధిగా గుర్తించి, సకలజన సాధికారతా యజ్ఞాన్ని గుర్తించక పోవడం ఒక జన్యు లోపంగా పరిగణించవలసి ఉంటుంది. 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కట్టించే బృహ త్తరమైన మానవీయ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రారం భించింది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు కోర్టుకెక్కించి ఆపించాడు. ఇది తప్పని కామ్రేడ్ నారాయణకు తోచకపోవడం చిత్రం. తాకట్టు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆయన పట్ల చాలా అనుమానాలకు తెరతీసింది. ఆస్తుల తాకట్టు సంగతేమో గానీ సిద్ధాంతాలను తాకట్టుపెట్టడం అత్యంత హేయమైన విష యమని గ్రహిస్తే మంచిది. వైఖరి మార్చుకొని వెంటనే ప్రజల పక్షాన నిలబడకపోతే ఒక మహత్తర చరిత్ర కలిగిన పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లవుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మానవహక్కులు–భాష్యాలు
మానవహక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలోనుంచి చూస్తున్నారని...అందువల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యపై విస్తృతంగానే చర్చ నడుస్తోంది. ఒకచోట ఏ చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట చోటుచేసుకుంటే మౌనంవహిస్తారన్నది ఆయన ఆరోపణల సారాంశం. ప్రధాని ప్రస్తావించిన అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మరికొంత విశదీకరించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమను తాము దళిత హక్కుల చాంపియన్లుగా చెప్పుకుంటూ రాజస్థాన్లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ దళితులపై సాగుతున్న అత్యా చార ఘటనల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్కు కొత్త కావొచ్చు గానీ... మన దేశంలోనూ, వేరే దేశాల్లోనూ హక్కుల సంఘాలు ఏదో ఒక దశలో పక్షపాత ఆరోప ణలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కుల సంఘంలో చీలిక కూడా వచ్చింది. అధికార, విపక్షాల నడుమ సాగే వ్యాగుద్ధాల్లో ఇది వినబడటం తాజా పరిణామం. ఈమధ్య ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేడిలో రైతు ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఈ నెల 1, 7 తేదీల్లో రాజస్థాన్లో దళితులపై అత్యంత అమానుషంగా జరిగిన దాడి ఘటనలను మరుగుపరుస్తున్నదని బీజేపీ చేసిన వ్యాఖ్య కొట్టిపారేయదగ్గది కాదు. ఈ ఉదంతాల్లో కేసులు నమోదుచేశామని, నిందితు లను అరెస్టు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నా అక్కడ తరచుగా దళితులపై, మైనారిటీలపై సాగుతున్న దాడులను నిలువరించలేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే. ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1948లో ఐక్య రాజ్యసమితి పిలుపునిచ్చింది. దారిద్య్రం అత్యంత అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించింది. తర్వాత ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్గదర్శకాలు రూపొందుతూ వచ్చాయి. ఈలోగా హక్కులు కాలరాసే ప్రభుత్వాల తీరుపై పలు దేశాల్లో ఉద్యమాలు బయల్దేరాయి. పాలకు లపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. మన దేశంలో 60వ దశకం చివరిలో హక్కుల ఉద్యమాలు మొగ్గతొడి గాయి. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వ ఆగడాలు, బోస్నియా, రువాండా, బురుండీ, అంగోలా వంటిచోట్ల సాగిన నరమేథాలు, తూర్పు యూరప్ దేశాల్లో హక్కుల ఉల్లంఘనలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేశాయి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలన్నీ వ్యవస్థాగతమైన, తటస్థమైన మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని 1991లో పారిస్లో జరిగిన మానవహక్కుల సదస్సు పిలుపునిచ్చింది. దీన్ని 1993లో ఐక్యరాజ్య సమితి కూడా ధ్రువీకరించాక అనేక దేశాల్లో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఆచరణలో సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగపడిన దాఖలా లేదు. వీటికి నామమాత్ర అధికారాలులిచ్చి, లాంఛనప్రాయం చేసిన ప్రభుత్వాలే ఇందుకు కారణం. ఆ సంఘాలకు చేసే నియామకాలు కూడా అసంతృప్తినే మిగులుస్తున్నాయి. మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఏర్పాటైనా యేటా ఈ సంఘాలు ఇచ్చే నివే దికలనూ, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. వాటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరిచి తీరవలసినవా కాదా అనే అంశంపై చాన్నాళ్లుగా అయోమయం ఉంది. మానవ హక్కుల సంఘాల అధికారాలు, విచారణలు న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణిం చాలని, వాటికి సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా పరిస్థితి పెద్దగా మారలేదు. మానవహక్కుల సంఘాలు చేసే సిఫార్సులకు మానవహక్కుల చట్టం సెక్షన్ 18 ఇస్తున్న భాష్యంపై ఇన్నేళ్లయినా సుప్రీంకోర్టుతోసహా దేశంలోని ఏ న్యాయస్థానమూ సంది గ్ధతకు తావులేని విధంగా తీర్పులు వెలువరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ పని చేసింది. సెక్షన్ 18 మానవ హక్కుల సంఘాలకు తిరుగులేని అధికారాలిస్తోందని తేల్చిచెప్పింది. ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు తగిన సవరణలు అవసరమని సూచించింది. దానిపై కేంద్రం ఇంతవరకూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మానవ హక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు ఆ సంఘాల పటిష్టతపై చర్చ జరిగితే, వాటికి విస్తృతమైన అధికారాలు కల్పించే దిశగా చర్యలుంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప లఖింపూర్ ఖేడి ఘటనలో ప్రధాన బాధ్యుడని ఆరోపణలొచ్చిన కేంద్ర మంత్రి కుమారుణ్ణి యూపీ పోలీసులు అరెస్టు చేయలేని దుస్థితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఆ సంఘాల బలోపేతాన్ని కోరుకోవడం దురాశే కావొచ్చు. మీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా... మా ఏలుబడి ఉన్నచోట్ల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా అని రాజకీయ పక్షాలు వాదులాడుకుంటే, సవాళ్లు విసురుకుంటే, మానవ హక్కులకు ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటే నిజంగానే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ముఖ్యంగా మానవహక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు అలాంటి వాదనలు అప్రస్తుతం. అందుకు బదులు మానవహక్కుల పటిష్టతకు సమష్టిగా ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే సాధారణ పౌరులకు మేలు కలుగుతుంది. -
China: జగమొండి డ్రాగన్
ఒకటి కాదు... రెండు కాదు. తాజాగా ఆదివారం భారత, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగినవి – ఏకంగా 13వ విడత చర్చలు. తొమ్మిది గంటల పాటు ఉన్నతస్థాయి చర్చల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో ఒక్క అంగుళమైనా పురోగతి లేదు. తప్పంతా అవతలివాళ్ళదే అన్నది ఇరుపక్షాల వాదన. వివాదాస్పదమైన కొన్ని కీలక ప్రాంతాలపై పరిష్కారం కోసం ‘నిర్మాణాత్మక సూచన’లిచ్చామనీ, చైనా ‘అంగీకరించలేద’నీ భారత సైన్యం సోమవారం ఉదయం ప్రకటించింది. చైనా మటుకు భారత్ ‘అసంబద్ధమైన, అవాస్తవిక డిమాండ్లు చేస్తోంద’ని ఆదివారం రాత్రే ఆరోపించింది. వెరసి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గమనిస్తే, డ్రాగన్ మంకుపట్టుతో వరుసగా రెండో ఏడాది, ఈ రానున్న చలికాలంలోనూ తూర్పు లద్దాఖ్లోని పర్వత ప్రాంతాల్లో భారీ సైనిక మోహరింపులు తప్పవు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఆక్సిజన్ కూడా అందని చోట, మైనస్ 30 డిగ్రీల గడ్డ కట్టే చలిలో 50 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి, పహారా కాయక తప్పదు. శత్రువుల చొరబాట్లు లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని, సరిహద్దులను కాపాడకా తప్పదు. 2020 మే నెలలో చైనా బలగాలు తమ వార్షిక విన్యాసం కోసం టిబెటన్ పీఠభూమి ప్రాంతానికి వచ్చాయి. కానీ, చైనా ఆ బలగాలను తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వైపు మళ్ళించింది. దాంతో, సరిహద్దు వెంట కీలకమైన పీపీ15, పీపీ17ఏ అనే రెండు గస్తీ పాయింట్లలోనూ రెండు దేశాల సైనికులు ఎదురుబొదురయ్యాయి. భారత్తో ప్రతిష్టంభన నెలకొంది. అప్పటికే గాల్వన్ లోయలోని పీపీ14, పాంగ్గాంగ్ త్సో సరస్సు ఉత్తరపు ఒడ్డున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం ఈ 4 గస్తీ పాయింట్లలోనూ చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, మోహరించాయి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 1976లో చైనాపై ఉన్నతస్థాయి నిర్ణాయక బృందం ‘చైనా స్టడీ గ్రూప్’ (సీఎస్జీ) ఏర్పాటైంది. ఆ బృందమే ఈ గస్తీ పాయింట్లను నిర్ణయిస్తుంది. భారత, చైనాల మధ్య ఇప్పటికీ అధికారికంగా సరిహద్దులు నిర్ణయం కాని నేపథ్యంలో ఎల్ఏసీని చైనా బలగాలు దాటడం మునుపటి ఒప్పందానికి తూట్లు పొడవడమే! ఈ వివాద పరిష్కారం కోసం గత ఏడాది మే నుంచి ఇప్పటికి సంవత్సరం పైగా భారత, చైనాల మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో వరుసగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, నేటికీ అనేక సమస్యలకు పరిష్కారం సాధ్యం కాలేదు. ఆ మధ్య ఫిబ్రవరిలో పాంగాంగ్ త్సో ప్రాంతంలో, అలాగే ఆగస్టులో జరిగిన 12వ విడత చర్చల్లో గోగ్రా ప్రాంతంలోనూ బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. రెండు పక్షాలూ కలసి సంయుక్త ప్రకటన ఇచ్చాయి. కానీ, ఈసారి చర్చల్లో అలాంటి ఏ పురోగతీ లేదు. సంయుక్త ప్రకటనా లేదు. హాట్స్ప్రింగ్స్, దెమ్చోక్, దెప్సాంగ్ లాంటి అనేక ఘర్షణాత్మక ప్రాంతాలపై అంగుళమైనా ముందడుగు పడలేదు. పైపెచ్చు, రెండు వర్గాల మధ్య విభేదాలూ బాహాటంగా బయటపడ్డాయి. సరిహద్దుల్లో ఇటీవలి ఘటనలూ ఆ విభేదాలను స్పష్టం చేశాయి. తాజా విడత చర్చలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో జరిగిన సైనిక ఘర్షణ – చైనా సైనికులను కొన్ని గంటలు నిర్బంధించడం లాంటివి బయటకొచ్చాయి. చైనా వైపు నుంచి గతంలో గాల్వన్ లోయలో భారత సైనికుల నిర్బంధ చిత్రాలు లీకయ్యాయి. అలాగే, మరో విషయం. చర్చల తర్వాత అటువైపు నుంచి చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలు చేయడం సాధారణం. కానీ, గత కొన్ని విడతల చర్చల్లో చైనా సైన్యం ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఈ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. అంటే, చైనా ఈ చర్చలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న మాట. చర్చలు నత్తనడకన సాగుతున్నా డ్రాగన్ పట్టించుకోవడం లేదన్న మాట. ఘర్షణ కొనసాగినా సరే ఆ అగ్రరాజ్యానికి కావాల్సింది ఆధిపత్యమే తప్ప, సమస్యకు పరిష్కారం కాదన్న మాట. తాజా చర్చల్లో వైఫల్యంతో భారత భూభాగంపై చైనా కొనసాగుతోందనే మాట మళ్ళీ పైకొచ్చింది. సరిహద్దులోని వాస్తవ పరిస్థితిని దాచకుండా దేశానికి చెప్పాలంటూ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు భారత ప్రధాని మోదీని ప్రశ్నించాయి. మరోపక్క భారత – చైనా సరిహద్దు ప్రాంతాల్లో అతి కష్టంపై ఈ మాత్రమైనా వెసులుబాటు దక్కినందుకు భారత్ సంతోషించాలంటూ చైనా కటువుగా మాట్లాడుతోంది. సైనిక అధికార ప్రతినిధి చేసిన ఆ అహంభావపూరిత ప్రకటనలో సామరస్యం కన్నా బెదిరింపు ధోరణే కనిపిస్తోంది. రాజు కన్నా మొండివాడు బలవంతుడట. మరి, ఏకంగా రాజులు, రాజ్యాలే మొండివాళ్ళయితే? చైనా అనుసరిస్తున్న వైఖరి అలాంటిదే. అగ్రరాజ్యం ఆ వైఖరిని మార్చుకుంటే... భారత సరిహద్దులో, తద్వారా ఉపఖండంలో శాంతి వెల్లివిరుస్తుంది. కానీ, చైనా లక్ష్యం మాత్రం వాస్తవాధీన రేఖను తమకు అనుకూలంగా ఏకపక్షంగా మార్చేసుకోవడమే. మరీ ముఖ్యంగా, దెప్సాంగ్ మైదానప్రాంతాల్లో ఆ పని చేయాలన్నది పొరుగు దేశం లోలోపలి ఆకాంక్ష. డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరే అందుకు సూచిక. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. మూసుకుపోని చర్చల ద్వారాన్ని తెరిచే ఉంచాలి. మలి విడత చర్చలకు సిద్ధమవుతూనే, చైనా ఆటలకు అడ్డుకట్ట వేసే వ్యూహరచన చేయాలి. మన భూభాగం అంగుళమైనా వదలకుండా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చే మార్గాలూ అన్వేషించాలి. కానీ, జగమొండి డ్రాగన్కు ముకుతాడు వేయడం మాటలు చెప్పినంత సులభమేమీ కాదు. అదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. -
ముసురుకుంటున్న చీకట్లు!
కరెంట్ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్ కొనుగోలు రేట్ల మోత. యూనిట్కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకొని, విద్యుత్ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. మన దేశంలో 135 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లలోని బొగ్గు, లిగ్నైట్ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి లేకుండా పోయింది. మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్లో దాదాపు సగం థర్మల్ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్లో రోజుకో గంట, పంజాబ్లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు సైతం పవర్ కట్ బాటలోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్ తర్వాత విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. రాష్ట్రాలు విద్యుత్ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. ఇవాళ మంచినీటి లానే విద్యుత్ కూడా! విద్యుత్ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! -
శరత్కాల వెన్నెల
‘విత్ ఫ్రీడమ్, బుక్స్ అండ్ ది మూన్ హూ కుడ్ నాట్ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్వాష్ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం. ‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్పేలో ఎంత ఉంటే ఏంటి... సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు. రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది. సంవత్సరానికి ఒకసారి శరత్ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు. -
సినిమా పరివార్!
‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు. సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే. మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్ స్టేక్హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్ ప్రసిద్ధ ఫిలిమ్ మేకర్ వాల్డ్డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా? కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన. ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి. 1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్స్టార్స్గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్ హిట్ అయినట్టు! ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగింది. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్ ఫైవ్ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్ హిట్గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’. దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్మెంట్నూ, ఫోకస్ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, కేఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్ వుండేది. ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్ ఓపెనింగ్స్తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు. ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్ మేకింగ్లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్ తట్టుకోలేనంత భారీ బడ్జెట్ సినిమాలే. ఈ బడ్జెట్లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్.ఒక పావలా నిర్మాణవ్యయం. షూటింగ్ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్ సింబల్. షూటింగ్ విరామంలో స్టార్లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్లోనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు. స్టార్ పరివారాల క్యారవాన్ల కోసం, భోజనం క్యారియర్ల కోసం, సినిమా ప్రొడక్షన్ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్లైన్ టికెటింగ్’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్ కల్యాణ్కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ. స్టార్ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సొంతింటికొస్తున్న విమానం
ఎయిర్ ఇండియా తిరిగి టాటా చేతికే వచ్చేసింది. స్వాతంత్రానికి పూర్వం ప్రయివేటు రంగంలో మొదలై, తర్వాత ప్రభుత్వ పరమై... భారత దేశ కీర్తి పతాకాన్ని దశాబ్దాల పాటు విశ్వ గగన వీధుల్లో రెపరెపలాడించిన ఓ విమానయాన సంస్థ తిరిగి అదే సంస్థ చేతికి రావడం భావోద్వేగాలు రేపే ఘట్టం! ‘చరిత్ర పునరావృతమౌతుంది’ అని తరచూ వాడే నానుడి ఇక్కడ నిజమైంది. ‘భూమి గుండ్రంగా ఉండును...’ అనేది సాపేక్షంగా రుజువవుతుందన్నట్టు... కొన్ని పరిణామాలు మొదలైన చోటికే మళ్లీ చేరడాన్ని జనం వింతగా చూస్తారు. కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు లోతైన భావోద్వేగాలకు లోనవుతారు. భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, దేశంలో లైసెన్స్ పొందిన తొలి కమర్షియల్ పైలెట్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జే.ఆర్.డి) టాటా 1932లో స్థాపించిన సంస్థ, 1953లో చట్టం ద్వారా ప్రభుత్వ నిర్వహణలోకి వెళ్లి, 68 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థ చేతుల్లోకి వచ్చింది. ఎయిర్ ఇండియా నూటికి నూరు శాతం కొనుగోలుకై వచ్చిన తాజా బిడ్లలో టాటాయే అర్హమైనట్టు, చివరకు అదే ఎంపికయినట్టు కేంద్రంలోని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం)’ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే శుక్రవారం అధికారికంగా ప్రకటించడంతో దేశమంతా ఓ ఆహ్లాదపు వార్త విన్న అనుభూతి పొందింది. ఎందుకంటే, టాటా గ్రూప్కు, దాని యాజమాన్యానికి ఉన్న పేరు అటువంటిది. జాతీయతా భావాలు కలిగిన నిబద్ద కార్పొరేట్ సంస్థగా వారికున్న పేరు దేశంలో మరే సంస్థకూ లేదంటే అతిశయోక్తి కాదు! ‘టాటా గ్రూప్కు ఇస్తే మంచిది. ఎయిర్ ఇండియాను స్వీకరించి, సమర్థంగా నిర్వహించడానికి అంతకు మించిన కార్పొరేట్ ఏదీ ఇవాళ దేశంలో లేదు’ అని ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అçహ్లువాలియా రెండు రోజుల కింద చేసిన ట్వీట్ సగటు భారతీయుల భావాల ప్రతీక! చివరకు అదే జరిగింది. ‘...జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే విమానయాన సంస్థను పొంది, నిర్వహించే అవకాశం, గ్రూప్కు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తాం. ఓ ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్ది ప్రతి భారతీయుడూ గర్వించేలా చేస్తాం....’ అన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తక్షణ స్పందన గ్రూప్ సంస్థల సంకల్పాన్ని ప్రతిబింబించేదే! ఎయిర్ ఇండియాను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చేసిన తొలి యత్నం కాదిది. 2000– 01లోనే అప్పటి బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం, నిధుల సమీకరణ కోసం ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సన్నద్దమైంది. అప్పుడూ టాటా గ్రూప్తో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రయత్నం చేశాయి. కానీ, ఎందుకో వ్యవహారం కుదరలేదు. 2005 తర్వాత ప్రయివేటు రంగం పోటీని, ప్రభుత్వ రంగంలోని అలసత్వాన్ని ఎయిర్ ఇండియా తట్టుకోలేకపోయింది. తీవ్ర నష్టాలు, తీరని రుణభారంతో అల్లాడుతూ వచ్చింది. ముఖ్యంగా, 2007లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వపు యూపీఏ ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ని విలీనం చేసి, యాౖభై వేలకోట్ల రూపాయల రుణం ఇప్పించడం ద్వారా కొత్త విమానాల్ని కొనుగోలు చేయించింది. మెరుగవక పోగా, పరిస్థితి దిగజారింది. ఒక దశలో ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి వచ్చినపుడు, ఈక్విటీ ఫండ్ రూపంలో కేంద్రం ముఫ్ఫై వేల కోట్ల రూపాయలు ఇప్పించినా కోలుకోలేకపోయింది. ఎయిర్ ఇండియా వాటాలు 76 శాతం, ఎయిర్ ఇండియా–సింగపూర్ ఎయిర్పోర్ట్ టర్మినల్ సర్వీసెస్ వాటాలు 50 శాతం విక్రయించాలని 2018లో చేసిన మరో ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక నూరుశాతం విక్రయమే మార్గమని, 2019లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకిలా పరిణమించింది. 63 వేల కోట్ల రూపాయల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనడానికి వచ్చిన బిడ్లలో స్పైస్జెట్, టాటా చివరి వరకూ మిగిలి, టాటా సన్స్ అంతిమ విజేత అయింది. టాటాలకు ఇంతటి శక్తి, కీర్తి ఒక రోజులో వచ్చినవి కాదు. నూరేళ్లకు పైబడ్డ సంకల్ప ఫలం. నిబద్ధత, దేశభక్తి, అంకితభావం కలగలిసిన కృషి ఫలితం. చిన్న గుండుసూది తయారీ నుంచి పెద్ద విమానాలు నడుపడం వరకు దేశాభివృద్ధిలో టాటాల భాగస్వామ్యం అగణితమని చెప్పాలి. నడమంత్రపు సిరితో తూగుతున్న నయా కార్పొరేట్లతో పోలిస్తే టాటాలది ఈ దేశపు మట్టితో, గాలితో, పౌరుల బతుకుతో ముడివడ్డ ప్రగతి! 1991 మార్చి 23న, జేఆర్డీ టాటా, బాంబేహౌజ్లోని తన కార్యాలయంలో కూర్చొని ‘నేను రిటైర్ అవాలని, ఆ స్థానంలో నిన్ను ప్రకటించాలని నిర్ణయించాను’ అని వెల్లడించడానికి దశాబ్దం ముందు నుంచే రతన్ టాటా మది నిండా ఆలోచనలున్నాయి. టాటా విస్తరణ బ్లూప్రింట్ అప్పటికే తయారైంది. ఒకవైపు దేశ ఆర్థికస్థితి, మరోవైపు ప్రభుత్వ విధానాల్ని గమనంలోకి తీసుకొని ఆయనీ బ్లూ ప్రింట్ రూపొందించారు. లైసెన్స్రాజ్లో ఎదురైన చేదు అను భవాలు ఆయనకు తెలుసు. టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి సంస్థల్ని అగ్రస్థానంలో నిలప డానికి ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు! ఉత్పత్తి, ధరలు, విక్రయాలు, మార్కెటింగ్, ఎగుమతి–దిగుమతులు, విదేశీ మారకం.... ఇలా, అప్పట్లో ప్రతిదీ నియంత్రణే! అన్నీ అధిగమించి, దేశ ప్రయోజనాల విషయంలో అణుమాత్రం రాజీపడకుండా సంప్రదాయ–నెమ్మది పంథా నుంచి టాటా గ్రూప్ను ప్రపంచ పోటీ తట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. టాటా అంటే, ఇవాళ విశ్వస నీయత కలిగిన బ్రాండ్! దేశ ప్రగతి సౌధంలో ఒక్కో ఇటుకై నిలిచిన పెద్ద గోడ! ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ అనివార్యమైతే... అందుకు టాటాయే యోగ్యం! దేశానికి అదే ప్రయోజనకరం. -
మంచుకొండల ఆత్మఘోష
మంచుకొండల కాశ్మీరం మళ్ళీ రక్తమోడుతోంది. బరి తెగించిన ముష్కరుల దాడుల్లో అమాయకులు బలి కావడం పెరిగింది. కొద్దిరోజులుగా జమ్మూ – కశ్మీర్లో జరుగుతున్న వరుస సంఘటనల్లో అక్కడి అల్పసంఖ్యాక వర్గాలైన కశ్మీరీ పండిట్లు సహా అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రతాదళాల ప్రాణత్యాగం చేయడం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. కానీ, గడచిన ఆరేళ్ళ గణాంకాల లెక్కలు తీస్తే తీవ్రవాదులు రూటు మార్చి, భద్రతాదళాల బదులు ఇప్పుడు పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. పేరున్న వ్యక్తులు, కశ్మీర్ లోయలోని స్థానికేతరులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కశ్మీరీ పండిట్ అయిన ప్రసిద్ధ కెమిస్ట్ సహా ముగ్గురు పౌరులను మంగళవారం కొద్ది గంటల వ్యవధిలో తీవ్రవాదులు కాల్చి చంపడం అందుకు ఉదాహరణ. వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ సహా పార్టీలన్నీ దీన్ని ఖండించాయి. ఆ రక్తపుమరకలు ఆరక ముందే గురువారం శ్రీనగర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి తుపాకీలు ధరించిన ఆగంతుకులు చొచ్చుకు వచ్చి, టీ తాగుతున్న ప్రిన్సిపాల్పై, మరో కశ్మీరీ పండిట్ టీచర్పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి, ప్రాణాలు తీయడం మరో తీరని విషాదం. జనంతో మమేకమయ్యేందుకు కేంద్ర మంత్రులు పలువురు తొమ్మిది వారాల కార్యక్రమం చేస్తున్న సమయంలో గత పది రోజుల్లో ఇలా ఏడుగురు పౌరులు బలి కావడం గమనార్హం. బీజేపీ తెచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టంతో కొత్తగా ఏర్పడ్డ ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ నెలలోనే హోమ్ మంత్రి అమిత్ షా కూడా పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలో ఈ వరుస దాడులు, హత్యలు కలవరపరిచే విషయాలు. కాశ్మీరం కళకళలాడుతోందంటున్న పాలకుల మాటల్లోని డొల్లతనానికి నిదర్శనాలు. మతపరంగా అస్థిరతను సృష్టించి, అల్పసంఖ్యాకుల్లో భయాన్ని పెచ్చరిల్ల జేయడం కోసమే ఈ దాడులని సాక్షాత్తూ డీజీపీయే చెప్పారు. 2016 నుంచి గత ఆరేళ్ళలో కశ్మీర్లో ఇదే ధోరణి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉత్తిపుణ్యానికి 27 మంది పౌరుల ప్రాణాలు తీవ్రవాదపు కోరలకు చిక్కాయి. తాజాగా ఆరెస్సెస్కు పని చేస్తున్నారంటూ సుప్రసిద్ధ ఫార్మసిస్టునూ, పోలీసు ఇన్ఫార్మర్ అంటూ బీహారీ వీధి వర్తకుణ్ణీ – ఇలా రకరకాల నెపాలతో తీవ్రవాదులు దారుణకాండకు దిగుతున్నారు. పాకిస్తాన్లోని లష్కరే తాయిబాకు ఇక్కడి మరోరూపమైన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’, మరోపక్క ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ– కశ్మీర్’ లాంటి వేర్వేరు సంస్థలు ఈ దారుణాలకు పాల్పడింది తామేనని ప్రకటించుకోవడం నివ్వెరపరుస్తోంది. నిఘా వర్గాల వైఫల్యాన్ని పట్టి చూపిస్తోంది. కశ్మీర్లోని ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా కొన్నాళ్ళుగా దాడులు జరుగుతున్నాయి. ఏ వర్గంతోనూ సంబంధం లేని అమాయకులను చంపడం ద్వారా దశాబ్దాలుగా అక్కడ శాంతియుతంగా జీవిస్తున్న అల్పసంఖ్యాకులను భయపెట్టడమే పరమార్థం. పండిట్లు కశ్మీర్కు సత్వరమే తిరిగొచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఓ వెబ్సైట్ను ప్రారంభించడమే తీవ్రవాదుల దృష్టిలో ఆ ఫార్మసిస్టు చేసిన తప్పు. కశ్మీర్కు తిరిగిరావాలనుకొనే వారిని హెచ్చరించడమే వారి ఉద్దేశం. ‘స్థానికులు కానివారెవరూ ఇక్కడకు రాకూడదు, జీవనం గడపకూడద’న్న అవాంఛనీయ ధోరణికీ, అసహనానికీ ఈ ఘటనలు సూచిక. ఈ నీచప్రయత్నాలకు ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రోజువారీ వ్యవహారంగా మారిన హింసకు ముగింపు పడేలా చూడాలి. ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వానికి తావివ్వకుండా పగ్గాలను తమ చేతిలోనే ఉంచుకోవాలనే ధోరణినీ సత్వరమే వదిలించుకోవాలి. ఏళ్ళూపూళ్ళ కశ్మీర్ సమస్యకు పైపూతలు పనికిరావు. లోతైన పరిష్కారమే శరణ్యం. జరుగుతున్న ప్రతి దాడీ, పోతున్న ప్రతి ప్రాణం గుర్తుచేస్తున్నది అదే! ఇలాంటి పరిస్థితుల్లోనూ ముష్కరుల చేతిలో ఫార్మసిస్టు మఖన్లాల్ బింద్రూ అసువులు బాసినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు గుండె దిటవుతో మాట్లాడిన తీరు జాతికి స్ఫూర్తిదాయకం. ‘ఆ దుండగులు తుపాకులతో ఈ దేహాన్ని కాల్చవచ్చు. కానీ, మా ఆత్మనూ, మా ఈ స్ఫూర్తినీ చంపలేరు’ అన్న ఉద్వేగభరితమైన మాటలు చాలాకాలం చెవులలో రింగుమంటాయి. తీవ్రవాదం పంజా విసిరిన 1990లలో ఎందరో పురిటిగడ్డను వీడిపోయినా, హిమసీమలనే అంటిపెట్టుకొని బతుకుతున్న ఇలాంటి కొద్ది కశ్మీరీ పండిట్ల కుటుంబాల నైతిక స్థైర్యం అనుసరణీయం. అక్కడ ఇప్పుడు అందరికీ కావాల్సిన పరమౌషధం అదే. మరి, అంతటా భయం, అందరిపైనా అనుమానం నెలకొన్న కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి పాలకులు ఏం చేస్తున్నారు? జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికో, ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికో ‘నయా కశ్మీర్ నిర్మాణం’ నినాదాలను కేంద్ర పాలకులు ఎత్తుకుంటే సరిపోతుందా? కశ్మీర్పై పాకిస్తాన్ కుయుక్తులు, ఈ దాడులతో ప్రజలకు చేరవేయదలుచుకున్న భావం ఏమిటో తెలుస్తూనే ఉంది. కానీ, అదే సమయంలో కశ్మీర్లో నిద్రాణంగా ఆగ్రహం, బాధ, ఆవేదన గూడుకట్టుకున్నాయన్నది వాస్తవం. ఆ సంగతి గుర్తించాలి. భారత అనుకూల భావాలు తగ్గుతూ, వేర్పాటువాదానికి ఊతం అందుతున్న తీరును ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలను కలుపుకొని, తగిన చర్యలు చేపట్టాలి. జూన్లో ప్రధాని జరిపిన అఖిలపక్షం తదుపరి కర్తవ్యాన్ని చేపట్టాలి. అలా కాకుండా, పెట్టుబడులు, పర్యాటకులు, రోడ్ల నిర్మాణం, విద్యుదుత్పత్తి లాంటి మాటలు చెప్పి, గణాంకాల లెక్కలతో కశ్మీర్ శాంతిసౌభాగ్యాల సీమ అని నమ్మబలికితే అది ఆత్మవంచనే. కశ్మీరే కాదు... దేశం దాన్ని ఎంతోకాలం భరించలేదు. -
ఫేస్... బుక్ అయ్యిందా?
కాలం కలసిరాకపోవడమంటే ఇదేనేమో! కొద్ది రోజులుగా ఫేస్బుక్ సంస్థకు తగులుతున్న వరుస ఎదురుదెబ్బలు చూస్తే అంతే అనిపిస్తోంది. ఒకప్పుడు తాను పని చేసిన ఈ సంస్థ దృష్టిలో యూజర్ల ‘‘భద్రత కన్నా లాభమే ముఖ్యం’’ అంటూ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని నుంచి ఈ ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఆమె బయటపెడుతున్న వేలాది రహస్యపత్రాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అది చాలదన్నట్టు సోమవారం 6 గంటలపైగా ఫేస్బుక్, దాని సేవలైన వాట్సప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్లు సాంకేతిక సమస్యలతో ఆగిపోయాయి. దీనిపై రకరకాల ఊహాగానాలొచ్చినా, కమ్యూనికేషన్ టూల్స్లో లోపాలతో పాటు కాన్ఫిగరేషన్ మార్పు వల్లే ఇది తలెత్తిందని నిపుణుల మాట. 2008 తర్వాతెన్నడూ లేనంతటి ప్రపంచవ్యాప్త స్తంభన, తాజా ఆరోపణలతో సంస్థకు గట్టి దెబ్బే తగిలింది. ట్విట్టర్, టిక్టాక్, టెలిగ్రామ్లకి చాలామంది మారిపోవడంతో, ఫేస్బుక్ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. 6 గంటల్లో ఫేస్బుక్ 10 కోట్ల డాలర్ల ఆదాయం నష్టపోయినట్లు అంచనా. వీటికన్నా జనం ఫేస్బుక్లో ఎక్కువసేపు గడపడానికి విద్వేషపోస్టుల్ని ప్రోత్సహిస్తోందన్న వివాదం మరింత నష్టాన్ని కలిగించనుంది. ఫేస్బుక్ నైతికతపై ఆరోపణలు చేసింది హార్వర్డ్లో ఎంబీఏ చేసిన మంచి వక్త, అల్గారిథమ్స్లో దిట్ట, పేటెంట్లు పొందిన స్త్రీ. గూగుల్, పిన్రెస్ట్లలో పనిచేసిన ఆమెకు ఫేస్బుక్లో జనం ఏ చూడాలనేది కంప్యూటర్ కోడ్ ఎలా ఎంపిక చేస్తుందో, లోతుపాతులేమిటో బాగా తెలుసు. అందుకే, ఫేస్బుక్ తప్పులను ప్రపంచానికి చాటిన ఈ 37 ఏళ్ళ మాజీ ఉద్యోగిని మంగళవారం అమెరికన్ సెనేట్ కామర్స్ సబ్ కమిటీ ముందు చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలకు అంత విలువ. ప్రోడక్ట్ మేనేజర్గా ఫేస్బుక్లో పనిచేసి, మే నెలలో బయటకొచ్చిన ఆమె కొన్ని వేల అంతర్గత పత్రాలను ప్రసిద్ధ పత్రిక ‘వాల్స్ట్రీట్ జర్నల్’తో కొన్నాళ్ళుగా అజ్ఞాతంగా పంచుకుంటూ వచ్చారు. వాటి ఆధారంగా ఫేస్బుక్ హాని గురించి ఆ పత్రిక వరుస కథనాలు వేస్తూ వచ్చింది. ఇక, ఆదివారం హాగెన్ తన పేరు, రూపం బయటపెడుతూ ఇచ్చిన ‘60 మినిట్స్’ టీవీ భేటీ దానికి పరాకాష్ఠ. ఫేస్బుక్కు 289 కోట్ల మంది, వాట్సప్కు 200 కోట్ల పైచిలుకు మంది యూజర్లున్నారని ఓ లెక్క. ఈ ఏడాది మొదట్లో వాట్సప్ కోసం ఫేస్బుక్ తీసుకొచ్చిన సరికొత్త ప్రైవసీ విధానం ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇంటిగుట్టు బయటపెట్టిన పత్రాలను బట్టి చూస్తే, ఇప్పటి దాకా అందరూ అనుమానిస్తున్న అనేక అంశాలు నిజమే అనిపిస్తోంది. లక్షలాది ఉన్నత వర్గాల యూజర్ల కోసం మాత్రం ఫేస్బుక్ కొంత సడలింపులతో కూడిన రహస్య నిబంధనలు పాటిస్తోంది. అలాగే, టీనేజ్ అమ్మాయిల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇన్స్టాగ్రామ్ వ్యవహారంతో తమ శరీరాకృతి పట్ల నిరాశకు లోనైన దుఃస్థితి. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి. 2018లో అల్గారిథమ్లో మార్పు ద్వారా ఫేస్బుక్ విద్వేషాలకు తావిచ్చింది. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలవేళ తప్పనిసరై, పోస్టింగులపై కొన్ని అడ్డుకట్టలు పెట్టింది. తీరా ఎన్నికలవగానే వాటిని ఎత్తేయడమే ఈ జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై మూకదాడికి దారితీసింది. 34 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్లున్న మనదేశంలో బీజేపీ, ఆరెస్సెస్లవి, లేదా వాటితో అనుబంధమున్నవీ అయిన ఫేస్బుక్ ఖాతాలు, గ్రూపులు, పేజీలు భయాన్ని పెంచేలా, ముస్లిమ్ వ్యతిరేక కథనాలను ప్రమోట్ చేస్తున్నాయట. రాజకీయ సందేశాలకు అడ్డాగా మారిన ఆ సంగతి హాగెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవన్నీ దిగ్భ్రాంతికరం. అందరికీ ముఖపుస్తకమన్నట్టు పేరు పెట్టుకున్న సంస్థ ఇలా ముఖం చాటేసే పనులు చేయడం విడ్డూరమే. తాజా వివాదంపై ఫేస్బుక్ సీఈఓ జుకెర్బెర్గ్ మొదట్లో మౌనంగా ఉన్నా, చివరికి ఖండించక తప్పలేదు. వాదనల మాటెలా ఉన్నా, ఇప్పటికే అనేక వివాదాలకు లోనై, ఏకస్వామ్య పోకడలకు జరిమానాల పాలై, నిశిత పరిశీలనలో ఉన్న కంపెనీ ఫేస్బుక్. ఉద్యోగులే బయటకొచ్చి, ఆరోపణలు చేయడమూ దానికి కొత్త కాదు. కానీ, ఇలాంటి వేదికలు ప్రపంచాన్ని శాసించేంత శక్తి మంతం కావడం, ఈ సామాజిక వేదిక ఆగితే కమ్యూనికేషన్ ఆగే పరిస్థితి రావడం అభిలషణీయం కానే కాదు. ప్రపంచం ప్రతి క్షణం సెర్చింగ్కు వాడే గూగుల్, ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడరైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటివి కూడా రేపు ఇలా అనుకోని స్తంభనకు గురైతే ప్రపంచ సమాచారప్రసారం, వాణిజ్యాల పరిస్థితేమిటన్నది సీరియస్గా ఆలోచించాల్సిందే. అయితే, ప్రపంచమొక కుగ్రామమై, సమాచారమే అత్యంత శక్తిమంతమైనదిగా మారిన వర్తమానంలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలే వద్దనగలమా? ఫేస్బుక్పై ఇన్ని ఆరోపణలు చేసిన హాగెన్ సైతం ఆ సామాజిక వేదికను నిషేధించమనడం లేదు. దాని పనితీరును పర్యవేక్షిస్తూ, రోజూ 160 కోట్ల పైచిలుకు మందికి అది చూపించే సమాచారంపై మార్గదర్శనం చేయమని సూచిస్తున్నారు. ఈ విషయంపై మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. అదే సమయంలో మార్కెట్ దిగ్గజాలు చేసే తప్పొప్పుల్ని నిర్భయంగా బయటపెడుతూ, సమాజానికి కావలి కాస్తున్న హాగెన్ లాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరమూ ఉంది. ఇంత విషం నిండిన సంస్థలో పనిచేస్తున్నామా అనిపిస్తే, రేపు మరింత మంది ఉద్యోగులు ఆమె లాగా అలారమ్ మోగించవచ్చు. దాచేస్తే దాగని ఆ సత్యాలన్నీ బయటకు రావాలి. బెదిరింపులతో వారి నోరు నొక్కేస్తే – సత్యం వధింపబడుతుంది. ధర్మం చెరలోనే మగ్గుతుంది. పారాహుషార్! -
చివరి కాంగ్రెస్ మొఘల్?
చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్. పాపం, ఆయన పేరుకే చక్రవర్తి. పట్టుమని పదిమైళ్ల విస్తీర్ణం కూడా లేని షాజహానాబాద్ (పురానా ఢిల్లీ)కే ఆయన అధికారం పరిమిత మైంది. ఒకపక్క మరాఠాల దూకుడు, మరోపక్క ఈస్టిండియా కంపెనీ పెత్తనం. ఉర్దూ గజల్స్ రాసుకోవడం మినహా ఏ నిజ మైన అధికారం లేని పరిస్థితి ఆయనది. ‘న కిసీ కి ఆంఖ్ కా నూర్ హూ’ (నేను ఎవరి కంటి వెలుగునూ కాదు) అనే అద్భు తమైన గజల్తో తన నిస్సహాయతను అలంకరించుకున్నాడు. మధ్యయుగ భారత చరిత్రలో మొఘల్ రాజు వంశం ఎంతటి జగత్ ప్రసిద్ధమో, ఆధునిక ప్రజాస్వామ్య భారతంలో కాంగ్రెస్ పాత్ర కూడా అంతటి ప్రభావవంతమైనది. డెబ్బయ్యేళ్ల భారత రిపబ్లిక్లో యాభయ్యేళ్లు కాంగ్రెస్దే అధికారం. మరో ఇరవై సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి నెహ్రూ – గాంధీ కుటుం బాన్ని వేరు చేయడం ఇప్పటిదాకా సాధ్యం కాలేదు. ఈ సాధ్యం కాకపోవడమనే బలహీనతే ఆ పార్టీని ఇప్పుడొక రాచపుండులా కెలుకుతున్నది. ఈ పుండు మానదనీ, పార్టీ అవసాన దశకు చేరు కున్నదనీ సర్వేసర్వత్రా ఒక అభిప్రాయం ఇప్పుడు బలపడు తున్నది. ఆ పార్టీకి ఇప్పుడు అధినేత ఎవరు? గత సాధారణ ఎన్ని కల్లో ఓడిపోయిన వెంటనే రాహుల్ కాడి పారేశారు. ఎవరెంత బతిమాలినా, బామాలినా అలకవీడలేదు. గత్యంతరం లేక మరోసారి సోనియా గాంధీయే అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్నది. కానీ వాస్తవానికి పార్టీ దైనందిన కార్యక్రమా లన్నిటికీ ఆమె దూరంగా ఉంటున్నారట. కీలక నిర్ణయాలన్నీ రాహుల్గాంధీయే తీసుకుంటున్నారనీ, ఆయనకు కొంతమంది కన్సల్టెంట్లు, మార్కెటింగ్ నిపుణులు, సోదరి ప్రియాంక సహక రిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ శ్రేణుల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. బాధ్యత లేని అధికారాన్ని కాంగ్రెస్ పార్టీలో రాహుల్గాంధీయే చెలాయిస్తున్నారు. పంజాబ్ సంక్షోభం చల్లా రకముందే తలెత్తిన ఛత్తీస్గఢ్ తలనొప్పి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఢిల్లీకి వచ్చారు. ‘సోనియాజీ ఢిల్లీలో లేనట్టున్నారు’ అనే నర్మగర్భమైన కామెంట్ను చేశారట. ‘సోనియాగాంధీ పాత్ర ఏమీ లేదు, అంతా రాహుల్జీనే చూస్తు న్నార’నేది బఘేల్ కామెంట్కు తాత్పర్యమని చెప్పుకుంటు న్నారు. ఆఖరి మొఘల్కు నెత్తిన కిరీటం తప్ప చేతిలో అధికారం లేదు. ఈ కాంగ్రెస్ మొఘల్కు మకుటం లేదు గానీ మంత్ర దండం చేతిలోనే ఉన్నది. ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ వయసు నూట ముప్పయ్యారు. పార్టీల లెక్కల్లో మంచాన పడాల్సిన వయసేమీ కాదు. అమెరికా, ఐరోపాల్లో రెండొందల యేళ్లు దాటిన పార్టీలు కూడా నిండు యవ్వనంతో పరుగులు పెడుతున్నాయి. మరి మన కాంగ్రెస్కు ఎందుకు ఈ దుర్గతి? ప్రస్తుత పార్టీ నాయకత్వమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పంజాబ్, ఛత్తీస్గఢ్ అంతఃకలహాల నేపథ్యంలో కపిల్ సిబల్ ఒక ఆసక్తి కరమైన ప్రకటన చేశారు. ‘మేము జీ–ట్వంటీత్రీ (గ్రూప్ ఆఫ్ 23) నిజమే. కానీ, జీ–హుజూర్ 23 కాదని’ పార్టీ నాయకత్వా నికి పరోక్ష హెచ్చరికను పంపించారు. ఇంతమంది సీనియర్ నాయకులు ఒక గ్రూప్గా ఏర్పడి నాయకత్వాన్ని అభిశంసిం చడం గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో రెండుసార్లు పార్టీ చీలిన సందర్భాలు ఇందుకు మినహాయింపు. గత సంవత్సరం ఆగస్టులో ఇరవై మూడు మంది కాంగ్రెస్ ప్రముఖ నాయకులు సోనియాగాంధీకి ఒక లేఖ రాశారు. వారిలో కొందరు కోర్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఉద్దేశ పూర్వకంగానే మీడియాకు కూడా లేఖ లీకయింది. పార్టీ నాయ కత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని వారు ఆ లేఖలో ప్రస్తావించారు. వరుస పరాజయాలను, పార్టీ ప్రభావం తగ్గిపోతున్న విషయాలను వారు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవలసిన అవస రాన్ని గుర్తించాలని వారు అధినేత్రికి సూచించారు. లేఖపై సంత కాలు చేసిన వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, ఆనంద్శర్మ తదితర 23 మంది సీనియర్లు ఉన్నారు. ఈ లేఖ రాయడానికి కొన్ని నెలలు ముందుగానే కొందరు ముఖ్యనేతలు సోనియాగాంధీని కలిశారట. లేఖలో సంతకాలు చేయని ఒకరిద్దరు ప్రముఖులు కూడా ఈ బృందంలో ఉన్నారు. రాహుల్గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవనీ, బలవంతంగా అతడి నాయకత్వాన్ని రుద్దితే కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయ మని ఆమెకు స్పష్టంగా చెప్పారట. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రారంభిస్తే గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకు రావచ్చునని కూడా ఆమెకు చెప్పారని వినికిడి. అయితే పుత్ర ప్రేమ వలన ఆమె వీరి రాయబారాన్ని తిరస్కరించారు. పుత్రుని మనసులో ఏముందో ఆమెకు తెలుసు. ఓటమి బాధ్యత నుంచి దృష్టి మళ్లించడానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడే గానీ, దానికి శాశ్వతంగా దూరం కావడం ఆయన ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. కొంతకాలం పాటు ఇలా గడిపేస్తే, అధ్యక్ష పదవిని స్వీకరించవలసిందిగా తనపై పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ, జరిగిన పరిణామం ఆయన అంచనాకు యాంటీ క్లైమాక్స్. ‘జీ–23’ లేఖ బహిర్గతం కాగానే రాహుల్జీ ఆగ్రహోదగ్రుడయ్యాడట. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టా రని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నిర్ణయాలన్నీ కన్సల్టెంట్ల సహకారంతో తానే తీసుకోవడం మొదలుపెట్టారు. లేఖ రాసిన సీనియర్లను పూర్తిగా దూరం పెట్టారు. ఏ సమస్య ఎదురైనా కోర్ కమిటీ కూర్చొని చర్చించడం కాంగ్రెస్ పార్టీలో ఒక ఆనవాయి తీగా ఉండేది. 2004లో తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ప్రతి శుక్రవారం సాయంత్రం కోర్ కమిటీ సమావేశమై ముఖ్య విషయాలను చర్చించేది. పార్టీ అధ్యక్షురాలు, ప్రధాన మంత్రి సహా ఐదారుగురు ముఖ్యనేతలు ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. తుది నిర్ణయం పార్టీ అధినేత్రిదే అయినా, అది ఉమ్మడి నిర్ణయంగా బయటకు వచ్చేది. ఇప్పుడు ఆ కోర్ కమిటీ ఊసేలేదు. వేర్వేరు భాషలు, చరిత్రలు, సంస్కృతులు, భిన్నమైన సామాజిక జీవనాలతో కూడిన బహువిధమైన మన దేశం కాలక్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలిగింది. భార తీయత అనే ఏకత్వ సాధనకు ఎన్నో పరిణామాలు దోహద పడ్డాయి. అన్నిటిలోకి ముఖ్యమైనది భారత జాతీయ కాంగ్రెస్. విరుద్ధ ప్రయోజనాలున్న శక్తులను ఉమ్మడి ప్రయోజనమైన స్వాతంత్య్ర సాధనకోసం ఏకతాటిపై నడిపిన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ అనుభవమే స్వాతంత్య్రం తర్వాత కూడా జాతి నిర్మాణానికి దోహదపడింది. ఆ అనుభవమే కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘకాలం పాటు దుర్భేద్యంగా నిలబెట్టగలి గింది. భారతదేశంలో ఎన్ని విరుద్ధ వర్గాలున్నాయో కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని వర్గాలుండేవి. వారితో నిరంతరం సంభా షించి, సమన్వయపరిచి, అసంతృప్తిని చల్లార్చే ఒక ఎకోసిస్ట మ్ను కాంగ్రెస్ పార్టీకి చరిత్ర బహూకరించింది. అతివాద – మితవాద భావజాల శక్తులను కూడా మిళితం చేసుకునే మధ్యే వాద మార్గం కాంగ్రెస్ ఎకోసిస్టమ్లో ఒక ప్రధానాంశం. సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా కాంగ్రెస్ ఎకోసిస్టమ్ బీటలు వారడం ప్రారంభమైంది. రాహుల్ చురుకైన పాత్ర పోషించడం ప్రారంభమైన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. శరద్ పవార్, మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి వంటి బలమైన నాయకులను దూరం చేసుకొని కాంగ్రెస్ పార్టీ మూడు పెద్దరాష్ట్రాలను పోగొట్టుకున్నది. వరుసగా రెండు సార్లు యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పోషించిన పాత్రను కాంగ్రెస్ సరిగ్గా అర్థం చేసుకోలేక పోయింది. జనాకర్షణ గల ప్రాంతీయ నేతలను తక్కువ అంచనా వేసి కాంగ్రెస్ నాయకత్వం భారీ మూల్యం చెల్లించింది. ఇప్పుడు ఆ పార్టీ ప్రభావం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. అదృష్టం కలిసివస్తే మొదటి స్థానం, లేదంటే రెండో స్థానమైనా దక్కించుకోగలిగిన రాష్ట్రాలు ఒక డజన్ కూడా లేవు. బలంగా ఉన్న పంజాబ్ను అపరిపక్వ రాజకీయ వ్యూహంతో కాల దన్నుకున్నారు. దళిత ముఖ్యమంత్రి ప్రయోగం కనీసం ఒక ఏడాది ముందు చేసి ఉంటే ఏమైనా ఫలితముండేదేమో! ఎన్నికలకు మూడు నెలల ముందు ఆయన చేయగలిగేది ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా గెలిపించిన తెలంగాణను ఒక ఊసర వెల్లి రాజకీయవేత్తకు ఫ్రాంచైజ్ కింద ఇచ్చేసినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ బండారం బయటపడితే అక్కడ భంగపాటు తప్పదు. ఇక మిగిలినవి కేరళ (కూటమి), కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, అస్సాం మాత్రమే. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి ఉన్న లోక్సభ స్థానాలు 172. మొత్తం లోక్సభ సీట్ల సంఖ్యలో ఇది 31 శాతం మాత్రమే. ఇక్కడే కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది. జాతీయ పార్టీకి తక్కువ, ప్రాంతీయ పార్టీకి ఎక్కువ అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిస్థితి వల్ల నష్ట పోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు. మొత్తం భారత ప్రజా స్వామ్య వ్యవస్థకే అది గుదిబండగా తయారైంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే, ప్రతిపక్షం లబ్ధిపొందడానికి కాంగ్రెస్ అడ్డంకిగా మారింది. ప్రధాన ప్రతి పక్షంగా ఉన్నందువల్ల నరేంద్రమోదీ ప్రత్యామ్నా యాన్ని జనం కాంగ్రెస్లోనే వెతుకుతారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్గాంధీ నాయకుడు. రాహుల్ వర్సెస్ మోదీ పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి జ్యోతిష్యుడో, సెఫాలజిస్టో కావ లసిన అవసరం ఉండదు. ఎవరైనా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టి మిగిలిన పార్టీలన్నీ ఏకం కావడం ఒక ప్రత్యామ్నాయం. గతంలో కేసీఆర్ చెప్పిన ‘ఫెడరల్ ఫ్రంట్’ వంటిదన్నమాట. మమతా బెనర్జీ ప్రస్తుతానికి ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు కన్పిస్తున్నారు. కానీ, కలగూరగంప ప్రాంతీయ పార్టీ లను జాతీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు అంగీకరించగలరా? ఆ ప్రభుత్వ సుస్థిరతపై నిశ్చింతగా ఉండగలరా?... చాలా కష్టం. రాకెట్ల మాదిరిగా దూసుకుపోతున్న నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, ప్రజా సంపదను శ్రీమంతులకు దోచిపెట్టడం యథేచ్ఛగా సాగి పోతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం ఒక విదూషక పాత్రలో ఒరిగిపోవడం ఒక విషాదం. ఇప్పటికిప్పుడు ఒక సరైన ప్రత్యా మ్నాయం తయారు కావాలంటే ఉన్న మార్గాలు రెండు. ఒకటి: తెల్లారే సరికల్లా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలంగా విస్త రించాలి. ప్రస్తుత నాయకత్వాన్ని తొలగించి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. ఇది జరగాలంటే అల్లావుద్దీన్ దగ్గర్నుంచి అద్భుత దీపాన్ని అరువు తెచ్చుకోవాలి. ఇది అసాధ్యం. రెండు: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్న ఎకోసిస్టమ్ను పునరుద్ధ రించుకుంటూ ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడాలి. అలా ఏర్పడా లంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అదృశ్యం కావాలి. వైద్య రంగంలో ఇటువంటి సందర్భాలకోసం ‘మెర్సీ కిల్లింగ్’ అనే తరుణో పాయం ఉన్నది. చావలేక, బతకలేక, బతకడానికి హింస పడు తున్న రాజకీయ పార్టీలకు దీన్ని వర్తింపజేసే అవకాశాలు లేవు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నిస్సహా యుడైతే కావచ్చు కానీ గొప్ప దేశభక్తుడు. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి ఊపిరిపోసినవాడిగా ఆయన పేరు నిలబడుతుంది. గొప్ప ఉర్దూ కవిగా కూడా ఆయన చిరస్థాయిగా నిలబడి పోతాడు. భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ మనుగడ సాగించలేకపోతే చివరి కాంగ్రెస్ మొఘల్గా రాహుల్ గాంధీ ముద్రపడతారు. రాహుల్ దేశభక్తిని కూడా శంకించ వల సిన పనిలేదు. తాతముత్తాతల దగ్గర్నుంచీ దేశభక్తుల కుటుంబం వారిది. బహదూర్ షాకు కవిత్వ వ్యాపకమున్నట్టు రాహుల్కు ఏవైనా ఉన్నాయేమో పెద్దగా తెలియదు. కొన్ని ఉన్నా అవి జనా నికి పెద్దగా అర్థంకావు. పార్లమెంట్ సమావేశాల్లో ఆవేశపూరి తంగా మాట్లాడి, ఆ వెంటనే తన ప్రధాని దగ్గరకు వెళ్లి ఆయన్ని లేపి గట్టిగా ఆలింగనం చేసుకోవడం వంటి హాబీలు కొన్ని ఆయ నకు ఉన్నాయి. అయితే వాటి ప్రయోజనం ఏమిటి? పరమార్థ మేమిటి అనేవి సామాన్యులకు ఎప్పటికీ అర్థం కావు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కలిసొచ్చిన అదృష్టం?
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకు అంటే ఇదేనేమో! దేశరాజధాని నుంచి తమ సామ్రాజ్యాన్ని పంజాబ్ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇంతకు మించిన మంచి అవకాశం రాదు. సరిగ్గా నెల రోజుల్లో ప్రత్యర్థుల తప్పులతో పంజాబ్లో తమ పార్టీ ఇంతగా పుంజు కుంటుందని చివరకు ‘ఆప్’ సైతం ఊహించలేదు. కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు, ఆ పార్టీ సీఎం అమరీందర్ రాజీనామా, పీసీసీ పీఠమెక్కినంత వేగంగానే సిద్ధూ కిందకు దిగిపోతానని అలకపాన్పు ఎక్కడం– అన్నీ ఇప్పుడు ‘ఆప్’కు కలిసొస్తున్నాయి. సర్వశక్తులూ కేంద్రీకరిస్తే, మరో అయిదు నెలల్లో పంజాబ్లో జెండా ఎగరేయడం కష్టమేమీ కాదని ఆ పార్టీకి అర్థమైంది. ‘ఆప్’ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండురోజుల పంజాబ్ పర్యటన, కురిపించిన హామీలే అందుకు నిదర్శనం. జూలై ఆఖరున జరిపిన తమ ఆఖరి సర్వేలో పంజాబ్లో 20 శాతం మేర కాంగ్రెస్ ప్రజాదరణ తగ్గిందనీ, ‘ఆప్’ ఆదరణ పెరిగిందనీ సాక్షాత్తూ అమరీందరే చెబుతున్నారు. మరోపక్క సీ–ఓటర్ లాంటి జాతీయ సంస్థల సర్వే సైతం ఈసారి ‘ఆప్’ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని అంచనా వేస్తోంది. ఆ పార్టీ, దాని అధినేత దూకుడు పెంచింది అందుకే. అధికారంలోకొస్తే గృహ వినియోగానికి 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, సర్జరీలు, ఢిల్లీ తరహాలోనే పంజాబ్లో 16 వేల గ్రామక్లినిక్లు అంటూ రెండో భారీ వాగ్దానం చేశారు. నిజానికి ‘ఆప్’ దళిత కార్డూ వాడదలిచింది. కొత్త సీఎంగా చన్నీ రూపంలో కాంగ్రెస్ ముందే ఆ కార్డు వాడడంతో ‘ఆప్’కు ఓ అస్త్రం పోయింది. అయితేనేం, కాంగ్రెస్ దళిత ప్రేమ కేవలం ఎన్నికలయ్యే దాకా మూడు నెలల ముచ్చటేనని ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్లా హిందూ ముద్రకు దూరం జరగలేదు. మధ్యేమార్గ జాతీయవాదపార్టీగా హిందూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తోంది. ఈసారి సిక్కులకే సీఎం పీఠమని తేల్చేసింది. అలా అన్ని వర్గాలనూ తనవైపు తిప్పుకొనే పనిలో ‘ఆప్’ ఉంది. కాంగ్రెస్కు సొంత ఇంటిని సర్దుకోవడంతోనే సరిపోతోంది. కొత్త సీఎం చన్నీతో గురువారం 3 గంటల పైగా చర్చ తర్వాత, పీసీసీ పీఠానికి రాజీనామా విషయంలో సిద్ధూ రాజీకి వచ్చినట్టు వార్త. కానీ, వరుస అనాలోచిత, దుందుడుకు చర్యలతో ఆయనకూ, కాంగ్రెస్ పార్టీకీ జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ మొత్తంలో చివరకు గెలుపు ఎవరిదన్నది పక్కన పెడితే, నష్టపోయింది నిస్సందే హంగా కాంగ్రెస్సే. బుధవారం అమిత్షానూ, గురువారం అజిత్ దోవల్నూ కలిసిన అమరీందర్ బీజేపీలో చేరట్లేదని అన్నారు. కానీ, ఏదో సామెత చెప్పినట్టు పెళ్ళిలో నాగవల్లి నాటి మాట సదస్యా నికి ఉంటుందా అన్నది ప్రశ్న. రానున్న అయిదు నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. సీనియర్లను ఘోరంగా అవమానిస్తున్న కాంగ్రెస్ను మాత్రం వదిలేస్తున్నట్టు అయిదు దశాబ్దాల పైచిలుకు రాజకీయ అనుభవజ్ఞుడు అమరీందర్ సింగ్ కరాఖండిగా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధూను గెలవనిచ్చేది లేదనీ మరోసారి తొడగొట్టారు. ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పుట్టి ముంచేలా ఉన్నాయి. పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సత్తా తెలిసిన విశ్లేషకులు చెబుతున్న జోస్యం ఒకటే – సిద్ధూను ఆయన మట్టి కరిపించడం ఖాయం. కాంగ్రెస్ అధిష్ఠానానికి తప్పు తెలిసొచ్చేలా చేయడమూ ఖాయం. అదే నిజమైతే, కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని చేజేతులా వదులుకున్నట్టు అవుతుంది. పంజాబ్లో బీజేపీ, దాని మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్కు ఎలాగూ ఇప్పుడు పెద్ద బలం లేదు గనక, ‘ఆప్’కు ఇప్పుడు అన్నీ మంచి శకునములే. అలాగని ‘ఆప్’కు సమస్యలే లేవని కాదు. గత రెండేళ్ళుగా ఆ పార్టీ పంజాబ్ విభాగం అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. గెలుపు వాసనలు పసిగట్టిన అసంతృప్త నేతలు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. అకాలీదళ్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనల్లోని లోటుపాట్లను ప్రచారోపన్యాసాల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ‘ఆప్’కు ‘ఒక్క ఛాన్సివ్వండి’ అంటున్నారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో ‘ఆప్’ 20 సీట్లు గెలిచి, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అప్పట్లో స్థానికులెవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించక, లోకల్ సెంటిమెంట్లో దెబ్బతింది. ఈసారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. ఇంకా సస్పెన్స్ ముడి విప్పకపోయినా, ఈసారి సిక్కు వర్గీయులే తమ అభ్యర్థి అని జూన్లోనే ప్రకటించేసింది. ఢిల్లీ తరహా పాలన, ఉచిత పథకాల హామీలే ఆసరాగా పైకి ఎగబాకాలని చూస్తోంది. అయితే, ఢిల్లీలో ‘ఆప్’ పాలనంతా అద్భుతమనీ నమ్మలేం. కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రచారానికి తెగ ఖర్చు చేస్తోంది. బీ కేటగిరీ రాష్ట్రమైన ఢిల్లీలో తలసరి ప్రభుత్వ ప్రకటనల ఖర్చు దేశమంతటిలోకీ అత్యధికమట. రాజధాని పేపర్లలో రోజూ ఏదో ఒక మూల ‘ఆప్’ ప్రకటన ఉండాల్సిందేనంటున్నారు పరిశీలకులు. కరోనా కాలంలో రాజధాని వదిలి గ్రామాలకు వెళ్ళిన వలస జీవుల ఇంటి అద్దెలు తామే కడతామన్న తలకు మించిన హామీలూ ‘ఆప్’ అధినేత ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ పంజాబ్లోనూ వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. రేపు నిజంగా అధికారం లోకి వస్తే అవన్నీ ఆచరణ సాధ్యమా అన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నదే వర్తమాన కాంగ్రెస్ సర్కారుపై సొంత నేత సిద్ధూ సహా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. వచ్చిన సానుకూలతను ‘ఆప్’ వాడుకోవడం వరకు ఓకే కానీ, ఓట్ల కోసం చందమామను చేతిలో పెడతామంటేనే చిక్కు. ఎందుకంటే, ఓటర్లకిచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఢిల్లీలో ఆ పార్టీకి ఇప్పటికే తెలిసొచ్చింది. తస్మాత్ జాగ్రత్త! -
‘శ్రవణ’ మేఘాలు
చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం. పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించే వాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లలకు కథల మీద కథలు చెప్పేవారు. పూర్వీకులు తాము తెచ్చిన వేటను విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది. కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్ గూటెన్బెర్గ్ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూప మిచ్చాడు. మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు. అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని మింగేసింది. పెరిగిన సాంకేతికత ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి. అంధులకు ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్ బుక్స్) సంకల్పించాడు థామస్ ఆల్వా ఎడిసన్ 1877లో. కానీ 1952లో న్యూయార్క్ కేంద్రంగా గల క్యాడ్మాన్ రికార్డ్స్ వాళ్లు కవి డైలాన్ థామస్ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్ మార్కెట్ పరిధిని 2019లో 2.67 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు. మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది. అయితే స్వీడన్కు చెందిన ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ ‘స్టోరీటెల్’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ దిగ్గజం అమెజాన్ కూడా ‘ఆడిబుల్’ పేరుతో ఈ ఆడియో బుక్స్ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లి్లష్, హిందీకే పరిమితమైంది. చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది. -
శస్త్ర చికిత్సే, లేపనాలు సరిపోవు
జ్వరం రోగం కాదు. రోగ లక్షణమే! రోగమేదైనా, దాని సంకేతంగా జ్వరం వస్తుంది. జ్వరం తగ్గే మందు మాత్రమే ఇస్తే... రోగం నయం కాదు. రోగాన్ని గుర్తించాలి, చికిత్స చేయాలి, మళ్లీ రాకుండా చూడాలి. అలా జరుగకపోతే అది ప్రాణాంతకంగానూ మరొచ్చు! మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న దోరణి అలాగే ఉంటోంది. సదరు దుర్మార్గాలను వేటికవే ఘటనలుగా చూస్తున్నాం. విడివిడిగా çపరిశీలిస్తున్నాం. పొడిపొడిగా స్పందిస్తున్నాం. ఒక నిందితుడు పోలీసు ‘ఎన్కౌంటర్’లో చనిపోతేనో, మరో నిందితుడిని రైల్వే ట్రాక్పై ‘ఆత్మహత్య’గా చూసో ‘తగిన శాస్తి జరిగిందిలే!’ అని సరిపెట్టుకుంటున్నాం. సమస్య మూలాలపై దృష్టి పెట్టట్లేదు. కారణాల్ని లోతుగా అన్వేషించట్లేదు. ఇంతటి జఠిల సమస్యకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాల్ని కనుక్కోవడం లేదు. నిర్మాణాత్మక ప్రయత్నమే జరగట్లేదు. పౌరులుగా మనం సరే, దర్యాప్తు సంస్థలు, సమాజ శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, న్యాయపాలకులు.. అందరూ, అక్కడక్కడ ఒకటీ, అరా ‘దిశ’ చట్టం వంటి ప్రయత్నాలు తప్ప నిర్దిష్ట కార్యాచరణే లేదు. అందుకే, ఈ ఘాతుకాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, లైంగిక దాడులు, హత్యోదంతాల తీరు తెన్నులు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఆయా నేరాలే ఘోరంగా ఉన్నాయంటే, అవి జరిగే తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవి వెలుగు చూస్తున్న కేసులే, ఇంకా రికార్డులకెక్కని దాష్టీకాలెన్నో రెట్లు! భయంగొలిపే వాతావరణం బలపడుతోంది. ప్రమాద సంకేతమేమంటే, అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరచడమో, హతమార్చడమో చేసిన సందర్భాలు అనివార్యంగా వెలుగు చూస్తు న్నాయి. అత్యాచారానికే పరిమితమైన ఘాతుకాల్లో, ఎవరైనా దైర్యం కూడగట్టుకొని పోలీసుస్టేషన్ గడప తొక్కిన చోట రికార్డుల్లోకి వస్తున్నాయి. అలా జరక్క, లోలోపల లొంగదీసుకునే, బెదిరించి అత్యాచారాలకు పాల్పడే, నిరవధికంగా–నిరాఘాటంగా లైంగిక హింసను కొనసాగిస్తుండే, నిత్య క్షోభకు గురిచేస్తుండే... వెలుగు చూడని ఉదంతాలెన్నో! ఎందరు వివాహిత మహిళలు, పెళ్లికాని యువతులు, బాలికలు ఆగని కన్నీటితోఅలాంటి మూగవేదనను అనుభవిస్తున్నారో? అదంతా లెక్కలకెక్కని అజ్ఞాత హింస! ఈ అమానుష హింసకి మూలాలెక్కడున్నాయి? పురుషాధిక్య సమాజంలో మ(మృ)గాడై పుట్టిన పసికందు పెంపకం నుంచి, అప్పుడే మొదలయ్యే లింగ వివక్ష నుంచి, వాడి నడతపై దృష్టి పెట్టని తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం నుంచి, అసహజ వాతావరణం– పరిసరాల వరకు అంతటా మూలాలున్నాయి. స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలోనే పెద్ద లోపముంది. లోపభూయిష్ట విద్యా విధానంలో విలువలు కొరవడ్డ ‘చదువు’తో అలవడే కుసంస్కారం నుంచి, నిర్హేతుకమైన నిరుద్యోగిత నుంచి, తిని తిరగడం అలవడ్డ ఆంబోతుతనం వరకు అన్నీ యువతలో హింసా దృక్పథాన్ని పెంచి పోషించేవే! పేదరికం, ప్రేమరాహిత్యం, కుటుంబ కలహాలు, ఎప్పుడో ఒకటీ, రెండు చిన్న నేరాలు చేస్తే సరిదిద్దని నిర్లక్ష్యపు వ్యవస్థ... ఇవన్నీ దారితప్పిన యువ తలో లైంగిక నేర ప్రవృతిని పెంచేవే! ఉద్రేకాన్ని, ఉన్మాదాన్ని, లైంగిక హింసను ప్రేరేపించేలా బాధ్య తెరుగక తీసే సినిమా, ఓటీటీ–టీవీ సీరియళ్ల ‘విష(య)ం’ కూడా కారణమే! విచ్ఛల విడిగా దొరికే మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్ హింసాప్రవృత్తికి ప్రధాన వనరు! వీటికి తోడు.. మార్కెట్ ప్రపం చంలో దూసుకువచ్చిన స్మార్ట్ఫోన్ వ్యసనం, హద్దూ–అదుపూ లేని శృంగార సైట్ల (పోర్న్) ప్రభావం మగైనా, ఆడైనా... యువతను తప్పుదారి పట్టిస్తోంది. తెలిసి చేసే ఉద్దేశ్యపూర్వక దురాగతాలు కొందరివైతే, అవగాహన లేక, తెలియకుండా ఉచ్చులో పడేవారెందరో! పిల్లల పట్ల వాంఛతో రగిలే ఉన్మాదుల్ని (పీడోఫైల్) గుర్తించి, వారిని సరిదిద్దే వ్యవస్థే మనదగ్గర లేదు. ఉత్తరప్రదేశ్, హాత్రస్లో దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం జరిపి, రక్తమోడే స్థితిలో ఆమెను పొలాల్లో పారవైచిన దుర్మార్గానికి ఏడాది. చికిత్స పొందుతూ మరణిస్తే.... కుటుం బాన్ని అడ్డుకుంటూ అర్ధరాత్రి బలవంతపు అంత్యక్రియలు జరిపించిన పాలనా వ్యవస్థ మనది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, రక్షక వలయం మధ్య భయంగా నేటికీ విచారణ హాజరవుతున్న తలిదండ్రులకు, ఇంకెన్నాళ్లో ఈ కన్నీటి వేధన తెలియదు. దాదాపు దేశవ్యాప్తంగా జరిగే ఈ దాష్టీకాలకు కుటుంబ నేపథ్యం, పెరిగిన క్రమం, సామాజిక పరిస్థితులు ఓ కారణమైతే వ్యవస్థాగత లోపాలు మరో బలమైన కారణం! ప్రభుత్వాల వైఖరి, దర్యాప్తు వ్యవస్థల నిర్వాకం, న్యాయస్థానాల్లో అసాధారణ జాప్యాలు వెరసి దురాలోచనాపరుల్లో భయంలేనితనాన్ని పెంచుతున్నాయి. చట్ట మంటేనో, తీర్పులంటేనో, చివరకు శిక్షలంటేనో భయంతో మాత్రమే ఈ నేరాల్ని నియంత్రించ గలుగుతాం. కానీ, అదే ఉండటం లేదు. ఇదంతా పరిగణనలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ చట్టానికి కేంద్రమింకా అనుమతించలేదు. వారు లేవనెత్తిన సందేహాలకు ఏపీ సమాధానా లిచ్చినా, అనుమతి కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ లోపున ఆ చట్టపు స్పూర్తిని అమలుపరుస్తూ, దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం, కాలపరిమితితో నేరాల సత్వర దర్యాప్తు–విచారణ జరిపించడం ఆశావహ పరిణామం. వెంటనే అనుమతించి, కేంద్రమీ చట్టాన్ని దేశవ్యాప్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పౌరసమాజం ముగ్గురూ ఏకతాటిపైకి వచ్చి లైంగిక హింసను శాశ్వతంగా నిర్మూలించే పూనిక వహించాలి. అప్పుడే మహిళకు రక్ష! -
మన పరీక్షలు ఎంత ‘నీట్’?
దేశంలో బోలెడు పోటీ ఉన్న ప్రవేశపరీక్షలవి. ఒకటి వైద్యవిద్యకూ, మరొకటి ఇంజనీరింగ్ విద్యకూ సంబంధించినది. ప్రతిష్ఠాత్మకమైన ఆ చదువుల్లో చేరడానికి అర్హత నిర్ణయించే ‘నీట్’, ‘జేఈఈ’ - ఈ జాతీయ స్థాయి పరీక్షలు రెండూ తాజాగా వివాదాస్పదం కావడం విచిత్రం. దేశ మంతటా ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలంటూ ప్రతిష్ఠాత్మకంగా పెట్టుకున్న ఎగ్జామ్లు ఇవి. కానీ, వీటిలో సైతం దొడ్డి దారిన పాస్ చేసి, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం సంపాదించి పెట్టేలా అక్రమార్కులు విజృంభించడం నివ్వెరపరుస్తోంది. మన పరీక్షావిధానాల్లోని డొల్లతనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. అటు జేఈఈ, ఇటు నీట్ రెండింటిలో అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు దిగాల్సి రావడం ఈ ప్రవేశపరీక్షల విశ్వసనీయతను వెక్కిరిస్తోంది. ప్రాసంగికతను ప్రశ్నిస్తోంది. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం 2012లో మొదలుపెట్టినప్పటి నుంచి ‘నీట్’ వివాదాలు రేపుతూనే ఉంది. ఈ జాతీయ ప్రవేశపరీక్ష విద్యార్థుల ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అంతరాలను బట్టి కొందరికి వరం, మరికొందరికి శాపమనే వాదన చాలా కాలంగా నడుస్తోంది. కొన్నేళ్ళుగా తమిళనాడు, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో వివాదమూ నెలకొంది. అప్పట్లోనే పలువురు విద్యార్థుల ఆత్మహత్యలతో తమిళనాట ‘నీట్’ రద్దు ఎన్నికల వాగ్దానమూ అయింది. ఇటీవల వారం రోజుల్లో ముగ్గురి ఆత్మహత్యతో ఈ నెల 13న అక్కడి కొత్త డీఎంకె ప్రభుత్వం తమిళనాట నీట్ను మినహాయిస్తూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. పన్నెండో తరగతి మార్కులే వైద్యవిద్యలో ప్రవేశానికి అర్హతగా తీర్మానించింది. రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప, ఈ బిల్లు కాస్తా చట్టం కాదు. ఇంతలోనే పులి మీద పుట్రలా ఈ దొడ్డిదారి పాస్ వివాదం. ఎవరైనా సరే రూ. 50 లక్షలిస్తే చాలు... అసలు విద్యార్థి బదులు వేరెవరినో కూర్చోబెట్టి, ‘నీట్’ రాయించి, మెడికల్ కాలేజీ సీటు ఇప్పించే నాగపూర్లోని కోచింగ్ బండారం ఈ నెల 22న సీబీఐ బయటపెట్టింది. కథ కొత్త మలుపు తిరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జేఈఈ (మెయిన్స్), వాటిలో పాసైన 2.5 లక్షల మంది ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో చేరేందుకు రాసే జేఈఈ (అడ్వాన్స్డ్)కు సైతం ఇప్పుడు బురదంటుకుంది. ఈ ఏడాది నుంచి 4 దశలైన ఈ పరీక్షలో నాలుగోది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). పేరొందిన జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న ఇందులోనూ అక్రమాలు జరిగాయని సీబీఐ తేల్చింది. 15 లక్షలిస్తే, విద్యార్థి పరీక్ష రాసే కంప్యూటర్లోకి సుదూరంగా ఎక్కడి నుంచో సాంకేతికంగా జొరబడి, జవాబులు రాసి పాస్ చేయించే మోసాలు బహిర్గతమయ్యాయి. ఇలా అక్రమాలకు పాల్పడ్డ విద్యార్థుల్లో కొందరిపై ఎన్టీఏ తాజాగా మూడేళ్ళు నిషేధం పెట్టింది. పట్టుబడని దొంగల సంఖ్య పరమాత్ముడికి ఎరుక. వెరసి, జేఈఈ, నీట్ – రెండూ లోపరహితం కాదని తేలిపోయింది. ఏటా లక్షలాది విద్యార్థులు అనేక నెలలు శ్రమించి ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ ఏడాది 15.3 లక్షల మంది నీట్, 9.4 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాశారు. ఎంతటి ప్రతిభావంతులైనా ఈ ఎంట్రన్స్ టెస్టుల్లో పాసైతేనే, కోరుకున్న వైద్య, ఇంజనీరింగ్ వృత్తివిద్యాభ్యాసం చేయగలుగుతారు. అందుకోసం అనేక మంది లక్షలు పోసి మరీ కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల కన్నా తక్కువుండి, గ్రామీణ ప్రాంతాల్లో తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు నీట్ ఓ ప్రాణాంతక పోటీగా మారింది. సమాజంలోని ఉన్నత సామాజిక, ఆర్థిక వర్గాలకే ఎంబీబీఎస్ సీటొచ్చే పరిస్థితి. విభిన్న వర్గాలకు చోటు లేకుండా పోతోంది. తమిళనాడు సర్కార్ నియమించిన కమిటీ ఆ సంగతే తేల్చింది. 2013లో ఒకసారి నీట్ జరిగినా, సుప్రీమ్ కోర్టు నిషేధంతో కొన్నేళ్ళు ఆగింది. 2016లో కోర్టు ఉత్తర్వుల సవరణతో 2017– 18 విద్యా సంవత్సరం నుంచి నీట్ మళ్ళీ దేశవ్యాప్తంగా తప్పనిసరి తంతుగా మారింది. అప్పటి నుంచి నీట్ నుంచి మినహాయింపు కోసం తమిళనాడు లాంటి రాష్ట్రాలు ప్రయత్నిస్తూనే వస్తున్నాయి. బాగా చదివి, పన్నెండో తరగతిలో మార్కులు తెచ్చుకున్నవారు సైతం దేశవ్యాప్త సిలబస్, కోచింగ్ అంతరాలతో నీట్ సరిగ్గా రాయలేక, ఒత్తిడి, ఆందోళనతో కొన్నేళ్ళుగా ఎందరో పసివాళ్ళు ప్రాణాలు తీసుకోవడం కన్నీరు తెప్పిస్తోంది. ప్రతిభకు పట్టం కట్టడం, అందరికీ సమాన అవకాశాల కల్పన, విద్యార్థుల ప్రాణాలు – ఇలా ఎన్నో ముడిపడ్డ సున్నిత అంశమిది. నీట్ను యథాతథంగా కొనసాగించ రాదు. అలాగని, రాష్ట్రానికో రకం సిలబస్, ఒక్కోచోట ఒక్కోరకం మార్కుల కేటాయింపున్న బహుభాషా దేశంలో, పన్నెండో తరగతి మార్కులతోనే దేశవ్యాప్త ప్రవేశాలు నిర్ణయించాలని పట్టుబట్టడమూ సరైనది కాదు. వైద్యం రాష్ట్ర జాబితాలోది కాగా, విద్యను రాష్ట్ర పరిధి నుంచి ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడిలా నీట్తో కేంద్రం పెత్తనమన్నది విమర్శ. ఇరుపక్షాలూ సమగ్రంగా ఆలోచించి, తగు చర్యలు చేపట్టాలి. బలహీన వర్గాలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం, లేదంటే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు రిజర్వు చేయడం లాంటివి చేయవచ్చు. ఈ పరీక్షలు, మార్కులే ప్రపంచం కాదనీ, బతకడానికి నీట్ ఒక్కటే మార్గం కాదనీ పెద్దలు, టీచర్లు పిల్లలకు ధైర్యమివ్వాలి. ప్రభుత్వమేమో జేఈఈలో అక్రమాలకు ఎథికల్ హ్యాకర్లతో అడ్డుకట్ట వేయాలి. పారదర్శకమనే ఆన్లైన్ పరీక్షలే ‘డిజిటల్ ఇండియా’ వేళ అక్రమాలకు నెలవైనప్పుడు వ్యవస్థ నిద్ర మేల్కోవాల్సిందే. ఎందుకంటే, ఇది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు. కోట్లాది కుటుంబాల ఆకాంక్షలకు విపత్తు. -
తెలంగాణ విమోచన దినోత్సవం.. వద్దా ఉత్సవం?
‘మా తెలంగాణలో మేము కనీసం విమోచనో త్సవాలు జరుపుకోవడా నికి కూడా స్వేచ్ఛ లేదా?మేం ఇంకెంత కాలం ఆంధ్రోళ్ళ పాలనలో ఉండాలి? మేమేమైనా బానిసలమా?’ ఇలాంటి మాటలెన్నో మాట్లాడింది ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమ నాయకునిగా చెప్పుకునే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వచ్చి ఏడేళ్ళు గడుస్తున్నా– నిధులు, నీళ్లు, నియామకాలు కాదు కదా... కనీసం స్వేచ్ఛగా తెలంగాణ విమోచన దినోత్సవా లకు కూడా వీలు లేని దుస్థితి దాపురించింది. ప్రత్యేక తెలంగాణలో అధికారికంగా విమోచ నోత్సవాలు జరపలేక పోవడానికి కారణమేంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కాబట్టి, ఇక విమోచనోత్సవాల అవసరమేంటన్నది కేసీఆర్ ఉవాచ. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది కదా, మరి పంద్రాగస్టు వేడుకలు ప్రతి ఏటా జరుపుకోవట్లేదా? మజ్లిస్ పార్టీకి తెలంగాణ విమోచనోత్సవాలు జరపడం ఇష్టం లేదు కాబట్టి అధికారంలో ఉన్నా జరుపలేని దుస్థితి మాది. కారు మాత్రమే మాది, స్టీరింగ్ ఒవైసీది’అని కేసీఆర్ చెప్పివుంటే కొద్దిగా గౌరవం అయినా ఉండేదేమో! ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినవన్నీ వాస్తవాలని నమ్మి, రెండుసార్లు అధికారం కట్ట బెట్టిన తర్వాత కవులు పాడుకుంటున్నట్లుగా ‘ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడబ్బ సొమ్మ యిందిరో తెలంగాణ’ అన్నదానికి వచ్చే సమాధానం: ఒక కుటుంబం పాలైంది. సమైక్య పాలనలో లాగే రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. పైగా బోనస్గా ఆర్టీసీ కార్మికుల, ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలు పెరిగాయి. సమైక్య పాలనలో కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ అయినా ఉండేది. ఏ ధర్నా చౌక్ కేంద్రంగా తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగాయో, ఆ ధర్నాచౌక్నే ఎత్తేస్తే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రజలది. తెలంగాణ విమోచనోత్సవాలు జరపాలని ఒక్క బీజేపీ తప్ప, కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి గొప్పగా చెప్పే కమ్యూనిస్టులు సైతం చేస్తున్నది ఏమీలేదు. బహుశా తెలంగాణ ప్రజలకు వారు చేసినంతగా అన్యాయం ఇంకెవరూ చేయలేదన్న సత్యాన్ని గ్రహించి కాబోలు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే, తెలంగాణ (హైదరాబాద్ సంస్థాన్) ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 దాకా రాకపోడానికి నిరంకుశ నిజాం, రజా కార్లతోపాటు కమ్యూనిస్టులు కూడా కారణం. దేశానికి స్వాతంత్య్రం రానున్న తరుణంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా భారత కమ్యూనిస్టు పార్టీ తన వైఖరిని మార్చుకుంది. అప్పటిదాకా కేవలం నిజాం, రజా కార్ల నుంచి బాధలు అనుభవించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు కమ్యూనిస్టుల నుంచి మరిన్ని కష్టాలు పెరిగాయి. హైదరాబాద్ను భారతదేశంలో కలిపేసుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలి; భారత సైన్యాలు హైదరాబాద్లో అడుగు పెట్ట కుండా అడ్డుకోవాలి అంటూ నాటి ఆంధ్ర కమ్యూనిస్టు నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఒక ప్రకటన విడుదల చేయడంతోపాటు, స్వతంత్ర హైదరాబాద్ ఏర్పడాలనే నినాదం కూడా ఇచ్చారు. వీరి అండతో రజాకార్లకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. హైదరాబాద్ సంస్థాన సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు నిజాం ప్రయత్నించాడు. కమ్యూనిస్టు పార్టీ వైఖరిని అప్పటి మరో కమ్యూనిస్టు ముఖ్య నాయకుడు రావి నారాయణ రెడ్డి తీవ్రంగా నిర సించారు. ‘ఆంధ్ర నాయకత్వం బాధ్యులుగా ఉన్న అన్ని వేళల్లోకల్లా పోలీసు చర్య తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, భారత మిలిటరీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనేది పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతం లాంటిదని అంటే తప్పేమీ కాదు’ అని తన ‘తెలంగాణ నగ్న స్వరూపం’ అన్న డాక్యుమెంట్లో నిర్మొహమా టంగా స్పష్టం చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ దృఢచిత్తంతో వ్యవహరించి సైనిక చర్య చేపట్టి ఉండకపోతే ఇటీవటి కాలందాకా కశ్మీర్ కొరకరాని కొయ్యగా తయారైనట్లుగానే, హైదరాబాద్ సంస్థానం కూడా మారేదేమో! తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తే అదేదో మైనారిటీలకు వ్యతిరేకమైనదిగా, మతతత్వంగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ చేయడం గర్హనీయం. ఇదే టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో తెలంగాణ విమో చనోత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తే అడ్డురాని మతతత్వం బీజేపీ డిమాండ్ చేస్తే ఎలా అవు తుందో తెలియజేయాలి. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరచడం పక్కన పెట్టాలి. -వ్యాసకర్త బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ -
కలాం సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ ఈ ఘటన
ఎంతోమంది గాంధీ పేరు పెట్టుకున్నా, గాంధీజీకి నిజమైన వారసుడు ఏపీజే అబ్దుల్ కలాం!. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. అందుకు ఉదాహరణలుగా నిలిచిన కొన్ని ఘటనలు ఉన్నాయి. కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా రాష్ట్రపతి భవన్లో కొన్ని రోజుల పాటు ఉండగా వారి భోజన, వసతి ఖర్చులన్నీ కలాం లెక్కకట్టి చెల్లించారు. గాంధీ తన కుటుం బంతో సహా దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చేస్తున్నప్పుడు మిత్రులు, అభిమానులు కస్తూర్బాకు నగలను బహుమతులుగా ఇచ్చారు. ‘ఇవి నా కష్టార్జితం కాదు. కావున ఇవి సమాజానికే ఉపయోగపడాలి’ అని దక్షిణాఫ్రికా లోనే ఒక ట్రస్టును ఏర్పరచి, దానికే వాటిని గాంధీ ఇవ్వడం జరిగింది. కలాం డీఆర్డీఓ డైరెక్టరుగా ఉన్నప్పుడు ఆయనకు వీణ నేర్చుకోవాలనిపించింది. ఒక సామాన్య ఉద్యోగి భార్య (కళ్యాణి) చిన్న పిల్ల లకు ఇంట్లోనే వీణ నేర్పిస్తోందని తెలిసి, కలాం వెళ్లారు. ఈ వయసులో మీకెందుకు వీణ అంటూనే నెలకు వంద రూపాయల ఫీజు అని చెప్పి, విద్యార్థులతో కలసి కూర్చోమంది. ఒక రోజు ఇంటి దగ్గర పనిమీద ఇంటికివచ్చిన ఉద్యోగి తన ఇంట్లో కలాంను చూశాడు. అప్పుడు విషయం తెలిసిన కళ్యాణి మీరు ముందే మాకు ఈ విషయం చెప్పి ఉంటే మేమే మీ ఇంటికి వచ్చి రోజూ చెప్పేవాళ్ళం, ఫీజు కూడా తీసుకునే వాళ్ళం కాదు అని బాధపడుతుంటే– ‘అందుకే నేను మీ ఆయనకు తెలియ కుండా వచ్చి నేర్చు కుంటున్నాను. విద్యార్థి ఎంత గొప్పవాడైనా టీచర్ దగ్గర శిష్యుడిగానే ఉండాలన్నారు కలాం. సంస్కృతం కష్టం అని గాంధీ అందరు పిల్లల్లాగే తలచి పెర్షియన్ భాష క్లాసులో కూర్చుంటే, కృష్ణశంకర పాండ్యా అనే సంస్కృత ఉపాధ్యాయుడు ‘సంస్కృతం నేర్చుకోవడంలో ఏదైనా కష్టముంటే నా దగ్గరకు రా’ అన్నారు. ఆ రోజు పాండ్యా వద్ద సంస్కృతం నేర్చుకొని ఉండకపోతే భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవగలిగేవాడిని కాదన్నారు గాంధీ. కలాంను విశాఖపట్నం జిల్లా చోడవరం తీసుకొచ్చి సుమారుగా 10 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఆయన ప్రసంగం వినిపించాలని ‘కల’గన్నాను. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిం చడంతో అది ‘కల’గానే మిగిలిపోయింది. ఎప్పుడూ ‘కలలు’ వాటి సాకారం గురించి మాట్లాడే ఆయన నా ‘కల’ మాత్రం సాకారం కాకుండానే భగవంతుడిలో లీనమైపోయారు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం ఈ–మెయిల్: mnaidumurru@gmail.com -
లెక్క పెద్దది... ఉద్దీపన చిన్నది
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం – ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ఇది ప్రాథమికం. ఒకప్పటి ప్రభువులైనా, ఇప్పటి ప్రభుత్వాలైనా తప్పక చేయాల్సిన పని ఇదే. కరోనా కష్టకాలం ఆ సంగతి పదే పదే గుర్తుచేస్తోంది. అందుకే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా రూ. 6.28 లక్షల కోట్ల అంకెతో ముందుకు రావడం కాస్తంత సంతోషమే. ఇప్పటికే కరోనా మొదటి ఉద్ధృతిలో, తరువాత ఒకటికి, మూడుసార్లు రకరకాల ఉద్దీపన ప్యాకేజీలు, ఉపశమన చర్యలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి ఇలా ముందుకు వచ్చింది. దెబ్బతిన్న అనేక రంగాలకు అండగా నిలవడం కోసం తాజా కరోనా రెండో ఉద్ధృతి అనంతరం తొలిసారిగా చర్యలు ప్రకటించింది. ఆర్థికరంగం అప్పుడప్పుడే కోలుకుంటోందని భావిస్తున్న వేళ కరోనా సెకండ్ వేవ్ నిజానికి పెద్ద దెబ్బే కొట్టింది. అంతకు మించి అనిశ్చితి నెలకొనేలా చేసింది. అందుకే, ఆర్థికమద్దతు అందించాలంటూ ‘రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధాన సంఘం’తో సహా పలువురు ప్రభుత్వాన్ని కోరారు. ఆ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఎనిమిది కీలక చర్యలతో తాజా ఉద్దీపన ప్యాకేజీ వచ్చింది. అయితే, ఇందులో నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేదేమీ లేదు. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణసంస్థలకు ప్రభుత్వహామీగానే ప్యాకేజీలో ఎక్కువ ఉండనుంది. నిజానికి, కరోనాతో గత ఏడాది మార్చిలో తొలిసారి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన రెండు రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులనూ, పట్టణ, గ్రామీణ నిరుపేద ప్రజానీకాన్నీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రకటన అది. ఆ తరువాత నుంచి ‘ఆత్మనిర్భర్ ప్యాకేజీ’ లాంటి రక రకాల పేర్లతో కేంద్రం నుంచి వివిధ సందర్భాల్లో ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలు వస్తూ వచ్చాయి. వాటి పేర్లు, ఉద్దేశాలు ఏమైనప్పటికీ – కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికంటూ లక్షల కోట్లు లెక్కల్లో కనిపించాయి. తాజా ఉపశమన చర్యలూ దానికి కొనసాగింపే! కరోనాతో దెబ్బ తిన్న రంగాలకు కొత్తగా రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం ప్రకటించారు. ఇందులో భాగంగా కరోనా మూడో వేవ్ ముప్పు నేపథ్యంలో– ఆరోగ్య రంగం మీద, అందులోనూ ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి పెట్టడం విశేషం. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు ‘నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్’ హామీ ఇవ్వనుంది. కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ పట్ల, జనం ఇబ్బందుల పట్ల ఈ మాత్రం అక్కర కచ్చితంగా హర్షణీయం. కానీ, ఆలోచనలో ఉన్నది ఆచరణలో ఎంత ప్రతిఫలిస్తుందన్నది పలువురి సందేహం. అందుకు తగ్గట్టే... విత్తమంత్రి తాజా అంకెల విన్యాసంలో కూడా నిజంగా అందేదెంత, జనం లబ్ధి పొందేదెంత అన్నది కాస్తంత లోతుగా పరి శీలిస్తే కానీ తేలవు. మొత్తం రూ. 6.28 లక్షల కోట్లలో అనేకం– బ్యాంకులు అప్పులివ్వాల్సిన రుణ హామీ పథకాలు, లేదంటే ఇప్పటికే బడ్జెట్లో చూపిన వ్యయాలు. అలాగే, ఇందులో చాలా మటుకు ఈ సంవత్సరానికి సంబంధించినవి కావు. అయిదేళ్ళ పాటు సాగే అనేక సంస్కరణల్లో అవి భాగం అనేది గమనార్హం. ఇక, ఈ ప్రకటించిన మొత్తంలో కేవలం పదో వంతే (దాదాపు రూ. 55 వేల నుంచి 60 వేల కోట్లు) ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే అదనపు వ్యయం అని ఆర్థిక నిపుణుల అంచనా. ఇక, మరికొన్నేమో ప్రస్తుతం ఉన్న పథకాలు, గతంలో ప్రకటించిన చర్యల్లోనే చేసిన మార్పులు చేర్పులు. ప్రభుత్వ అండతో వచ్చిన గ్యారెంటీలను చూసి, బ్యాంకులు మరింత రుణాలివ్వడానికి ముందుకు వస్తాయనే ఊహ మీదే ఈ ప్యాకేజీ రూపకల్పన సాగింది. అది ఏ మేరకు ఆచరణ సాధ్యమో ఇప్పటికిప్పుడు చెప్పలేం. అయితే, అంతా నిరాశే అనడానికీ వీలు లేదు. మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా వ్యాపార వేత్తలను ఆర్థికంగా ఉత్సాహపరిచే ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన’ను వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగించాలన్న నిర్ణయం ప్రశంసనీయం. అలాగే, సూక్ష్మ రుణ సంస్థల ద్వారా చిన్న కుటుం బాలకు రుణాలు అందేలా కేంద్రం బ్యాంకులకు హామీ ఇచ్చే పథకం లాంటివీ మెచ్చదగినవే. అయితే, టూరిస్టులకు ఉచిత వీసాల ప్రకటన వినడానికి బాగున్నా, వాళ్ళు రావాలంటే దేశంలో వ్యాక్సినేషన్ ఇంకా వేగంగా సాగాలి. కరోనా భయాలు లేకుండా సామాజిక ప్రశాంతత నెలకొనాలి. వ్యాపారాలు లేక కుదేలైన పర్యాటక, ఆతిథ్య రంగాల మొదలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల దాకా అన్నిటికీ మరిన్ని రుణాల బదులు నాన్–డెట్ క్యాపిటల్ సమకూర్చాలి. అలాగే, పట్టణ ప్రాంత నిరుపేదలకు నగదు బదిలీ ద్వారా తక్షణ ఆర్థిక సహకారం అందించాలి. నిజానికి, అమెరికా సహా అనేక దేశాలు ఈ కరోనా కాలంలో చేసింది అదే! ఒకపక్క మౌలిక వసతి కల్పన ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే, మరోపక్క ఆర్థికంగా అండగా నిలవడం వల్ల జనం కొనుగోళ్ళు చేస్తారు. పరిశ్రమల ఉత్పత్తులకు తగ్గట్టు అమ్మకాలు సాగి, వ్యాపారాలు పుంజుకుంటాయి. వెరసి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. మొత్తం మీద, మూడో వేవ్పై రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ... కరోనా కష్టాల కడలి నుంచి ఆర్థిక వ్యవస్థను ఒడ్డునపడేయడానికి చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. ఇవ్వాల్సింది ఎంతో ఉంది. అందాక... ఆక్సిజన్ అందక కష్టపడుతున్న వివిధ రంగాలకు ఈ తాజా ప్యాకేజీ లెక్కల్లో చూపినంత ఉద్దీపన కాకపోయినా, కాసింత ఊపిరి! కొద్దోగొప్పో ఊరట!! అయితే, ఈ ప్యాకేజీలతోనే అంతా సర్దుకుంటుందని చంకలు గుద్దుకుంటేనే కష్టం!! -
ఈ వేగం సరిపోదు
నిరుడు సెప్టెంబర్లో తగ్గుముఖం పట్టడం మొదలెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఫిబ్రవరిలో మళ్లీ అక్కడక్కడ తలెత్తుతూ చాలా తక్కువ వ్యవధిలోనే ఉగ్రరూపం దాల్చింది. గత 24 గంటల్లో కొత్తగా 53,480 కేసులు బయటపడగా 354 మంది మరణించారు. మొత్తం 84 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో... అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్య ప్రదేశ్లలో వున్నాయని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా రెండో దశ మొదలైనప్పుడు మన దేశంలోనూ ఆ పరిస్థితి తలెత్తవచ్చునని అంటు వ్యాధుల నిపుణులు పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలూ సకాలంలో మేల్కొనలేదు. పౌరులను అవసరమైనంతగా అప్రమత్తం చేయలేదు. మళ్లీ ఉత్సవాలు, వేడుకలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు మొదలుకావటం... అన్నీ మరిచి వాటిల్లో భారీయెత్తున ప్రజానీకం పాల్గొనటం ఎక్కువైంది. అదృష్టవశాత్తూ నిరుటితో పోలిస్తే మనం నిరాయుధంగా లేం. వైరస్ బారిన పడినవారికి ఏఏ పరీక్షలు జరపాలో, ఎలాంటి చికిత్స చేయాలో గతంతో పోలిస్తే మరింత స్పష్టత వచ్చింది. అంతకుమించి ఆ మహమ్మారి బారిన పడకుండా వుండేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. అయితే అనేక కారణాల వల్ల వ్యాక్సిన్లిచ్చే ప్రక్రియ మందకొడిగానే వుంది. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అత్యధికంగా పౌరులకు టీకాలు వేస్తున్న దేశం మనదే. కానీ తలసరి సగటు చూస్తే చాలా తక్కువే. ఇప్పుడిప్పుడు వైరస్ విజృంభణ గమనించాక 45 ఏళ్ల వయసు పైబడినవారికి కూడా టీకాలివ్వటం మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా కేసుల డేటాను పరిశీలిస్తే ఆ మహమ్మారి వ్యాప్తి ఎంత వేగంగా వుందో అర్థమవుతుంది. నాలుగైదు నెలల క్రితం అమెరికా, యూరప్లలో రెండో దశ మొదలైనప్పుడు సైతం దాని వ్యాప్తి ఇదే వేగంతో వుంది. సాధారణంగా ఏ దేశంలోనైనా వైరస్ వ్యాపిస్తున్న తీరు వెల్లడికాగానే ఆ వైరస్ తాలూకు జన్యు అనుక్రమణికను ఆరా తీసే పని చురుగ్గా మొదలవుతుంది. అయితే ఆ విషయంలో మనం బాగా వెనకబడివున్నాం. వెల్లడైన మొత్తం కేసుల్లో కనీసం అయిదు శాతం మేర ఈ ప్రక్రియ పూర్తి చేయగలిగితే ఆ వైరస్ ఆనుపానులన్నీ స్పష్టంగా వెల్లడవుతాయి. కానీ మన దేశంలో అది కేవలం 0.01 శాతం మాత్రమే. 2019 డిసెంబర్లో తొలిసారి చైనాలోని వుహాన్లో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచం నలుమూలలా విస్తరించే క్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది. ఒక రోగి నుంచి మరొక రోగికి వ్యాపించే సమయంలో ఆ వైరస్ ఎన్ని రకాల ఉత్పరివర్తనాలకు లోనయిందో, ఆ క్రమంలో అది ఏవిధమైన మార్పులకు గురవుతున్నదో తెలుసుకోవాలంటే రోగుల నుంచి నమూనాలు సేకరించి, వైరస్ అనుక్రమణికను తెలుసుకోవటం ఒక్కటే మార్గం. ఒక వైరస్లోని జన్యువులను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే దాని నిర్మాణ స్వరూపంపై అవగాహన కలుగు తుంది. అది క్షీణ దశకు చేరుకుందా, ప్రమాదకరంగా పరిణమించిందా అన్నది తేలుతుంది. అది తెలిస్తే ప్రజారోగ్య రంగంలో అనుసరించాల్సిన వ్యూహాలకు రూపకల్పన చేయటం, అందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయటం, వైరస్ వ్యాప్తిని అరికట్టడం సులభమవుతుంది. అలాగే వైరస్ ఏ ప్రాంతంలో అధికంగా వుందో, అది ఎక్కువగా ఎవరి ద్వారా వ్యాపిస్తున్నదో గుర్తించ గలుగుతారు. దాంతోపాటు వైరస్పై పరిశోధనలు చేస్తున్నవారికి సరైన వ్యాక్సిన్లను రూపొం దించటంలో, ఇతరత్రా చికిత్సలను సూచించటంలో తోడ్పడుతుంది. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయంతో తప్పనిసరిగా అమలు చేయల్సివచ్చిన లాక్డౌన్లు, వాటి పర్యవసానంగా అన్ని రంగాలూ స్తంభించిపోవటం కారణంగా సాధారణ ప్రజానీకం ఎన్నో అగచాట్లు పడింది. మరోసారి ఆ పరిస్థితి తలెత్తకూడదనుకుంటే టీకాలిచ్చే కార్యక్రమం మాత్రమే కాదు...ఇలా వైరస్ జన్యు అనుక్రమణికను తెలుసుకోవటం కూడా ముఖ్యం. బ్రిటన్లో రూపాంతరం చెందిన వైరస్ రకం 18 రాష్ట్రాల్లో 736మందికి సోకిందని గుర్తించారు. మరో 34మందికి దక్షిణాఫ్రికా రకం వైరస్ సోకిందని తేల్చారు. ఒకరికి బ్రెజిల్ రకం వైరస్ ఉందట. ఇవన్నీ వారంక్రితంనాటి లెక్కలు. ఇప్పుడు ఈ సంఖ్య మరిన్ని రెట్లు పెరిగివుంటుంది. ఇలా వివిధ రకాల కరోనా వైరస్ల వల్ల రోగ లక్షణాలను నిర్ధారించటంలో, దాన్ని నివారించటానికి ఇవ్వాల్సిన ఔషధాలను, వ్యాక్సిన్లను నిర్ణయించటంలో ఇబ్బందులెదురవుతాయి. మన దేశంలో ప్రజారోగ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, అందులోని లోటు పాట్లేమిటో కరోనా మహమ్మారి ప్రభావవంతంగా ఎత్తిచూపింది. అయితే దాన్నుంచి అవస రమైనమేర గుణపాఠాలు తీసుకోవటంలో విఫలమయ్యామని మనకెదురవుతున్న అనుభవాలు రుజువు చేస్తున్నాయి. వ్యాధి నిరోధకత మన దేశంలో ఎక్కువని సంబరపడే పరిస్థితులు లేవని కరోనా రెండో దశ తాజాగా రుజువు చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లో మాదిరే ఇక్కడా వేగంగా వైరస్ వ్యాపిస్తున్న తీరు మనం తక్షణం మేల్కొనాలని తెలియజెబుతోంది. నిరుడు కరోనా తీవ్రతను సకాలంలో గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో విఫలమైన బ్రిటన్, అమెరికాలు టీకాలివ్వటంలో మాత్రం అందరికన్నా ముందున్నాయి. ఆ చురుకుదనాన్ని మనం సైతం అందు కోగలగాలి. -
‘ఎవర్ గివెన్’ చెప్పే గుణపాఠం
చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది. ‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది. ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి. విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది. అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన. నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది. -
మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు
ఎన్నికల మేనిఫెస్టో ఒక పార్టీ రాజకీయ దృక్పథానికి, అది అనుసరించే విలువలకు, దాని దూర దృష్టికి ప్రతీకగా వుండాలి. కానీ ఇటీవలకాలంలో అది ఆచరణసాధ్యం కాని ఫక్తు వాగ్దానాల చిట్టాగా మిగిలిపోతోంది. సాధారణ సమయాల్లో ఎన్ని సంక్షోభాలు తలెత్తినా, జనం ఏమైపోయినా ధీర గంభీర మౌనాన్ని ఆశ్రయించే నాయకులు ఎన్నికలు ప్రకటించగానే వాగ్దానకర్ణులుగా మారిపోతారు. మేనిఫెస్టో రాసినప్పుడు వారి చేతికి ఎముక వుండదేమో... అందులో ఎక్కడలేని వాగ్దానాలూ వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఇవి కరోనా అనంతరం తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి ఎన్నికలు గనుక... లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నెన్నో కడగండ్లు చవిచూసిన వలసజీవుల్లో అధికశాతంమంది ఆ రాష్ట్రవాసులే గనుక అందరి దృష్టీ సహజంగానే బిహార్పై పడింది. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్కుమారే ఇప్పటికీ మెరుగైన సీఎంగా జనం భావిస్తున్నారని చెబుతున్నాయి. ఆయన ప్రభ కాస్త తగ్గినా, కేంద్రంలో నరేంద్ర మోదీ సమర్థపాలన దానికి జవజీవాలు కల్పించిం దని, పర్యవసానంగా ఆ రెండు పార్టీల కూటమి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అంటు న్నాయి. మేనిఫెస్టోలు చూస్తే మాత్రం ఆ అభిప్రాయం కలగదు. అవి సమ్మోహనాస్త్రాలను తలపిస్తు న్నాయి. ఎలాగైనా ఓటర్లను లోబర్చుకోవాలన్న తృష్ణ కనబడుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా వాటినిండా లక్షలాది ఉద్యోగాలు సునామీలా తోసుకొస్తున్నాయి. తాము ఎన్నికైతే పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఒకరంటే...19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మరొకరు పోటాపోటీగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తాము అధికారంలో వున్నామన్న స్పృహ కూడా వుండటం లేదు. మరి ఇన్నేళ్లూ ఏం చేశారని ఓటర్లు నిలదీస్తారన్న భయాందోళనలు లేవు. బీజేపీ మేనిఫెస్టో మరొక అడుగు ముందుకేసింది. ‘మేం గెలిస్తే కరోనా టీకా ఉచితమ’ని బిహార్ వాసులను ఊరిస్తోంది. టీకాకు అను మతి రావడమే తరువాయి... దాన్ని ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. కాబట్టి అది ఎప్పుడు వస్తుం దన్న సంగతలా వుంచితే... ఆ వాగ్దానం తీర్చడానికయ్యే వ్యయమెంతో కూడా ఆమెకు తెలిసే మాట్లాడారనుకోవాలి. అందుకు బదులు బిహార్తో సహా దేశమంతా ఆ టీకా ఉచితంగా ప్రజలకు అందించబోతున్నామని చెప్తే ఆచరణ మాటెలావున్నా కనీసం వినడానికి బాగుండేది. కేవలం బిహా ర్కు మాత్రమే అనడం వల్ల అది అనైతికమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఉచితం మాటెలావున్నా నిపుణులు చెబుతున్న ప్రకారం టీకా రావడానికి ఇంకా చాన్నాళ్లు పట్టేలా వుంది. ఈలోగా సభలకొచ్చే జనాన్ని భౌతిక దూరం పాటించేలా చేయడంలో కూడా పార్టీలు విఫలమవుతున్నాయి. ఏ సభ చూసినా ఈ ఎన్నికల హోరుకు జడిసి కరోనా మాయమైందా అన్న సంశయం కలుగుతోంది. ఏడెనిమిదేళ్లక్రితం పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు విలువైన వ్యాఖ్యానం చేసింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేలా హామీలు గుప్పించడం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తిని దెబ్బతీయడమేనని దాని సారాంశం. 2011లో డీఎంకే, అన్నా డీఎంకేలు పోటాపోటీగా చేసిన వాగ్దానాలు చూసి, రోజురోజుకూ అవి శ్రుతిమించిన వైనం గమనించి చిర్రెత్తుకొచ్చిన తమిళనాడు వాసి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ వ్యాఖ్య చేసింది. కమ్మని వాగ్దానాలను కట్టు దాటించడంలో తెలుగుదేశం అధి నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరారు. 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి ఎన్నిటినో ఉచితంగా ఇస్తానని ఊరించారు. అది ఏ స్థాయికి చేరిందంటే ఆయనకు అప్పట్లో ‘ఆల్ ఫ్రీ బాబు’ అన్న పేరు కూడా వచ్చింది. 2014లో ఆ పార్టీ మేనిఫెస్టో చేసిన వాగ్దానాలకు అంతులేదు. అవి ఏ స్థాయిలో వున్నాయంటే... నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలనాటికి ఆ మేనిఫెస్టో ఆచూకీ లేకుండా పోయింది. ఆన్లైన్లోగానీ, టీడీపీ కార్యాలయాల్లోగానీ అది ఎవరి కంటా పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. మళ్లీ రంగంలోకి కొత్త వాగ్దానాలు గుదిగుచ్చి సరికొత్త మేనిఫెస్టో తీసుకొస్తే 2019లో జనం ఆ పార్టీని తిరస్కరించారు. అది వేరే కథ! మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం కింద 12 రకాల వ్యాక్సిన్లు ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. పోలియో నియంత్రణకిచ్చే టీకా ఉచితంగా లభించకపోతే దేశంనుంచి దాన్ని తరమడం ఇప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆ మాదిరే కరోనా టీకా కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామంటే బిహార్ వాసులు సంతోషించేవారు. దేశవ్యాప్తంగా బిహారీలు పనిచేస్తుంటారు గనుక ఈ దేశంలో తాము విడదీయరాని భాగమన్న స్పృహ వారికి దండిగావుంటుంది. అలాగే ఈ కరోనా మహమ్మారి విజృంభణ పర్యవసానంగా తమ కళ్లముందే అనేకులు రాలిపోతుండటం చూసి కుంగుబాటులోవున్న దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ఎంతో ఊరటనిచ్చేది. రేపో, మాపో అది రాబోతోందన్న భరోసా ఏర్పడేది. వాగ్దానం బిహారీలకు పరిమితమై వుండటం వల్ల ఇతరులకు అది ఉచితంగా లభించదేమోనన్న సంశయం కలుగుతుంది. కనీసం నితీష్కుమార్ ఆ వాగ్దానం చేసివుంటే ముఖ్యమంత్రిగా ఆయన బిహారీల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోదల్చుకున్నా రన్న అభిప్రాయం కలిగేది. ఎటూ నితీష్ ఎన్డీఏ భాగస్వామి గనుక ఆయన గెలుపు బీజేపీకి, నరేంద్రమోదీకి కూడా గెలుపే అవుతుంది. అలాగని ఉచిత వాగ్దానాలన్నిటినీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు. సంక్షేమ రాజ్యం ఇరుసుగా పనిచేసే ప్రజాస్వామ్యంలో పేద వర్గాలకు ఉచితంగానో, సబ్సిడీతోనో అందుబాటులోకి తీసుకురావాల్సిందే. కానీ చేసే ఎలాంటి వాగ్దానమైనా బాధ్యతాయు తమైనదిగా వుండాలి. తాము ఇస్తున్న హామీలు ప్రజలకు ఎలాంటి సందేశం మోసుకెళ్తాయో గ్రహిం చాలి. అవి వారి ఉన్నతాశయానికి అద్దంపట్టాలి. వారి దూరదృష్టికి సంకేతంగా నిలవాలి. -
పోప్ హితవు
ఒకే జెండర్కు చెందినవారు కలిసి సహజీవనం చేద్దామనుకోవడంలో తప్పేమీ లేదని క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించి పెను సంచలనం రేపారు. అలాంటి లైంగిక భావనలున్నవారు కూడా దేవుని బిడ్డలే...వారిని దూరంగా విసిరికొట్టడం కానీ, బాధించడంగానీ సరైంది కాదని, వారి సహజీవనాన్ని కూడా వివాహంగా గుర్తించాలని ఒక డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు దేశదేశాల్లోని ప్రభుత్వాలను ఆలోచింపజేస్తాయి. వాస్తవానికి 2013లో పోప్గా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఆయన ప్రకటన చేశారు. అయితే అలాంటివారి సహజీవనాన్ని చట్టబద్ధం చేయాలని గట్టిగా కోరడం ఇదే ప్రథమం. పోప్ తాజా ప్రకటన ఆధునిక కాలానికి అనుగుణంగా మతంలో సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటున్నవారికి బలాన్నిస్తుంది. అదే సమయంలో సంప్రదాయవాదులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఎవరూ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా బెదిరింపులూ, వేధింపులూ ఎదుర్కొనే పరిస్థితి వుండ కూడదు. అలాంటివారికి చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చినప్పుడు మాత్రమే వారు అందరిలా సమా జంలో ప్రశాంతంగా జీవించగలుగుతారు. కానీ మన దేశంతో సహా అనేక దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లోని అసహజ నేరాల జాబితా స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూస్తోంది. అందుకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని ఆ సెక్షన్ చెబుతోంది. సుప్రీంకోర్టు సైతం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదే నంటూ 2012లో తీర్పునిచ్చింది. అయితే 2018లో దాన్ని సవరించుకుంది. పరస్పర అంగీకారం వున్న స్వలింగసంపర్క సంబంధాలు నేరం కాదని తీర్పునిచ్చింది. ప్రాణులను స్త్రీ, పురుషులుగా మాత్రమే ప్రకృతి ఎంపిక చేయనప్పుడు లైంగికత అంటే ఫలానా విధంగా మాత్రమే వుండాలని శాసించే హక్కు ఎవరికీ ఉండబోదని అమెరికన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సి కిన్సే ఒక సందర్భంలో చెప్పాడు. మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ నిచ్చింది. కానీ భిన్న లైంగిక భావనలున్న స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పరిగణించే చట్టం మాత్రం దశాబ్దాలపాటు యధావిధిగా కొనసాగింది. సున్నితంగా ఆలోచించే స్వభావమూ, సహాను భూతితో వ్యవహరించే గుణమూ న్యాయవ్యవస్థలో కొరవడితే రాజ్యాంగం ప్రవచించే ఉన్నతా దర్శాలు, వాగ్దానాలు ఉత్త మాటలుగా మిగిలిపోతాయి. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం నీడలో కూడా ప్రకృతి సహజమైన చర్యను నేరంగా పరిగణించే సెక్షన్ 377 ఏడు దశాబ్దాలు కొన సాగిందంటే అది మన న్యాయవ్యవస్థ వైఫల్యమనే చెప్పాలి. బ్రిటిష్ వలసవాదులు తమ దేశంలో అమలవుతున్న చట్టాన్ని 1861లో యధాతథంగా ఇక్కడ అమల్లోకి తెచ్చారు. అయితే స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించడానికి అనువైన చట్ట నిబంధనలు ఇంకా ఏర్పడలేదు. తమని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద దంపతులుగా గుర్తించాలంటూ ఇటీవలే ఢిల్లీకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు కవితా అరోరా, అంకితా ఖన్నాలు హైకోర్టు తలుపులు తట్టారు. తాము దంపతులుగా సహజీవనం చేస్తున్నామని, అందరి కుటుంబాలకూ బంధువులు వచ్చిపోతున్నట్టే తమ వద్దకూ వస్తుంటారని, అలాంటపుడు తమ సహజీవనాన్ని వివాహంగా గుర్తించడంలో అభ్యంతరం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీం కోర్టు ప్రకటించి రెండేళ్లవుతున్నా వివాహచట్టాల్లో అందుకు వీలు కల్పించే సహజీవనాన్ని పొందు పరచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాన్ని వివాహంగా ఎందుకు గుర్తించాలన్న సంశయం వచ్చినవారికి కవితా అరోరా, అంకితా ఖన్నా సవివరమైన జవాబిస్తున్నారు. బ్యాంకులో ఉమ్మడి ఖాతా తెరవాలంటే వారిమధ్య చట్టబద్ధమైన సంబంధం వున్నట్టు రుజువుండాలి. ఇద్దరు మహిళలను దంపతులుగా, కుటుంబంగా గుర్తించడం అసాధ్యం కనుక అధికారికమైన అడ్రస్ ప్రూఫ్ వారి నివాసగృహానికి లభించడం లేదు. పాస్పోర్టు పొందాలన్నా అదే ఇబ్బంది. ఆ చిరునామాలో నివసిస్తున్న వారిలో ఒకరిని యజమానిగా, మరొకరిని అద్దెకుంటున్నవారిగా మాత్రమే పరిగణించ గలమని పోలీసుల వాదన. ఇక వారసత్వ హక్కులు వంటివి సరేసరి. పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పొందేటపుడు నామినీగా గుర్తించడం, వారితో వున్న సంబంధాన్ని తెలపడం కూడా అసాధ్యం. ఇలా చట్టపరమైన అవరోధాలు ఎన్నో వున్నాయి. వీరి తరహాలోనే మరో ఇద్దరు స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టం కింద గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన వింతగా వుంది. ఒకే జెండర్కు చెందినవారి మధ్య వివాహం భారతీయ విలువల ప్రకారం సమ్మతం కాదని, అది పవిత్రంగా పరిగణించడం సాధ్యపడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. మరి స్వలింగ సంపర్కం రాజ్యాంగబద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం ఏం గౌరవిస్తున్నట్టు? ఇది మన దేశానికి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. ప్రపంచ దేశాలన్నిటా ఇలాంటి పరిస్థితే వుంది. దాదాపు 30 దేశాల్లో మాత్రమే ఇంతవరకూ స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించే చట్టాలున్నాయి. చాలాచోట్ల ఈ వివాహాలను అనైతికతగా పరిగణించే ఛాందసవాదులదే పైచేయి. కొన్నిచోట్లయితే అది మరణశిక్షకు అర్హమైన నేరం! అందువల్లే పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రకటన స్వలింగసంపర్కులకు కొత్త బలాన్నిచ్చింది. ఏ దేశానికైనా సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లుం టాయి. అయితే అవి రాజ్యాంగ నైతికతతో విభేదించినప్పుడు రాజ్యాంగం మాటే చెల్లుబాటు కావాలి. ప్రజాస్వామ్య రిపబ్లిక్లు ఏర్పడిన దేశాల్లో కూడా ఇంకా బూజుపట్టిన భావాలదే పైచేయి అవుతున్న వేళ పోప్ ప్రకటన అక్కడి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. -
మళ్లీ సరికొత్తగా ‘క్వాడ్’
పదమూడేళ్లనాటి జపాన్ ప్రతిపాదన అనేకానేక మలుపులు తిరిగి చివరకు సాకారం కాబోతోంది. చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల ఆధ్వర్యంలో బంగాళాఖాతంలోని మలబార్ సాగర జలాల్లో వచ్చే నెలలో నిర్వహించబోయే నావికా దళ విన్యాసాలకు మన దేశం ఆస్ట్రేలియాను సోమవారం ఆహ్వానించింది. చైనాకు సహజంగానే ఇది ఆగ్రహం కలిగించే చర్య. క్వాడ్ పురుటి నొప్పులు అన్నీ ఇన్నీ కాదు. 2007లో మొదట ఈ ప్రతిపాదన మొగ్గతొడిగి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే కూటమి కడుతున్నారంటూ నాలుగు దేశాలకూ దౌత్యపరమైన నిరసనలు తెలియజేసింది. అయితే చైనా భయాందోళనలు వాస్తవం కాదని, కేవలం పరస్పరం ప్రయోజనం వున్న అంశాలపై పనిచేయడమే కూటమి ఆంతర్యమని జపాన్ చెప్పింది. మన దేశం కూడా ఆ మాటే అంది. జపాన్తో తమకున్న వాణిజ్య ఒప్పందానికి అనుబంధంగా ఈ భద్రతా ఒప్పందం అవసరం గనుకే ఇందులో చేరామని తెలిపింది. కూటమి ఆధ్వర్యంలో టోక్యోలో 2007 మే నెలలో తొలి నావికాదళ విన్యాసాలు జరిగాయి. దానికి కొనసా గింపుగా బంగాళాఖాతంలోనూ విన్యాసాలు నిర్వహించారు. తీరా జపాన్లో షింజో అబే అధికారం కోల్పోయి ఆయన స్థానంలో టారో అసో వచ్చాక క్వాడ్లో కొనసాగదల్చుకోలేదని ప్రకటించారు. అటు ఆస్ట్రేలియాలో కూడా 2008లో జాన్ హోవార్డ్ నిష్క్రమించి కెవిన్ రుడ్ రావడంతో ఆ దేశం కూడా క్వాడ్కు మొహం చాటేసింది. అదే ఏడాది అప్పటి చైనా అధినేతలు మన దేశంలో పర్యటించబోతుండగా నాటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ‘చైనాను కట్టడి చేసే ఎలాంటి కూట మిలోనూ భారత్ భాగస్వామ్యం కాబోద’ని ప్రకటించారు. అలా ముగిసిన ముచ్చట కాస్తా అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ వచ్చాక మళ్లీ కదలబారింది. ఆయన మళ్లీ అందరితో మాట్లాడి ఒప్పిం చాక 2017లో క్వాడ్ చర్చలు మొదలయ్యాయి. అప్పటికి దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా కార్య కలాపాలు పెరిగాయి. అక్కడ పగడాల దిబ్బలు, ఇసుకమేటలు తమవేనని చైనా ప్రకటించి, స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది జపాన్ను చికాకు పర్చడం, ఆ దేశానికి అమెరికా అండగా నిలవడంతో క్వాడ్ మళ్లీ ప్రాణం పోసుకుంది. అయితే మునుపటిలా కాదు... క్వాడ్ ఈసారి గట్టిగా పనిచేయదల్చుకున్నట్టే కనబడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా తప్ప ప్రత్యేకించి కూటమి కోసమే సమా వేశాలు జరిగిన చరిత్ర క్వాడ్కు లేదు. కలిసేది నాలుగు దేశాలైనా ‘ఆసియాన్’ సమావేశాల సమ యాల్లో లేదా ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయాల్లో మాత్రమే నేతలు కలిసేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. గత నెలాఖరులో క్వాడ్ దేశాల సీనియర్ అధికారుల సమావేశం జరి గింది. ఆ వెనకే ఈ నెల మొదట్లో విదేశాంగమంత్రులు సమావేశమయ్యారు. మలబార్ విన్యాసాలపై ఆ సమావేశంలో అంగీకారం కూడా కుదిరింది. కానీ ఆస్ట్రేలియా అందులో పాల్గొనడం విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. కానీ వారం రోజుల అనంతరం చివరకు ఆస్ట్రేలియాను ఆహ్వానిం చడానికే మన దేశం నిర్ణయించింది. చైనాకు ఆగ్రహం కలిగినంత మాత్రాన క్వాడ్ నాటో తరహాలో ఇప్పటికప్పుడు సైనిక కూటమిగా రూపొందుతుందని భావించనవసరం లేదు. అటు అధికారుల సమావేశంలోనూ, ఇటు విదేశాంగమంత్రుల సమావేశంలోనూ ప్రధానంగా చర్చకొచ్చింది కరోనా అనంతర పరిస్థితుల గురించే. అలాగే ఇకపై ప్రపంచ పంపిణీ వ్యవస్థ తీరుతెన్నులెలా వుండాలో, సభ్య దేశాలు సమష్టిగా కదిలి ఆర్థికంగా ఎదగడానికి చేయాల్సిందేమిటో కూడా చర్చించారు. మరో మూడు దేశాలు– న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాంలు కూడా పాలుపంచుకున్నాయి. కనుక క్వాడ్ త్వరలో మరింత విస్తరించడం ఖాయం. అయితే ‘అమెరికా ఫస్ట్’ పేరిట మిత్ర దేశాలపై కూడా రకరకాల ఆంక్షలు విధిస్తూ స్వీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ట్రంప్ను నమ్మి ఇందులో దిగడం ఎంతవరకూ సమంజసమన్న సంశయం ఈ దేశాలకు లేకపోలేదు. ఆసియాన్తో మన దేశానికి సంబంధబాంధవ్యాలు ఏర్పడి అర్థ శతాబ్ది దాటుతోంది. చారిత్రకంగా ఆ దేశాలు అమెరి కాతో సన్నిహితంగా మెలిగేవి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అందుకే వాటితో మన సంబంధాలు అంతంతమాత్రం. ఇప్పుడు ఆ బంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాన్ మరిన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలనుకుంటోంది. ఇదే సమయంలో తనకు సమాంతరంగా ఈ ప్రాంతంలో క్వాడ్లాంటి మరో కూటమి మొగ్గతొడుగుతుండటం, అది సైతం విస్తరించాలనుకోవటం ఆసి యాన్కు సమస్యే. ఈ వైరుధ్యాన్ని మన దేశం ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. లద్దాఖ్లో చైనాతో మనకు ఏర్పడిన లడాయి, ఆ దేశం అనుసరిస్తున్న మొండివైఖరి మలబార్ విన్యాసాలకు ఆస్ట్రేలియాను ఆహ్వానించాలన్న మన నిర్ణయానికి కారణం కావొచ్చు. కానీ క్వాడ్ను పరస్పర ఆర్థిక, వాణిజ్య, భద్రతాపరమైన ప్రయోజనాలకు అనువుగా రూపొందించాలి తప్ప అమె రికా కనుసన్నల్లో నడిచే మరో నాటో కూటమిగా దాన్ని మార్చనీయకూడదు. నాటో కూటమివల్ల యూరప్ కంటే అమెరికాయే ఎక్కువగా లాభపడింది. ప్రపంచ పోలీస్గా వ్యవహరిస్తూ, సమస్యా త్మక ప్రాంతాలకు ఆ కూటమి సైన్యాన్ని తరలిస్తూ ప్రపంచంపై తన పట్టు నిలుపుకోవడంలో అది విజయం సాధించింది. అయితే సైనిక కూటమిగా మారకపోవడం చైనా చర్యలపై కూడా ఆధార పడివుంటుంది. వుహాన్ శిఖరాగ్ర సదస్సు అనంతరం క్వాడ్ విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరించింది. చైనాకు ఇబ్బంది కలిగించవద్దన్నదే దాని వెనకున్న ఉద్దేశం. కానీ అంతక్రితంనుంచీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చూపిస్తున్న దూకుడునే గల్వాన్ లోయలో కూడా ప్రదర్శించి తాజా నిర్ణయానికి చైనా ప్రధాన కారణమైంది. ఏదేమైనా క్వాడ్ మళ్లీ ప్రాణం పోసుకోవడం ప్రపంచంలో రానున్న కాలంలో సరికొత్త పరిణామాలకు దారితీస్తుందనటంలో సందేహం లేదు. -
అప్రమత్తతే మందు
యూరప్ దేశాలన్నీ కరోనా వైరస్ రెండో దశ విజృంభణతో కుదేలవుతున్న వేళ మన దేశంలో తొలిసారి ఆ మహమ్మారి క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. కరోనాపై మనం పోరు ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తుండగా జూలై నుంచి అది ఎడాపెడా విస్తరిస్తూ పోయింది. ఈ మూడు నెలల కాలంలో తొలిసారి సోమవారం దేశవ్యాప్తంగా 47,000 కేసులు నమోదయ్యాయి. ఆమర్నాడు స్వల్పంగా పెరిగి 50,000కు చేరాయి. సాధారణంగా సోమవారం వెలువడే కరోనా ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మిగిలిన రోజులతో పోలిస్తే ప్రతి ఆదివారమూ కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా వుంటుంది. సాధారణ రోజుల్లో దాదాపు 11 లక్షల పరీక్షలు జరుగుతుండగా... ఆదివారాల్లో అవి 8–9 లక్షల మధ్య వుంటాయి. అయినా రోజూ దాదాపు 60,000 కేసులు బయటపడటం రివాజైంది. కానీ ఈ ఆదివారం 8.59 లక్షల పరీక్షలు జరిపినా తక్కువ కేసులే వెల్లడయ్యాయంటే అది సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా రోజూ అధిక సంఖ్యలో కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో కూడా 6,000 కన్నా తక్కువ కేసులు నమోదుకావడం కూడా జూలై 8 తర్వాత ఇదే తొలిసారి. ఈమధ్య కరోనా తీవ్రత ఎక్కువగా వున్నట్టు కనబడుతున్న కర్ణాటక, కేరళల్లో కూడా కొత్త కేసులు తగ్గాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా చెప్పినట్టు కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా అప్రమత్తత ఏమాత్రం సడలనీయకూడదు. మాస్క్ ధరించడంతో మొదలుపెట్టి ముందు జాగ్రత్తల్లో దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా తీవ్రత తగ్గినట్టు కనిపించడంతో చాలామందిలో ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి బయల్దేరింది. కొందరు శాస్త్రవేత్తలు భారత్లో ఇప్పటికే కరోనా వైరస్ ఉచ్చస్థితికి వెళ్లి, అక్కడినుంచి వెనక్కి రావడం మొదలైందంటున్నారు. మనకిక రెండో దశ బెడద ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఫిబ్రవరినాటికల్లా ఈ మహమ్మారి విరగడకావొచ్చునని అంచనాలు వేస్తున్నారు. కానీ ముందుజాగ్రత్త చర్యల్ని విస్మరించేవారు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఆ తగ్గే సంఖ్యలో అలాంటివారుండే అవకాశం లేకపోలేదు. అందువల్లే వ్యాక్సిన్ వచ్చేవరకూ ఇప్పుడమలవుతున్న జాగ్రత్తలన్నీ పాటించకతప్పదు. నియంత్రణ విధానాలను విస్మరిస్తే ఏమవుతుందో ప్రస్తుతం యూరప్ దేశాలనూ, అమెరి కానూ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా యూరప్ దేశాలన్నీ ఇంచుమించుగా కరోనా బారినుంచి బయటపడి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడం మొదలుపెట్టాయి. పరిమితంగా అయినా పరిశ్రమలు తెరుచుకోవడం, రవాణా సదుపాయాలు సాధారణ స్థితికి చేరడం, మళ్లీ జనం రోడ్లపై సందడి చేయడం కనబడింది. ఈ దేశాల్లో ఇటీవల ఒకరకమైన అసహనం మొదలైంది. కరోనా తగ్గాక కూడా ఇంకా ఆంక్షలుండటం ఏమిటన్నది దాని సారాంశం. కానీ తాజాగా బయటపడు తున్న కేసులతో ఆంక్షల్ని మళ్లీ పెంచడం మొదలుపెట్టారు. వృధా ప్రయాణాలు మానుకోవాలని, సాధ్యమైనంతవరకూ ఇళ్లకే పరిమితం కావాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ దేశ పౌరులను కోరారు. అందరం కలిసికట్టుగా నిబంధనలు పాటించడం వల్లే వైరస్ తొలి దశ దాడినుంచి కనిష్ట నష్టాలతో బయటపడగలిగామని, ఇప్పుడు సైతం దాన్ని మరిచిపోవద్దని విజ్ఞప్తిచేశారు. యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా వుంది. కరోనా తొలి దశ విజృంభణ నుంచి బయట పడ్డాక నెమ్మదిగా యధాపూర్వ స్థితికి వస్తున్న తరుణంలో రెండో దశ విజృంభణ పుట్టుకొచ్చి అంతంతమాత్రంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థల్ని చిక్కుల్లో పడేసింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్లు గతవారం మళ్లీ కఠినమైన ఆంక్షల్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. ఇవి ఇంకా పెరుగుతాయని రెండు మూడు రోజులుగా నాయకులు చెబుతున్నారు. త్వరలో విడు దల కాబోయే మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు బాగుంటాయని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నవేళ నాలుగో త్రైమాసికం పూర్తిగా నెగెటివ్లోకి జారుకునే సూచన కనబడుతోంది. మాంద్యం రెండంకెలకు చేరుకోవచ్చునని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి యూరప్ యూనియన్(ఈయూ) తన సభ్యదేశాలకు రికవరీ ఫండ్ కింద ఇవ్వదల్చుకున్న 75,000 కోట్ల యూరోల నిధుల పంపిణీని ప్రస్తుతానికి నిలిపేయాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకూ దాని జోలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు. ఇప్పుడు యూరప్ పరిణామాలు మనకు గుణపాఠం కావాలి. కరోనా బయటపడిన తొలి నాళ్లలో కేరళ దాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొంది. వరసబెట్టి తీసుకున్న చర్యల కారణంగా అక్కడ కేసుల సంఖ్య రోజుకు కేవలం రెండు, మూడు మాత్రమే వెల్లడైన సందర్భాలున్నాయి. కానీ ఈమధ్య అవి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 11న ఒకేరోజు 11,755 కేసులు బయటపడినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. కర్ణాటకలో సైతం ఇంతే. అక్కడ కూడా ఇటీవలకాలంలో కేసులు పెర గడం మొదలైంది. దీని వెనకున్న కారణాలేమిటో నిపుణులు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలయ్యాక జనాన్ని హెచ్చరించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్ల వరసగా వచ్చిన పండగల్లో జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిందని వారు చెబు తున్న మాట. అలాగే కరోనా జన్యువుల్లో వచ్చిన ఉత్పరివర్తన కూడా ఇందుకు దోహదపడి వుండొ చ్చని అంచనా వేస్తున్నారు. కనుక ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ఇదే ధోరణి దేశమంతా కనబడే ప్రమాదం వుంది. విద్యాసంస్థలను యధావిధిగా నడుపుకోవడానికి ప్రయత్నిస్తూనే, రవాణా సదు పాయాలను కొనసాగిస్తూనే, ఇతరత్రా కార్యకలాపాలకు చోటిస్తూనే నిరంతరం అందరూ అప్రమ త్తంగా వుండకతప్పదు. ఎక్కడ లోపం జరిగినా పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం వుంటుంది. -
ఇదేనా పురోగతి!
గతంతో పోలిస్తే కొంత మెరుగయ్యామని సంతోషించాలో... చాలా వెనకబడిన దేశాలతో పోల్చినా మరింతగా వెనకబడ్డామని బాధపడాలో తెలియని స్థితి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో మన దేశం ఈసారి 94వ స్థానంలో వుంది. నిరుడు 102వ స్థానంలో వున్నాం గనుక ఇప్పుడున్న స్థితికి సంతోషించాలని కొందరు చెబుతున్నారు. కానీ ఆకలి సమస్య చాలా తీవ్రంగా వున్న దేశాల సరసనే ఇప్పటికీ మనం వున్నామని గుర్తుంచుకోవాలి. వివిధ అంశాల్లో ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం ఒక దేశం ఎలా వుందన్నదే ఈ ఆకలి సూచీకి ప్రాతిపదిక. అలా చూసుకుంటే నిరుడు మన స్కోరు 30.3 దగ్గరుంటే ఇప్పుడది 27.2కు దిగింది. అంటే ఎంతో కొంత మెరుగు పడ్డామని చెప్పుకోవాలి. కానీ ఆ స్కోరు తగ్గినంత మాత్రాన మనం ఆకలి సమస్య తీవ్రత పరిధి నుంచి బయటకు రాలేదు. పౌష్టికాహారలోపం, అయిదేళ్లలోపు పిల్లలు తగిన ఎత్తు లేకపోవడం లేదా ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే మరణాలు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ఆకలిసూచీని రూపొందిస్తున్నారు. ఇది వెల్లడైనప్పుడల్లా రాజకీయ పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, అధికారంలో వున్నవారిని విపక్షం విమర్శించడం... మీరుండగా ఏం చేశారని అధికార పక్షం ఎదురు ప్రశ్నించడం రివాజుగా మారింది. 2018లో 103వ స్థానంలో వున్న మనం నిరుడు 102కి, అక్కడినుంచి ఈ ఏడాది 94కు వచ్చామన్నది నిజమే. కానీ 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సాధించాలని ఐక్యరాజ్యసమితి 2015లో తీర్మానించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆకలి మంటల్ని ఆర్పడం ఒకటని మనం మర్చిపోకూడదు. ఇతర లక్ష్యాల మాటెలావున్నా ఆకలిని తరిమికొట్టడంలో మన పురోగతి మందకొడిగా వున్నదని ఏటా వెలువడుతున్న జీహెచ్ఐ నివేదికలు చాటుతున్నాయి. ఎంత మందకొడి అంటే... మన పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ల కన్నా కూడా మనం ఎంతో వెనకబడివున్నాం. అవి కూడా మనతోపాటు ఆకలి సమస్య తీవ్రంగా వున్న దేశాల వరసలోనే వున్నాయి. కానీ గతంతో పోలిస్తే వివిధ అంశాల్లో మెరుగయ్యాయి. మనమూ, సుడాన్ ఒకే స్థానంలో వున్నాం. కేవలం చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ దేశాలు మాత్రమే తాజా సూచీలో అన్నిటికన్నా ఉత్తమంగా నిలిచాయి. ప్రపంచంలో ఒకపక్క శ్రీమంతుల జాబితా ఏటా పెరుగుతోంది. దానికి సమాంతరంగా, సమానంగా ఇటు ఆకలిమంటలు కూడా విస్తరిస్తున్నాయి. 2017లో దాదాపు 9 లక్షల కోట్ల డాలర్లున్న ప్రపంచ కుబేరుల సంపద ఇప్పుడు పదిన్నర లక్షల కోట్ల డాలర్లకు చేరువవుతోందని స్విట్జర్లాండ్లోని సంస్థలు లెక్క చెబుతున్నాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే 2017లో 2,158మంది శ్రీమంతు లుంటే ఇప్పుడు ఆ సంఖ్య 2,189కి పెరిగింది. రంగాలవారీగా చూస్తే టెక్, హెల్త్కేర్, పారిశ్రామిక రంగాలు ఆ సంపదకు కారణమవుతున్నాయి. ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి పర్యవ సానంగా ఈ రంగాలే మున్ముందు కూడా కాసులు కురిపిస్తాయి. వారిని మరింత కుబేరుల్ని చేస్తాయి. ఇటీవలే వెలువడిన ప్రపంచ బ్యాంకు నివేదిక ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పేదరికంలోకి జారుకునేవారి సంఖ్య బాగా పెరుగుతుందని ప్రకటించింది. కొత్తగా 11 కోట్ల 50 లక్షలమంది దారిద్య్ర రేఖకు దిగువన చేరతారని ఆ నివేదిక అంచనా వేస్తోంది. ఇదిగాక ఆదాయం తీవ్రంగా పడిపోవడం, అప్పులబారిన పడటం పర్య వసానంగా ఇప్పటికే అమలవుతున్న అనేక కార్యక్రమాలకు ప్రభుత్వాలు కేటాయింపుల్ని తగ్గించక తప్పదు. కనుక ఆ పరిధిలో వుంటూ పేదరికాన్ని జయిస్తున్నవారు కూడా చేయూత లేక చిక్కుల్లో పడతారు. ఏతావాతా ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో ఇప్పుడున్న ర్యాంకులు వచ్చే ఏడాది ఆకలి సూచీనాటికి మరింత దారుణంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఈ ఏడాది పేదరికం బాగా తగ్గి, అది 7.9 శాతానికి చేరుతుందని కరోనా వైరస్ పంజా విసరడానికి ముందు నిపుణులు లెక్కేశారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం అది 9.4 శాతం వుంటుందని వారు అంచనా వేస్తున్నారు. మన దేశంలో విధానాలకు కొదవలేదు. పథకాలు, వాటి పేర్లు కూడా ఘనంగా వుంటాయి. అమలుపరచడానికొచ్చేసరికి అంతా అస్తవ్యస్థమవుతోంది. కొన్ని అంశాల్లో దృష్టి కేంద్రీకరించి పనిచేయడం, ఫలితం సాధించడం సాధ్యమవుతున్నా... మరికొన్నిటిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన బడుతోంది. అలాగే సాధిస్తున్న ప్రగతి అంతటా ఒకేవిధంగా వుండటంలేదు. కొన్ని రాష్ట్రాలు ఎప్పటికీ వెనకబడే వుంటున్నాయి. వాటి లోపాలు సరిదిద్దడంలో, పరుగులెత్తించడంలో తగిన పర్య వేక్షణ కొరవడుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్వంటి అధిక జనాభావున్న పెద్ద రాష్ట్రాలు పనితీరును మెరుగుపరుచుకుంటే ప్రపంచ సూచీలో మన పరిస్థితిలో కాస్త పురోగతి కనబడే అవకాశం వుంటుంది. ఈ రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం తీవ్రత ఎక్కువుంది. దేశంలో పుట్టే ప్రతి అయి దుగురు శిశువుల్లోనూ ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. కనుక పౌష్టికాహార లోపాన్ని ఆ రాష్ట్రం సరిచేసుకోనట్టయితే అది మొత్తం మన ర్యాంకును ప్రభావితం చేస్తుంది. పిల్లలకు సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం చవగ్గా అందించడం, మాతా శిశు సంరక్షణ పథకాలను బాగా అమలు చేస్తూ బిడ్డ కడుపులో పడినప్పటినుంచీ మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తల్లికి అందేలా చూడటం, పుట్టినప్పటినుంచి బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం అందించడం వగైరాలు చేస్తేనే తక్కువ బరువుండటం, ఎత్తు తక్కువగా వుండటం, పసి వయసులోనే మృత్యువాత పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే, అందుకు అనువుగా పథకాలు రూపకల్పనచేసి, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తేనే దేశం శక్తిమంతమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కదలాలి. -
నేపాల్తో మళ్లీ చెట్టపట్టాలు
అయిదు నెలలక్రితం భారత్–నేపాల్ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కొద్ది రోజులుగా సద్దు మణిగాయి. కారణమేమిటో తాజా పరిణామాలే చెబుతున్నాయి. మన సైనిక దళాల ప్రధానాధికారి ఎం.ఎం. నరవణే వచ్చే నెలలో ఆ దేశం పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షు రాలు విద్యాదేవి భండారీ ఆయనకు నేపాల్ సైనిక గౌరవ జనరల్గా గౌరవ పురస్కారాన్ని అంద జేయబోతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా, అందుకు మన దేశం కూడా అంగీకరించడం మంచి పరిణామం. వాస్తవానికి ఇది గత ఫిబ్రవరిలోనే జరగాలి. కానీ అప్పటికే కరోనా కలకలం మొదలుకావడంతో వాయిదాపడింది. మన ఉత్తరాఖండ్లో భాగంగా వున్న లింపియాధుర, కాలా పానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని మొన్న మే నెలలో నేపాల్ ప్రకటించడంతోపాటు అందుకు సంబంధించి ఒక మ్యాప్ను కూడా విడుదల చేసింది. భారత్ రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని... ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. దాంతో ఇటు మన దేశం నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలే వెలువడ్డాయి. మ్యాప్ను విడుదల చేయడంద్వారా చర్చలకు నేపాల్ శాశ్వతంగా తలుపులు మూసిందని మన దేశం సూటిగా చెప్పింది. నేపాల్ తీసుకొచ్చిన ఈ కొత్త పేచీ వెనక ‘ఎవరో’ ఉన్నారని జనరల్ నరవణే చేసిన వ్యాఖ్యతో అక్కడి నేతలు మరింత రెచ్చిపోయారు. తాము చైనా చెప్పినట్టల్లా ఆడుతున్నామని పరోక్షంగా అన్నారని వారికి అర్ధమైంది. కొత్త సరిహద్దులతో విడుదల చేసిన మ్యాప్లకు సంబంధించిన బిల్లుల్ని అక్కడి పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టారు. ఇక రెండు దేశాల సంబంధాలూ చక్కదిద్దలేని స్థాయికి చేరు కున్నాయని అందరూ అనుకున్నారు. కానీ చాకచక్యంతో దౌత్యం నెరపితే, కాస్త సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ సంగతి తాజాగా నిరూపణ అయింది. ఇరుగు పొరుగు దేశాల మధ్య విభేదాలుండటం కొత్తేమీ కాదు. చారిత్రకంగా, సాంస్కృతికంగా శతాబ్దాల చరిత్ర వున్న రెండు దేశాలు ఏదో ఒక ఘటన కారణంగానో, ఎవరో చేసిన వ్యాఖ్య కారణం గానో శాశ్వతంగా దూరమవుతాయని, శత్రువులుగా మిగులుతాయని భావించవలసిన అవసరం లేదు. భారత్–నేపాల్ సంబంధాలు మళ్లీ చివురిస్తున్న వైనం రెండు నెలలుగా కనబడుతూనే వుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని శర్మ ఓలితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మన ప్రభుత్వం నేపాల్లో చేపట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులపై కఠ్మాండులో ఆగస్టు 17న సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో జరిగిన ఆ చర్చల తర్వాత పరిస్థితి మళ్లీ మెరుగుపడటం మొదలైంది. అంతమాత్రాన కొత్త మ్యాప్ల వ్యవహారం సమసినట్టు కాదు. ఆ అంశంపై చర్చలు ఇంకా జరగాల్సేవుంది. నేపాల్తో మన దేశం సంబంధాలు ఎప్పుడూ ఉండాల్సిన విధంగా లేవు. ఇందుకు ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో నియంతృత్వ పోకడలను అమలు చేయడమే కాక, దక్షిణాసియాలో ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. తాము అధికారంలోకొచ్చాక ఇరుగుపొరుగుతో మంచి సంబంధాలు నెల కొల్పుతామని చెప్పారు. ఆ తర్వాత జనతాపార్టీ అధికారంలోకొచ్చి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా, వాజపేయి విదే శాంగమంత్రిగా వ్యవహరించినప్పుడు విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులే చేశారు. కానీ కొద్దికాలంలోనే వారు సైతం ఇందిర బాటలో పయనిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. నెహ్రూ ఏలుబడిలో కూడా దక్షిణాసియా దేశాలతో సంబంధాల విషయంలో మన విధానం సరిగాలేదని నిపుణులు విమర్శించేవారు. ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించడానికి, ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రాంతీయ దేశాలతో సఖ్యతే కీలకం. అందువల్ల మన సర్వశక్తులూ అభివృద్ధిపై కేంద్రీ కరించడానికి అవకాశం వుంటుంది. అవతలి దేశాలు మన స్నేహ హస్తాన్ని అందుకోవడంలో విఫలం కావొచ్చు... కావాలని మనతో పేచీలకు దిగొచ్చు... మన భద్రతకు ముప్పు తెచ్చే విధానాలు అను సరించొచ్చు. అటువంటప్పుడు దృఢంగా వుండాల్సిందే. మన రక్షణకు అవసరమైన చర్యలు తీసు కోవాల్సిందే. అదే సమయంలో వృధా వివాదాల వల్ల కలిగే అనర్థాలను అవి గ్రహించేలా చేయాలి. మనవైపుగా లోటుపాట్లు లేకుండా చూడాలి. మనం పెత్తనం చలాయిస్తున్నామని, వారి ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నామని చిన్న దేశాలు అభిప్రాయపడేలా ఉండకూడదు. నేపాల్ విషయంలో మన పాలకులు మొదటినుంచీ నిర్లక్ష్యంగానే వున్నారు. 1997లో అప్పటి మన ప్రధాని ఐకె గుజ్రాల్ నేపాల్లో పర్యటించాక, మళ్లీ మోదీ ప్రధాని అయ్యేవరకూ ఏ ప్రధానీ ఆ దేశం వెళ్లలేదు. మంత్రుల స్థాయి పర్యటనలు, అధికారుల స్థాయి పర్యటనల తీరూ అంతే. చైనా దీన్ని ఆసరా చేసుకుని నేపాల్ను సన్నిహితం చేసుకోవడానికి ఎడతెగని ప్రయత్నం చేసింది. నేపాల్లో మనపై విద్వేషభావం ఏర్పడేలా ప్రచారం చేసింది. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క నేపాల్తో మాత్రమే కాదు... బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, మయన్మార్ వగైరాలతో కూడా చైనా వ్యూహాత్మకంగా చెలిమి చేస్తోంది. దీన్ని మన దేశం గమనంలోకి తీసుకోవాలి. భారత్–నేపాల్ మధ్య వాణిజ్య విస్తరణ జరిగితే అది ఇరు దేశాలకూ ఎంతో మేలు చేస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మన దేశం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వుంటుంది. ఇప్పుడు జరగబోయే జనరల్ నరవణే పర్యటన వల్ల ఏదో ఒరుగుతుందని చెప్పలేం. కానీ మెరుగైన సంబంధాల దిశగా అడుగులేయడానికి అది ఎంతో కొంత తోడ్పడుతుంది. -
అమెరికా ఎటువైపు?
అమెరికాలో అందరి అభిప్రాయంగా ప్రచారంలో వున్న అంశాన్నే తాజా సర్వే కూడా మరోసారి ధ్రువీకరించింది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నెగ్గే ఛాన్స్ లేదన్నది ఆ సర్వే సారాంశం. అమెరికాలో అత్యధికులు ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్నే కోరుకుంటు న్నారని ఆ సర్వే చెబుతోంది. అంతకన్నా ముఖ్యమైనదేమంటే... ఓటు హక్కున్న ప్రవాస భారతీ యుల్లో మూడింట రెండొంతులమంది ఈసారి బైడెన్కే ఓటేస్తామని తెలిపారు. ఎన్నారై ఓటర్లలో 72 శాతంమంది బైడెన్కు అనుకూలంగా వుంటే ట్రంప్కు 22 శాతంమంది అనుకూలం. సాధారణంగా భారతీయులెప్పుడూ డెమొక్రాటిక్ పార్టీకే అనుకూలంగా వుంటారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నెగ్గాలని కోరుకున్నవారిలో భారతీయులు గణనీయంగానే వున్నారన్న అభిప్రాయం కలగడానికి అప్పుడు కొంతమంది చేసిన హడావుడి, ఆయన శిబిరంలో ఎన్నికల బాధ్యతలు చూసేవారిలో గణనీయ సంఖ్యలో ఎన్నారైలు వుండటం కొంత కారణం. దాంతోపాటు అప్పట్లో ట్రంప్ కోసం కొందరు యజ్ఞం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్నారై ఓట్లలో 16 శాతం ట్రంప్కు వెళ్లాయని లెక్కలు చెబుతున్నాయి. ఆయనపై పోటీచేసిన డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 77 శాతం ఎన్నారైలు ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే ట్రంప్ ఓట్లు అప్పటికీ ఇప్పటికీ 6 శాతం మేర పెరిగాయి. మరో 6 శాతం మంది ఎటూ తేల్చుకోలేనివారున్నారని తాజా సర్వే వెల్లడించింది. వీరిలో ఎంత శాతాన్ని ట్రంప్ తనవైపు తిప్పుకుంటారన్నది చూడాల్సివుంది. పెన్సిల్వేనియా, మిచిగాన్, ఫ్లారిడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువగా వుంటారు. కనుక అక్కడ వీరి మద్దతు కీలకమవుతుంది. ఎన్నారై ఓటర్లలో ట్రంప్వైపు మొగ్గిన వారి సంఖ్య గతంకన్నా పెరగడానికి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకున్న ఆదరణ కారణం. వాస్తవానికి ఇదింకా ఎక్కువగానే వుండేది. కానీ ట్రంప్ తెంపరితనం దాన్ని తగ్గించింది. ఒకపక్క ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన తరుణంలో ఈ నెల మొదటివారంలో హెచ్ 1బీ వీసాలపై కొత్త ఆంక్షలు విధించారు. అమెరికా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే వీటిని తీసుకొచ్చానని ట్రంప్ ప్రకటించారు. ఎలాంటి కారణం చూపి అయినా ప్రభుత్వం వీసా నిరా కరించడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తున్నాయని, ఇందువల్ల తమకెంతో నష్టం జరుగుతుందని భారతీయులు వాపోతున్నారు. అయితే శ్వేత జాతి అమెరికన్లలో కూడా తన పరపతి తగ్గుతోందని తెలిశాకే ట్రంప్ ఈ కొత్త ఆంక్షల్ని అమల్లోకి తెచ్చారన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థికన్నా దాదాపు 8 నుంచి 10 శాతం అధికంగా ఓట్లు తెచ్చుకున్న అయోవా, ఒహాయో, టెక్సాస్ రాష్ట్రాల్లో ఈసారి కేవలం అయోవా రాష్ట్రంలో మాత్రమే ఆయన లబ్ధి పొందుతారని ఒక సర్వే గతంలో చెప్పింది. అయితే ఒహాయో, ఫ్లారిడాల్లో బైడెన్ వెనకబడ్డారని తాజా సమాచారం. ఈ రెండూ రెండో ప్రపంచ యుద్ధం మొదలుకొని ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఎంపికైనవారి వెనకే వున్నాయి. గత నెల 29న ట్రంప్, బైడెన్ల సంవాదం తర్వాత బైడెన్ ఆధిక్యత కనబరిచారని దాదాపు అన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. ఎన్బీసీ అయితే అంతక్రితం రెండు వారాలకన్నా బైడెన్ ఆధిక్యత ఆరు శాతం పెరిగిందని... ఆయనకు 53 శాతంమంది మద్దతు పలికితే, ట్రంప్కు 39 శాతంమంది అనుకూలంగా వున్నారని తేల్చింది. గత ఎన్నికల్లో తన ప్రత్యర్థికన్నా ఒక శాతం ఓట్ల ఆధిక్యత సాధించిన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యత చాలా ఎక్కువగా వుందన్నది సర్వే చెబుతున్న మాట. ఈ మూడూ పారిశ్రామికంగా ప్రాముఖ్యం వున్నవని, ఇక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువగా వుంటుందని గమనిస్తే ట్రంప్ పరిస్థితి ఎలావుందో అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ గ్రహించబట్టే ట్రంప్ ఉత్సాహంగా వున్నట్టు కనబడేందుకు ప్రయత్నిస్తున్నారు. బైడెన్తో సంవాదం జరిగిన రెండ్రోజుల తర్వాత తనకు కరోనా వైరస్ సోకిందని ఆయన ప్రకటించారు. ట్రంప్ తానే కరోనా వైరస్ బారిన పడటంతో ఆ వ్యాధిని అరికట్టడంలో విఫలమయ్యారన్న ప్రచారాన్ని ధ్రువీకరించినట్టయింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, శక్తివంతంగా కనబడాలని అమెరికన్లు కోరుకుంటారు. అలాంటివారే సమస్యలనుంచి తమను కాపాడగలడన్న నమ్మకం వారికుంటుందంటారు. బైడెన్తో జరిగిన సంవాదంలో ఓటమిపాలై వున్న ట్రంప్కు కరోనా వైరస్ కూడా సోకిందంటే ఇక చెప్పేదేముంది? కనుకనే వ్యాధినుంచి కోలుకున్నవారు పాటించాల్సిన నియమాలను కూడా పక్కనబెట్టి రెండు వారాలు కాకుండానే ఆయన ఎన్నికల రంగంలోకి ఉరికారు. ఇప్పటికే చాలామంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి సంఖ్య కోటీ పది లక్షల వరకూ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ముందుగా ఓటే యడం ఇదే ప్రథమం అంటున్నారు. మిగిలినవారు ఓటేయడానికి ఇక మూడు వారాల సమయం మాత్రమే వుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓటు పెద్దగా పరిగణనలోకి రాదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకమైనవి. గత దఫాలో పాపులర్ ఓటు హిల్లరీ పక్షానే వున్నా ఆమె ఓటమి పాలయ్యారని గుర్తుంచుకుంటే... సర్వేలు చూసి ట్రంప్ను పరాజితుడిగా లెక్కేయడం సరికాదని అర్థ మవుతుంది. ఇంతవరకూ చేసిన సర్వేలన్నిటా ట్రంప్ కన్నా దాదాపు 10 శాతం ఆధిక్యత కనబరు స్తున్నా ఓటర్ల పూర్తి విశ్వాసాన్ని చూరగొనడంలో బైడెన్ విఫలమయ్యారని గ్యాలప్ సంస్థ తేల్చింది. ట్రంప్ మళ్లీ విజేత అవుతారని 56 శాతంమంది ఓటర్లు భావిస్తుంటే... 40 శాతంమంది మాత్రమే బైడెన్ నెగ్గుతారని అనుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. నిరుద్యోగం, వర్ణ వివక్ష, కరోనా వైరస్ వంటి అనేక అంశాలు అమెరికా ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కనుకనే ట్రంప్ గెలుపు అనుమానమేనని సర్వేలు అంటున్నాయి. అందులో ఎంతమేర వాస్తవం వుందో వచ్చే నెలలో తేలిపోతుంది. -
అడుగడుగునా వివక్ష
లైంగిక వేధింపులకు సంబంధించిన ఉదంతాలు వెల్లడైనప్పుడు సమాజంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. కారకులపై చర్యకు అందరూ డిమాండ్ చేస్తారు. కానీ లింగ వివక్ష అలా కాదు. చాలా సందర్భాల్లో అది బాధితులకు తప్ప కనబడదు. వారు ఫిర్యాదు చేస్తే తప్ప ఎవరి దృష్టీ పడదు. ఒక్కోసారి ఫిర్యాదు చేసినా చివరకు అది వివక్షగా పరిగణనలోకి రాకపోవచ్చు. బాధితులు దాన్ని సరిగా చెప్పలేకపోవచ్చు. లింగ వివక్ష బాహాటంగా కనబడినప్పుడు సైతం బాధితులకు అండగా నిలిచే ధోరణి అన్నిచోట్లా వుండదు. అసలది పెద్దగా చర్చకు రాదు. మంగళవారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చాలా నిర్మొహమాటంగా మాట్లాడి మంచి పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమా నాలనూ, అవరోధాలనూ చెప్పారు. అడుగు ముందుకు పడుతున్నా, ఆధునికత విస్తరిస్తున్నా, అభివృద్ధి సాధిస్తున్నామని అనుకుంటున్నా మారనిది ఈ లింగ వివక్ష. పిండ దశతో మొదలుపెట్టి అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో ఇది తప్పడం లేదు. సౌమ్యా స్వామినాథన్ వంటివారు మాట్లాడటం వల్ల ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్నవారు ఆ విషయాన్ని సూటిగా చెప్పగలిగే, గట్టిగా ప్రశ్నించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆమె చెప్పిన విషయాలు వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లో పనిచేసినప్పుడు తాను ఎదు ర్కొన్న వివక్ష గురించి ఆమె చెప్పారు. ఐసీఎంఆర్ మన దేశంలో జీవ వైద్య పరిశోధనలో సర్వో న్నతమైన సంస్థ. 1911లో భారతీయ పరిశోధనా నిధి సంఘం(ఐఆర్ఎఫ్ఏ)గా ఆవిర్భవించిన ఆ సంస్థ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో ఐసీఎంఆర్గా రూపుదిద్దుకుంది. అది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధనా విభాగం సారథ్యంలో పనిచేస్తుంది. గర్భధారణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, అంటురోగాలు, పౌష్టికాహార లోపాలు, కేన్సర్, గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, మానసిక ఆరోగ్యం, ఔషధాలు వగైరాల్లో ఐసీఎంఆర్ పరిశోధనలు చేస్తుంది. సమాజ ఆరోగ్య పరిరక్షణకు అవలంబించాల్సిన ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందిస్తుంది. సగటు మనుషుల్లో కనబడే కుల, మత, ప్రాంత, జెండర్ వివక్షలవంటివి ఇలాంటిచోట తావుండదని అందరూ అను కుంటారు. ఆశిస్తారు. విద్యాపరంగా, మేధోపరంగా ఇక్కడివారు ఉన్నతంగా వుంటారని భావిస్తారు. అయితే సౌమ్య వెల్లడించిన అంశాలు ఇందుకు విరుద్ధంగా వున్నాయి. కమిటీ సమావేశాల్లో ఎప్పుడూ పురుషాధిక్యత రాజ్యమేలుతుందని, పరిశోధనకు సంబంధించి చెప్పేవి పూర్తిగా వినకుండానే కొట్టిపారేయడం లేదా ఆ ఆలోచనను హేళన చేయడం తనకు తరచు ఎదురయ్యేదని ఆమె చెప్పిన మాటలు విషాదం కలిగిస్తాయి. ఇందువల్ల రెండోసారి ఏదైనా ప్రతిపాదించదల్చుకున్నప్పుడు, ఒక అభిప్రాయం చెప్పదల్చుకున్నప్పుడు సంకోచం ఏర్పడేదని కూడా ఆమె చెప్పారు. ఇలాంటిచోట కొత్త ఆలోచనలకూ, సృజనకూ తావుంటుందా? స్వాతంత్య్ర వచ్చి ఏడు పదులు దాటుతున్నా మన దేశంలో అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువే. పాఠశాల విద్యలో చేరిన ఆడపిల్లల్లో ఎక్కువ శాతం అనేకానేక అవాంతరాల వల్ల మధ్యలోనే చదువు చాలించుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్లేసరికి అది మరింతగా తగ్గుతుంది. గతంతో పోలిస్తే శాస్త్ర పరిశోధనా రంగంలో ఇప్పుడు మహిళల శాతం బాగా పెరిగినా అదింకా ఉండవలసినంతగా లేదు. ఇప్పుడే ఇలావుంటే ఆమె కెరీర్లో అడుగుపెట్టేనాటికి ఎలాంటి స్థితి వుండేదో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. మన సమాజంలో కుటుంబం సహాయసహకారాలు, ప్రోత్సాహం లేకపోతే ఆడపిల్లలు అన్నివిధాలా ఎదగటం చాలా కష్టం. భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ కుమార్తెగా మాత్రమే కాదు... సాయుధ దళాల వైద్య కళాశాలలో, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్లో ఉన్నత చదువులు చదివిన ఆమెకు సైతం పనిచేసేచోట వివక్ష తప్పలేదంటే బాధాకరమే. చదువుకునే రోజుల్లో ఎదురుకాని పరిస్థితులు పనిచేసేచోట వున్నాయని ఆమె అంటున్నారు. మహిళా పరిశోధకులు తమ పరిశోధనాంశాలకు గ్రాంట్లు తెచ్చుకోవాలన్నా, వారి పరిశోధనా ఫలితాలు ప్రతిష్టాత్మక పత్రికల్లో ప్రచురింపజేసుకోవాలన్నా సమస్యలెదురవుతుంటా యన్నది ఆమె మరో ఆరోపణ. ఇవి ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు సరిగదా... మరింతగా పెరిగా యంటున్నారామె. ప్రపంచ ఆరోగ్య రంగంలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిలో 70 శాతం వరకూ మహిళలే. కానీ ఆ రంగం తీరుతెన్నులను నిర్ణయించాల్సిన సారథ్య బాధ్యతల్లో వారు 25 శాతం మించరని ఈమధ్య బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్లో కరోనా వైరస్ను ఎదుర్కొనడానికి ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్లో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు వున్నారని ఆ అధ్యయనం తెలిపింది. అచ్చం సౌమ్యా స్వామినాథన్ తరహాలోనే అమెరికాలోని ఎంఐటీలో సైన్స్ చరిత్రను బోధించే మహిళా శాస్త్రవేత్త అభా సూర్ కొన్నేళ్లక్రితం భారత్లోనూ, ఇతరచోట్లా అమల వుతున్న లింగ వివక్షపై ఒక పుస్తకమే రాశారు. 60వ దశకంలో లేజర్ కిరణాల గురించి పరిశో ధించేటపుడు లింగ వివక్షతోపాటు, కుల వివక్ష కూడా వుండేదని ఆమె అన్నారు. మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ బెంగళూరు ఐఐఎస్సీ సారథిగా వున్నప్పుడు మహిళా శాస్త్రవేత్తలకు ఎదురైన ఇబ్బందుల్ని తెలిపారు. తరతమ భేదాలతో దాదాపు అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకూ ఇలాంటి వివక్ష ఏదో ఒక దశలో ఎదురవుతోందన్నది వాస్తవం. కనుకనే ఇప్పుడు సౌమ్య ప్రస్తావించిన అంశాలను ఐసీఎంఆర్ మాత్రమే కాదు...అన్ని సంస్థలూ సీరియస్గా తీసుకుని తమ నిర్వహణా పద్ధతులనూ, విధానాలనూ సమీక్షించి సరిదిద్దుకోవాలి. వివక్ష ఏ రూపంలో వున్నా రూపుమాపాలి. -
ఎడతెగని వానలు
వర్షాలు తగ్గి కాస్త తెరిపిన పడ్డామని అందరూ అనుకునేలోగానే మళ్లీ కుండపోత తప్పకపోవడం ఈసారి వానా కాలం సీజన్ ప్రత్యేకత. నైరుతి రుతుపవనాలు తమ వంతుగా కుమ్మరించి వెళ్లాయో లేదో... ఈశాన్య రుతుపవనాలు జోరందుకున్నాయి. ఈసారి ఈశాన్య రుతుపవనాలు సాధారణం గానే వుండొచ్చని దక్షిణాసియా వాతావరణ ఫోరం గత నెలాఖరున ప్రకటించింది. కానీ అందుకు భిన్నంగా వానలు మోతమోగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయు గుండంగా మారి మంగళవారం తీరం దాటడంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఏకధాటిగా పడుతున్నాయి. సాధారణ ప్రజానీకాన్ని కలవర పెడుతున్నాయి. రిజర్వాయ ర్లన్నీ నిండి...వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్నీ కళకళల్లాడుతున్న తీరు బాగున్నా... సాధారణ జనజీవనం మాత్రం అస్తవ్యస్తమవుతోంది. మానవ తప్పిదాల కారణంగానే వాతావరణ స్థితిగతులు ఇలా మారిపోతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత మూడేళ్లుగా కురు స్తున్న వర్షాలు చూస్తే ఇంచుమించు ప్రతిసారీ 20 సెంటీమీటర్ల వర్షపాతం పడటం గమనించదగ్గ అంశం. 1891– 2017 మధ్య ఏటా సగటున అయిదు తుపానులు ఏర్పడితే... 2018లో ఏడు, 2019లో 8 చొప్పున వచ్చాయి. అరేబియా సముద్రంలో అయితే నిరుడు అయిదు తుపానులు ఏర్ప డ్డాయి. దాదాపు అన్నీ పెను తుపానులే. 1902 నుంచి అక్కడ సగటున ఏటా ఒకటి మాత్రమే వచ్చేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుపానుల తీవ్రత సైతం గతంతో పోలిస్తే ఎంతో ఎక్కువైంది. గత నెల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎర్త్ సైన్స్ విభాగాన్ని కూడా చూస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పిన జవాబు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈమధ్య ప్రతి ఏటా అంతక్రితంతో పోలిస్తే భారీ వర్షాలే ఉంటున్నాయని గణాంకసహితంగా వివరించారు. కనుక భారీవర్షాలే ఇక రివాజుగా మారతాయన్న అంచనాకు రావొచ్చు. ప్రకృతి వైపరీత్యాలను మనం నివారించలేకపోవచ్చు. కానీ వాటివల్ల కలిగే నష్టాలను కనిష్ట స్థాయికి తీసుకెళ్లగలం. సాంకేతికత బాగా పెరిగిన వర్తమానంలో అది తరచు రుజువవుతూనే వుంది. మూడువైపులా సముద్ర జలాలు ఆవరించివున్న మన దేశానికి అల్పపీడనాలు, వాయు గుండాలు, తుపానులు తప్పవు. వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో, వాటి తీవ్రత ఏవిధంగా వుంటుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమో అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు సత్వరం సమాచారం అందుతోంది. ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటు న్నాయి. ఎక్కడెక్కడ సహాయ చర్యలు అవసరమవుతాయో అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా సిబ్బందిని సంసిద్ధం చేస్తున్నాయి. కనుకనే గతంతో పోలిస్తే ప్రాణనష్టం బాగా తగ్గింది. అయితే వర్షాలు పడినప్పుడల్లా నగరాలు నదుల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగి అక్కడుండే పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వస్తున్నది. రోడ్లు సరేసరి. అవి గుంతలు పడి, మ్యాన్హోళ్లు సక్రమంగా లేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులకు ప్రకృతి వైపరీత్యాలను కారణంగా చూపినంత మాత్రాన వాటివల్ల కలుగుతున్న నష్టా నికి మన బాధ్యతను విస్మరించలేం. మన దేశంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, సక్రమమైన రీతిలో జనావాసాల నిర్మాణం లేని కారణంగా కుంభవృష్టితో వచ్చే సమస్యలు ఇంతకింతా పెరుగుతున్నాయి. చాలా నగరాలు ఒకనాటి చిన్న చిన్న జనావాసాల కలయికతో ఏర్పడినవే. అప్పట్లో ఆ జనావాసాల అవసరాలకు అనుగుణంగా వుండే చెరువులు, కుంటలు నగరాలు ఏర్పడే క్రమంలో మాయమయ్యాయి. వాటన్నిటినీ పూడ్చి నిర్మాణాలకు వినియోగించుకునే తీరు క్రమేపీ పెరిగింది. కనుకనే వానాకాలంలో ఆ నీరంతా ఎటూపోయే దారిలేక జనావాసాల్లోకి చొరబడుతోంది. పట్టణీ కరణ, నగరీకరణ మన దేశంలో పాలకుల వైఫల్యాలకు నిదర్శనగా మారుతున్నాయి. ఉపాధి కల్ప నకు తోడ్పడే కేంద్రాలన్నీ నగరాలు, పట్టణాల్లోనే వుండటంతో ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం అందరూ వాటికే వలసపోవలసి వస్తోంది. దాంతో అవి జనంతో కిక్కిరిసి క్రమేపీ ఇరుగ్గా మారు తున్నాయి. భూముల ధరలకు రెక్కలొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా పెరుగుతుండొచ్చు. కానీ వలసవస్తున్న లక్షలాదిమంది అవసరాలకు అను గుణంగాఉండటం లేదు. డ్రెయినేజీ సదుపాయం మొదలుకొని ఏదీ సరిగ్గా లేక సమస్యలబారిన పడుతున్నాయి. ప్రణాళిక అంటే వర్తమానాన్ని గమ్యరహితంగా మార్చడం కాదు...భవిష్యత్తును వర్తమానం లోకి తీసుకురావడమని అమెరికన్ రచయిత అలెన్ లెకిన్ అంటారు. చాలాముందు చూపుతో యోచించి అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నప్పుడే నగరాలు మెరుగ్గా వుంటాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలున్నచోట వాటికి సంబంధించిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు వంటివి పరిగణనలోకి తీసుకుని నగరాల్లోని నిర్మాణాలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎంగా వున్నప్పుడు కృష్ణా కరకట్టపై జరిగిన అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవా ల్సింది పోయి, తానే స్వయంగా అందులో ఒకటి ఆక్రమించుకుని నివాసమున్నారు. పైపెచ్చు తానే ప్రజావేదిక పేరిట ఒక భవనాన్ని నిర్మించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ భవంతిని కూలిస్తే బాబు నానా హడావుడీ చేశారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా అమరావతి, ప్రత్యేకించి కరకట్ట ప్రాంతం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో వున్నాయో అందరికీ కనబడుతూనే వుంది. భారీగా వరద నీరు వచ్చిచేరే అవకాశం కనబడటంతో బాబు నివాసంతోసహా కరకట్ట ప్రాంత వాసులంతా ఖాళీ చేసి వెళ్లాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వాల్సివచ్చింది. రాను రాను మన దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం వుంది గనుక పాలకులు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలి. -
అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి
చైనాతో ఆసియా ప్రాంత దేశాలకూ, ప్రత్యేకించి భారత్కూ రాగల ముప్పు గురించి ఇటీవలకాలంలో అమెరికా ఒకటికి రెండుసార్లు హెచ్చరించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా 60,000మంది సైనికులను మోహరించిందని, అందువల్ల తక్షణం భారత్కూ, ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకూ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ఈమధ్యే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా హెచ్చరించారు. ఆయన మాత్రమే కాదు... అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ సైతం ఇలాగే ధ్వనించారు. మన దేశంలో మూడురోజుల పర్యటన కోసం సోమవారం వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి స్టీఫెన్ బీగన్ ఉద్దేశం కూడా ఇదే. అయిదు నెలలనుంచి చైనా ఎల్ఏసీ వద్ద పేచీ పెడుతోంది. మే 5న ఇరు దేశాల సైనికుల మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. చైనా సైనికులు మన జవాన్లు 20మందిని కొట్టిచంపారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్యా కోర్ కమాండర్ స్థాయి చర్చలు మొదలుకొని రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల వరకూ సాగుతున్నా ప్రతిష్టంభన మాత్రం ముగియలేదు. శతఘ్నులు, క్షిపణులు, తుపాకులతో ఇరు దేశాల సేనలూ అక్కడ సర్వసన్నద్ధంగా వున్న వైనం చూస్తుంటే అది ఏ క్షణమైనా ఘర్షణలకు దారితీయొచ్చునన్న సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చేస్తున్న హెచ్చరికలు కొట్టిపడేయనవసరం లేదు. అయితే మన దేశం మొదటినుంచీ సరిహద్దు తగాదాల విషయంలో వ్యూహాత్మకమైన స్వయంప్రతిపత్తిని పాటిస్తోంది. అటు పాకిస్తాన్తో వున్న వివాదాన్నయినా, ఇటు చైనాతో వున్న వివాదాన్నయినా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడంపైనే ఆసక్తి చూపుతోంది. మూడో దేశం మధ్యవర్తిత్వం ప్రతిపాదనను మన దేశం పలుమార్లు ఖండించింది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి– చారిత్రకంగా ఆసియా ఖండ దేశాల మధ్య వున్న సంబంధాలు, రెండు–ఆ వివాదం మాటున వేరే రాజ్యాల పెత్తనం నచ్చక పోవడం. కనుకనే అటు పాకిస్తాన్ నుంచి, ఇటు చైనా నుంచి ఎన్ని సమస్యలున్నా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృక్పథాన్నే ప్రకటిస్తోంది. మన దేశంతో యుద్ధం వచ్చినప్పుడు గతంలో ఎదురైన చేదు అనుభవాలరీత్యా పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడంపైనే దృష్టి పెడుతోంది. సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్సహించి, భారత్లో... ముఖ్యంగా కశ్మీర్లో కల్లోలం సృష్టించాలని పన్నాగాలు పన్నుతోంది. చైనా ఆ దేశానికి మద్దతుగా నిలవడమే కాక, ఇటీవలకాలంలో ఎల్ఏసీ పొడవునా కుంపటి రాజేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో స్టీఫెన్ బీగన్ మన దేశానికి రావడం, భారత్–అమెరికాల మధ్య ఈ నెలాఖరున జరిగే 2+2 వ్యూహాత్మక సమావేశానికి సంబంధించిన అంశాలు ఖరారు చేసుకోవడం చైనాకు కంటగింపుగానే వుంటుంది. ఈ నెల మొదట్లో మైక్ పాంపియో సైతం ఈ సమావేశం గురించే చర్చించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోనూ, ఇతరచోట్లా సమష్టిగా పనిచేయడానికి, శాంతి సాధ నకు, పటిష్టమైన భద్రత కల్పించడానికి రెండు దేశాల భాగస్వామ్యం అవసరమవుతుందని అమెరికా ఎప్పటినుంచో పట్టుబడుతోంది. చైనాతో అమెరికాకున్న విభేదాలు తక్కువేం కాదు. వాణిజ్య రంగం మొదలుకొని సాంకేతికత, కరెన్సీ, హాంకాంగ్ తదితర అంశాల్లో అవి పరస్పరం సంఘర్షిస్తున్నాయి. అదే సమయంలో చైనా విషయంలో అమెరికా ఊగిసలాట ధోరణినే ప్రదర్శిస్తోంది. చైనాను బెది రించి, ఏదోమేరకు తనకు సానుకూలమైన నిర్ణయం తీసుకునేలా చేయడానికి అది శాయశక్తులా ప్రయత్నించి కొన్నిసార్లు సఫలమవుతోంది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ ఊగిసలాట మరింత పెరిగింది. ఆయన ఎప్పుడు చైనాను ప్రశంసిస్తారో, ఎప్పుడు దూషించి విరుచుకుపడతారో అనూహ్యం. చైనాతో భారత్కు ముప్పు వుందని, తమ సాయం లేనిదే భారత్ నెగ్గుకురాలేదని ఇప్పుడంటే మైక్ పాంపియో చెబుతున్నారుగానీ... ఇటీవలకాలంలో ఒకటికి రెండుసార్లు భారత్–చైనాలు సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి వీలుగా మధ్యవర్తిత్వం నెరపుతానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరపడానికి మన దేశానికి గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా అభ్యంతరాలు లేవు. ఈ అంశంలో ఇప్పటికే పలు దఫాలు ఇరు దేశాలూ చర్చించు కున్నాయి. కానీ ప్రతిసారీ అమెరికాలో కనబడే ఊగిసలాట ధోరణే మన దేశాన్ని అయోమయంలో పడేస్తోంది. వ్యూహాత్మక ఒప్పందం తర్వాత రక్షణ కొనుగోళ్లు, సమష్టి ఉత్పత్తి తదితర అంశాలతో సహా అన్నింటిలోనూ భారత్ తమతో కలిసి నడవాల్సివుంటుందని పాంపియో నిరుడు నేరుగానే చెప్పారు. అమెరికా–చైనా సంబంధాలు మాత్రమే కాదు... అమెరికా–రష్యా సంబంధాలు కూడా ఇటీ వలకాలంలో క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు నెరపడం మన ప్రయోజనాలకు ఎంతవరకూ ఉపయోగమో మనం తేల్చుకోవాల్సి వుంటుంది. నాటో సభ్యదేశంగా వున్న టర్కీ నిరుడు రష్యాతో కుదుర్చుకున్న ఎస్–400 క్షిపణి ఒప్పందం, జర్మన్ సంస్థలకు రష్యాతో నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుపై కుదిరిన ఒప్పందంవంటి అంశాల్లో అమెరికా స్పందన ఎంత తీవ్రంగా వుందో అందరికీ తెలుసు. టర్కీపై అది ఆంక్షలు కూడా విధించింది. చైనాతో మనకు సమస్యలున్నమాట వాస్తవం. అందుకు అమెరికా సహాయసహకారాలు కూడా మనకు అవసరం. కానీ ఇతరులతో మనం స్వతంత్రంగా, మన అవసరాలకు తగ్గట్టు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆటంకమయ్యేలా ఆ సహాయసహకారాలు ఉండకూడదు. పైగా అమెరికా తన అవసరాలరీత్యా ఎప్పటికప్పుడు భిన్నమైన వైఖరులు ప్రదర్శిస్తూపోతుంటే అందుకు అనుగుణంగా మనం మారలేం. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న స్టీఫెన్ బీగన్కు ఈ సంగతే స్పష్టం చేయాలి. -
కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వారిని నిరోధిస్తుందని, ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాలనుంచి తప్పుకోవడంతోపాటు రాజకీయంగా ప్రేరేపితమైన ధోరణిగా వ్యాఖ్యనించడం గమనార్హం. దేశంలో మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వం చాలా పాజిటివ్ ధోరణితో ఉందని ఆరోపించింది. పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య వాస్తవాలను దాచి, ప్రజల్లో తప్పుడు ఆశలను కల్పించవద్దని దేశ నాయకులకు పిలుపునిచ్చింది. అసలు నిజాలు చెప్పకుండా, కప్పివుంచడం అంటే ఆరోగ్య సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించకుండా ప్రజలను నిరోధించcడమేనని వ్యాఖ్యానించింది. నివారణ చర్యల పట్ల ప్రజల్లో అనిశ్చితికి దారి తీయడమే కాకుండా, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని లాన్సెట్ పేర్కొంది. ఆశావాదాన్ని ప్రోత్సహించే ఒత్తిడికి దేశ శాస్త్రీయ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపింది. మహమ్మారి ప్రారంభం తగిన సాక్ష్యాలు లేనప్పటికీ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ న్వాడకంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది.అలాగే స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ టీకాను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటనను కూడా తప్పుబట్టింది. ఇది వివాదాస్పదంగా ఉందని సంపాదకీయం పేర్కొంది. ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు ఉందని భారత ప్రభుత్వం వాదించడాన్ని లాన్సెట్ సవాలు చేసింది. కేసులు,మరణాల డేటా పారదర్శకతను తప్పుబట్టింది ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా నివేదించినా, ఈ సంఖ్యలు పోల్చదగినవా కావా అని తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ సందేహాలను వ్యక్తం చేసింది. మహమ్మారిని నిలువరించే సామర్థ్యం భారతదేశానికి ఉందనీ, కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. వైద్యం, మందులు, ప్రజారోగ్యం, పరిశోధన, తయారీలో తగినంత నైపుణ్యం ఉందని పేర్కొంది. తప్పుడు ఆశావాదాన్ని ప్రజలకు అందించకుండా వీటన్నింటిని ఉపయోగించాలని, గౌరవించాలని హితవు పలికింది. అయితే కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది. -
ట్రంప్ బెదిరింపు ధోరణి
మొదటినుంచీ కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమెరికాను రోగగ్రస్తం చేసిన ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. కరోనా వైరస్ను నియంత్రించడానికి బ్రహ్మాండంగా పనికొస్తుందని తాను విశ్వసిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం ఎగుమతులపై మన దేశం నిషేధం విధించిందనగానే ఆయన చేసిన వ్యాఖ్యానం ఇందుకు నిదర్శనం. ‘అదే నిజమైతే భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామ’ంటూ ఆయన విరుచుకుపడ్డారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి ట్రంప్ చాన్నాళ్లుగా మాట్లాతున్నారు. వైద్యులు రోగిని అన్నివిధాలా పరీక్షించి, తమ పర్యవేక్షణలో మాత్రమే దాన్ని వాడవలసివుంటుందని, ఎవరికి తోచినట్టు వారు ఉపయోగిస్తే ప్రాణాలకు ముప్పు తెస్తుందని అమెరికాలోని వైద్య నిపుణులు ఇప్పటికే ట్రంప్కు చెప్పారు. అయినా ఆయన తలకెక్కలేదు. ఆ మందు గురించి తరచుగా చెబుతూనేవున్నారు. దీనికి, మన దేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసెటమాల్ ఎగుమతులపైనా నిషేధం విధించడానికి సంబంధం లేదు. ఈ ఆపత్కాలంలో మన దేశానికే వాటి అవసరం పడవచ్చునన్న ముందస్తు ఆలోచనతో రెండురోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధిగ్రస్తులకు ఇది పరిమితంగానే ఉపయోగపడినా, వారి బాగోగులు నిత్యం చూసే వైద్యులు ముందుజాగ్రత్తగా వాడాల్సివుండొచ్చని నిపుణులు తేల్చారు. పైగా మన దేశంలో మలేరియా వ్యాధిగ్రస్తులు కూడా ఎక్కువ గనుక ఆ మందు అందుబాటులో వుండటం అవసరమని భావించారు. నిపుణులతో చర్చించి, పాలనావ్యవహారాల్లో ముఖ్యపాత్ర పోషించేవారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ట్రంప్కు ఈ గొడవ లేదు. తాను అనుకున్నదే జరగాల నుకుంటారు. కరోనా వైరస్ విషయంలోనూ ఆయన తీరు మొదట్లో అదే మాదిరి వుంది. దాని ప్రభావం తమ దేశంపై ఉండదుగాక ఉండదని ట్రంప్ బలంగా నమ్మారు. అందుకే చాన్నాళ్లు పట్టించుకోవడం మానేశారు. ఈలోగా ఎవరో ఆయనకు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటించారు. తన విశ్వాసానికి శాస్త్రీయ ప్రాతిపదిక వున్నా లేకున్నా, ఆ ఔషధం అత్యవసరమని ట్రంప్ భావించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. దానిపై నిర్ణయం తీసుకోవడానికి కాస్తయినా వ్యవధి ఇవ్వకుండానే ఈలోగా నోరు పారేసుకున్నారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు కావస్తున్నా దౌత్య మర్యాదలు ట్రంప్కు ఒంటబట్టలేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది. అమెరికా ఇలా అహంభావంతో మాట్లాడటం కొత్తేమీ కాదు. వేరే దేశాలతో వైరం ముదిరిన సందర్భాల్లో గతంలో అధ్యక్షులుగా వున్నవారు ఈ మాదిరే హెచ్చరికలు చేసేవారు. కానీ అకారణంగా నోరు పారేసుకోవడంలో ట్రంప్ వారిని మించిపోయారు. ఆయనకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పదం ఉపయోగించాలో కూడా తెలియదు. భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ దిగుమతి చేసుకుంటామని, దీనిపై మోదీతో మాట్లాడానని ట్రంప్ చెప్పాక, ఈ నిషేధం సంగతిని ఒక విలేకరి ప్రస్తావించారు. అంతటితో ఆగక వైద్య ఉపకరణాల ఎగుమతిని అమెరికా నిషేధించినందువల్లే అందుకు జవాబుగా భారత్ ఈ పని చేసివుండొచ్చనుకుంటున్నారా అని కూడా అడిగారు. అంతక్రితం మాటెలావున్నా భారత్–అమెరికాల మధ్య మూడు దశాబ్దాలుగా గాఢమైన అనుబంధం ఉంది. దీనికితోడు ఇరు దేశాధినేతల మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. ఈ నేపథ్యంలో మరొకరెవరైనా అయితే ఆ నిషేధం ఉండబోదని ఆశిస్తున్నట్టు చెప్పేవారు. కానీ ట్రంప్ మాత్రం ఇరు దేశాల మధ్యా వున్న వాణిజ్యసంబంధాల చరిత్ర, అందువల్ల ఎప్పుడూ మన దేశమే ‘లాభపడుతున్న’ వైనం ఏకరువు పెట్టారు. మోదీ నిర్ణయం అదే అయితే అందుకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. అయితే ఏ దేశానికి ఆ దేశం తమ స్థితిగతులెలావున్నాయో చూసుకుని వేరే దేశాలకు ఎంతవరకూ సహకరించగలమన్నది నిర్ణయించుకుంటాయి. తనకు మాలిన ధర్మాన్ని ఏ దేశమూ చేయలేదు. వైద్య ఉపకరణాల విషయంలో అమెరికా అయినా, ఔషధాల విషయంలో మన దేశమైనా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాయని బోధపడుతుంది. అయితే నిర్ణయాన్ని సడలించుకోవాలని ఏ దేశమైనా అభ్యర్థించడం సహజం. కొన్ని సందర్భాల్లో అధిక మొత్తం వెచ్చించి కొనడానికి కూడా సిద్ధపడే సందర్భాలుంటాయి. ఈమధ్యే వేరే దేశం కోసం చైనా సిద్ధం చేసిన మాస్క్లను అమెరికా తన్నుకుపోయిందని వార్తలొచ్చాయి. తాను వైద్య ఉప కరణాల ఎగుమతిని నిలిపేసినా తప్పులేదు. వేరే దేశానికి వెళ్లాల్సిన మాస్క్లు హైజాక్ చేసినా పర్వాలేదు. కానీ తాను అవసరమనుకునే ఔషధం ఎగుమతిని మాత్రం ఏ దేశమూ నిషేధించ కూడదు. ఇదీ అగ్ర రాజ్య నీతి! ఇప్పుడు కేంద్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్పై వున్న నిషేధాన్ని ఎత్తివేసింది. కేవలం దేశంలో నిల్వలు ఏ స్థాయిలో వున్నాయో, మన అవసరాలకు సరిపోతాయో లేదో లెక్క చూసుకోవడానికి తాత్కా లికంగా ఎగుమతులు ఆపాలన్న నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు దాన్ని తొలగిస్తున్నామని మన విదేశాంగ ప్రతినిధి చెప్పారు. నిరుడు అమెరికాకు కావలసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరాల్లో 47శాతం మన ఫార్మా కంపెనీలే తీర్చాయి. ఈ ఔషధాన్ని అమెరికాకు సరఫరా చేసే తొలి పది సంస్థల్లో మన దేశానికి చెందినవే అధికం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం వున్నవారికి ఆ ఔష ధాన్ని అందిస్తామని మన దేశం అభయమివ్వడం మెచ్చదగ్గ నిర్ణయం. కానీ ట్రంప్ బెదిరింపు ధోర ణితో మాట్లాడటం సరికాదని కూడా చెప్పవలసింది. వాణిజ్యపరమైన వివాదాలేమైనా వుంటే సామ రస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. నోరు పారేసుకుని పనులు చక్కబెట్టుకుం దామనుకునే ధోరణి సరికాదు. -
సముచిత నిర్ణయమేగానీ...
అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పదు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన వర్తమానంలో ఎంపీల జీతభత్యాల్లో 30 శాతం కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించడం కూడా ఇటువంటిదే. దీంతోపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇదే తరహాలో తమ జీతాలు తగ్గించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మాజీ ఎంపీలకిచ్చే పింఛన్లకు కూడా ఈ కోత వర్తిస్తుంది. ఇదంతా ఏడాదిపాటు అమల్లోవుంటుంది. ప్రధాని, కేంద్రమంత్రులు, సహాయమంత్రులు అందరూ దీని పరిధిలోకొస్తారు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాప్రతినిధులకూ, ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే జీతభత్యాల్లో కొంత శాతం కోత విధించాయి. ఈ మొత్తాన్ని అనంతరకాలంలో చెల్లిస్తామని ప్రకటించాయి. ఇప్పుడు కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయాన్ని గమనిస్తే, సర్వశక్తులూ కేంద్రీకరించి పనిచేస్తే తప్ప దీన్ని దుంపనాశనం చేయడం అసాధ్యం. కనుక ఆ దిశగా రాగలకాలంలో మరిన్ని చర్యలు తప్పకపోవచ్చు. వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కోసం ఆసుపత్రులను, సిబ్బందిని సిద్ధంగా వుంచడం, చికిత్స చేయడం, అందుకు అవసరమైన ఔషధాలు, చికిత్సకు అవసరమైన ఉపకరణాలు సమీక రించడం భారీ యజ్ఞంవంటిది. పన్నుల రూపంలో, సుంకాల రూపంలో వివిధ పద్దులకింద ప్రభు త్వాలకు సమకూరే ఆదాయం కూడా వీటన్నిటికీ ఎక్కడా సరిపోదు. ఇందువల్లే స్తోమత వున్నవారు విరివిగా విరాళాలివ్వాలని పిలుపునిస్తున్నాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కోత దీనంతటికీ కొనసాగింపే. దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నదో మీడియాలో నిత్యం వచ్చే వార్తా కథనాలు వెల్లడిస్తూనే వున్నాయి. లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలూ మూతబడి ఉత్పాదక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా ఆగిపోక తప్ప లేదు. సామాన్యులంతా ఈ పర్యవసానాలు అనుభవిస్తున్నారు. పూట గడవడం ఎలాగో తెలియక మహానగరాలను నమ్ముకుని ఇన్నాళ్లూ బతుకు బండి ఈడుస్తున్న నిరుపేద వర్గాల ప్రజలు గత్యం తరం లేని స్థితిలో స్వస్థలాలకు తిరుగుముఖం పట్టడం మీడియాలో అందరూ చూశారు. ఇప్పుడొ చ్చిన ఈ విపత్తు ఇంతక్రితం మానవాళి ఎదుర్కొన్న ఉత్పాతాలన్నిటినీ తలదన్నేంత తీవ్ర స్థాయిలో వుంది. ఈ వైరస్ సృష్టిస్తున్న జీవన విధ్వంసం సాధారణమైనది కాదు. అందరూ తమకు చేతనైనం తగా సాయం చేస్తేనే, తమకు తారసపడిన నిస్సహాయులకు ఏదో రూపంలో చేయూతనందిస్తేనే ఈ విషాద దశను దాటడం సాధ్యమవుతుంది. వ్యక్తులుగా కొందరు, అనేక స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కృషిలో పాలుపంచుకుంటున్నాయి కూడా. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీఎం సహాయనిధు లకు విరాళాలు భారీగా అందుతున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన పీఎం కేర్స్కు ఇంతవరకూ దాదాపు రూ. 6,500 కోట్ల మేర విరాళాలు వచ్చాయంటున్నారు. ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కోత విధించడంతోపాటు ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీలాడ్స్) నిధులను రెండేళ్లపాటు నిలిపివేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం. ఈ కారణంగా ప్రభుత్వానికి రూ. 7,900 కోట్లు సమకూరుతాయి. ఎంపీల జీతభత్యాలకు విధించే కోతలవల్ల వచ్చే నిధులతోపాటు ఈ నిధులు కూడా ప్రభుత్వ సంచితనిధికి తరలుతాయి. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సర్కారు ఎంపీలాడ్స్ పథకాన్ని అమల్లోకి తెచ్చి ప్రతి ఎంపీ ఏడాదికి అయిదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసేందుకు అవకాశమిచ్చింది. ఆ మొత్తాన్ని మరుసటి సంవత్సరం కోటి రూపాయలకు పెంచింది. అది క్రమేపీ పెరుగుతూ వచ్చి ఇప్పుడు పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నిధుల్ని సమర్థవంతంగా వినియోగించి తమ తమ పరిధుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాన్ని మెరుగ్గా వినియోగించనివారూ, అసలు దాని జోలికే పోనివారు కూడా వుంటున్నారు. కరోనా వైరస్పై పోరుకు అవసరమైన నిధులు సమీకరించడం కోసం ఈ ఎంపీలాడ్స్ను కూడా రెండేళ్లపాటు ఆపేయాలనుకోవడం కంటే, ఆ నిధుల్ని మరో పద్ధతిలో వినియోగించడానికి వీలు కల్పిస్తే బాగుండేది. వాటిని సంచితనిధికి తర లించడం కాక ఆ ఎంపీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు కేటాయిస్తే కరోనా వైరస్తో పోరాడు తున్న ప్రభుత్వాలకు చేయూతనిచ్చినట్టు అయ్యేది. పన్నులు, సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటా గతంతో పోలిస్తే తగ్గింది. పైగా కేంద్రంనుంచి రావాల్సిన బకాయిలు కొన్ని పెండింగ్ వున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో పలు రాష్ట్ర ప్రభు త్వాలు దాదాపు ఒంటిచేత్తో ఈ మహమ్మారిపై పోరాడుతున్నాయి. అటు మహమ్మారిని ఎదుర్కొన డానికి, ఇటు నిరుపేద వర్గాలకు చేయూతనీయడానికి అవసరమైన నిధులు అందుబాటులో వుంటేనే రాష్ట్రాలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతాయి. సంచిత నిధికి వెళ్లే వివిధ రకాల మొత్తాలన్నీ ఎటూ రాష్ట్రాల్లో వ్యయం చేస్తారు. దాన్నెవరూ కాదనరు. కానీ చాలాచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికి ప్పుడు నిధుల అవసరం ఎంతోవుంది. ఆ అవసరాన్ని తీర్చడానికి ఎంపీలాడ్స్ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి దాదాపు రెండు వారాలు కావస్తోంది. పౌరుల కదలికలపై తప్ప సరుకు రవాణాకు ఎలాంటి అడ్డంకులూ వుండబోవని కేంద్ర ప్రభుత్వం ప్రక టించినా రాష్ట్రాల మధ్యా, కొన్ని రాష్ట్రాల్లో వివిధ జిల్లాల మధ్యా ఇంకా సరుకు రవాణాకు, ముఖ్యంగా ఔషధాలకు ఆటంకాలు ఎదురవుతూనే వున్నాయి. పర్యవసానంగా కొన్ని సరుకులు మార్కెట్ల నుంచి మాయమైతే, మరికొన్నిటి ధరలు చుక్కలంటుతున్నాయి. ఇప్పుడెదురవుతున్న ఇబ్బందులతోపాటు, మున్ముందు ఎదురుకాబోయే సమస్యలేమిటో అంచనా వేసుకుని, రాష్ట్రాల సహకారంతో వీటన్నిటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది. -
సేవ చేసేవారిపై దాడులా?
కరోనా మహమ్మారి కాటేయాలని చూస్తున్న వర్తమానంలో వైద్య సిబ్బంది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయాల్సివస్తున్నదో తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో వైద్యులపై రెండురోజుల్లో జరిగిన దాడులు వెల్లడించాయి. గడిచిన మూడు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య రెట్టింపయింది. అంతక్రితం రెండురోజుల పరిస్థితితో బేరీజు వేస్తే ఒక్కసారిగా ఇలా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొత్తగా వెల్లడైన రోగుల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లొచ్చినవారే అధికం. వారిలో అనేకమంది ఇంకా వైద్య పర్యవేక్షణలో వున్నారు. అమెరికా తదితర దేశాలతో పోలిస్తే అదృష్టవశాత్తూ మన దేశంలో బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య ఇంకా తక్కువే. లాక్డౌన్ పటిష్టంగా అమలు కావడం వల్లే ఇది సాధ్యమైంది. ఇన్నాళ్లుగా విదేశాలనుంచి వచ్చిన వారిపైనే ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయి. వారి కుటుంబసభ్యులను, వారిని కలిసిన ఇతరులను పరీక్షించడంవంటివి చేశాయి. కొత్తగా బయటపడిన నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతంతో ఆ సదస్సుకు వెళ్లినవారిని గుర్తించి, తరలించడం మొదలైంది. సింగపూర్, దక్షిణ కొరియాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో మనమింకా వెనకబడి వుండటం వల్ల పూర్తి స్థాయిలో నియంత్రించడం సాధ్యపడటంలేదు. పకడ్బందీ నిఘా వుంచడం, గరిష్టంగా పరీక్షలు జరపడం, వైద్యులకు అవసరమైన రక్షణ ఉపకర ణాలు అందించడం వగైరాల్లో లోటు కనిపిస్తోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో సేవలందిస్తున్న అయి దారుగురు వైద్యులు ఈ వ్యాధిబారిన పడటం ఇందువల్లే. ఈ నేపథ్యంలోనే వైద్యులకు, ఇతర సిబ్బందికి అవసరమైన ఉపకరణాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే రాగల వారాల్లో పరీక్షలు, రోగుల గుర్తింపు, తరలింపు వంటి అంశాలపై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పిలుపునిచ్చారు. ఉన్నకొద్దీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం వుండటం వల్ల వైద్యులపై ఒత్తిళ్లు పెరుగుతాయని ఇప్పుడు జరిగిన ఘటనలు తెలియజేస్తున్నాయి. ఇతర రంగాల్లో పనిచేస్తున్నవారితో పోలిస్తే వైద్యులు తమ పని గంటల్ని మించి వుండవలసి వస్తుంది. డ్యూటీ ముగుస్తున్న సమయంలో అనుకోకుండా ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా రోగి వస్తే చికిత్స మొదలెట్టక తప్పదు. మన దేశంలో వైద్యుల సంఖ్య చాలా దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రస్తుతం సగటున 1,404 మంది పౌరులకు ఒక డాక్టర్ వున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వేయిమందికి ఒక డాక్టర్ వుండాలని సూచించింది. వాస్తవానికి దేశంలో ఇప్పుడున్న 9.61 లక్షలమంది వైద్యుల్లో 52 శాతంమంది మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో వున్నారు. మిగిలిన రాష్ట్రాలన్నిటిలో మిగిలిన 48శాతంమంది వున్నారని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత నెలలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ నమోదైన వైద్యుల్లో రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర–15 శాతం, తమిళనాడు–12 శాతం, కర్ణాటక–10శాతం, ఆంధ్రప్రదేశ్–8 శాతం, ఉత్తరప్రదేశ్–7 శాతంమంది వున్నారని మంత్రి వివరించారు. ఢిల్లీ, అస్సాం, ఒడిశాల్లో 2 శాతం, తెలంగాణ, హరియాణా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్లలో ఒక శాతం చొప్పున వైద్యులు వున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య కళాశాలలు పెంచకపోవడం వల్ల, ఉన్నతశ్రేణి ఆస్పత్రుల్ని నెలకొల్పకపోవడం వల్ల ఈ పరిస్థితి వుంది. అందువల్లే రోగుల సంఖ్య పెరగకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యంగా మారింది. ఇందులో భాగంగానే దేశంలో చాలాచోట్ల అనుమానితుల్ని గుర్తించి, తరలించడానికి వైద్యులు, ఇతర సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైద రాబాద్లో కరోనా రోగి చనిపోయినందుకు ఆగ్రహించి అతని బంధువులు దాడి చేశారు. ఇతరత్రా వ్యాధులుండి, ఈ కరోనా బారినపడే వృద్ధులకు మిగిలినవారితో పోలిస్తే ప్రమాదం ఎక్కువని వివిధ మాధ్యమాల ద్వారా వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ కొందరిలో మూర్ఖత్వం ఇంకా పోలేదని ఈ ఉదంతం చాటుతోంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో అదే రోజు కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని గుర్తించి అతనికి పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన వారిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా డాక్టర్లు గాయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్లో, కర్ణాటకలోని బెంగళూరులో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా ఈమాదిరి దాడులు జరిగాయి. కరోనా వ్యాధికి సంబంధించినంతవరకూ మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో సంక్లిష్టమైనవి. సకాలంలో రోగుల్ని గుర్తించడంలో, వారికి వైద్య చికిత్స అందించడంలో జాప్యం జరిగితే ప్రాణనష్టం తప్పదు. పైగా తమకు రోగం వచ్చిన సంగతి గుర్తించకుండా ఇష్టానుసారం ఎటుపడితే అటు వెళ్లేవారివల్ల చుట్టూవున్న సమాజానికి కూడా చేటు. ఈ పరిస్థితుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలొడ్డి పనిచేస్తున్నారు. సాధారణ సమయాల్లోకన్నా ఎక్కువగా వారు ఆసు పత్రుల్లో గడపవలసి వస్తోంది. వారందిస్తున్న సేవల్ని సమాజం గుర్తించాలని, వారికి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని పిలుపునిస్తే గత నెల 22న జనమంతా పాటించారు. కానీ కొందరు ఆ పిలుపు వెనకున్న స్ఫూర్తిని మరిచి ఇలాంటి దాడులకు దిగుతున్నారు. కరోనా వ్యాధిని గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన అమెరికా అందుకు మూల్యం చెల్లి స్తోంది. భారీ సంఖ్యలో ఆసుపత్రులు, వైద్యులు అందుబాటులో వుండి, అత్యంతాధునిక వైద్య సదుపాయాలున్నా క్షణక్షణానికీ పెరుగుతున్న రోగుల సంఖ్యతో ఏం చేయాలో తెలియక ఆ దేశం తలపట్టుకుంది. వైద్య సిబ్బంది కృషికి అడ్డుతగిలితే ఇక్కడ కూడా ఆ పరిస్థితులే ఏర్పడతాయి. ఇలాంటి దుండగులతో కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. వైద్యుల కృషికి సహకరిస్తేనే సమాజం సురక్షితంగా వుండగలుగుతుందని అందరూ గుర్తించాలి. -
రాష్ట్రాలకు చేయూత ఏది?
కరోనాపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమరంలో మన దేశం కూడా పూర్తిగా నిమగ్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆ మహమ్మారిపై సమష్టిగా బహుముఖ పోరు కొనసాగిస్తున్నాయి. ఊహించనివిధంగా వచ్చిపడిన ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొనడానికి దేశమంతా లాక్డౌన్ ప్రకటిం చడం, వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి, వారిని పరిశీలన కేంద్రాలకు తరలించడం, ఆసుపత్రుల్లో చికిత్స అందించడం, నిరుపేద వర్గాలకు రేషన్ అందించడం, నగదు సాయం చేయడం వగైరాలకు ప్రభు త్వాలన్నీ భారీ మొత్తం వ్యయం చేయాల్సివస్తోంది. అదే సమయంలో నిత్యావసరాలు, ఔషధాలు విక్రయించే దుకాణాలు తప్ప ఇతర వాణిజ్య కార్యకలాపాలన్నీ స్తంభించి ఖజానాలు బోసిపోతు న్నాయి. పలు ప్రభుత్వాలు సిబ్బంది జీతాల్లో తాత్కాలికంగా కోత విధించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ ముగిశాక తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అటు ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే తీసుకున్న చర్యల్ని తెలియ జేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాగల వారాల్లో కరోనాపై మరింత తీవ్రంగా పోరాడవలసివుంటుందని ప్రధాని చెప్పడాన్ని గమనిస్తే రాష్ట్రాలు నిర్వ ర్తించాల్సిన కర్తవ్యాలు మున్ముందు చాలానే వుండొచ్చు. ఈ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి మాస్క్లు, వ్యక్తిగత పరిరక్షణ ఉపకరణాలు మొదలుకొని రోగులకు సిద్ధం చేయాల్సిన వెంటిలేటర్లు, ఔషధాల వరకూ ఎన్నో అందుబాటులోకి తీసుకురావాల్సివుంటుంది. వీటికితోడు ఈ పంట దిగుబడుల కాలంలో వాటిని కొనడానికి రాష్ట్రాలు భారీగా వెచ్చించాల్సివుంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాల ఆదాయ వనరులూ ఒకేలా లేవు. కొన్ని రాష్ట్రాలు పారిశ్రామికంగా, వాణి జ్యపరంగా ముందంజలో వుంటే మరికొన్ని ఎంతో వెనకబడి వున్నాయి. ఆరేళ్లక్రితం విభజన అనం తరం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ అప్పటినుంచీ ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. ఆ సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేసి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని విపక్ష నేతగా ఉన్నప్పటినుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనేవున్నారు. గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా వదులుకుని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. పైగా ఆయన పాలన రెండున్నర లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది. ఇలాంటి అననుకూల వాతావరణంలో వచ్చిపడిన కరోనా సంక్షోభం వల్ల ఆదాయం మరింతగా తగ్గింది. అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను వగైరాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పడి పోయింది. అయినా కరోనాను ఎదుర్కొనడానికి ఆ రాష్ట్రం శాయశక్తులా కృషి చేస్తోంది. వనరులను సమీకరించడానికి ప్రజా ప్రతినిధులు మొదలుకొని ప్రభుత్వ సిబ్బంది, పింఛన్దార్ల వరకూ సగం వేతనాలను వాయిదా వేయాల్సివచ్చింది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ఆదాయం వున్న మహా రాష్ట్ర సైతం లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతోంది. ఈసారి ఆదాయం రూ. 2,10,824 కోట్లు వుండొచ్చునని 2020–21 బడ్జెట్లో అంచనా వేసిన ఆ రాష్ట్రం అందులో 5.35 శాతం... అంటే రూ. 27,000 కోట్ల మేర తగ్గొచ్చునని అంచనా వేసింది. పంజాబ్, బెంగాల్, రాజ స్తాన్ వంటివి నిరుపేద వర్గాలకు చేయూతనందించడానికి కూడా తమ దగ్గర తగినన్ని నిధులు లేవంటున్నాయి. వలస కార్మికులను, హఠాత్తుగా ఉపాధి కోల్పోయినవారిని ఎలా ఆదుకోవాలన్న అంశాన్ని తేల్చకుండానే కేంద్రం ప్రకటించిన లాక్డౌన్తో చాలా రాష్ట్రాలు సమస్యల్లో కూరుకు పోయాయి. స్వస్థలాలకు వెళ్లడం కోసం కాలినడకన బయల్దేరిన వలస కార్మికులను ఎక్కడికక్కడ నిలి పేసి, వారికి కూడు, గూడు కల్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కానీ ఇందుకు కావలసిన నిధులు ఎవరిస్తారన్నదే సమస్య. సంక్షోభ సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్రాలకు వుండే విపత్తు నిధుల నుంచి ఖర్చు చేసుకోవడానికి అనుమతినిస్తున్నట్టు గత వారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్తమానం పంపింది. కానీ ఆ పద్దులో వుండేది చాలా స్వల్ప మొత్తమని రాష్ట్రాలు చెబుతు న్నాయి. ఆ పద్దు కింద రాష్ట్రాలకు రావలసిన నిధులకు సంబంధించిన బిల్లులు కేంద్రం వద్ద ఎప్పుడూ పెండింగ్లోనే వుంటాయి. ఇక నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్కు సంబంధించిన పద్దులో రూ. 31,000 కోట్లు ఉన్నాయని, వాటిని కూడా వినియోగించుకోవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ నమోదైన నిర్మాణ రంగ కార్మికులకు మాత్రమే అది వినియోగించాలి. అసాధారణమైన విపత్తులు విరుచుకుపడినప్పుడు అందుకనుగుణంగా స్పందించడం కేంద్రం బాధ్యత. లేనట్టయితే రాష్ట్రాలు సంక్షోభంలో చిక్కుకుపోతాయి. ఎన్నికల సమయంలో చేసే వాగ్దా నాల మాదిరి ఆ స్పందన వుండకూడదు. గత నెలాఖరున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కరోనా ప్యాకేజీకింద ప్రకటించిన నిధుల్లో కొన్ని అంతక్రితం ప్రకటించిన వివిధ పథకాలకు సంబంధించినవే. సారాంశంలో రాష్ట్రాల ఖజానాలు క్రమేపీ చిక్కిపోతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ద్రవ్యలోటు కట్టుదాటకూడదన్న పట్టుదలతో నిధుల వ్యయంలో కేంద్రం జాగ్రత్తగా అడుగులేస్తుంది. కానీ ఇప్పుడు నెలకొన్న ఈ సంక్షోభకాలంలో దాన్ని సడలించుకోవాలి. రాష్ట్రాలకు నిధుల కొరత లేకుండా చూడాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రాలు ఈ సంక్షోభాన్ని అధిగమించాక ఉపాధి కల్పనకు కృషి చేయగలవు. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పద్దు కింద కేంద్రానికి అందాల్సిన నిధులు కూడా తగ్గుతాయనడంలో సందేహం లేదు. కానీ ఆర్బీఐ నుంచి రుణం తీసుకోవడంతో సహా అనేక చర్యలు తీసుకుని ఈ నిధుల్ని సమీకరించాలి. దీర్ఘకాలం లాక్డౌన్తో తలెత్తే సమస్యల వల్ల ప్రజల్లో అసంతృప్తి, అశాంతి ప్రబలకుండా వుండాలంటే రాష్ట్రాలకు ధారాళంగా నిధులందిం చాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. -
అప్రమత్తత అత్యవసరం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో తీవ్రతను పెంచిందని ఈ రెండురోజు లుగా పెరిగిన బాధితుల సంఖ్య చూస్తే అర్ధమవుతుంది. మంగళవారంనాటికి వ్యాధిగ్రస్తుల సంఖ్య 1,397 వరకూ వుండగా, 24 గంటలు గడిచేసరికల్లా అది 1,637కి చేరుకుంది. మృతుల సంఖ్య 45కి చేరింది. అయితే అదృష్టవశాత్తూ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇప్పటికీ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య తక్కువగానే వుందని చెప్పుకోవాలి. కొత్తగా బయటపడిన కేసుల్లో అత్యధికం ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన ఒక సదస్సుకు వెళ్లినవారికి సంబంధించినవే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బయటపడిన కేసులు కూడా ఈ కోవలోనివే. తెలంగాణ నుంచి 1,030 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 1085 మంది ఈ సదస్సుకు వెళ్లారని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. గత నెల 13–15 తేదీల మధ్య నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన ఈ సదస్సుకు ఇండొనేసియా, మలే సియా, సౌదీ అరేబియా దేశాల ప్రతినిధులు రావడంతో వారిద్వారా... ముఖ్యంగా మలేసియా ప్రతి నిధుల ద్వారా ఈ వైరస్ అంటుకుని వుండొచ్చన్నది ప్రాథమిక అంచనా. వీరిలో కొందరు స్వస్థలా లకు వెళ్లినా, మరికొందరు ఇక్కడే వుండి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. వారి ద్వారా ఎంతమందికి ఈ మహమ్మారి సోకిందో ఇంకా తేలవలసివుంది. ఈ వ్యాధి గురించిన అపోహలు ఎంతగా పెరిగాయంటే, ఆ వ్యాధిగ్రస్తుల్ని, వారి కుటుంబాలను, చివరికి వారికి చికిత్సనందించే వైద్య సిబ్బందిని వెలివేసినట్టు చూసే వాతావరణం దేశంలో అలుముకుంది. ఇది మంచిది కాదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇదంతా వ్యాధిగ్రస్తుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. కనుకనే ఈ వ్యాధి బారిన పడినవారిలో కొందరు తమంత తాము బయటికొచ్చి చెప్పు కోవడానికి సందేహిస్తున్నారు. ఇది ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. రోగి వెంటనే చికిత్స చేయించుకుంటే కోలుకోవడం చాలా సులభమని వైద్య నిపుణులు పదే పదే వివరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి సులభంగా తగ్గిపోతుందని కోలుకున్న వారు సైతం చెబుతున్నారు.అయినా వ్యాధిగ్రస్తుల్లో ఇంకా భయాందోళనలు, సందేహాలు పోవడం లేదు. వ్యాధిగ్రస్తులను వెలివేసే ధోరణి, వారిపట్ల లేనిపోని వదంతులు సృష్టించే వైఖరి అత్యంత ప్రమాదకరమైనది. దీనికి జడిసి ఎవరూ బయటకు చెప్పలేని స్థితి ఏర్పడితే అది సమాజం మొత్తానికి ప్రమాదంగా పరిణమిస్తుంది. ఇంతవరకూ రాజకీయాలు, కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీ తంగా అందరూ ఒక్కటై కరోనా మహమ్మారిపై పోరాడారు. ఇదిలాగే కొనసాగాలి. అయితే సదస్సు సంగతి వెల్లడయ్యాక దీన్ని నీరుగార్చే ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల్లో మొదలయ్యాయి. దాదాపు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏయే జిల్లాల వాసులు ఎందరు ఈ సదస్సుకు వెళ్లారో, వారి ఆరోగ్య స్థితిగతులు ఎలావున్నాయో... వారు ఇంతవరకూ ఎవరెవరిని కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీసి, వారందరినీ పరిశీలన కేంద్రాలకు పంపవలసివుంది. విదేశీ ప్రతినిధుల్లో పదిమంది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కొన్నిచోట్ల తిరిగారు. వీరందరికీ కరోనా వ్యాధి వున్నదని గత నెల 17న బయటపడింది. దానికి హాజరై వ్యాధిగ్రస్తులైన ఆరుగురు మరణించారని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ సదస్సుకు హాజరయ్యాక మహమ్మారి బారిన పడినవారు ఆంధ్రప్రదేశ్లో కూడా వున్నారు. మరికొందరి ఆచూకీ తెలియలేదంటున్నారు. ఈ తరుణంలో వ్యాధిగ్రస్తుల కుటుంబాల్లో మరింత భయాందోళనలు సృష్టించేందుకు కొందరు ప్రయ త్నిస్తున్నారు. ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. అది మంచిది కాదు. సదస్సు నిర్వహణలో చట్టవిరుద్ధత ఏమైనా వుందా, వుంటే ఎవరు బాధ్యులన్న అంశాన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయి. తగిన చర్య తీసుకుంటాయి. కానీ సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తి అనసవర సమస్యలు సృష్టిస్తుంది. సదస్సు సమయానికి దేశంలో లాక్డౌన్ మొదలుకాలేదు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం 1897 నాటి అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం సభలూ, సమా వేశాల్లో 200మందికి మించి పాల్గొనకూడదన్న నిబంధన వుంది. మరి ఈ నిబంధన విధించినప్పుడు అంతమంది విదేశీ ప్రతినిధులకు వీసాలు ఎలా మంజూరుచేశారో, వేలమందితో సదస్సు జరు గుతున్నప్పుడు స్థానిక పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదో తేలవలసివుంది. సదస్సు నిర్వా హకులు మాత్రం తమ సదస్సుకు ముందస్తు అనుమతులు తీసుకున్నామని, అన్ని వివరాలు పోలీ సులకు, ప్రభుత్వానికి అందించామని అంటున్నారు. కనీసం సదస్సు మొదలైనప్పుడైనా కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షల విషయాన్ని నిర్వాహకులకు పోలీసులు ఎందుకు చెప్పలేకపోయారో, తగిన చర్య అప్పుడే ఎందుకు తీసుకోలేకపోయారో అనూహ్యం ఆ పని చేసివుంటే ఇన్ని సమస్యలు ఎదురయ్యేవి కాదు. కనీసం లాక్డౌన్ ప్రకటించాకైనా అక్కడ ఎటూ కదల్లేక ఎంతమంది చిక్కుబడి వున్నారో ఆరా తీసి, క్వారంటైన్ కేంద్రాలకు పంపివుంటే బాగుండేది. ఇప్పుడు కొత్తగా బయట పడుతున్న కేసులన్నీ ఆ సదస్సులో పాల్గొన్నవారివీ, వారికి సన్నిహితులుగా మెలిగినవారివీ కావడం గమనిస్తే ఆందోళన కలుగుతుంది. దేశంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. రోగుల్ని గుర్తించిన వెంటనే తరలించడం, అను మానితులను స్వీయనిర్బంధంలో ఉంచడం ఎప్పటికప్పుడు సాగుతోంది. జనం పండుగలూ, ఉత్స వాలూ ఇళ్లల్లోనే జరుపుకుంటూ తమ వంతు సహకరిస్తున్నారు. కనుకనే దేశంలో 13 లక్షల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం వున్నదని మొదట అంచనా వేసిన అధ్యయన సంస్థలు సైతం దాన్ని సవరించుకున్నాయి. పాలకులు చురుగ్గా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్వేషాలు పెంచేలా వదంతులు వ్యాప్తి చేయకూడదని, ప్రభుత్వాలు చేస్తున్న కృషికి సహకరించాలని అందరూ గుర్తించాలి. -
అపాయంలో అమెరికా
కరోనా వైరస్తో రాగల ముప్పు గురించి ఎందరు హెచ్చరించినా మొదట్లో బేఖాతరు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాకానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో పడింది. లక్ష నుంచి 2 లక్షలమంది వరకూ ఈ వ్యాధికి బలయ్యే ప్రమాదం వున్నదని ‘చావు కబురు’ చల్లగా చెప్పినట్టు ఆయన ఇప్పుడు ప్రకటిస్తున్నారు. సరిగ్గా నెలక్రితం ఆయన కరోనా ప్రమాదం గురించి కొట్టిపడేశారు. మార్చి 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి గురించి హెచ్చరిస్తూ, దీని బారిన పడినవారిలో 3.4 శాతం మంది బలయ్యే అవకాశం వున్నదని తెలిపింది. కానీ ట్రంప్ అదంతా అబద్ధమని తోసిపుచ్చారు. మరణాల రేటు మహావుంటే ఒక శాతం ఉండొచ్చునని వాదిం చారు. అతిగా అంచనాలు వేసి భయపెట్టొద్దని సలహా కూడా ఇచ్చారు. ఇన్నాళ్లకు ఆయనకు జ్ఞానోద యమైంది. ఇందుకు వైద్య రంగ నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని మొదటగా అభినందించాలి. నెలరోజులుగా వారు ఎంతో శ్రమపడితే తప్ప ట్రంప్ ఈ స్థాయికి వచ్చివుండరని ఆయన మొండివైఖరి గురించి తెలిసినవారందరికీ అర్థమవుతుంది. ప్రమాద తీవ్రతను అంగీకరించిన ఈ సమయంలో కూడా ‘ఇంత తక్కువ మరణాలు’ తన ప్రభుత్వం తీసుకునే చర్యలవల్లేనని ట్రంప్ చెప్పుకున్నారు. మృతుల సంఖ్య ఒకేరోజు 500 దాటాక తన ప్రథమ ప్రాధాన్యత కరోనాయేనని, ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాతే వస్తుందని తెలిపారు. కొన్ని రోజులు వెనక్కి వెళ్లి చూస్తే ట్రంప్ దీనికి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. కరోనా వ్యాధి పెద్ద సమస్యకాదని, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడపడమే తన కర్తవ్యమని ఆయన చెప్పిన సంగతి ఎవరూ మరిచిపోరు. సరిగదా... చాలా త్వరలోనే ఈ వ్యాధికి వ్యాక్సిన్ రాబోతోందని కూడా ట్రంప్ మార్చి 7న భరోసా ఇచ్చారు. మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 8,00,000 దాటి ముందుకుపోగా, ఇందులో ఒక్క అమెరికాలోనే 1,65,000 మంది వున్నారు. ట్రంప్ నిలకడలేని ప్రకటనలు అమెరికా ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తాయి. ఆయన మాటలతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు అమల్లోకి తెచ్చినా పౌరులెవరూ వాటిని తీవ్రంగా తీసుకోలేదు. వివిధ రాష్ట్రాల గవర్నర్లను ట్రంప్ ఎగతాళి కూడా చేశారు. అదే ఇప్పుడు కొంపముంచిందని రోజురోజుకీ పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది. అమెరికా చరిత్ర తిరగేస్తే అచ్చం ట్రంప్ మాదిరే సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూసిన పాలకుడు మరొకరు కనిపిస్తారు. 80వ దశకంలో ఆ దేశాన్నేలిన రొనాల్డ్ రీగన్ అప్పట్లో బయటపడిన హెచ్ఐవీ/ఎయిడ్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వైరస్ గురించి చెప్పినప్పుడు అతిగా స్పందించొద్దని రీగన్ కొట్టిపడేశారు. ఎనిమిదేళ్లు అధికారంలో వుంటే చిట్టచివరి సంవత్సరంలో మాత్రమే ఆయన అయిష్టంగా ఈ వ్యాధిగ్రస్తుల విషయంలో పూర్తి స్థాయి చర్యలకు ఉపక్రమించారు. కానీ ఈలోగా 4 లక్షలమంది పౌరులు ఆ వ్యాధికి బలైపోయారు. ఆ అనుభవాలు తన కళ్లముందే వున్నా ట్రంప్ సైతం అదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా మొదట్లో కరోనా వెల్లడైన చైనాను మించి మరణాలు సంభవించే ప్రమాదం కనబడు తోంది. ట్రంప్ తనంత తానే ‘దాదాపు 2 లక్షలమంది వరకూ మరణించే అవకాశం ఉన్న’దని చెప్పారు. కానీ ఆ దేశంలోని ఇంపీరియల్ కాలేజీ అధ్యయనం చూస్తే ఎవరైనా బెంబేలెత్తడం ఖాయం. ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి సకాలంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే 22 లక్షలమంది మృత్యువాత పడే అవకాశం వున్నదని ఆ అధ్యయనం అంచనా వేసింది. ప్రాథమిక పరీక్షలు మొదలుకొని చికిత్స వరకూ వేర్వేరు అంశాల్లో ప్రభుత్వాలు స్పందించే తీరుతెన్నుల్ని ఊహించి, ఏరకంగా స్పందిస్తే ఏ తరహా పరిస్థితులు ఏర్పడతాయో కంప్యూటర్ ఆధారిత నమూనాల ద్వారా ఈ అంచనా వేసింది. వాటి ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. ఎవరి అంచనాలెలా వున్నా పాలకులు మాత్రం అత్యుత్సాహంతో ఇంతమంది చనిపోతారంటూ లెక్కలు చెప్పి హడ లెత్తించకూడదు. మొదట్లో నిపుణుల సూచనల్ని, సలహాల్ని బేఖాతరు చేసి ఏ తప్పు చేశారో...ఇప్పుడు వెనకా ముందూ చూడకుండా కొన్ని అంకెలు వల్లెవేయడం ద్వారా కూడా ఆయన అదే తప్పు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిపుణులు అనేకానేక సూచనలు చేస్తారు. పరిస్థితి తీవ్రత గురించి అవగాహన కలిగిస్తారు. తెలివైన పాలకులు వాటిని అర్థం చేసుకుని పౌరులకు ఎంతవరకూ చెప్పాలో అంతే చెబుతారు. ప్రభుత్వాల చర్యలే సమస్య తీవ్రతను అర్థం చేయించాలి. అదే సమయంలో పాలకులు భరోసా ఇవ్వాలి. ఈ మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని చర్యలూ తీసుకుంటున్నదన్న అభిప్రాయం పౌరుల్లో కలగజేయాలి. అప్పుడు మాత్రమే వారు తమ వంతు క్రమశిక్షణతో మెలిగి, ఎలాంటి సంక్షోభాన్నయినా అవలీలగా జయిం చగలుగుతారు. కరోనా వ్యాప్తికి సంబంధించి ఫిబ్రవరి–మార్చి నెల మధ్య సమయం ఎంతో కీలకం. దాన్నంతటినీ ట్రంప్ వృథా చేశారు. చెప్పడానికి ప్రయత్నించినవారిని గేలి చేశారు. తన మాటే సరైందని వాదించారు. ఫిబ్రవరి 26న ఆయన చేసిన ప్రకటనే ఇందుకు రుజువు. అప్పటికి 15 కేసులు బయటపడ్డాయి. ఇవి రెండుమూడు రోజుల్లో సర్దుకుంటాయని, ఆ తర్వాత కరోనా కేసులే వుండవని ఆయన చెప్పారు. ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడింది. కానీ ఆ కేసుల సంఖ్య 1,65,000 కు చేరుకుంది. ఈమధ్య కాలమంతా ఆయన అబద్ధాలతో, దబాయింపులతో కాలక్షేపం చేశారు. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఏ దేశానికి వచ్చిన విపత్తయినా ప్రపంచ పౌరులందరికీ దుఃఖం కలిగిస్తుంది. అందునా చదువుకో, కొలువుకో అమెరికా వెళ్లినవారు ఇప్పుడు మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గణనీయంగా వున్నారు. అందువల్లే ఆ అగ్రరాజ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. -
పల్లెలకు తిరుగుబాట
ఇరుగు పొరుగు రాష్ట్రాలనుంచి... సుదూర ప్రాంతాల్లోని గ్రామసీమలనుంచి పొట్టచేతబట్టుకుని లక్షలమంది మహా నగరాలకు వలస వెళ్లడం గురించి ఎప్పటినుంచో వింటున్నదే. దశాబ్దాలుగా ఈ మహానగరాల మనుగడకు, వాటి ధగధగలకు జీవనాడుల్లా ఉపయోగపడుతున్న ఈ వలసజీవుల బతుకుల్లో లాక్డౌన్ హఠాత్తుగా చీకట్లు నింపింది. ఉన్నట్టుండి గూడు చెదిరి, ఎక్కడా పని దొరక్క, ఎటూ కదల్లేక, ఆకలి తీరే దోవ అసలే కనబడక, కూడబెట్టుకున్న కొద్దిపాటి సంపాదన హరించుకు పోయి మహానగరాల్లోని వలసజీవులంతా తమ తమ కుటుంబాలతో వేలాదిగా స్వస్థలాలకు కాలి నడకన పయనమవుతున్నారు. ఆ పని చేయలేనివారు ఎంతో కొంత ముట్టజెప్పి గాలి సరిగా ఆడని కంటైనర్లలో కూర్చుని వేలాది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. సామాజిక మాధ్య మాలు, చానెళ్ల నిండా కనబడుతున్న ఈ దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆలస్యంగానైనా మేల్కొన్న ప్రభుత్వాలు ఆదరా బాదరాగా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టగా, సుప్రీంకోర్టు సైతం సోమవారం జోక్యం చేసుకుని 24 గంటల్లో వాస్తవ పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వల్ల ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు కనీవినీ ఎరుగనివి. వందేళ్లకొకసారి కూడా ఇంతటి మహా విపత్తు రాదని నిపుణులు చెబుతున్నారు. కనుకనే లాక్డౌన్ తప్పనిసరని కేంద్రం భావిం చింది. ఈ నెల 24నుంచి 21 రోజులపాటు దీన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. కొన్నాళ్ల పాటు పౌరుల కదలికలను స్తంభింపజేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని వైద్య నిపుణులు ఇచ్చిన సల హాయే ఇందుకు కారణం. దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని కూడా అంటున్నారు. మంచిదే. కానీ ఈ నిర్ణయం ఏ వర్గాలకు ఏ సమస్యలు తెస్తుందో, ఎలాంటి అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తుందో ముందుగా అంచనా వేయలేకపోవడం ప్రభుత్వాల లోపం. మహానగరాల్లో పుట్టుకొస్తున్న ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, పారిశుద్ధ్యంలో, ఎన్నెన్నో వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల ఉత్పత్తుల్లో, లక్షలాదిమంది సంపన్నుల నివాసాల్లో కార్యకలాపాలు సజావుగా సాగడం వెనక వీరి కృషి అపారమైనది. ఇందులో 99శాతంమందికి నిలకడైన ఉపాధి వుండదు. నికరమైన సంపాదన వుండదు. అసలు ఏ రిజిస్టర్లోనూ, ఏ రికార్డులోనూ వీరి పేర్లు నమోదైవుండవు. వారు నివాసం వుండే గూళ్లు కూడా మామూలు అర్థంలో నివాసగృహాలు కావు. అందుకు ఏమాత్రం పనికొచ్చేవి కాదు. కానీ ఆ మహా నగరాల్లో బతకాలంటే అంతకన్నా వారికి గత్యంతరం లేదు. వారి బతుకులు ఎప్పుడూ అస్థిరత్వంలో కొట్టుమిట్టాడుతుంటాయి. హఠాత్తుగా లాక్డౌన్ వంటి ఊహించని విప త్తులు వచ్చిపడితే ఆ బతుకులేమైపోతాయో సులభంగా అంచనా వేయొచ్చు. కరోనాపై చాలా మందిలో వున్న భయాందోళనలే పెద్ద సమస్యని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్య కూడా వాస్తవమే కావొచ్చు. కానీ లాక్డౌన్తో అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోయి, చివరకు ఇంటిచాకిరి చేసేవారిని కూడా ఎవరూ లోపలకు అడుగు పెట్టనీయని స్థితిలో వలసజీవులకు మరో దోవ లేదు. లాక్డౌన్ ప్రకటన వెంబడే వివిధ బస్తీల్లో నివాసం వుండేవారికి ప్రభుత్వాలనుంచి భరోసా దొరికితే వేరుగా వుండేది. నిత్యావసరాలు వారికి అందుబాటులోకి తెస్తే బాగుండేది. ఇవన్నీ జరగకపోవడం వల్లే వలసజీవులు వారి స్వస్థలాలకు పోవడం తప్పనిసరైంది. ఎప్పుడూ ఉపాధి వెదుక్కుంటూ పల్లెటూళ్లనుంచి పట్టణాలకూ, నగరాలకూ వలస పోవడం తప్ప ఉపాధి లేమి వల్లనో, ఉత్పాతాల వల్లనో అటునుంచి వెనక్కి వచ్చిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవు. అయాచితంగా వచ్చిన ఈ ‘సెలవు’ సమయంలో అయినవారితో కలిసి పండగ చేసు కుందామన్న యావతో వీరంతా బాధ్యతారహితంగా సొంత వూళ్లకు పోతున్నారని బీజేపీ నేత ఒకరు నోరు పారేసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మహా నగరాలనుంచి నిష్క్రమిస్తున్న వేలాదిమందివల్ల దేశంలోని అనేక ప్రాంతాలు కరోనా బారినపడే ప్రమాదం ఏర్పడిందన్నది ఆయన ఆందోళన. తర్వాత సొంత పార్టీ నేతల్లో కొందరు ఆయనకు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సివచ్చిన నిర్ణయాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చిందని, అందుకు క్షమించాలని ప్రధాని నరేంద్రమోదీ పెద్ద మనసుతో చెప్పడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. సొంత వూళ్లకు కాలినడకన పోతున్నవారి వల్ల కరోనా వ్యాప్తి బెడద వుండొచ్చన్న వాదనలో ఎంతో కొంత నిజం వుండొచ్చు. కానీ అంతకన్నా వారికి గత్యంతరం ఏముంది? ఉన్నచోటే వుంటే కరోనా మాట అటుంచి, ఆకలిదప్పికలతో మరణించక తప్పని పరిస్థితులున్నాయి. ఈ తీవ్రతను ముందే అంచనా వేయలేకపోవడంపై ఆత్మవిమర్శ చేసుకోకపోగా ‘సెలవుల’ కోసం వెళ్తున్నారనడం అమాను షమనిపిస్తుంది. ఎలాంటి ప్రయాణ సాధనాలు లేకుండా, పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా పిల్లా పాపలతో మండుటెండల్లో నడుచుకుంటూ పోతున్న ఈ వలస జీవుల్ని కదిలిస్తే వాస్తవాలేమిటో తెలు స్తాయి. వివిధ మాధ్యమాల్లో వీరి గురించి వెలువడుతున్న కథనాలు ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తున్నాయి. వీరంతా భద్రంగా వారి వారి ఊళ్లకు వెళ్తున్నారని అనుకోవడానికి లేదు. రోగాల బారినపడి, ఆకలిదప్పికలకు తాళలేక, గుండెపోటు వచ్చి కొందరు చనిపోతున్నారు. ఇలాంటి కార ణాలతో ఈ నెల 24 మొదలుకొని ఇంతవరకూ 22మంది మరణించారు. ఇందులో అయిదుగురు పిల్లలున్నారు. వీరేకాదు... బిహార్లోని భోజ్పూర్లో ఆకలికి తాళలేక పదకొండేళ్ల బాలుడు చని పోయాడు. దశాబ్దాలనుంచి తమ చెమటతో, నెత్తురుతో ఆ మహా నగరాల నిర్మాణంలో, వాటి మను గడలో అనామకంగా ఉంటూనే సాయపడిన ఈ అభాగ్యజీవులకు ఇప్పుడు కావాల్సింది చేతలు. అవి ఎంత త్వరగా అమలైతే అంత త్వరగా ఈ వలసలు ఆగుతాయని గుర్తించాలి -
ఎట్టకేలకు మరణదండన
ఉరి తాడు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో శుక్రవారం ఉదయం నిర్భయ దోషులు నలుగురికీ మరణదండన అమలు కావడం ఖాయమైంది. మన దేశంలో న్యాయ ప్రక్రియ ఎంత సుదీర్ఘమైనదో, ఉరిశిక్ష పడినవారికి సైతం చట్టపరంగా ఎన్ని రకాల అవకాశాలుంటాయో ఈ కేసు మరోసారి నిరూపించింది. తమ కుమార్తెను అమానుషమైన చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారం జరిపి హతమార్చిన దుండగులకు శిక్ష విధించడంలో ఎంతో జాప్యం చోటుచేసుకుందనుకుంటే... అది అమలు చేయడంలోనూ ఇంత తాత్సారమేమిటని నిర్భయ తల్లి అనేకసార్లు కన్నీరుమున్నీరయ్యారు. వారందరూ ఉరికంబం ఎక్కినరోజునే తమ కుమార్తె ఆత్మ శాంతిస్తుందని ఆమె చెప్పారు. అయితే ఉరిశిక్ష పడిన నేరస్తులకు అన్ని రకాల అవకాశాలూ ముగిశాకనే శిక్ష విధించడం మనకున్న చట్టాల ప్రకారం తప్పనిసరి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదన్నదే ఈ న్యాయ సిద్ధాంతంలోనిఅంతరార్థం. ఒకసారి ఉరిశిక్ష అమలయ్యాక దోషులుగా తేలినవారు ఏ కారణం చేతనో నిర్దోషులని తేలినా... వారి అభ్యర్థనల్ని పరిశీలించడంలో సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయని తేలినా తప్పు సరిదిద్దుకోవడం అసాధ్యం కనుకనే ఇన్ని జాగ్రత్తలు. ఇందిరాగాంధీ హత్య కేసు, పార్లమెంటు దాడి కేసు, ముంబైపై ఉగ్రవాద దాడిలో పట్టుబడిన కసబ్ విషయంలోనూ ఉరిశిక్ష విధించడానికీ, దాన్ని అమలు చేయడానికీ మధ్య ఎంతో వ్యవధి ఉంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ఆవేదన ఉంటుందన్నది నిజమే. తమవారికి ఏం జరిగిందో, దోషులకు కూడా తక్షణం అదే జరగాలని వారు పట్టుదలగా వుంటారు. నిర్భయ దోషుల విషయానికే వస్తే వారు అనుసరించిన విధానాలు, శిక్ష తప్పించుకునేందుకు వారు చూపిన సాకులు నిర్భయ కుటుంబీకులకు మాత్రమే కాదు... దేశ ప్రజలందరికీ ఆగ్రహం కలిగించాయి. ఇలా ఇంకెన్నాళ్లు కాలక్షేపం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి. నిర్భయ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడంతోపాటు అత్యాచారం, ఇతర లైంగిక నేరాల్లో విధించాల్సిన శిక్షల గురించి, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా నియమించింది. జస్టిస్ వర్మ కమిటీ రికార్డు స్థాయిలో కేవలం 29 రోజుల్లోనే తన సిఫార్సులు అందించగా... ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలి రెండు నెలల్లోనే అత్యాచార నేరానికి మరణ దండన విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే నిర్భయ కేసు ఫాస్ట్ట్రాక్ కోర్టులో చాలా త్వరగానే పూర్తయిందని చెప్పాలి. 2012 డిసెంబర్ 16న ఆ ఉదంతం జరగ్గా, నలుగురు దోషులకు 2013 సెప్టెంబర్లో మరణశిక్ష విధించింది. ఈ విచారణ కొనసాగుతుండగానే దుండగుల్లో ఒకడు ఆత్మహత్య చేసుకోగా, మరో దుండగుడి వయస్సు 16 ఏళ్లలోపు కావడం వల్ల అతడిపై జువెనైల్ కోర్టులో విచారణ జరిగి మూడేళ్ల శిక్ష పడింది. నలుగురు దోషులకూ ఫాస్ట్ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఆ మరుసటి ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించింది. నిందితులు అప్పీల్ చేసుకోగా 2017 మే నెలలో ఈ నేరగాళ్లకు ఉరిశిక్ష సరైందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటినుంచి రివ్యూ పిటిషన్లు మొదలయ్యాయి. నేరగాళ్లలో ఒకరి తర్వాత ఒకరు... ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు పిటిషన్లు దాఖలు చేయడం, వాటిని తిరస్కరించడం, రాష్ట్రపతికి క్షమాభిక్ష వినతులు, వాటిని తోసిపుచ్చాక దాన్ని సవాలు చేస్తూ తిరిగి ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేయడం కొనసాగాయి. నేరం జరిగిన సమయానికి తాను జువెనైల్నని నేరగాడు పవన్ కుమార్ గుప్తా కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తమను ఏకాంతవాస ఖైదు చేశారని, చిత్రహింసలకు గురిచేశారని, తమను ఉరి తీయాలంటూ కేంద్రమంత్రులు తదితరులు ప్రకటనలివ్వడం వల్ల ఆ ప్రభావం న్యాయస్థానాలపై పడిందని నేరగాళ్లు ఆరోపించారు. ఒక దోషి భార్య తాను వితంతువుగా బతకలేను గనుక అతగాడినుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ సాకుతో శిక్ష అమలును జాప్యం చేయొచ్చునన్నది వారి ఎత్తుగడ. ఈలోగా ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ కావడం, అవి వాయిదా పడటం రివాజైంది. ఈ కేసులో నేరగాళ్ల దుర్మార్గం సమాజం మొత్తాన్ని కలచివేసింది. కనుకనే ఈ ఉదంతంపై అంతగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వారికి సత్వరం ఉరిశిక్ష పడాలని అందరూ కోరుకున్నారు. ఈమధ్య కాలంలో అలాంటి నేరగాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్న ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఏదైనా చట్టప్రకారమే జరగాలన్న విధానం నేరగాళ్లు శిక్ష పడకుండా తప్పించుకోవడానికి తోడ్పడుతున్నదన్న అసంతృప్తే ఇందుకు కారణం. నేరానికీ, శిక్షకూ మధ్య ఉండే ఈ అపరిమిత జాప్యాన్ని ప్రభుత్వాలు అధిగమించగలిగితే నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో పౌరుల్లో ఉండే అసంతృప్తి సమసిపోతుంది. నేర నివారణకు చర్యలు తీసుకుంటూనే, అవి జరిగినప్పుడు తక్షణం స్పందించి పకడ్బందీ దర్యాప్తు, విచారణ పూర్తికావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి వీలుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు దిశ యాప్ను రూపొందించి విడుదల చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. నేరాలకు ఆస్కారంలేని పరిస్థితులు కల్పించడం, నేరం చేసినవారికి వెనువెంటనే శిక్ష తప్పదన్న అవగాహన కలిగించడం కీలకం. అప్పుడు మాత్రమే ఏ సమాజమైనా భద్రంగా మనుగడ సాగించగలుగుతుంది. -
సర్వత్రా ‘ఢిల్లీ’ ఉత్కంఠ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు హోరాహోరీగా జరిగిన ప్రచారం గురువారం సాయంత్రంతో సమాప్త మవుతుంది. ప్రచారం మొదలైన కొన్ని రోజుల వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సాధించిన విజయాలపైనా, దాని వైఫల్యాలపైనా సాగుతున్నట్టు కనబడిన చర్చంతా పది పన్నెండు రోజులుగా కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, వాటిని తీర్చడానికి ఎదురవుతున్న అవరోధాలు, జవాబుదారీ తనం వగైరా అంశాలు ప్రస్తావనకొస్తుండగా దాన్ని తనకనుకూలమైన దోవకు మళ్లించడంలో బీజేపీ సఫలమైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో మహిళలు సాగిస్తున్న ఆందోళనపై కేంద్రీకరించి, జాతీయ భద్రతను ప్రధాన అంశంగా మార్చి మీరెటు వైపో తేల్చు కోవాలంటూ పౌరులకు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రజలు స్థానిక అంశాలనూ, ఆప్ ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలను పరిగణనలోకి తీసుకుని ఓట్లేస్తారా లేక బీజేపీ కోరుకున్నట్టు జాతీయ భద్రతే ప్రధాన మనుకుంటారా అన్నది చూడాల్సివుంది. 8వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఈసారి గాలి ఎటు వీచిందో చెప్పగలిగే అవకాశం వుంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా 11న అసలు ఫలితాలు వెలువడే వరకూ ఉత్కంఠ తీరదు. ఢిల్లీ పౌరులు ఏం ఆలోచిస్తున్నారో, చివరకు ఎటువైపు మొగ్గుతారో నిర్ణయించడం అంత సులభమేమీ కాదు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అక్కడున్న ఏడు స్థానాలనూ కట్టబెట్టిన ప్రజలు, మరికొన్ని నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు భారీ ఆధిక్యతతో అధికారం అప్పగించి అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. మొత్తం 70 స్థానాల్లో ఆప్కు 67 రాగా, మిగిలిన మూడు బీజేపీకి దక్కాయి. అప్పుడు ఆప్ నెగ్గుతుందని కానీ, నెగ్గినా ఈ స్థాయిలో సీట్లొస్తాయని గానీ ఏ సర్వే చెప్పలేకపోయింది. ఇంచుమించు ప్రతి సర్వే కూడా బీజేపీకి 40కి మించి స్థానాలొస్తాయని, ఆప్కి అంతక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న 28 స్థానాలకు మించిరావని, ఇంకా తగ్గినా ఆశ్చర్యం లేదని చెప్పాయి. ఈ లెక్కలన్నీ 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకొచ్చిన 46.40 శాతం ఓట్ల ఆధారంగా వేసినవే. ఎనిమిది నెలలక్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ 2014నే పునరావృతం చేసింది. ఆ పార్టీకి అంతక్రితం కంటే మెరుగ్గా 56.58 శాతం ఓట్లు లభించాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఏడు చోట్లా ఓడిపోయినా 32.90శాతం ఓట్లు గెల్చుకుంది. కానీ మొన్న లోక్సభ ఎన్నికల్లో దానికి కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒక్కచోట అది రెండో స్థానంలోకి రాగలిగింది. మిగిలిన ఆరుచోట్లా రెండో స్థానం కాంగ్రెస్దే. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆ ఫలితాలను బేరీజు వేస్తే బీజేపీ 65 స్థానాల్లో ఆధిక్యత చూపగా, కాంగ్రెస్ అయిదు చోట్ల ఆధిక్యత తెచ్చుకుంది. ఆప్ సున్నా చుట్టింది. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత బీజేపీ భరోసాగా లేదు. ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండ’న్న కేజ్రీవాల్ సవాలుకు బీజేపీ జవాబీ యలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై ఇలాగే చర్చ సాగింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని అప్పట్లో పార్టీలో చేర్చుకుని, ఆమెను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం వికటించింది. అందువల్లే ఈసారి అలా ఎవరినీ ప్రకటించే సాహసం చేయలేదు. బీజేపీ ప్రచార బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన భుజస్కంధాలపై వేసు కున్నారు. పలు సభల్లో ప్రసంగించడంతోపాటు, కొన్నిచోట్ల ఇంటింటి ప్రచారం చేశారు. ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలన్నిటిలోనూ జాతీయ భద్రత, 370 అధికరణ రద్దు తదితర అంశాలే విస్తృతంగా ప్రచారమయ్యాయి. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఢిల్లీలో మోహరించారు. దేశద్రోహుల్ని కాల్చిచంపాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సభల్లో నినా దాలు చేయించడం, మరో ఎంపీ షాహీన్బాగ్ ఆందోళనకారులు ఇళ్లల్లోకి చొరబడి అరాచకాలు సృష్టి స్తారంటూ ప్రకటించడం వివాదాస్పదమయ్యాయి. వేదికలపై ఇలా జాతీయ భద్రతను హోరె త్తించినా మేనిఫెస్టోను మాత్రం బీజేపీ స్థానిక అంశాలతో నింపింది. ఇంటింటికీ రక్షిత మంచినీరు, వలస కార్మికులు నివసించే కాలనీల అభివృద్ధి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల సాయం, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి వాగ్దానాలు చేసింది. బీజేపీ, ఆప్ కూడా పరస్పరం ప్రభావితమవుతున్నాయని రెండు పార్టీల మేనిఫెస్టోలు గమనిస్తే అర్థమవుతుంది. గత అయిదేళ్లలో కేజ్రీవాల్ అమలు చేసిన అంశాలు గమనంలోకి తీసుకుని బీజేపీ మేనిఫెస్టో రూపొందిస్తే... బీజేపీ లేవనెత్తుతున్న అంశాల విషయంలో ఆప్ అత్యంత జాగరూకతతో అడుగులేసింది. షాహీన్బాగ్పై మీ వైఖరేమిటన్న ప్రశ్నకు నేరుగా జవాబివ్వడానికి ఆప్ సిద్ధపడలేదు. పైగా మళ్లీ అధికారంలో కొచ్చాక పాఠశాలల్లో దేశభక్తిపై పాఠాలు పెడతామని వాగ్దానం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే రూ. కోటి ఇస్తామని చెప్పడం అందరి ప్రశంసలూ పొందింది. 20,000 లీటర్ల వరకూ ఉచితంగా నీరు, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, ప్రభుత్వ పాఠశాలల సమూల మార్పు, మొహల్లా క్లినిక్లు, మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం, కాలనీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు వంటివి కేజ్రీవాల్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. కేంద్రం సృష్టించిన అవ రోధాలు అధిగమించి సుప్రీంకోర్టు తీర్పుతో ఏడాదిన్నరగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కేజ్రీవాల్ చెప్పడాన్ని జనం సానుకూలంగా తీసుకున్నారు. కాంగ్రెస్ రంగంలోవున్నా దాన్నెవరూ పట్టించుకునే స్థితి లేదు. మొత్తానికి బీజేపీ ప్రచార హోరుతో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో వెలువడే తీర్పుపై దేశమంతా ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో విజయం మాటెలావున్నా, 2015 ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన మెజారిటీని మాత్రం పునరావృతం చేయనీయరాదన్న కృత నిశ్చయం బీజేపీలో కన బడింది. ఓటరు నాడి తెలిసేది మరికొన్ని రోజుల్లోనే. -
అనంత్ ‘చరిత్ర’ పాఠాలు
నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు తరచుగా కట్టు తప్పుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అలాంటివారిలో ఒకరు. పార్టీలో శరవేగంతో ఎదగడానికో...అధినేత దృష్టిలో పడితే ఇప్పుడున్న స్థానాన్ని మించిన అవకాశాలు వస్తాయనో భావించి ఇష్టానుసారం మాట్లాడే నేతలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. కానీ అనంత్కుమార్ హెగ్డే ఆ కోవలోకి రారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకొచ్చినవారు కాదు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపీగా పనిచేసినవారు. అలాంటి నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే, జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే కొత్తగా వచ్చే నాయకులకు, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు పోతాయి. ఆ సంగతి ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. ఇంతక్రితం కూడా పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై నిరసనలు పెల్లుబికాయి. ఒకసారైతే నోరు జారారనుకోవచ్చు. కానీ పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాటి వెనక నిర్దిష్టమైన ఉద్దేశాలు న్నాయని, ప్రయోజనాలున్నాయని అనుకోవాల్సివస్తుంది. ఆయన తాజాగా దేశ స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరెత్తకుండా, ఆయన్నుద్దేశించే అంటున్నట్టు అందరికీ అర్థ మయ్యేలా నిందాపూర్వకంగా వ్యాఖ్యానించారు. చరిత్ర గురించి, అది తీసుకున్న మలుపుల గురించి అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని, ఉంటారని ఆశించలేం. అలాగే స్వాతంత్య్రోద్యమంపైనా, దాని తీరుతెన్నులపైనా భిన్నాభిప్రాయం ఉండటం తప్పేం కాదు. ఆ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలోనే షహీద్ భగత్సింగ్ వంటి వారికి గాంధీ అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి ఉండేది. బలప్రయోగంతో ప్రజల స్వాతంత్య్రేచ్ఛను అణిచివేయాలని చూస్తున్న బ్రిటిష్ పాలకులకు అదే భాషలో బదులీయాలని ఆయన వాదించేవారు. నేతాజీ సుభాస్చంద్ర బోస్ సైతం ఇలాంటి అభిప్రాయంతోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)ను స్థాపించి, యువతీయువకులను సమీకరించారు. అయితే హెగ్డే అభ్యం తరం పూర్తిగా వేరు. ఆయన దృష్టిలో స్వాతంత్య్రోద్యమంలో రెండు రకాలవారున్నారు. ఆయుధా లతో పోరాడినవారు. మేధోశక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసినవారు. వీరుగాక మరో రకం సమర యోధులున్నారు. ఈ సమరయోధులు బ్రిటిష్ పాలకులతో లాలూచీ పడి ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమ సారథులు దాన్నెలా నడపాలో ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారినుంచి సలహాలు తీసుకునే వారు. పాలకులు చెప్పినట్టల్లా చేస్తామన్న అవగాహనతో, సర్దుబాట్లతో ఆ ఉద్యమం సాగింది. తమ ఉద్యమాన్ని గుర్తించి, తమను అరెస్టు చేసి జైలుకు పంపమని ఈ ఉద్యమ సారథులు పాలకులను వేడుకునేవారు. జైళ్లలో తమను జాగ్రత్తగా చూసుకుంటే చాలని కోరేవారు. ఇలాంటి నాయకులపై బ్రిటిష్ పోలీసులు ఒక్కసారి కూడా చేయిచేసుకోలేదు. ఇంతవరకూ ఎవరి గురించి మాట్లాడు తున్నారో స్పష్టత లేకుండా ప్రసంగించిన అనంత్కుమార్ ఆ తర్వాత కాస్త స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ను సమర్థించేవారంతా ఆమరణ నిరాహార దీక్షల వల్లా, సత్యాగ్రహం వల్లా స్వాతంత్య్రం వచ్చిందని చెబుతుంటారని, కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. సత్యాగ్రహం వల్ల బ్రిటిష్ పాలకులు ఈ దేశం వదిలిపోలేదని, వారు నిరాశానిస్పృహలకు లోనై స్వాతంత్య్రం ప్రకటిం చారన్నది హెగ్డే అభిప్రాయం. ఇలా స్వాతంత్య్రోద్యమ చరిత్రనంతా ఏకరువు పెట్టాక, ఈ ఉద్యమం నడిపించినవారు మన దేశంలో మహాత్ములయ్యారని వ్యాఖ్యానించారు. నిజంగా ఈ దేశం కోసం పనిచేసి, పెను మార్పులు తీసుకురావడానికి త్యాగాలు చేసినవారిని చరిత్ర చీకటి కోణాల్లోకి నెట్టేశారని ఆవేదన చెందారు. ఎవరికీ తెలియని ఈ చరిత్రనంతా తాను ఎక్కడ అధ్యయనం చేశారో ఆయన చెప్పలేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశించాక తన మాటల్ని మీడియా వక్రీకరించిందని ఆయనంటున్నారు. తాను గాంధీ, నెహ్రూ పేర్లెత్తలేదని చెబుతున్నారు. ఈ దేశంలో స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ సమరం నడిపిందీ, ఆమరణ దీక్షలు చేసిందీ ఎవరో హెగ్డే చెప్పకపోయి ఉండొచ్చు. అలాగే ఈ ఉద్యమాలు సాగించినవారు మహాత్ములయ్యారన్నప్పుడు కూడా ఆయన ఎవరి పేరూ ప్రస్తావించి ఉండకపోవచ్చు. కానీ స్వాతంత్య్రోద్యమం గురించి ఎంతో కొంత తెలిసినవారికి కూడా ఎవరినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారో సులభంగా తెలుస్తుంది. నిజానికి అలా తెలియాలనే ఆయన అంత వివరంగా, అంత ‘స్పష్టంగా’ మాట్లాడారు. కాకపోతే పేర్లు నేరుగా వెల్లడించడానికి ఇంకా సమయం రాలేదని అనుకుని ఉండొచ్చు. ‘పెదవి దాటని మాటలకు మనం యజమానులం. పెదవి దాటి బయటకు వచ్చిన మాటలకు మాత్రం మనమే బానిసలవుతామ’ని బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మహాత్ముణ్ణి గుర్తుకుతెచ్చేంతగా వ్యాఖ్యానించిన హెగ్డే...తమ మేధో శక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసిన ఆ మహానుభావులెవరో కూడా స్పష్టంగా చెప్పివుండాల్సింది. అప్పట్లో ఈ దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి పాటుబడి, చరిత్ర చీకటికోణాల్లో మగ్గిపోయిన వారెవరో కూడా వివరించి ఉండాల్సింది. ఆయన అలా చేసివుంటే ఈ చర్చ మొత్తం వేరుగా ఉండేది. అలాగే తన ‘లాలూచీ’ ఆరోపణలకు సమర్థనగా బ్రిటిష్ ప్రభుత్వ పత్రాలేమైనా వెల్లడించివుంటే అందరూ సంతోషించేవారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా గత నవంబర్లో ఇదేవిధంగా మహాత్మా గాంధీని ఏమనలేదు. కానీ ఆయన్ను పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశ భక్తుడన్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీ మందలించింది. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చెప్పింది. స్వాతంత్య్రోద్యమాన్ని పల్చన చేసి, దాని సారథుల్ని కించపరిచి సాధించదల్చు కున్నదేమిటో హెగ్డే చెప్పాలి. తమ పార్టీ వారినుంచే తరచు ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలెందు కొస్తున్నాయో బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
మెప్పించని విన్యాసం
ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, మందగమనంతో అది అందరినీ భయపెడుతున్న వేళ... వృద్ధి రేటు పల్టీలు కొడుతూ, ద్రవ్యోల్బణం పైపైకి పోతున్న వేళ బడ్జెట్ విన్యాసం కత్తి మీది సాము. ఖజానా రాబడి తగ్గుతూ ఎంచుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన నిధుల సమీకరణకు సమస్యలెదురైనప్పుడు అందరినీ మెప్పించేలా బడ్జెట్ ప్రతిపాదనలుండటం అసాధ్యం. మెప్పిం చడం మాట అటుంచి ఇప్పుడున్న సంక్షోభం పేట్రేగకుండా చూస్తే అదే పదివేలు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి పాదనలు అందుకనుగుణంగా ఉన్నట్టు తోచదు. వినిమయాన్ని పెంచడానికి మధ్యతరగతి చేతుల్లో డబ్బులుండేలా చూడాలి. ఉపాధి అవకాశాలు పెరిగితే వారికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం పన్నుల రూపంలో పెద్దగా పోనప్పుడు వారు తమ అవసరాల కోసం ఖర్చు పెట్ట గలుగుతారు. అయితే ఈ క్రమంలో ఖజానా పెద్దగా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను వసూళ్లు తగ్గకుండావున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రజల కొనుగోలు శక్తి పెంచి విని మయం బాగుండేలా తీసుకునే చర్యలకూ, ఖజానా దండిగా నిండటానికి చేసే ప్రయత్నాలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది. దీన్నెంత ఒడుపుగా చేయగలుగుతారన్న దాన్నిబట్టే ఆర్థికమంత్రి చాకచక్యం వెల్లడవుతుంది. మిగిలినవాటి మాటెలావున్నా ప్రతి బడ్జెట్కు ముందూ మధ్యతరగతి ఆశగా ఎదురు చూసేది ఆదాయం పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థికమంత్రి కనికరించి గడిచిన సంవత్సరంకన్నా పన్ను భారం మరింత తగ్గిస్తే బాగుండునని మధ్యతరగతి జీవులు ఆశిస్తారు. ఆ విషయంలో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఈసారి నిర్మలా సీతారామన్ ఆదాయం పన్ను వసూలుకు సంబం ధించి రెండు రకాల విధానాలు ప్రతిపాదించారు. ఇప్పుడున్న మూడు శ్లాబ్లను యధాతథంగా కొనసాగిస్తూ, దాంతోపాటు ఏడు కొత్త శ్లాబ్లు ప్రకటించారు. కొత్త శ్లాబుల్ని ఎంచుకుంటే కొన్ని మినహాయింపులు ఎగిరిపోతాయని ఆమె చావు కబురు చల్లగా చెప్పడంతో అందరూ నీరసపడ్డారు. ఇంతకూ కేంద్ర ఆర్థికమంత్రి చేసిందల్లా ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ వేతన జీవులకివ్వడమే. రెండూ కత్తులే. ఏ కత్తి మెత్తగా తెగుతుందో ఎవరికి వారు తేల్చుకోవాల్సివుంటుంది. నిపుణులు చెబు తున్నదాన్నిబట్టి ఈ చర్య వల్ల ఆదాయం పన్ను గణన, రిటర్న్ల దాఖలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. కొత్త శ్లాబుల్లోకి మారదల్చుకున్నవారికి నిరాకరిస్తున్న మినహాయింపులు హేతుబద్ధంగా అనిపించడం లేదు. రూ. 15 లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి పాత విధానంలో రూ. 2,73,000 ఆదాయం పన్ను చెల్లించాల్సివస్తే... కొత్త విధానం ప్రకారం రూ. 1,95,000 చెల్లిస్తే సరిపోతుంది. అంటే కొత్త విధానంలో రూ. 78,000 మిగులుతుంది. కానీ అదే సమయంలో వారు గృహ రుణంపై చెల్లించే వడ్డీ, బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకయ్యే ఫీజులు, పీపీఎఫ్ వంటివాటిపై ఇప్పు డున్న మినహాయింపులన్నీ కోల్పోతారు. ఇవే కాదు... 80జీ కింద విరాళాలపై ఉండే మినహాయింపు, 80 జీజీ కింద నెలకు రూ. 5,000 వరకూ ఉండే మినహాయింపు మాయమవుతాయి. ఇలా దాదాపు 70కి పైగా మినహాయింపులను తొలగించారు. అయితే మున్ముందు సమీక్షించి మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంగతలా వుంచితే... గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వర్త మానంలో ఇలా మినహాయింపులు తొలగించడం ఆ రంగానికి చేటు కలిగించదా? అలాగే బీమా ప్రీమియంలు చెల్లించేవారికిచ్చే మినహాయింపులు కూడా కొత్త విధానంలో కనుమరుగయ్యాయి. ఆదాయం పన్ను మినహాయింపు కోసం అధిక శాతంమంది ఆశ్రయించేది బీమా ప్రీమియంలు చెల్లించడం. ఆ మినహాయింపు కాస్తా ఎత్తేస్తే, ఎవరైనా బీమా జోలికి వెళ్తారా? అది ఆ వ్యాపారంపై ప్రభావం చూపదా? ఉన్నంతలో సాగురంగానికీ, గ్రామీణ రంగానికీ కేటాయింపులు మెరుగ్గానే ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచడం మంచి చర్యే. జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రానికి ఎల్ఐసీలో పది శాతం వాటావుంది. ఇందులో ఏమేరకు విక్ర యిస్తారో చూడాలి. దండిగా లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసీలో ప్రైవేటీకరణకు వీలుకల్పించే ఈ చర్య అమలు అంత సులభం కాదు. దీన్ని ప్రతిఘటిస్తామని బీమా ఉద్యోగులు హెచ్చరించారు. కేంద్రం నిధులు సమకూరిస్తే తప్ప నడిచే అవకాశం లేని సంస్థలను వదిలిపెట్టి నిక్షేపంలా ఉండే సంస్థలను ప్రైవేటు పరం చేయడమేమిటన్నది వారి ప్రశ్న. ఎల్ఐసీ ఏ రోజూ ఆర్థికంగా ఇబ్బందుల్లోపడలేదు. ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. సరిగదా... నష్టాల్లో మునిగిన అనేక పబ్లిక్ రంగ సంస్థల్ని బతికిం చడానికి దాని నిధులే అక్కరకొస్తున్నాయి. బీమా రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా, ప్రజలు ఎల్ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఆ సంస్థే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో కేంద్రం పునరాలోచించడం ఉత్తమం. వివిధ మౌలిక సదుపాయ రంగ ప్రాజెక్టులకు అవస రమైన నిధులు సమీకరిస్తూనే, ద్రవ్యలోటు రాకుండా చూడటానికి ఎల్ఐసీలోనూ, ఐడీబీఐలోనూ ఉన్న వాటాలను కేంద్రం విక్రయించదల్చుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఏమేరకు సాధ్యమో చూడాల్సివుంది. అయితే ద్రవ్య లోటును నిర్దేశించిన పరిమితికి లోబడివుండేలా చూడాలన్న లక్ష్యంలో సంక్షేమ పథకాలకు కోత పడకుండా చూడటం ముఖ్యం. బడ్జెట్ గణాంకాలు గమనిస్తే ముగుస్తున్న సంవత్సరంలో ఆహార సబ్సిడీలో రూ. 75,532 కోట్లు, గ్రామీణ ఉపాధిలో రూ. 9,502 కోట్లు కోతపడ్డాయి. ప్రజల్లో వినిమయాన్ని పెంచి, డిమాండ్ పెరిగేలా చేసినప్పుడే తయారీ రంగం కోలుకుంటుంది. అందు కవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటేనే వృద్ధి రేటు నిర్మలా సీతారామన్ ఆశించినట్టు 10 శాతానికి చేరుతుంది. -
విద్యార్థులపై తూటా
మహాత్ముడి 72వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలంతా ఆయనకు నివాళులర్పిస్తున్న వేళ న్యూఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఒక దుండగుడు గురువారం కాల్పులు జరిపిన దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. నడిరోడ్డుపై పట్టపగలు ఇంతక్రితం ఎవరూ కాల్పులకు తెగబడలేదని కాదు. మూడు దశాబ్దాలక్రితం ముంబై మహానగరాన్ని గడగడలాడించిన మాఫియా ముఠాలు ఆధిపత్యం కోసం పరస్పరం తుపాకులతో తలపడిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి కిరాయి గూండాలు వ్యాపారిపైనో, పారిశ్రామికవేత్తపైనో గురిపెట్టిన ఉదంతాలున్నాయి. అయితే అవన్నీ పోలీసులు ఘటనా స్థలి దరిదాపుల్లో లేనప్పుడు, వారు అప్రమత్తంగా లేనప్పుడు జరిగినవే. కానీ గురువారం నాటి ఉదంతం తీరు వేరు. అక్కడ పోలీసు బలగాలున్నాయి. రాజ్ఘాట్ వైపు వెళ్లే విద్యార్థుల్ని బలప్రయోగం చేసైనా నిరోధించడానికి ఆ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఈలోగా నాటు తుపాకి ధరించిన దుండగుడు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను గురి చూస్తూ... ‘స్వాతంత్య్రం కావాలా మీకు, ఇదిగో తీసుకోండి’ అంటూ కాల్చి ఒక విద్యార్థిని గాయపరిచాడు. ఇదంతా కెమెరాల సాక్షిగా, పోలీసు బలగాల సాక్షిగా జరిగిపోయింది. ఆరు వారాలక్రితం అదే విశ్వవిద్యాలయం విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగినప్పుడు ఆ ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీలు ఝుళిపించిన ఢిల్లీ పోలీసులు... ఆ తర్వాత పలుమార్లు ఆందోళనల్ని అడ్డుకోవడంలో అతిగా ప్రవర్తించిన పోలీసులు ఈసారి ఆ దుండగుడు తుపాకి తీసినా, దాంతో విన్యాసాలు చేసినా, చివరకు కాల్పులు జరిపినా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యూజిలాండ్లో నిరుడు మార్చిలో క్రైస్ట్ చర్చి నగరంలో 51మందిని ఊచకోత కోసిన దుండగుడి వైనం ఎవరూ మరిచిపోరు. అతగాడు ఈ దాడినంతటినీ ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఢిల్లీలో కాల్పులకు తెగబడిన దుండగుడు కూడా దాడికి ముందు ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాడని చెబుతున్నారు. దుండగుడు అప్పటివరకూ ఆ ఆందోళనకారులతోనే ఉన్నాడని, ఉన్నట్టుండి వేగంగా ముందు కొచ్చి కాల్పులు జరిపాడని, ఇది హఠాత్ సంఘటన గనుక తేరుకోవడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచదు. ఊహించని పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణ వారికుంటుంది. నిత్యం అలాంటి పరిస్థితులతో వ్యవహరిస్తుంటారు కాబట్టి అందుకు సంబంధించిన నైపుణ్యం మెరుగుపడాలి తప్ప తగ్గకూడదు. పైగా అంతవరకూ ఆందోళనకారుల్లో ఒకడిగా ఉన్నవాడు తమవైపు తుపాకి ధరించి, కేకలు పెడుతూ వస్తుంటే అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆ క్షణంలో అతగాడెవరో తెలిసే అవకాశం లేదు. ఆందోళనకారులవైపునుంచి వస్తున్నాడు గనుక తమకే హాని తలపెట్టొచ్చునని అనుమానం కలగాలి. కనీసం మతి చలించినవాడేమోనన్న సందేహమైనా రావాలి. కానీ పోలీసుల తీరు చూస్తే ఎంతో భరోసాతో ఉన్నట్టు కనబడింది. కాల్పులు జరుపుతున్నాడని అర్థమయ్యాక ఆందో ళనకారులు కూడా ఎదురుదాడికి ప్రయత్నించివుంటే మరెంతమందికి హాని కలిగేదో ఊహించలేం. ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి, ఆ క్రమంలో అవసరమైతే బలప్రయోగం చేయడానికి అక్కడ సిద్ధంగా వున్న పోలీసులు అంత నిర్లిప్తంగా ఉండిపోవడాన్ని ఎవరూ ఊహించలేరు. ఇందుకు ఏ సంజాయిషీ చెప్పినా అది సాకు మాత్రమే అవుతుంది. ఢిల్లీ పోలీసుల నిర్వాకం వెల్లడికావడం ఇది మొదటిసారి కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన జేఎన్యూపై ముసుగులు ధరించిన దుండగులు దాడి చేసి, లేడీస్ హాస్టల్తోసహా పలుచోట్ల దాదాపు మూడు గంటలపాటు బీభత్సం సృష్టించిన రోజున కూడా వారు ప్రేక్షకపాత్రే పోషించారు. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల నుంచి తమకు అనుమతి అందలేదని తప్పించుకోజూశారు. ఆరోజు నిర్వా్యపకత్వం సరే... ఆ తర్వాతైనా సమర్థత చాటుకోలేక పోయారు. ఇంతవరకూ ఆ దుండగుల్లో ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేకపోయారు. దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే ప్రపంచ దేశాల్లో మన పరువు దెబ్బతినదా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. కానీ 24 గంటలు గడిచినా ఆ యువకుడు ఏ సంస్థకు చెందిన వాడో, నాటు తుపాకి అతనికెలా వచ్చిందో, ఫేస్బుక్లో అతను పెట్టిన ఉన్మాద రాతల వెనక ఎవరు న్నారో పోలీసులు ఇంకా ఆచూకీ రాబట్టినట్టు లేదు. ఢిల్లీలో ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం సాగుతోంది. కనుక ఈ రెండూ పరస్పర ప్రభావితాలవుతున్నాయి. ‘మీరు మోదీవైపు ఉంటారా, షహీన్బాగ్ వైపా?’ అని అమిత్ షా నేరుగానే ప్రచార సభల్లో ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ మరో అడుగు ముందుకేసి దేశద్రోహుల్ని కాల్చి చంపాలంటూ సభికులతో నినాదాలు చేయించారు. అటు కాంగ్రెస్ సైతం షహీన్బాగ్ ఆందోళనల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీ ఈ ఉద్యమానికి దూరంగా తమ ప్రభుత్వం అయిదేళ్లలో సాధించిన విజయాల గురించి చెప్పుకుంటోంది. ఆందోళనపై కేజ్రీవాల్ స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ప్రజానీకంలో ఒకరకమైన అభద్రతా భావాన్ని కలగజేయడం బాధ్యతారాహిత్యమని నాయకులు గుర్తించాలి. ఇప్పుడు ఢిల్లీలో కాల్పులకు తెగబడి అరెస్టయిన యువకుడు ఇలాంటి ఉద్రిక్తతలతో ప్రభావితమయ్యాడని అర్ధమవుతోంది. కనుక నేతలు సంయమనం పాటించాలి. ఆచితూచి మాట్లాడాలి. -
సత్వర న్యాయం
రెండు నెలలక్రితం కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులు షేక్ బాబు, షాబుద్దీన్, షేక్ మఖ్దూంలకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఫాస్ట్ట్రాక్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఉదంతం జరిగిన మూడు రోజులకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని చకచకా దర్యాప్తు చేశారు. గత నెల 11న ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకాగా 14న పోలీసులు చార్్జషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు కూడా అంతే వేగంతో దర్యాప్తు జరిపి 45 రోజుల్లో తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష పడింది కనుక తెలంగాణ హైకోర్టు దీన్ని ధ్రువీకరించాల్సివుంటుంది. ఉరిశిక్ష విధింపు విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నవారు సైతం తెలంగాణ పోలీ సులు పకడ్బందీగా దర్యాప్తు చేయడాన్ని, ఫాస్ట్ట్రాక్ కోర్టు కూడా ఈ కేసు విచారణను సత్వరం పూర్తి చేయడాన్ని హర్షిస్తారు. అత్యాచారాలు తరచుగా చోటుచేసుకోవడానికి గల ముఖ్య కారణాల్లో వ్యవస్థలు సక్రమంగా స్పందించకపోవడం ఒకటని 2012లో నిర్భయ ఉదంతం తర్వాత కేంద్రం నెలకొల్పిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఉదంతంలో కూడా పోలీసులు ఇంతే వేగంతో స్పందించారు. ఘటన జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి నేరగాడికి ఉరిశిక్ష పడింది. ఈ కేసు తీర్పును సమీక్షించిన తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. గత నవంబర్ 27న వైద్యురాలు దిశను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులు ఆ తర్వాత డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో మరణించారు. ఆ నిందితులు ఇదే తరహాలో తెలంగాణ, కర్ణాటకల్లో 15మంది మహిళల ప్రాణాలు తీసినట్టు తమ దర్యాప్తులో వెల్ల డైందని పోలీసులు చెప్పారు. యాదాద్రి జిల్లాలోని హాజీపూర్లో బాలికల ప్రాణాలు తీసిన కేసులోని నిందితుడికి ఇంకా శిక్ష పడాల్సివుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికి, మీడియాలో బాగా ప్రచారంలోకొచ్చిన కేసుల విషయంలో మాత్రమే పోలీసులు శ్రద్ధ పెడుతున్నారని, న్యాయస్థానాలు కూడా వేగంగా విచారణ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. అత్యాచారం కేసుల్లో మాత్రమే కాదు... ఆడపిల్లల పట్ల జరిగే ఏ చిన్న లైంగిక నేరంలోనైనా ఇదేవిధమైన శ్రద్ధ పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. ముఖ్యంగా తమ కుమార్తెను ఫలానా వ్యక్తి వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని అత్యంత సాధారణమైన విషయంగా తీసుకోవడం పోలీసు విభాగాల్లో రివాజు అయింది. అసలు బాధితులు ఫిర్యాదు చేసేవరకూ వచ్చారంటేనే పరిస్థితి వారి చేయి దాటిపోయిందని అర్థం. మన సమాజంలో ఏ ఆడపిల్లయినా వేధింపులు ఎదుర్కొన్నప్పుడు అంత త్వరగా తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా సిద్ధపడదు. కుటుంబాల్లో ఆడపిల్లల్ని పెంచే విధానం ఇందుకు ఒక కారణం. అలా చెబితే తననే నిందిస్తారేమో, అసలు బయటకే వెళ్లొద్దని కట్టడి చేస్తారేమో అని సందేహపడుతుంది. చదువుకునే బాలికైతే చదువు ఆపేస్తారని భయపడుతుంది. వేధింపుల స్థాయి పెరిగాక తప్పనిసరై ఇంట్లో చెబుతుంది. తల్లిదండ్రులు సైతం పోలీసుల వరకూ వెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరిద్దామని చూస్తారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే కుటుంబం పరువు పోతుందని భయపడతారు. అందరూ వేలెత్తి చూపుతారని సందేహపడతారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత తాత్సారం చేస్తే ఏమవుతుందో వేరే చెప్పనవసరం లేదు. దిశ విషయంలో పోలీసులు వెంటనే స్పందించలేదు. ఆమె తన సోదరికి ఫోన్ చేసి తన టూ వీలర్ పాడైందని, బాగు చేసుకొస్తానని వెళ్లినవాడు ఇంకా రాలేదని చెప్పిన కాసేపటికే స్విచాఫ్ కావడంతో వెంటనే ఆ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదని, వెంటనే కదిలివుంటే ఆమె ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు ఆరోపిం చారు. బాధితులకు ఎవరూ అండగా రారని, వారు నిస్సహాయులని తెలిసినప్పుడే నేరగాళ్లు మరింత పేట్రేగిపోతారు. కనుకనే సమాజంలో నిస్సహాయులుగా ఉండేవారి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయో, అవి తమ విధులను ఎలా నిర్వర్తిస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేసే యంత్రాంగం ఉండాలని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచించింది. తనిఖీల్లో అలసత్వంతో ఉన్నట్టు తేలినపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది .లోగడ వరంగల్ జిల్లాలో జరిగిన ఉదంతంలోగానీ, ఇప్పుడు సమత కేసు ఉదంతంలోగానీ సత్వర దర్యాప్తు జరగడం, వెనువెంటనే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడటం వంటివి హర్షించదగ్గవే అయినా... వాటి తీవ్రతతో నిమిత్తం లేకుండా ఏ కేసు విషయంలోనైనా ఇదే స్థాయిలో స్పందించే స్వభావాన్ని పోలీసులు అలవర్చుకుంటే నేరస్వభావాన్ని మౌలిక దశలో కట్టడి చేయడం వీలవుతుంది. ఈ క్రమంలో నిందితులు పలుకుబడి కలిగినవారైనా ఉపేక్షించకూడదు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో శాసనసభ్యుడిపై అత్యాచారం ఆరోపణలొచ్చినప్పుడు పోలీసులు ఎంతో తాత్సారం చేయడం వల్ల అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఆ ఎమ్మెల్యే మనుషులు ఆమె తండ్రితోసహా కుటుంబంలో నలుగురిని హతమార్చడంతోపాటు రోడ్డు ప్రమాదం పేరిట బాధితురాలినే హత్య చేయాలనుకున్నారు. తీవ్రమైన నేరాలకు కఠిన శిక్షలు విధించడానికి అనువుగా చట్టాలు సవరించడం, వెంటవెంటనే నేరగాళ్లకు శిక్షలు పడేవిధంగా అన్ని వ్యవస్థలూ చురుగ్గా పనిచేయడం నేరాలను అరికట్టడంలో ఎంతో ఉపయోగపడతాయి. అదే సమయంలో మద్యపానం మహమ్మారిని అదుపు చేయడం, అశ్లీల వీడియోలపై కట్టడం చేయడం అత్యంత ముఖ్యం. ఒక మనిషి మృగంగా మారడానికి తోడ్పడుతున్న ఈ మాదిరి ప్రమాదకరమైన వాటిని నిర్మూలించకుండా నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. కనుక ప్రభుత్వాలు వీటిపై కూడా దృష్టి పెట్టాలి. -
ప్రైవేటుకి ఎయిరిండియా
పుష్కర కాలం నుంచి నష్టాలే తప్ప ఏ సంవత్సరమూ లాభాల మాటెరగని ఎయిరిండియాను ఇక వదుల్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ సంస్థలో తనకున్న వాటా మొత్తాన్ని ఉప సంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం తెలియజేసింది. వాస్తవానికి రెండేళ్లక్రితం కూడా ఎయిరిండియా సంస్థలో తన వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించుకుంది. అయితే అందులో 76 శాతం వాటాను మాత్రమే విక్రయిస్తానని ప్రకటించింది. అయితే అదంత లాభసాటి కాదన్న కారణంతో ఎవరూ ముందుకు రాలేదు. అందుకే కావొచ్చు... ఈసారి మొత్తం వాటా విక్ర యానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఎయిరిండియా రుణ భారం రూ. 60,000 కోట్లు మించింది. దానికి ఏటా నష్టాలే వస్తున్నాయి. 2018–19లో అది రూ. 8,556.35 కోట్లు నష్టపోయింది. అంతకు ముందు సంవత్సరం దాని నికర నష్టం రూ. 5,348.18 కోట్లు. గత దశాబ్దకాలంలో ఎయిరిండియా కొచ్చిన నష్టాలు లెక్కేస్తే ఆ మొత్తం రూ. 69,575.64 కోట్లని గత నెలలో కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి ప్రకటించారు. ఎయిరిండియా ఇండియన్ ఎయిర్లైన్స్తో విలీనమ య్యాక 2007–08లో లాభాలొచ్చాయి. ఆ తర్వాత మరెప్పుడూ అది లాభాలు కళ్లజూడలేదు. ఒక పక్క దేశంలో ఆర్థిక మందగమనం, మరోపక్క మొన్న అక్టోబర్లో ప్రకటించిన కార్పొరేట్ పన్ను రాయితీ వగైరాలతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో నష్టజాతక ఎయిరిండియా భారం మోయడం అసాధ్యమన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు కనబడుతోంది. ఎయిరిండియాకు వివిధ అనుబంధ సంస్థలున్నాయి. వాటిల్లో కొన్నిటిని ఈ అమ్మకం నుంచి మిన హాయించారు. ఇప్పుడున్న రూ. 60,000 కోట్ల అప్పులో సంస్థను కొనుగోలు చేసేవారు రూ. 23,287 కోట్ల మొత్తాన్ని భరించాల్సివుంటుంది. మూడేళ్లక్రితం ఎయిరిండియా ఆర్థిక పునర్నిర్మాణ పథకంపై ఆడిట్ నివేదిక అందజేసింది. అందులో అది ఎయిరిండియా నిర్వహణ తీరును తప్పుబట్టింది. పథకంలో నిర్దేశించిన అనేకానేక లక్ష్యాలను అందుకోవడంలో అది ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించింది. 2016లో ప్రయా ణికుల ద్వారా లభించే ఆదాయాన్ని రూ. 21,297 కోట్లుగా అంచనా వేయగా, అందులో దాదాపు 20 శాతం తగ్గింది. వాస్తవ ఆదాయం రూ. 15,773 కోట్లు. తగినన్ని విమానాలు దాని వద్ద లేకపోవడం, మానవ వనరుల్ని వినియోగించుకోవడంలో విఫలం కావడం, ప్రయాణికుల రద్దీ వున్నచోట కాక వేరే మార్గాల్లో విమానాలు తిప్పడం వగైరాలు ఈ నష్టాలకు కారణమని అది తెలిపింది. తనకున్న ఆస్తుల్ని వినియోగించుకుని ఆదాయం పెంచుకోవడంలోనూ ఎయిరిండియా దారుణంగా విఫల మవుతున్నదని కాగ్ విమర్శించింది. దానికున్న 12 ఆస్తులను సరిగా వినియోగించుకుంటే రూ. 500 కోట్ల ఆదాయం వస్తుందని పునర్నిర్మాణ పథకంలో అంచనా వేస్తే అందుకోసం ఎయిరిండియా రూపొందించిన నిబంధనలు దానికి ఆటంకంగా మారాయన్నది కాగ్ అభియోగం. డిమాండ్కు తగి నట్టుగా విమానాలను సమకూర్చుకోవడంలో సంస్థ విఫలమైందని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించు కోవడానికి ఎ 320 రకం విమానాలను కొనుగోలు చేయాలని కన్సల్టెంట్ సూచించగా అందుకోసం గ్లోబల్ టెండర్లు పిలవడానికి మూడేళ్లు పట్టిందని ఎత్తిచూపింది. ప్రయాణికుల రద్దీ రీత్యాగానీ, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి గానీ ఈ విమానాలు దోహదపడేవని, కానీ అలివిమాలిన జాప్యంతో సంస్థకు యధాప్రకారం నష్టాలు వచ్చాయని కాగ్ తేల్చిచెప్పింది. ఎమిరేట్స్కి, ఇతర గల్ఫ్ దేశాలకు పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎయిరిండియా తగిన సంఖ్యలో విమానాలు నడపలేకపోతుండగా, ఈ అవకాశాన్ని వినియోగించుకుని విదేశీ సంస్థలు దండిగా లాభాలు గడించ గలుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, యూరప్ దేశాలకు నడిపే సర్వీ సులను విస్తరించడం, అందుకు తగినట్టుగా ప్రయాణికులను రాబట్టుకోలేకపోవడం వల్ల 2015– 16లో ఎయిరిండియా రూ. 2,323. 76 కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా న్యూయార్క్ రూట్లో తిరిగే ఎయిరిండియా విమానాల్లో 77 శాతం ప్రయాణికులు మాత్రమే ఉంటున్నారని కాగ్ ఎత్తిచూ పింది. సిబ్బంది కూడా అవసరానికి మించి ఎక్కువున్నారని, అలాగే ఉన్న పైలెట్లు, కేబిన్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంలో తరచు వైఫల్యాలు ఎదురవుతున్నాయని కాగ్ ఎత్తిచూపింది. తొలిసారి 1953లో అప్పటివరకూ వున్న టాటా ఎయిర్లైన్స్ను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, దానికి ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభమయ్యాక విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలను అనుమతించారు. ఆ సమయంలో నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలనూ ప్రభుత్వం పూర్తిగా నిపుణులకు వది లేసివుంటే వేరుగా ఉండేది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. దాంతో సర్కారీ విధానాలకు లోబడి పనిచేయాల్సిన ఎయిరిండియా సహజంగానే ప్రైవేటు సంస్థల పోటీని తట్టుకోలేకపోయింది. నిజా నికి ఎంతో జాగ్రత్తగా వ్యాపారం చేయగలవనుకున్న ప్రైవేటు సంస్థలే విమానయాన రంగంలో తరచు బోల్తా పడుతున్నాయి. ఇంతవరకూ 13 ప్రైవేటు విమానయాన సంస్థలు మూతబడ్డాయి. ఎయిరిండియాను ఈసారైనా ఎవరో ఒకరు కొనుగోలు చేస్తే ఏమోగానీ... లేకపోతే అది కూడా మూతబడే పరిస్థితే వుంది. గతంలో దేశీయ సర్వీసులకు ఇండియన్ ఎయిర్లైన్స్, అంతర్జాతీయ సర్వీసులకు ఎయిరిండియా ఉండేవి. రెండింటికీ నష్టాలొస్తున్న క్రమంలో విలీనం చేయడం ఉత్తమ మని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. నిజానికి అది ప్రమాదకరమని అప్పట్లో నిపుణులు హెచ్చరించారు. విలీనం చేసినప్పటినుంచీ రెండు సంస్థల్లో పనిచేసే సిబ్బందికి జీతభత్యాల్లో, విధి నిర్వహణ, పదోన్నతులు వగైరాల్లో ఉన్న వ్యత్యాసాలపై పేచీలు బయల్దేరాయి. అవి పలుమార్లు సమ్మెలకు దారితీశాయి. ఒక దిగ్గజ సంస్థగా వెలుగొందిన ఎయిరిండియా చివరకు పెను నష్టాలతో రెక్కలు తెగిన పక్షిలా మారడం విచారకరం. -
సౌదీతో సాన్నిహిత్యం
ఏ దేశంలోనైనా సంస్కరణలు ఊపందుకుని ఆర్థిక సామాజిక రంగాల్లో చలనం అధికంగా కనిపిం చినప్పుడు అది ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అక్కడకు వివిధ దేశాల అధినేతల రాకపోకలు పెరుగుతాయి. ఆ దేశంలో పెట్టుబడులపరంగా, వాణిజ్యపరంగా విస్తృతమైన అవకాశాలు ఏర్పడటం అందుకు కారణం. ఆ కోణంలో సౌదీ అరేబియా ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే మంగళవారం ఆ దేశంలో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ రూపొందించిన విజన్–2030 ఎనిమిది దేశాలతో సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకొనాలని నిర్దేశిస్తోంది. అందులో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్లతోపాటు మన దేశం కూడా ఉంది. సౌదీ అరేబియాకు ఇతరేతర దేశాలతో ఉన్న సంబంధాలు మాటెలా ఉన్నా మనతో అది సౌహార్ద సంబంధాలే కొనసాగిస్తూ వస్తోంది. ఈ ఏడాది మొదట్లో సౌదీ అరేబియా యువ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మన దేశంలో పర్యటించారు. అప్పుడు భారత్లో ఇంధనం, ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, పెట్రో కెమికల్స్, చమురుశుద్ధి, విద్య, తయారీరంగం తదితరాల్లో రూ. 10,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన కుదిరింది. దానికి కొనసాగింపుగా మోదీ పర్యటనలో ఒప్పందాలపై సంతకాలవుతాయి. దాంతోపాటు మంగళవారం రియాద్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్షియేటివ్(ఎఫ్ఎఫ్ఐ) ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభమైన వార్షిక సద స్సులో కూడా మోదీ పాల్గొన్నారు. 2024కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు సంకల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. సౌదీతో మన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 2,750 కోట్ల డాలర్లు. మన చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతుల ద్వారానే తీరు తుండగా ఇరాక్ తర్వాత భారత్కు భారీగా ముడి చమురు సరఫరా చేసే దేశం సౌదీ అరేబియానే. 2018–19లో మన దేశం 20 కోట్ల 73 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకోగా అందులో సౌదీ వాటా 4 కోట్ల టన్నులపైనే. సౌదీకి చెందిన ఆరామ్కో ప్రపంచంలోనే అత్యధిక లాభాలు గడిస్తున్న చమురు సంస్థ. ఆ దేశంలో 27,000 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయని అంచనా. కనుక చమురు రంగంలో సౌదీ అరేబియా స్థానం తిరుగులేనిది. అయితే భారత్–సౌదీ అరేబియాల మధ్య సహకారం కేవలం చమురు–ఇంధన రంగాలకు మాత్రమే పరిమితమై లేదు. ఇరు దేశాల అధినేతలూ తీసుకున్న చొరవ కారణంగా ఈ సహకారం బహుళరంగాలకు విస్తరించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ, సాగర భద్రత, పెట్టుబడులు, పర్యాటకం తదితర అనేక రంగాలకు విస్తరించింది. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణల కార్యక్రమం భారీయెత్తున సాగుతోంది. అందులో గణనీయమైన భాగస్వామ్యం ఇవ్వడంతోపాటు మన దేశంలోని పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ తదితర రంగాల్లో సౌదీ సహకారం అందించాలని మన దేశం కోరుకుంటోంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఇటువంటి పరిస్థితి లేదు. మనకు అప్పటికి సోవియెట్ యూనియన్గా ఉన్న రష్యాతో మంచి సంబంధాలుండేవి. అటు సౌదీ అరేబియా అమెరికా అనుకూల వైఖరితో ఉండేది. దానికితోడు భారత్తో సంబంధాల విషయం వచ్చేసరికి అది పాకిస్తాన్ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించేది. ఇప్పుడు అదంతా మారింది. రెండు దేశాలూ సకల రంగాల్లో సన్నిహితం కావాలని నిర్ణయించాయి. కశ్మీర్ భారత్ ఆంతరంగిక వ్యవహార మని, దాని జోలికి పోవద్దని సౌదీ నేతలు భావించారు. జమ్మూ–కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, 370 అధికరణను రద్దుచేయడం వంటి అంశాల్లో ఈ కారణం వల్లే సౌదీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. టర్కీ తరహాలో సౌదీ కూడా స్పందిస్తుందనుకున్న పాకిస్తాన్ ఈ పరిణామంతో ఖంగుతింది. పొరుగునున్న పాకిస్తాన్ నుంచి మనకు ఉగ్రవాద బెడద ఉన్నట్టే సౌదీ అరేబియాకు కూడా ఇరుగు పొరుగు నుంచి ముప్పు కలిగే ప్రమాదం ఉంది. ఇటీవలే అక్కడి ఆరామ్కో చమురుశుద్ధి కర్మా గారంపై ద్రోన్ దాడులు జరిగి భారీ నష్టం సంభవించింది. పశ్చిమాసియాలో సైనికపరంగా సౌదీ శక్తిమంత మైనదే అయినా, ఏటా అది ఆయుధాల కోసం వందలకోట్లు వెచ్చిస్తున్నా, ఉగ్రవాద వ్యతి రేక పోరులో దానికి అనుభవం తక్కువ. కనుకనే ఈ రంగంలో సహకరించుకోవాలని భారత్, సౌదీ అరేబియాలు నిర్ణయించుకున్నాయి. ఉమ్మడి సైనిక శిక్షణ కార్యక్రమాలు, విన్యాసాలు జరపడం ఇలాంటి లోటు పాట్లను తీరుస్తుంది. ఫిబ్రవరిలో బిన్ సల్మాన్ మన దేశంలో పర్యటించినప్పుడు ఈ విషయంలో ఒప్పందం కుదరింది. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ వెళ్లి దానికి కొన సాగింపుగా చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది మొదట్లో రెండు దేశాల ఉమ్మడి నావికా దళ విన్యాసాలు జరుగుతాయి. అంతరిక్ష సాంకేతికతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సౌదీ నిర్ణయించింది. కనుక ఈ రంగంలో సైతం మన దేశానికి అవ కాశాలు బాగా పెరుగుతాయి. రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, ఉపగ్రహ ఆధారిత సము ద్రయాన నిర్వహణ వగైరాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు అపారమైన అనుభవం ఉంది. వీటన్నిటా రెండు దేశాలూ కలిసి పనిచేస్తే ఉమ్మడిగా లాభపడటానికి అవకాశాలుంటాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాలూ చాలా రంగాల్లో సన్నిహితమయ్యాయి గనుక ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి వెళ్తాయి. అయితే రెండు దేశాల మధ్య ఏర్పడే ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే అవి రెండూ తమ జాతీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టాలి తప్ప మూడో దేశం ప్రయోజనాల గురించి ఆలోచించకూడదు. భారత్, సౌదీ అరేబియాలు రెండూ ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే అచిరకాలంలోనే ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి. -
బాగ్దాదీ ‘ఆపరేషన్’!
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అధినాయకుడు, ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీ కోసం అమెరికా అయిదారేళ్లుగా సాగిస్తున్న వేట ముగిసింది. అతగాడిని సిరియాలో తమ దళాలు వెంటాడి ఓ సొరంగంలో చిక్కుకున్నాక మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ముందు ట్విటర్ ద్వారా ఏకవాక్య ప్రకటన చేసి, ఆ తర్వాత మీడియా సమావేశం ద్వారా బాగ్దాదీ మృతి వివరాలను ఆయన వెల్లడించారు. వీక్షకుల్లో ఉత్కంఠ రేపేందుకు చానెళ్లు సస్పెన్స్ దట్టించి మధ్యమధ్యలో విడుదల చేసే టీజర్ల మాదిరి ఆ ట్వీట్ ఉంది. తమ బలగాల చర్య పర్యవసానంగా ఐఎస్ నడ్డి విరచగలిగామని ట్రంప్ సంతోషపడుతున్నారు. ఆ మాటెలా ఉన్నా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని మళ్లీ గెలుచుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న వేళ బాగ్దాదీ మరణం ఖచ్చితంగా ఆయనకు కలిసిరావొచ్చు. ఇరాక్ తదితర దేశాల్లో అనేకానేక దురాగతాలకూ, దుర్మార్గాలకూ కారణమైన సంస్థ అధినాయకుడు మరణించాడంటే సహజంగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక జర్మన్ పాత్రికేయుడు యూర్గన్ టోడెన్ హ్యోపర్కి అయిదేళ్లక్రితం ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాక్లోని మోసుల్లోఐఎస్ ముఠాలో కొందరిని కలిసి బాగ్దాదీని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయనతో ‘అతను కేవలం వ్యక్తిమాత్రుడు. విద్యావంతులు, నాయకులు సభ్యులుగా ఉండే ఒక మండలి ఆయన్ను నాయకుడిగా ఉంచింది. ఆయన మరణిస్తే ఆ మండలి మరొకరిని ఆ స్థానంలో ప్రతిష్టిస్తుంది. మీరు కలవదల్చుకుంటే మండలి సభ్యుల్ని కలవండి’ అని సలహా ఇచ్చారట! కనుక బాగ్దాదీ మరణంతో ఐఎస్, దాని దుర్మార్గాలు కనుమరుగవుతాయని భావించడం దురాశే. ఒకపక్క దురాగతాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు కొనసాగిస్తూనే.... ఆ సంస్థ పుట్టుకకూ, అది పుంజుకోవడానికి ఏ కారణాలు దోహదపడ్డాయో గుర్తించడం, అందుకు కారకులెవరో తేల్చడం, వారిపట్ల ఎలా వ్యవహరించాలో నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచ ప్రజల కర్తవ్యం. లేనట్టయితే బాగ్దాదీలాంటివారు మున్ముందు కూడా పుట్టు కొస్తూనే ఉంటారు. ఊహకందని మారణహోమాలు సృష్టిస్తూనే ఉంటారు. సరిగ్గా ఎనిమిదేళ్లక్రితం అల్ కాయిదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా మెరైన్లు మట్టు బెట్టినప్పుడు కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మీడియా సమావేశం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అయితే అందులో ట్రంప్ ప్రదర్శించినంత నాటకీయత లేదు. ఆయన ఒక ప్రకటన చదవబోతున్నట్టు తెలుసుకున్న వెంటనే అప్పటికప్పుడు చానెళ్లు అన్నిటినీ నిలిపి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఒబామా ప్రకటనలో అవసరమైన వివరాలేమీ లేవు. కానీ ట్రంప్ తీరు వేరు. ఆపరేషన్ మొత్తం ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆయన మాటలు జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరూ అది కళ్లముందే జరిగిందన్న భ్రాంతికి లోనుకావడం ఖాయం. అమెరికన్ బలగాలు గుర్తించి కాల్పులు మొదలెట్టిన వెంటనే బాగ్దాదీ ముగ్గురు పిల్లల్ని తీసుకుని లబోదిబోమంటూ ఒక సొరంగంలో దూరిన వైనం, ఆ సొరంగానికి బయటకుపోయే మార్గం లేకపోవడం గురించి ట్రంప్ వివరించారు. అనంతరం పాత్రికేయులడిగిన సందేహాలన్నిటికీ జవాబి చ్చారు. మొత్తం నలభై నిమిషాలపాటు ట్రంప్ ప్రసంగించారు. బాగ్దాదీ తొలిసారి ప్రపంచానికి పరిచయమైననాటికీ, ఇప్పుడు మరణించేనాటికీ పరిస్థితుల్లో వచ్చిన వ్యత్యాసాన్ని గమనిస్తే ఐఎస్ ఉత్థానపతనాల గురించి స్థూలంగా అర్ధమవుతుంది. 2010లో ఐఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించి నప్పుడు అది ప్రపంచ ముస్లింలందరికీ మార్గదర్శకత్వంవహిస్తుందని బాగ్దాదీ చెప్పుకున్నాడు. కానీ ఇరాక్, ఇరాన్, సిరియా, అఫ్ఘానిస్తాన్ వగైరాల్లో అమెరికా అనుసరిస్తున్న ధోరణుల్ని గట్టిగా వ్యతిరేకించే ప్రపంచ ముస్లిం ప్రజానీకంలో సైతం అతనికి పెద్దగా మద్దతు లభించింది లేదు. సరిగదా కార్యకలాపాలు సాగించిన ప్రాంతాల్లోనే అది క్షీణించింది. తన చుట్టూ ఉండేవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితికి అతను చేరుకున్నాడు. అల్ కాయిదా, ఐఎస్ మొదట్లో కలిసి పనిచేసినా 2013లో తెగదెంపులు చేసుకున్నాక ఆ రెండు సంస్థలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికాకు సాగిలబడిన ద్రోహులు మీరంటే మీరని నిందించుకు న్నాయి. పిరికిపందలని తిట్టుకున్నాయి. కానీ అల్ కాయిదా అనుబంధ సంస్థ హయత్ తహ్రిర్ అల్ షామ్(హెచ్టీఎస్)కు పలుకుబడి ఉన్న సిరియాలోని అద్లిబ్ ప్రాంతంలో ఇప్పుడు బాగ్దాదీ పట్టు బడటాన్ని గమనిస్తే చిట్టచివరిలో అతని స్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఖలీఫాగా తనను తాను ప్రకటించుకున్నాక అతను నేరుగా దానికి నాయకత్వంవహించింది తక్కువ. పైగా దాని కంటూ ప్రత్యేకించి ఒక స్థావరం లేదు. 2003లో అమెరికా దురాక్రమించే సమయానికి ఇరాక్ ఎంతో ప్రశాంతంగా ఉండే సోషలిస్టు, సెక్యులర్ రాజ్యం. రాజ్యాంగంలో ఇస్లామ్ను అధికార మతంగా ప్రకటించడానికి ఆ దేశాధ్యక్షుడు సద్దాంహుస్సేన్ నిరాకరించారు. అలాంటి దేశాన్ని వల్లకాడుగా మార్చి అప్పటికి పాఠశాల చదువు కూడా పూర్తిచేయని బాగ్దాదీ లాంటివారిని ఉగ్రవాదులుగా రూపాంతరం చెందే స్థితికి చేర్చింది అమెరికాయే. ఐఎస్ బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. ఈ వాస్తవాన్ని దాచి అది మత సంస్థగా చిత్రించడం పాశ్చాత్య మీడియా అవగాహన లేమి పర్యవసానం. సిరియా అధ్యక్షుడు అసద్ను పదవీచ్యుతుణ్ణి చేయడం కోసం య«థేచ్ఛగా డాలర్లు, ఆయుధాలు కుమ్మరించి, ఎందరు మొత్తుకుం టున్నా వినక ఐఎస్ను పెంచి పోషించిన అమెరికాయే ఇప్పుడు బాగ్దాదీ మరణంలో తన విజ యాన్ని వెదుక్కుంటున్న తీరు విడ్డూరం. కనీసం ఇప్పటికైనా తన చేష్టలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయో గ్రహించి తీరు మార్చుకోవడం అమెరికా బాధ్యత. ఆ బాధ్యతను అది గుర్తించేలా చేయడం ప్రపంచ ప్రజానీకం కర్తవ్యం. -
బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం
ఇంట్లో ఫోన్ సౌకర్యం ఉండటం సమాజంలో గౌరవప్రతిష్టలకు చిహ్నంగా భావించే రోజుల్లో టెలి ఫోన్ విభాగం ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. సంపన్నులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఎవరో ఒకరితో సిఫార్సు చేయించుకుని ఇంటికి ఫోన్ అమర్చుకునేసరికి తాతలు దిగొచ్చేవారు. ఆ విభాగం కాస్తా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)గా మారిన తర్వాత క్రమేపీ ఎవరికీ అక్కర్లేని, ఎవరూ పట్టించుకోని సంస్థగా అది రూపాంతరం చెందింది. అంతకు చాలాముందే...అంటే 1986లో న్యూఢిల్లీ, ముంబై మహానగరాల్లో కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు మహానగర్ టెలి ఫోన్ నిగమ్(ఎంటీఎన్ఎల్) పేరిట వేరే ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుచేశారు. కొన్నాళ్లుగా ఆ రెండు సంస్థలూ సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకున్నాయని, ఎప్పుడు మూతబడతాయో... ఉన్న ఉద్యోగం కాస్తా ఎప్పుడు పోతుందో తెలియని అయోమయావస్థలో సిబ్బంది ఉన్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యమూ, బాధ కలుగుతాయి. కానీ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దాని పునరుద్ధ రణకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించి సిబ్బందిలో దీపావళికి ముందే వెలుగులు నింపింది. కేంద్రం నిర్ణయం ప్రకారం ఆ రెండు సంస్థలూ విలీనమై ఒకే సంస్థగా ఏర్పడతాయి. స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునేవారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. వీటితోపాటు సంస్థ మూడే ళ్లుగా ఎదురుచూస్తున్న 4జీ స్ప్రెక్ట్రమ్ కేటాయించాలని కూడా తీర్మానించారు. పదవీవిరమణపై ఒత్తి ళ్లేమీ ఉండబోవని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. సంస్థల ఆస్తులను అమ్మడం లేదా లీజుకివ్వడం ద్వారా రూ. 37,500 కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 1.68 లక్షలమంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్ఎల్లో 22,000మంది ఉన్నారు. ఈ రెండు సంస్థలకూ ఉన్న రుణభారం రూ. 40,000 కోట్లు. టెలికాం రంగంలో గుత్తాధిపత్యం ఉన్నప్పుడు అదొక వెలుగు వెలిగినా, అనంతరకాలంలో ప్రైవేటు ఆపరేటర్లు రంగ ప్రవేశం చేయడంతో ఆ పోటీని తట్టుకోవడం దానివల్ల కాలేదని, కనుకనే క్రమేపీ నీరసించిందని అందరూ అనుకుంటారు. అందులో అర్థసత్యం మాత్రమే ఉంది. బీఎస్ఎన్ ఎల్గా ఆవిర్భవించిన 2000 సంవత్సరం నుంచి 2009 వరకూ అది లాభార్జనలోనే ఉంది. ఆ తర్వాత సైతం ఎంతో కొంత మేర మెరుగ్గానే ఉంది. అన్ని రకాల పోటీలనూ తట్టుకుని అది నిలబడగలిగింది. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్కున్న అనుభవం ముందుగానీ, దానికి అందుబాటులో ఉన్న వనరుల ముందుగానీ ఏ సంస్థ అయినా దిగదుడుపేనన్నది మరిచిపోకూడదు. అసలు టెలికాం రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం సరికాదని, దాన్ని సంస్థగా మారిస్తే ప్రభుత్వం రూపొందించే విధానాలకూ, దాని నిర్వహణకూ మధ్య అగాధం ఏర్పడుతుందని, అది చివరకు ఎటూ కదల్లేని స్థితికి చేరుతుందని అప్పట్లోనే టెలికాం యూనియన్లు ఆందోళన వెలిబుచ్చాయి. దాన్ని చివరకు ప్రైవేటీకరించే ప్రతిపాద నలు మొదలవుతాయని ఆరోపించాయి. ఆ విభాగాన్ని అలాగే కొనసాగనిచ్చి, వృత్తిపరమైన స్వేచ్ఛనీ యాలని కోరాయి. నిజమే... ఒక కార్పొరేషన్గా దాన్ని రూపొందించాలనుకున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైనవారికి బాధ్యతలు అప్పగించి, వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వాలి. కానీ విధానపరమైన నిర్ణయాలన్నీ ప్రభుత్వాలు తీసుకుంటూ వాటి పర్యవసానాలకు మాత్రం సంస్థను నిందించడం రివాజుగా మారింది. ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు వచ్చినా ఇదే తంతు నడిచింది. ఇందుకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపే ఉదాహరణ. ఇతర ప్రైవేటు సంస్థలన్నిటికీ ఎప్పుడో 2016లో దక్కిన ఆ స్పెక్ట్రమ్ కోసం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు మూడేళ్లు ఎదురుచూడాల్సివచ్చింది. తీరా దాన్ని కేటాయించాలన్న నిర్ణయం తీసుకునేసరికి ఈ రంగమంతా 5జీ స్పెక్ట్రమ్ కోసం ఉవ్విళ్లూ రుతోంది. ఈ సంస్థల్లో సమస్యలున్నమాట వాస్తవమే. కానీ ఇతర సంస్థలకు దీటుగా నిలబడకపోతే చందాదారులంతా వలసపోతారు. అసలు ప్రైవేటు ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చడమే ఈ జాప్యానికి కారణమని సిబ్బంది సంఘాలు ఆరోపించాయి. ఈ రెండింట్లో దేన్ని దేనితో కలపాలన్న అంశంలో నిర్ణయం తీసుకోవడానికి పదేళ్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంటీఎన్ఎల్ లిస్టెడ్ కంపెనీ. బీఎస్ఎన్ఎల్ కార్పొరేషన్. ఎంటీఎన్ఎల్ లిస్టెడ్ కంపెనీ ప్రతిపత్తి రద్దుచేయాలా, బీఎస్ఎన్ఎల్ను సైతం ఆ దోవకు మళ్లించాలా అన్నదే ఈ సుదీర్ఘ మీమాంస సారాంశం. ఆ సంగతలా ఉంచితే ఇన్నాళ్లుగా బీఎస్ఎన్ఎల్ 3జీ స్పెక్ట్రమ్పైనే బండి లాగిస్తూ, అక్కడక్కడ 4జీ సేవలు అందిస్తోంది. కాబట్టి భారీగా నష్టాలు చవిచూస్తోంది. ఇన్ని కష్టాల్లో కూడా అది 12 కోట్లమంది ఖాతాదార్లతో, మార్కెట్లో 11 శాతం వాటాతో, రూ. 20,000 కోట్లకుపైగా వార్షిక ఆదాయంతో ఉన్నదంటే ప్రజల కున్న విశ్వాసం కారణం. చంద్రబాబువంటి ఏలికలు బీఎస్ఎన్ఎల్ సేవలు ఆపేసి ప్రైవేటుకిస్తా మంటూ బేరాలు పెట్టారు. ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన ఆ సంస్థ సవ్యంగా మనుగడ సాగిస్తుందని తోచదు. ఎందుకంటే 4జీ సేవల కోసం తహతహలాడినవారంతా ఇతర ఆపరేటర్ల వద్దకు వలసపోయారు. ఇది ‘జియో’ యుగం! ఇప్పుడుంతా ధరల పోటీ నడుస్తోంది. ఆ సేవల్లో కొత్తగా అడుగుపెట్టే సంస్థ వాటి కన్నా చవగ్గా, మెరుగ్గా ఉండగలదా అన్నదే ప్రధాన అంశం. పైగా 4జీ కేటాయించాక అది పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి దాదాపు 12 నుంచి 15 నెలలు పడుతుందంటున్నారు. బీఎస్ ఎన్ఎల్ ఈ సవాళ్లన్నిటినీ ఎలా అధిగమిస్తుందో, ఎంత వేగంగా పనిచేస్తుందో వేచిచూడాలి. కవి తిల కుడు అన్నట్టు ‘చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది/ శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది/ దారంతా గోతులు యిల్లేమో దూరం/ చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం’. బీఎస్ఎన్ఎల్ సర్వ శక్తులూ కూడదీసుకుని, అవాంతరాలను అధిగమించి కోట్లాదిమందితో మళ్లీ శభాష్ అనిపించుకుం టుందని, లక్షలాదిమంది సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశించాలి. -
విలక్షణ తీర్పు
వరసగా రెండోసారి సైతం మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షాలకు అందలం దక్కడం ఖాయమని ఫలితాలు చెబుతున్నా విజేతలైనవారికి పూర్తి సంతృప్తి మిగల్చకుండా ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమికి సులభంగానే అధికారం దక్కే అవకాశం ఉన్నా, దాని మెజారిటీ గతంతో పోలిస్తే తగ్గింది. హరియాణాలో బీజేపీ ఏకైక మెజారిటీ పక్షంగా మాత్రమే అవతరించింది. అక్కడ పది సీట్లు గెలిచిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్ జనతాపార్టీ(జేజేపీ), మరికొందరు స్వతంత్రుల మద్దతు పొందడం దానికి తప్పనిసరి. అక్కడే తామే సర్కారు ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోయిన బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల ఫలితాలూ కాస్త నిరాశ కలిగించకమానవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే గెలుపెవరిదో చాలామంది సులభంగా అంచనా వేశారు. ఎందు కంటే విపక్షం పెద్దగా ప్రతిఘటించని ఎన్నికలివి. ఎప్పటిలాగే మీడియా కూడా ప్రజలనాడి పట్టుకోవ డంలో పెద్దగా సఫలం కాలేకపోయిందని ఫలితాలు చాటుతున్నాయి. మహారాష్ట్రలో గడిచిన అయి దేళ్లూ కూటమిలో జూనియర్ భాగస్వామిగా కొనసాగిన శివసేనను ఈసారి బీజేపీ పట్టించుకోక తప్పనిస్థితి ఏర్పడింది. అధికారం పంచుకోవడం ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ ప్రాతిపదికనే ఉంటుందని శివసేన చీఫ్ ఉధవ్ ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవడం లేదా మంత్రి పదవుల్ని చెరిసగం తీసుకోవడం తప్పనిసరన్నది ఆయన ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ సారాంశం. ఈ ఫలితాలు బీజేపీ కళ్లు తెరిపించగలవని నమ్ముతున్నట్టు ఠాక్రే చేసిన వ్యాఖ్య రానున్నకాలంలో రెండు పార్టీల మధ్యా ఎటువంటి సంబంధాలుంటాయో తేటతెల్లం చేస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వ పటిమను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో తమ కూటమి ఎటూ విజయదుందుభి మోగించబోవడం లేదని తెలిసినా ఆయన పోరాటాన్ని ఆప లేదు. 78 ఏళ్ల వయసులో ఆయన రాష్ట్రాన్నంతా చుట్టుముట్టారు. అనేక బహిరంగసభల్లో మాట్లా డారు. కనుకనే కాంగ్రెస్కు జూనియర్ భాగస్వామిగా ఉన్న పార్టీని పెద్ద పార్టీగా మార్చారు. ఈ ఎన్ని కల్లో అది అది 50కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ 40 దరిదాపుల్లో సర్దుకోక తప్పని స్థితిలో పడింది. సతారా లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడ్డ శివాజీ వంశస్తుణ్ణి ఓడించి ఎన్సీపీ సత్తా చాటడం ఆ పార్టీ పనితీరుకు నిదర్శనం. క్రితం సారి అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి. 2014 అక్టోబర్లో జరిగిన ఆ ఎన్నికలు కాంగ్రెస్ మూలాల్ని పెకలించివేశాయి. అంతక్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారోద్యమ సారథిగా ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ సాగించిన ప్రచారోద్యమం తాలుకు ప్రకంపనలు ఆ అసెంబ్లీ ఎన్నికలనాటికీ కొనసాగి మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమిని కకావికలు చేసింది. వరసగా రెండు దశాబ్దాలపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఆ కూటమి మోదీ ప్రచారధాటికి కుప్ప కూలింది. హరియాణా కథ కూడా అదే. అక్కడ వరసగా దశాబ్దంపాటు ఏలి మూడోసారి కూడా తనదే విజయమని కలలుగంటున్న కాంగ్రెస్ను బీజేపీ ఖంగుతినిపించింది. కానీ అయిదేళ్లు గడిచే సరికి పరిస్థితి అంత ఏకపక్షంగా ఏం లేదని తేటతెల్లమైంది. ఎన్నికలు ముంగిట్లోకొచ్చేసరికి కాంగ్రెస్ కళాకాంతులు కోల్పోయింది. మహారాష్ట్రలో దిగ్గజ నేతలనుకున్నవారు కాషాయ దారి పట్టగా పార్టీలో మిగిలినవారు అనాథలను తలపించారు. పరస్పర కలహాల్లో మునిగితేలారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసలు ప్రచారం జోలికే రాకపోగా, ఆమె కుమారుడు రాహుల్ మొక్కుబడిగా బహిరంగసభలు నిర్వహించారు. మహారాష్ట్ర, హరియా ణాల్లో మొత్తంగా ఆయన ఏడు సభలకు మించి పాల్గొన్నదిలేదు. అందుకు భిన్నంగా మోదీ రెండు రాష్ట్రాల్లోనూ 25 ప్రచారసభల్లో ప్రసంగించారు. ఈ ఎన్నికల ప్రచారంలో 370 అధికరణ రద్దు మోత మోగింది. దానికితోడు సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అభివృద్ధి చర్యలు బీజేపీకి ధీమా ఇచ్చాయి. పైనుంచి కిందివరకూ ఆ పార్టీలో అందరూ ఏకోన్ము ఖంగా పనిచేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం పుంజుకోవడంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్నుంచి వలస పోయాయి. ఆ పార్టీ దారుణంగా దెబ్బతినడానికి కారణం అదే. హరియాణా విషయానికొస్తే అక్కడ బీజేపీకి దాదాపు ఎదురులేదన్నంత స్థాయిలో ప్రచారం సాగింది. విపక్ష కాంగ్రెస్ అంతఃకలహాల్లో మునిగి తేలింది. ఒకే ఒక బహిరంగసభలో సోనియా ప్రసంగిస్తారని ప్రకటించినా చివరి నిమిషంలో అది కాస్తా రద్దయింది. హరియాణాలో రెండుసార్లు సీఎంగా పనిచేసి, పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టగల సత్తా ఉన్న భూపిందర్ సింగ్ హూడాకు కాంగ్రెస్లో అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. రాహుల్ ఏలుబడిలో అశోక్ తన్వార్కు ప్రాధాన్యం పెరిగింది. సోనియా తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సరికి హరియాణా కాంగ్రెస్ రెండు పక్షాలుగా చీలిపోయింది. గత నెలలో తన్వార్ను తప్పించి కేంద్ర మాజీ మంత్రి కుమారి షెల్జాకు పీసీసీ చీఫ్గా బాధ్యతలప్పగించి, హూడాను ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. అంతవరకూ అలిగి కూర్చుని వేరే తోవ చూసు కుంటానన్న హూడా మళ్లీ చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ స్థాయిలో 30 స్థానాలు దాటుతున్నాయంటే అది ఆయన ఘనతే. ఉప ఎన్నికలు జరిగిన 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 26 స్థానాలు గెల్చుకుని అగ్రభాగంలో ఉన్నా విపక్షాలు చెప్పుకోదగ్గ విజయాలే సాధించాయి. యూపీలో తిరిగి సమాజ్వాదీ పార్టీ పుంజుకున్న ఆనవాళ్లు కనబడ్డాయి. బిహార్లో జేడీ(యూ) చిన్నబోయింది. అక్కడ నాలుగు ఉప ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి దక్కింది ఒక్కటే. ఆర్జేడీకి రెండు లభించాయి. ఎంఐఎం సైతం ఒక సీటు గెల్చుకోవడం విశేషం. మొత్తానికి అధికార పక్షాలు పూర్తి భరోసాతో ఉండటానికి వీల్లే దని ఈ ఎన్నికల ఫలితాలద్వారా దేశవ్యాప్తంగా ఓటర్లు తేటతెల్లం చేశారు. -
ఇంత జాప్యమా?!
ఉత్తరప్రదేశ్లో అధికారం అండదండలున్న ఓ సన్యాసి తనపై లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని, అతన్ని తక్షణం అరెస్టు చేయాలని ఫేస్బుక్లో ఓ వీడియో ద్వారా నెలక్రితం వెల్లడించి అదృశ్యమైన 23 ఏళ్ల యువతి పోరాటం ఫలించింది. ఆయన బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయా నందేనని వెనువెంటనే తెలిసినా ఎఫ్ఐఆర్ నమోదుకు ఇన్నాళ్లూ వెనకాడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం ఆయన్ను అరెస్టు చేసింది. న్యాయశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆ యువతి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనుద్దేశించి ఆ వీడియోలో న్యాయం చేయమని విన్నవించ డమే కాదు... తన ప్రాణానికి ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మీడియాలో విస్తృతంగా రావడంతో సుప్రీంకోర్టు తనంత తానే ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. అయినా నిందితుడి అరెస్టుకు ఇన్ని రోజులు పట్టడం మన దేశంలో వ్యవస్థల పని తీరుకు అద్దం పడుతుంది. నిందితుడిని అరెస్టు చేయ కపోతే ఆత్మాహుతి చేసుకుంటానని ఆ యువతి హెచ్చరించిన రెండురోజుల తర్వాతే ఈ అరెస్టు సాధ్యమైందని గుర్తుంచుకోవాలి. ఒకపక్క అదే రాష్ట్రంలోని ఉన్నావ్లో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్పై వచ్చిన అత్యాచారం ఆరోపణల విషయంలో ఎడతెగని జాప్యం చేసినందుకు ఫలితం ఏమిటో కనబడుతూనే ఉన్నా ప్రభుత్వం ఈ కేసులో ఓపట్టాన ముందుకు కదల్లేదు. ఉన్నావ్ కేసు బాధితురాలు రెండేళ్లుగా న్యాయం కోసం ఎడతెగని పోరాటం చేస్తోంది. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. ఎన్నో ఒత్తిళ్ల తర్వాత నిందితుణ్ణి అరెస్టు చేసినా బాధితురాలి కుటుంబానికి కష్టాలు తప్పలేదు. మొన్న జూలైలో కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి ఆమె పిన్ని, మేనత్తలను బలి తీసుకుంది. బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అప్పటికే తండ్రిని దుండగులు కొట్టి చంపారు. కుటుంబానికి అండగా నిలిచిన బాబాయ్ కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యాడు. ఉన్నావ్ ఉదంతంలో జరిగిన ఘటనలు కళ్లముందు కనబడుతున్నా చిన్మయానంద అరెస్టులో యూపీ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. యువతి చేసిన ఆరోపణలు సాధారణమైనవి కాదు. వాటిని రుజువు చేయగల 43 వీడియో క్లిప్పింగ్లను ఆమె తండ్రి అధికారులకు అందజేశారు. అందులో ఆమె పట్ల చిన్మయానంద అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, ఆమెతో మసాజ్ చేయించు కోవడం వంటివి ఉన్నాయి. ఆమెకూ, చిన్మయానందకూ మధ్య జరిగిన 200 ఫోన్ సంభాషణల రికార్డులు కూడా సిట్ అధికారుల అధీనంలో ఉన్నాయి. తనలాగే ఎందరో యువతులు ఆయన ఆశ్రమాల్లో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నారని యువతి తెలిపింది. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తండ్రి చెబుతున్నాడు. ఏదైనా నేరంలో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు మాత్రమే దానికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైనట్టు లెక్క. ఫిర్యాదు వచ్చిన వెంటనే బాధితురాలు చెబు తున్నదేమిటో రికార్డు చేసుకుని, నేరం జరిగిందో లేదో ప్రాథమికంగా నిర్ధారించుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు ఇంత తాత్సారం చేయడం దారుణం. ఆరోపణలొచ్చినవారు సాధారణ పౌరులైనా, పలుకుబడి ఉన్నవారైనా ఈ విషయంలో వ్యత్యాసం చూపించకూడదు. ఇదే రాష్ట్రంలోని బారాబంకీలో పాఠశాల విద్యార్థినులను చైతన్యవంతం చేసేందుకు తాము నిర్వహించిన సదస్సులో పదకొండో తరగతి చదువుతున్న బాలిక ఏం మాట్లాడిందో గమనంలోకి తీసుకుని ఉంటే పోలీసులు ఇలా వ్యవహరించేవారు కాదు. సమాజంలో జరుగుతున్న నేరాలనూ, వాటికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడవలసిన అవసరాన్ని పోలీసు ఉన్నతాధికారి సదస్సులో వివరిస్తుండగా నేరం చేసిన వ్యక్తి మంత్రి లేదా మరో శక్తిమంతమైన వ్యక్తి అయిన పక్షంలో చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించింది. ఉన్నావ్ ఉదంతాన్ని ప్రస్తావించింది. ఆ విద్యార్థిని ప్రసంగిస్తుంటే తోటి బాలికలంతా చప్పట్లతో ఆమెను ప్రశంసించారు. కానీ ఉన్నావ్ ఉదంతంలో ఏం జరిగిందో తాజా కేసులోనూ అదే జరిగింది. చిన్మయానందపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. 2011లో కూడా ఒక మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. తన లాగే ఎందరో చిన్మయానంద ఆశ్రమాల్లో దారుణమైన స్థితిలో బతుకీడుస్తున్నారని తెలిపింది. అత్యాచారాలు బయటకు పొక్కకుండా బాధితులను ఆ ఆశ్రమాల్లో పనిచేసేవారికిచ్చి పెళ్లిళ్లు చేస్తు న్నారని వెల్లడించింది. కేసు దాఖలై ఏడేళ్లు కావస్తున్నా అతీగతీ లేదు. సరిగదా నిరుడు ఆమె పేరిట షాజహాన్పూర్ కోర్టులో కేసు ఉపసంహరించుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలైంది. అది దాఖలు చేసింది తాను కాదని ఆమె మొత్తుకుంటోంది. చిత్రమేమంటే, రెండు కేసుల్లోనూ బాధిత యువ తులపై చిన్మయానంద మనుషులు దొంగతనం, బ్లాక్మెయిలింగ్ ఆరోపణలు చేశారు. అధికారంలోకొచ్చిన కొత్తలో వరస ఎన్కౌంటర్లతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నానని యోగి ఆదిత్యనాథ్ తరచు చెప్పుకునేవారు. కానీ యూపీలో నేరాల గ్రాఫ్ పైపైకి పోతోంది. మహిళలపై జరిగే నేరాల్లో యూపీ అగ్రభాగాన ఉన్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) ఇటీవల వెల్లడించింది. యాసిడ్ దాడి కేసుల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానం యూపీదే. లైంగిక నేరారోపణల్లో చిక్కుకున్న బడా నాయకుల్ని రక్షించడానికి తాపత్రయపడే ధోరణి వల్ల నేరాల కట్టడిలో పోలీసుల్లో అలసత్వం పెరుగుతుంది. నేరగాళ్లలో భరోసా ఏర్పడుతుంది. సాధారణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడతారు. సర్వోన్నత న్యాయస్థానం తనకు తానుగా జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చినా ఇంత జాప్యం చోటుచేసుకోవడం క్షమార్హం కానిది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన ధోరణిని మార్చుకోవాలి. -
మండలిలో భంగపాటు
‘భద్రతామండలిలో మనకోసం ఎవరూ పూల దండలు పట్టుకుని ఎదురుచూడటం లేదు. ఇది మరిచి ప్రవర్తిస్తే మనం పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్టే’ అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ ప్రకటించిన నాలుగు రోజులకు మండలిలో ఆ దేశానికి భంగపాటు ఎదు రైంది.370 అధికరణను మన దేశం రద్దు చేయడంపై మొన్న శుక్రవారం మండలి రహస్య సమావేశం జరిగినప్పుడు చైనా తప్ప మరే దేశమూ పాకిస్తాన్ పక్షం నిలబడలేదు. 15మంది సభ్యులున్న మండలిలో మెజారిటీ సభ్యులు కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, అందులో ఐక్యరాజ్యసమితి జోక్యం అవసరం లేదని అభిప్రాయపడటం పాకిస్తాన్కు ఎదురుదెబ్బే. జమ్మూ–కశ్మీర్లో ఉద్రిక్తత లను పెంచే చర్యలకు ఎవరూ పాల్పడరాదంటూ తీర్మానిద్దామని చైనా చేసిన సూచన కూడా వీగిపోయింది. రెండు గంటలపాటు సమావేశం జరిగాక బయటికొచ్చి ఇద్దరే మాట్లాడారు. వారిలో ఒకరు చైనా ప్రతినిధి. మరొకరు రష్యా ప్రతినిధి. చైనా ప్రతినిధి సహజంగానే పాకిస్తాన్ అనుకూల వైఖరితో మాట్లాడగా, రష్యా ప్రతినిధి భారత్ను సమర్థించారు. భద్రతామండలి చర్చించిన లేదా తీర్మానించిన అంశాలన్నీ చివరకు ఏమవుతున్నాయన్న సంగతలా ఉంచి, ఆ వేదికపై ఎలాగైనా కశ్మీర్ అంశం ప్రస్తావనకు రావాలన్న పాకిస్తాన్ కోరిక మాత్రం నెరవేరింది. మండలిలో పాకిస్తాన్కు లభించే మద్దతు అంతంతమాత్రమేనని తాను అనడానికి కారణ మేమిటో ఖురేషీ చెప్పారు. వందకోట్లకు మించి జనాభా ఉన్న భారత్లో అనేక దేశాలు పెట్టు బడులు పెట్టాయని, ఇస్లామిక్ దేశాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయని ఆయన వివరించారు. కానీ ఇదే మాట పాకిస్తాన్కు కూడా వర్తిస్తుంది. గిల్గిట్–బాల్టిస్తాన్లోని ట్రాన్స్ కారకోరంను ఆ దేశం చైనాకు అప్పగించకపోయి ఉంటే... చైనా నిర్మించతలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)లో చేరడానికి సిద్ధపడకపోయి ఉంటే అది కూడా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచేది కాదు. ప్రపంచం ఇప్పుడు మారిందని ఖురేషీ చెప్పడంలోనూ అర్ధసత్యమే ఉంది. అప్పట్లో పాకిస్తాన్ చర్యలకు నలువైపులనుంచీ మద్దతు వచ్చిపడిందీ లేదు...ఇప్పుడు అది తగ్గిందీ లేదు. అయినా ప్రపంచ దేశాల తీరు గురించి ఇంత తెలిసిన పాకిస్తాన్ మన దేశంతో మొదటినుంచీ ఎందుకు గిల్లికజ్జాలకు దిగుతున్నదో అనూహ్యం. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పాకి స్తాన్ పరిస్థితిని ఈ స్థితికి చేర్చింది 80వ దశకంలో ఆ దేశాన్నేలిన సైనిక నియంత జియావుల్ హక్. పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని దురాక్రమించిన తనకు బలం చేకూరాలంటే మత తత్వాన్ని పెంచడమే మార్గమని ఆయన అనుకున్నాడు. ప్రతి స్థాయిలోనూ మత ఛాందసులకు చోటిచ్చి వారికి పలుకుబడి పెరిగేలా చేశాడు. అనంతరకాలంలో ఆ ఛాందసవాద ముఠాలు కొరక రాని కొయ్యలా తయారయ్యాయి. అక్కడి సమాజాన్ని శాసిస్తున్నాయి. వాటినుంచే ఉగ్రవాదాన్ని బతుకు తెరువుగా చేసుకున్నవారు పుట్టుకొచ్చారు. అటువంటివారిని సరిహద్దులు దాటించి భారత్లోకి పంపి అలజడులు సృష్టించడం, అధీన రేఖ వద్ద తరచు ఆ దేశ సైన్యం అకారణంగా కాల్పులకు దిగడం వగైరాలన్నీ దానికి కొనసాగింపు. ఇలాంటి దేశాన్ని నమ్ముకుని ఎవరూ పెట్టుబడులు పెట్టరు. వ్యాపారాలు చేయరు. భారత్ పెద్ద మార్కెట్ అనడానికి ముందు.. దాదాపు 20 కోట్లమంది జనాభాతో ఉన్న తమ దేశమూ చెప్పుకోదగ్గ మార్కెటేనని ఖురేషీ గుర్తించి ఉంటే బాగుండేది. జనాభా ఎంత ఉందని కాదు... దేశం ప్రశాంతంగా ఉంటే వ్యాపారులైనా, పారి శ్రామికవేత్తలైనా ఉత్సాహంగా ముందుకొస్తారు. యువతకు ఉపాధి దొరుకుతుంది. అసలు అదంతా జరిగితే మన దేశంతో పాకిస్తాన్కు పేచీ పెట్టుకునే అవసరం వచ్చేది కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించడం, ఉపాధి కల్పనలో వెనకబాటు వగైరాలన్నీ పాకిస్తాన్ను కుంగ దీస్తున్నాయి. వాటినుంచి తమ ప్రజల దృష్టి మళ్లించడానికి పాకిస్తాన్ ఇలాంటి పేచీకోరు చర్యలకు దిగుతోంది. అయితే భద్రతామండలి చర్చ సందర్భంగా అటు చైనా తీరుతెన్నులపై, ఇటు రష్యా అడుగులేసిన తీరుపై మన దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొదటినుంచీ చైనా పాకిస్తాన్ వైపే మొగ్గుచూపుతోంది. అది కొత్త పరిణామమేమీ కాదు. కానీ వచ్చే అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య మన దేశంలో శిఖరాగ్ర చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో...వచ్చే నెల ఇరు దేశాల ప్రతినిధులమధ్యా సరిహద్దు అంశంపై చర్చలు జరగాల్సి ఉండగా చైనా ఇంత దూకుడుగా పాకిస్తాన్ ప్రయోజనాల పరిరక్షణకు శ్రమించడం, భద్రతామండలిలో ఒక తీర్మానం చేయాలని పట్టుబట్టడం గమనించదగ్గవి. ఒకపక్క తాను వీగర్ ప్రావిన్స్లో నిత్యం మానవహక్కుల హననానికి పాల్పడుతూ, హాంకాంగ్లో అణచివేత చర్యలకు దిగుతూ కశ్మీర్ పౌరుల విషయంలో మాత్రం అది మొసలి కన్నీరు కారుస్తోంది. అటు రష్యా స్వరం కూడా స్వల్పంగా మారిన వైనం కనబడుతోంది. కశ్మీర్ సమస్య భారత్–పాక్ల ద్వైపాక్షిక అంశ మని, వారిద్దరే దాన్ని పరిష్కరించుకోవాలని అది ఇప్పటికీ చెబుతున్నా... అందుకు 1972నాటి సిమ్లా ఒప్పందం, 1998నాటి లాహోర్ డిక్లరేషన్లను ప్రాతిపదికలుగా తీసుకోవాలని అంటున్నా, కొత్తగా ‘ సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాల’ ప్రస్తావనను వీటికి జత చేసింది. ఇది కొత్త పరి ణామం. అమెరికాతో మన దేశం సన్నిహితం కావడం విషయమై రష్యాకు చాన్నాళ్లనుంచి అసంతృప్తి ఉంది. కనుకనే ఈ రూపంలో దాన్ని వెళ్లగక్కింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భద్రతా మండలిలో మనకు గట్టి మద్దతుదారుగా నిలిచి, మనకు వ్యతిరేకంగా వచ్చే తీర్మానాలను ఎప్పుడూ వీటో చేస్తూ వచ్చిన రష్యా ఇలా వ్యవహరించడం గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దౌత్య వ్యవహారాలు కత్తి మీది సాము వంటివి. ఆచితూచి అడుగులేయడం చాలా ముఖ్యం. -
వానలు, వరదలు
పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత దేశంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. పదిరోజులుగా విడవ కుండా కురుస్తున్న వానలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో జనావాసాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. కృష్ణా బేసిన్లో పాతికేళ్ల తర్వాత తొలిసారి అన్ని ప్రాజెక్టుల గేట్లూ ఎత్తేయక తప్పలేదంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఆల్మట్టి, నారాయణ పూర్, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నిటా అన్ని క్రస్ట్ గేట్లూ ఎత్తేయవలసి వచ్చింది. గోదావరి కూడా అదే జోరు ప్రదర్శించి కాస్త శాంతిం చింది. ఎప్పటిలాగే ఈసారి కూడా రుతుపవనాలు దెబ్బతీశాయని అనుకునేంతలోనే కురిసిన ఈ వర్షాలు సహజంగానే ప్రజానీకానికి ఎంతో ఊరటనిచ్చాయి. అయితే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం తప్పలేదు. దేశ వ్యాప్తంగా వరదల వల్ల దాదాపు 200మంది మరణించారు. లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత తగ్గడంతో నదులు శాంతిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ కరువుతో అల్లాడిన ప్రాంతాలన్నీ కుంభవృష్టి పర్యవసానంగా చిగురు టాకులా వణుకుతుండటం ఒక వైచిత్రి. మానవ తప్పిదాల కారణంగా పర్యావరణం దారుణంగా దెబ్బతిని వాతావరణ పరిస్థితులు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. అదునుకు వర్షాలు కురవక అనేక ప్రాంతాలు కరువుకోరల్లో చిక్కుకోవడం... కురిసిన సందర్భాల్లో ఒక్కసారే పదుల సెంటీమీటర్ల వర్షం ముంచెత్తడం ఇటీవలకాలంలో తరచు చూస్తున్నాం. ఈసారి అనేక ప్రాంతాల్లో 50 శాతం మొదలుకొని 140 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మైసూరు వంటి ప్రాంతాల్లో ఇంతకు మించి మరెన్నో రెట్లు ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మూడు వైపులా సముద్రం ఉన్న మన దేశానికి వాయుగుండాలు, తుపానులు, వరదలు తప్పవు. వీటివల్ల తరచుగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పడం లేదు. ‘వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియద’ంటారు. వైజ్ఞానిక ప్రగతి పర్యవసానంగా ఆ రెండూ తెలుసుకోవడం ఇప్పుడెంతో మెరుగైంది. కానీ ఇప్పటికీ అవి పూర్తిగా అంచనా వేయడం అసాధ్యమవుతున్నది. ఎల్ నినో పర్యవసానంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చునని లేదా లా నినా వల్ల కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతుంటుంది. రాగల 24 గంటలు లేదా 48 గంటలూ ఎలాంటి పరిస్థితులుంటాయో అంచనా వేస్తోంది. అవి చాలావరకూ మెరుగ్గానే ఉంటున్నాయి. కానీ మరింత నిర్దిష్టంగా, నిర్దుష్టంగా చెప్పడం మాత్రం ఇంకా సాధ్యపడటం లేదు. విషాదమేమంటే చెప్పిన మేరకైనా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాయి. మహారాష్ట్రలోనైనా, కర్ణాటకలోనైనా పరిస్థితి ఇదే. అక్కడ వరదలు ముంచె త్తాక సైన్యం, విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగి సేవలందించాయి. అదంతా ప్రశంసిం చదగ్గదే. కానీ ఆ రాష్ట్రాల్లో అవసరమైన స్థాయిలో సమన్వయం లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. అధికార యంత్రాంగంలోని భిన్న వ్యవస్థలు ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ, ఎక్క డేది అవసరమో చూసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేసే వీలుండేది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీటిని విడతల వారీగా విడుదల చేస్తే ఇంతచేటు నష్టం ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్పుడల్లా ఇలాంటి లోపాలపై చర్చ జరగడం రివాజుగా మారినా అధికార యంత్రాంగాల్లో మార్పు రావడం లేదు. మనకు మొత్తంగా 5,344 భారీ ఆనకట్టలున్నాయి. వీటిల్లో 75 శాతం పాతికేళ్ల నాటివి. మరో 164 వందేళ్లక్రితానివి. దాదాపు 40 ఆనకట్టలు తెగిపడిన సందర్భాలున్నాయి. మన దేశానికి 7,517 కిలోమీటర్ల పొడవునా తీరప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న 84 జిల్లాల్లో 77 నగరాలు, 130 పట్టణాలు ఉన్నాయి. ముంబై, కోల్కతా, చెన్నై, విశాఖపట్టణంవంటి నగరాలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, దాని పురోగతికీ ఎంతగానో ఆయువుపట్టువంటివి. దాదాపు 26 కోట్లమంది ప్రజానీకం లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ తీరప్రాంతాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉంటుంది. కనుకనే సముద్ర తీరం, జల వనరులుండే చోట 500 మీటర్ల సమీపంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు, నిర్మాణాలు చేయకూడదని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జడ్) నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఆ నిబంధనల్ని ప్రభుత్వాలే బేఖాతరు చేసి విచ్చ లవిడిగా అనుమతులిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో కృష్ణా కర కట్టమీద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోగా, ప్రభుత్వమే ‘ప్రజావేదిక’ పేరుతో భవనం నిర్మించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ భవంతిని కూల్చడానికి చర్యలు తీసుకుంటే చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టారో అందరూ చూశారు. కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం ఆగకుంటే ఆయన ఉంటున్న నివాసం కూడా ఇప్పుడు మునిగే ప్రమాదం ఉంది. అక్కడే కాదు...ఆ రాష్ట్రంలో చాలాచోట్ల సీఆర్జడ్ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించారు. ఇష్టానుసారం రిసార్ట్లు, హోటళ్లు వగైరాలు నిర్మించారు. నిజానికి సీఆర్జడ్ నిబంధనల్ని కూలం కషంగా అధ్యయనం చేసి, జరుగుతున్న నష్టాల్ని గమనించి వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వచ్చారు. అయినా ఉల్లంఘనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడొచ్చిన వరదలు చూశా కైనా ఇలాంటి నియంత్రణలపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. కఠినంగా వ్యవహరిం చాలి. అలాగే ఇప్పుడు అనుసరిస్తున్న వరద నియంత్రణ చర్యల్లోనూ, సహాయం అందించడం లోనూ ఎదురవుతున్న సమస్యల్ని గమనించి, లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. -
‘కాఫీ కింగ్’ విషాదాంతం
దాదాపు నాలుగు దశాబ్దాలుగా భిన్న తరాలకు చెందిన లక్షలాదిమందికి మధురమైన క్షణాలను పంచుతూ, వారి జీవితాల్లో ఒక తీయని జ్ఞాపకంగా చెరగని ముద్ర వేసుకున్న సంస్థ ‘కెఫే కాఫీ డే’. అందుకే ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆచూకీ లేకుండా పోయారన్న వార్త ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు వారంతా భయపడినట్టే 36 గంటల తర్వాత సిద్దార్థ విగతజీవుడై కనబడ్డారు. సంస్థ ఉద్యోగులనూ, బోర్డు సభ్యులనూ ఉద్దేశించి ఆయన రాసినట్టు చెబుతున్న ఒక లేఖ ఆయనదేనని ఇంకా ధ్రువీకరించకపోయినా, అందులో ప్రస్తావించిన అంశాలు ఆందోళన కలిగిస్తాయి. ఆయన సన్నిహిత మిత్రులు, బంధువులు మాత్రమే కాదు... వ్యాపారరంగంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినవారు సైతం సిద్దార్థ సమర్థత గురించి, ఆ రంగంలో ఆయన దీక్ష, పట్టుదల గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడతారు. ఆయన ఆధ్వర్యంలోని సంస్థల ఉద్యోగులకు కూడా ఎప్పుడూ ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్నారని తెలియలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన తెలియనివ్వలేదు. కానీ ఆ లేఖ గమనిస్తే ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఎలాంటివో, ఆయన ఎంత నిస్సహాయంగా మిగిలిపోయారో అర్థమవుతుంది. విఫల వ్యాపారవేత్తగా మిగిలిపోయానన్న ఆవేదన అందులో కనిపిస్తుంది. సంస్థ నిలదొక్కుకోవడానికి, అది లాభాల బాట పట్టడానికి ఆయన చేసిన కృషి పెద్దగా ఫలించకపోవడం, అందుకోసం చేసిన అప్పులు అపరిమితంగా పెరిగిపోవడం, ఈలోగా ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడం, ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారుల వేధింపులు వంటివి ఆయన తనువు చాలించాలని నిర్ణయించు కోవడానికి దారితీసి ఉండొచ్చునని లేఖలోని అంశాలు చెబుతున్నాయి. సహజంగానే ఐటీ శాఖ తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. పైపెచ్చు ఆయన దగ్గర నల్లధనం పట్టుబడిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై తన వైఖరేమిటో చెప్పేందుకు సిద్దార్థ లేరు. కానీ ఆయనకున్న అప్పుల కన్నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ గనుక బకాయిల గురించి ఆయన బెంబేలెత్తే సమస్యే లేదన్నది సన్నిహితుల వాదన. ఏ రంగంలోనైనా నిపుణత సాధించి, ఉన్నత శిఖరాలు అందుకునేవారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. విజేతలను అందరూ ఆరాధనా భావంతో చూస్తారు. కానీ ఆ విజేతల ఆంతరంగిక పరిస్థితి వేరు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వారు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎక్కడ వెనక్కి తగ్గినా వైఫల్యం తలుపుతట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, క్రీడలా, రాజకీయాలా అన్న అంశాలతో నిమిత్తం లేదు. ఏ రంగం వారికైనా ఇది తప్పదు. జయాపజయాలను సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, నిత్యం సవాళ్లను ఎదుర్కొనే సాహసం సహజంగా అలవడేవి కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులతో, వ్యక్తులతో పోరాడుతూనే...తనపై తాను పోరాటం చేసుకుంటే తప్ప ఇవి సాధ్యపడవు. తామున్న రంగంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తూ సమున్నతంగా ఎదగడానికి శ్రమించేవారందరికీ ఇది వర్తిస్తుంది. సిద్దార్థ అటువంటివారు. ఆయన నిజాయితీపరుడు గనుకే, విలువలను నమ్ము కున్నవాడు గనుకే, సున్నితమనస్కుడు గనుకే ఒక్కుమ్మడిగా చుట్టుముట్టిన సమస్యలతో ఒత్తిళ్లకు లోనై ఉసురు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారికి ఈ బెడద ఉండదు. వారు విజేతలుగా తమను తాము చిత్రించుకోవడానికి శ్రమిస్తారు. అందుకోసం అన్ని రకాల చీకటి పనులకూ పాల్పడతారు. పాపం బద్దలైందని తెలిశాక దూరతీరాలకు పారి పోతారు. సిద్దార్థ రాసినట్టు చెబుతున్న లేఖలో ప్రస్తావనకొచ్చిన వేధింపుల అంశాన్ని ఐటీ శాఖ ఖండిస్తున్నది. కానీ దాంతో ఏకీభవించేవారు తక్కువ. ఇప్పుడే కాదు... ఎన్నాళ్లుగానో ఒక్క ఐటీ శాఖపైన మాత్రమే కాదు, నియంత్రణ వ్యవస్థలన్నిటి వ్యవహారశైలిపైనా ఆరోపణలున్నాయి. దేశంలో కార్పొ రేట్ తిమింగలాలుగా పేరుబడ్డ పది పదిహేను శాతంమంది రాజకీయ ప్రాపకంతో కులాసాగా ఉంటారు. వారి జోలికెవరూ పోరు. మధ్య, కింది స్థాయిలవారికి మాత్రం నిత్యం ఒత్తిళ్లు, వేధింపులు తప్పవు. ఇవన్నీ పైవారికి తెలిసే జరుగుతున్నాయని అనలేం. ఈ మధ్యే ఐటీ శాఖలో పలు ఆరోపణలున్నాయన్న కారణంతో 20మంది ఉన్నతాధికారులను కేంద్రం రిటైర్ చేసింది. ‘కెఫే కాఫీ డే’కు ఎదురైన వైఫల్యాలకు గల కారణాలను కేవలం సిద్దార్థలోనే చూడటం కూడా సరికాదు. మన దేశంలో ఇంకా అంతగా వేళ్లూనుకోని ఖరీదైన కాఫీ క్లబ్ల సంస్కృతిని ఆధారంగా చేసుకుని రూపొందించుకున్న వ్యాపార నమూనా ఆయన అనుకున్నట్టుగా విస్తరించి ఉండకపోవచ్చు. కానీ ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన సంస్థలకంటే మెరుగ్గా ఆయన నిలదొక్కుకోగలిగారు. ఆ సంస్కృతిని పెంచగలిగారు. ‘కెఫే కాఫీ డే’తో పోలిస్తే ఇతర సంస్థలు మన దేశంలో నామ మాత్రంగా మిగిలిపోయాయి. అయినా మూడు నాలుగేళ్లుగా ఆ సంస్థకు నష్టాలు తప్పడం లేదు. ఇది కేవలం ఆ సంస్థకు మాత్రమే పరిమితమైన స్థితి కాదు. మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు సకల రంగాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంతో సహా అన్నీ ఒడి దుడుకులు ఎదుర్కొంటున్నాయి. జీఎస్టీ బకాయిలు భారీయెత్తున పోగడుతున్నాయి. ఉపాధి అవకాశాల లేమి, వేతనాల్లో కోతలు, అనిశ్చితి వగైరాల వల్ల వినిమయం బాగా తగ్గింది. వెనకా ముందూ చూసి ఖర్చు పెట్టే స్థితి వచ్చింది. ఒకప్పుడు ‘కెఫే కాఫీ డే’లవంటి ఖరీదైన దుకాణాలకు వెళ్లడం తమ హోదాకు చిహ్నంగా భావించినవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించకతప్పడం లేదు. నియంత్రణ వ్యవస్థలు ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. బకాయిలున్నవారందరినీ ఒకే గాటన కట్టి, అందరినీ నేరగాళ్లుగా చూసే వైఖరిని విడనాడాలి. అప్పుడు సిద్దార్థవంటి వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలు నిబ్బరంతో ముందడుగు వేయడానికి వీలవుతుంది. -
ఇంత దారుణమా!
ప్రభుత్వాలు ఏం చెబుతున్నా, నాయకులు ఎలాంటి హామీలిస్తున్నా వాస్తవంలో జరిగేదేమిటో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబంపై గత రెండేళ్లనుంచి నిరంతరాయంగా సాగుతున్న అఘాయిత్యాలు గమనిస్తే తేటతెల్లమవుతుంది. ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది మొదలుకొని ఆ కుటుంబం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె తన తండ్రిని, బాబాయిని కోల్పోయింది. నిరంతం బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉంది. చివరికిప్పుడు ఆ బాలిక న్యాయస్థానానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ‘రోడ్డు ప్రమాదం’లో చిక్కుకుని చావు బతుకుల్లో ఉంది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న పిన్ని, మేనత్త ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా వారి న్యాయవాది పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉంది. ఆ కుటుంబంపై ఇంత వరకూ జరిగిన నేరాలూ, ఘోరాలు గమనిస్తే అసలు మనం ఏ యుగంలో ఉన్నామన్న అనుమానం తలెత్తుతుంది. మన దేశంలో మైనర్లపై జరిగే లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించే పోక్సో చట్టం ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదని అత్యాచార బాధితులు ఫిర్యాదు చేసిన పక్షంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు దాన్ని స్వయంగా పరిశీలించి, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలున్నాయి. కానీ ఆ నిస్సహాయ బాలిక కుటుంబానికి ఏదీ అక్కరకు రాలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మన నేతల నోట ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంద’న్న గంభీరమైన పలుకులు వినిపిస్తాయి. ఈసారీ అవే వినిపించాయి. నిజమే... ఉత్తరప్రదేశ్లో గత రెండేళ్లుగా అది తనకలవాటైన పద్ధతిలోనే ‘పని’ చేస్తూ పోతోంది. ఆ బాలిక కుటుంబం మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. ఈ ఘటనల క్రమం గమనిస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. మొదట 2017 జూన్లో ఆ బాలికను అపహరించి పది రోజుల తర్వాత వేరే ఊళ్లో ఎక్కడో దుండగులు వదిలేసి పోయినప్పుడు ఆమె స్థానిక ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ మనుషులు తనను అపహరించారని ఆరోపించింది. తనపై ఆ ఎమ్మెల్యే, అతని సోదరుడు రోజుల తరబడి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని రోదించింది. ఎక్కడా నోరెత్తకుండా ఉంటే ఉద్యోగం చూపిస్తామన్నారని తెలిపింది. ఇవన్నీ ఆమె కుటుంబం ఫిర్యాదులో పొందుపరిస్తే పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్లో వేరేవిధంగా నమోదు చేశారు. ఆమెను అపహరించడం (ఐపీసీ సెక్షన్ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ సెక్షన్ 366) వంటి ఆరోపణలు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ ఫిర్యాదు చేసింది మొదలు ఆ కుటుంబం నరకాన్ని చవిచూసింది. స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారన్న అనుమానంతో సీఎం మొదలుకొని ఉన్నతాధికారుల వరకూ ఆ బాలిక లేఖలు రాస్తూనే ఉంది. గత్యంతరం లేక ఆ బాలిక తల్లి న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తే ఆ తర్వాత కూడా జరిగిందేమీ లేదు. చివరకు న్యాయస్థానానికెళ్లొస్తున్న ఆ కుటుంబంపై ‘గుర్తు తెలియని వ్యక్తులు’ దాడి చేసి తండ్రిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. వారు అతని దగ్గర అక్రమ ఆయుధాలున్నాయంటూ కేసు పెట్టారు. ఎమ్మెల్యే సోదరుడి నాయకత్వంలోని గూండాలు తనపై దాడి చేసి కొట్టారని నెత్తురు కక్కుకుంటూ ఆయన చెప్పిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. అవి మీడియాలో వెల్లడై నిరసనలు పెల్లుబికాక ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేశారు. నిరుడు ఏప్రిల్లో యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేశాక ఈ ఘోరాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ తర్వాతగానీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు కాలేదు. ఈలోగా తీవ్రంగా గాయపడిన ఆమె తండ్రి సరైన వైద్యసాయం అందక మరణించాడు. ఈ కేసు రోజురోజుకీ తీవ్రమవుతున్నదని అర్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత చాన్నాళ్లకు ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఎమ్మెల్యేకు సహకరించి, అత్యాచారానికి తోడ్పడిందన్న ఆరోపణపై ఒక మహిళను కూడా అరెస్టు చేశారు. ఇంతలోనే కేసులో సాక్షిగా ఉన్న ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. నిజమే... ఆరోపణలొచ్చినంత మాత్రాన ఎవరూ దోషి కాదు. అవి కోర్టులో రుజువయ్యేవరకూ ఎవరైనా నిర్దోషే అని మన చట్టాలు చెబుతాయి. కానీ అసలు ఫిర్యాదులొచ్చినప్పుడు కేసు నమోదు చేయకపోతే, నిందితుడిని కనీసం అదుపులోనికి తీసుకుని ప్రశ్నించకపోతే ఏమనాలి? బాధితురాలి కుటుంబానికి నిరంతరం బెదిరింపులు రావడం, ఆ కుటుంబంలోనివారిపై వరసగా దాడులు జరగడం ఎలా అర్ధం చేసుకోవాలి? తనపై అత్యాచారం జరిగిందని ఆ బాలిక ఆరోపించేనాటికే పోక్సో చట్టం ఉనికిలో ఉంది. దాన్ని మరింత కఠినం చేస్తూ రెండు దఫాలు చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు. నిర్దిష్ట వ్యవధిలో ఇలాంటి కేసుల విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడాలని అందులో నిర్దేశించారు. కానీ బాలిక కుటుంబం వరస దాడులతో తల్లడిల్లుతూనే ఉంది. వీటన్నిటికీ పరాకాష్టగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితురాలికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఆ వాహనంలో లేకపోవడం, అందుకు పొంతన లేని కారణాలు చెబుతుండటం గమనిస్తే ఇది హత్యాయత్నమని ఎవరికైనా అనుమానం కలగకమానదు. ఎమ్మెల్యేపై హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఆ రాష్ట్ర అదనపు డీజీపీకి మాత్రం ఇది ప్రమాదంగానే కనబడుతోంది! ఏడేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం జరిగాక నేరగాళ్లకు కఠినమైన శిక్షలతో నిర్భయ చట్టం వచ్చింది. కానీ ఆచరణలో బాధిత కుటుంబాలకు న్యాయం ఎండమావే అవుతోందని ఉన్నావ్ ఉదంతం నిరూపిస్తోంది. ఎమ్మెల్యేపై వెనువెంటనే కేసు నమోదయ్యేలా, ఆయన అరెస్టయ్యేలా చర్యలు తీసుకోవడంలో యోగి సర్కారు మొదట్లో తాత్సారం చేయడంవల్లే ఇన్ని దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలిచ్చి బాధిత కుటుంబానికి రక్షణగా నిలవాలి. న్యాయం దక్కేలా చూడాలి. -
‘కర్ణాటకానికి’ తెర!
అనుకున్నట్టే కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైననాటి నుంచీ సంచలనాలకు కేంద్రంగా ఉన్న స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూశాక అందరికీ ఒకటి మాత్రం అర్ధమైంది– ప్రభుత్వం సంఖ్యాపరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చే విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ ఎడతెగని సీరియల్లా రోజుల తరబడి సాగుతాయి. తగినంత బలం ఉందనుకున్నప్పుడు పెట్టే తీర్మానం ఆగమేఘాల మీద పూర్తవుతుంది. రాజీనామాలిచ్చి మహారాష్ట్ర తరలిపోయి మకాం వేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు 17మంది విప్ విషయంలో తానిచ్చిన నోటీసులకు జవాబివ్వలేదన్న కారణం చూపి స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన పర్యవసానంగా బల నిరూపణకు అవసరమైన కనీస సంఖ్యాబలం 104కు తగ్గింది. సొంత బలం 105కు తోడు అదనంగా స్వతంత్ర సభ్యుడి ఆసరా తీసుకుని యడియూరప్ప గట్టెక్కారు. ఎంతకాలం అధికారంలో కొనసాగుతారన్న అంశాన్ని పక్కనబెడితే త్రుటిలో చేజారిన సీఎం పదవిని చేజిక్కించుకు తీరాలన్న ఆయన పట్టుదల నెరవేరింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా... గవర్నర్ వజూభాయ్ వాలా తొలి అవకాశమిచ్చినా ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. గత 14 నెలలుగా యడియూరప్ప అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల్లో కొందరిని సమీకరించుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడమే కాదు...సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోన్ సంభాషణల ఫైళ్లు కూడా వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం మాత్రం అంతర్గత కుమ్ములాటలతో కాలం గడిపింది. కుమారస్వామికి సక్రమంగా పాలించడానికి అవకాశమే చిక్కలేదు. 17మంది ఎమ్మెల్యేలు వలసపోవడానికి బీజేపీ ఏం చేసిందన్న సంగతలా ఉంచితే నిరంతర కలహాలతో మునిగితేలే కూటమి నుంచి నిష్క్రమించడానికి ఆ ఎమ్మెల్యేలకు సాకు దొరికిందన్నది వాస్తవం. ఈ మొత్తం వ్యవహారంలో రమేశ్ కుమార్ పాత్ర గురించి చెప్పుకోవాలి. ఆ పదవి హుందాతనాన్ని నిలబెట్టడంలో, పార్టీలకు అతీతంగా పనిచేయడంలో అసెంబ్లీల మొదలుకొని పార్లమెంటు వరకూ సభాధ్యక్షులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వర్తమానంలో ఆయన ప్రశంశనీయంగా వ్యవహరించారు. కూటమి తరఫున స్పీకర్ పదవిని అధిష్టించినా చాలా వరకూ తటస్థంగా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఒకపక్క, విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలానా సమయానికల్లా పూర్తికావాలన్న గవర్నర్ తాఖీదులు మరోపక్క వచ్చినా తన విధుల విషయంలో ఆయన స్పష్టంగానే, నిష్కర్షగానే ఉన్నారు. ఒత్తిళ్లకు లొంగడానికి సిద్ధపడలేదు. విశ్వాస తీర్మానంపై జరిగే చర్చను మరింత పొడిగించాలని అప్పటికి సీఎంగా ఉన్న కుమారస్వామి కోరినా నిరాకరించారు. ఓటింగ్ను ఎలాగైనా ఇంకోరోజుకు వాయిదా వేస్తే ఏదో ఒరుగుతుందన్న భ్రమలో ఉన్న కుమారస్వామికి చివరకు నిరాశే మిగిల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు, గత అయిదేళ్లలో కోడెల శివప్రసాదరావు ఎలా వ్యవహరించారో, ఆ పదవికే ఎలా కళంకం తెచ్చారో తెలుగు ప్రజలు మరిచిపోలేరు. పదవి నుంచి వైదొలగక తప్పనిస్థితి ఏర్పడిన ఒక ముఖ్యమంత్రి అందుకు గల కారణాలను చెప్పుకుందామంటే రామకృష్ణుడు ఆయనకు అవకాశమివ్వలేదు. ఏ పరిస్థితుల్లో తాను పదవి కోల్పోవలసి వచ్చిందో ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన వీడియోలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చాయి. కానీ యనమల అనుసరించిన వైఖరి కారణంగా అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం ఆయన స్వరం లేదు. కోడెల తీరు కూడా ఎన్నో విమర్శలకు తావిచ్చింది. సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎంతో ఆయనకు తెలుసు. అందులో ఎందరు ఫిరాయించారో తెలుసు. ఎందరికి మంత్రి పదవులొచ్చాయో తెలుసు. కానీ స్పీకర్గా అలాంటి సభ్యులపై చర్య తీసుకోవడం తన బాధ్యతన్న సంగతిని మాత్రం మరిచారు. కానీ సభలోనూ, బయట వేదికలపైనా విలువల గురించి గంభీరోపన్యాసాలివ్వడం మానుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... ఒక సందర్భంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఈ బాపతు నేతలే స్పీకర్లుగా అధికారాలు చలాయిస్తున్న దేశంలో ఫిరాయింపుల నిషేధ చట్టంతోసహా అన్ని రకాల రాజ్యాంగ విలువలూ మంట కలవడంలో వింతేముంది? ఇలాంటి పరిస్థితుల్లో రమేశ్ కుమార్ సభా సంప్రదాయాలనూ, స్పీకర్గా తనకున్న అధికారాలను సవ్యంగా వినియోగించుకోలగడం ప్రశంసనీయం. రాజకీయ వ్యూహప్రతివ్యూహాల దశ ముగిసింది కనుక కర్ణాటక ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఏం చేయాలన్న విషయంపై కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సాగు సంక్షోభం, ఉపాధి లేమి గ్రామీణ ప్రాంతాలను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రభుత్వం తక్షణ చర్యలకు నడుం బిగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే యడియూరప్ప అధికారంలో ఎన్నాళ్లు నెట్టుకు రాగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పదవి కోసం కూటమి సర్కారును కూల్చిన ఎమ్మెల్యేల వైనం కళ్ల ముందు కనబడుతుండగా, బీజేపీలో పదవు లాశిస్తున్నవారు సైతం రేపన్న రోజున అదే పని చేయరన్న గ్యారెంటీ లేదు. అదీగాక 17 స్థానాలకూ ఉప ఎన్నికలు వస్తే యడియూరప్పకు అదొక అగ్ని పరీక్ష అవుతుంది. వీటిని ఆయన ఎలా అధిగమిస్తారో, ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి. -
బ్రహ్మపుత్ర ఉగ్రరూపం
దేశంలో చాలా ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఈశాన్య భారతంలోని అస్సాం వరదనీటిలో తేలియాడుతోంది. 33 జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు వారంరోజులుగా ఇళ్లూ వాకిళ్లూ వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. 50మంది పౌరులు మరణించారు. వందలాది పశువులు, వన్యప్రాణులు వరద తాకిడికి చనిపోయాయి. భారీయెత్తున పంటలు, జనావాసాలు నాశనమయ్యాయి. ఒకపక్క ఈ నెల 31తో గడువు ముగిసిపోయే జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) గురించి అక్కడి జనం ఆదుర్దా పడుతుంటే పులి మీద పుట్రలా ఈ వరద సమస్య వారిని చుట్టుముట్టింది. జనాభాలో 40లక్షలమందిని విదేశీయులుగా నిర్ధారించి నిర్బంధ శిబిరాలకు తరలించగా వారిలో అనేకులు ఈ వరదలు తెచ్చిన అంటువ్యాధుల బారినపడి తల్లడిల్లుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు ఇళ్లు వదిలి రావడానికి భయపడుతున్నారు. తమ గుర్తింపు పత్రాలతో పునరావాస కేంద్రాలకెళ్తే అక్కడ గల్లంతవుతాయన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. అవి పోగొట్టుకుంటే శాశ్వతంగా అస్సాం వదిలిపోవాల్సి వస్తుందన్నది వారి కలవరపాటుకు కారణం. ప్రపంచంలోని అయిదు పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొంది చైనా, భారత్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల మీదుగా ప్రవహించే బ్రహ్మపుత్ర సాధారణ సమయాల్లో ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి దాని ఉగ్రరూపం బయటపడుతుంది. ఏటా జూన్–అక్టోబర్ నెలల మధ్య ఒకసారి కాదు... మూడుసార్లు అస్సాంను అది ముంచెత్తుతుంది. ప్రతిసారీ విలయం సృష్టిస్తుంది. దేశంలో వేరేచోట్ల వరదలు ముంచెత్తినప్పుడు మీడియాతోసహా అందరూ వాటి గురించే చర్చిస్తారని, ఈశాన్య ప్రాంతంలో ఏం జరిగినా ఎవరికీ పట్టదని మొదటినుంచీ విమర్శలున్నాయి. ఇప్పుడు అస్సాంను ముంచెత్తిన వరదల సందర్భంలోనూ అది బాహాటంగా బయటపడుతోంది. జనం పట్టించుకున్న సమస్యల విషయంలో వెంటనే కాకపోయినా ఆలస్యంగానైనా ఏదోమేరకు చర్యలుంటాయి. కానీ ఎవరికీ పట్టనప్పుడు ఏమవుతుందో చూడాలంటే అస్సాం వర్తమాన పరిస్థితులను గమనించాలి. టిబెట్ ప్రాంతంలోని కైలాస శిఖరాల్లో పుట్టి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రాంతంలో ప్రవహించాక అస్సాంలోనే అది మైదాన ప్రాంతంలోకి అడుగుపెడుతుంది. పెను వేగంతో ప్రవహించే నదులన్నీ ఒండ్రుమట్టినీ, బురదనూ వెంటేసుకురావడం సర్వసాధారణం. కానీ బ్రహ్మపుత్ర మోసుకొచ్చే బురద నీరు, ఒండ్రుమట్టి పరిమాణం అసాధారణమైనది. అదంతా ఎక్కడిక్కడ మేట వేయడం వల్ల క్రమేపీ పూడిక పెరిగిపోయి ఆ నదికి, దాని కాల్వలకూ ఉండే గట్లు తెగిపడతాయి. ఆ ప్రాంతంలో తరచు వచ్చే భూకంపాల వల్ల కొండ చరియలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులేర్పడతాయి. ఈ కారణాలన్నిటివల్లా నదీ గమనమే మారుతుంటుంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రహ్మపుత్రలో నౌకల రాకపోకలు సాగేవంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి దానికి భిన్నం. బ్రహ్మపుత్ర వల్ల భూమి కోతకు గురై 1954 తర్వాత 3,800 చదరపు కిలోమీటర్ల వ్యవసాయ క్షేత్రం నాశనమైందని నాలుగేళ్లక్రితం అస్సాం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తెలిపింది. కరకట్టల నిర్మాణంతో ఈ వరదలను ఎంతో కొంత నివారించాలని, నష్టాన్ని పరిమితం చేయాలని అడపాదడపా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు. ఆ కరకట్టల పరిస్థితి ఎలా ఉందో, ఎక్కడెక్కడ గండ్లు పడే ప్రమాదం ఉందో సకాలంలో గుర్తించి సరిచేస్తేనే అవి నిలబడతాయి. గతంలో నిర్మించిన చాలా కరకట్టల స్థితిగతుల్ని సరిగా పట్టించుకోక పోవడం వల్లనే ఇంత నష్టం వాటిల్లిందని నిపుణులు చెబుతున్నారు. అడవులు విచ్చలవిడిగా నరకడం, కొండలు పిండి చేయడం, చిత్తడి నేలలు పూడ్చడం వంటి చర్యల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయంటున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ప్రమాదకర పోకడల్ని అరికట్టే ప్రయత్నాలుండటం లేదు. బ్రహ్మపుత్ర నదిలో పూడిక తీసే పనులు భారీయెత్తున కొనసాగించి, దాన్నంతటినీ నదికి ఇరువైపులా గట్ల నిర్మాణానికి వినియోగిస్తామని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ రెండేళ్లక్రితం చెప్పారు. కానీ అందువల్ల కాస్తయినా ప్రయోజం చేకూరదు సరిగదా... భారీ వ్యయమవుతుందని నిపుణులు హెచ్చరించారు. ఏటా కోట్లాది రూపాయలు అందుకోసం వెచ్చించినా బ్రహ్మపుత్రలో పూడిక పెరగడాన్ని నిలువరించడం అసాధ్యమని వారి వాదన. నదిపై ఆనకట్టలు నిర్మిస్తే రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ చేయొచ్చునని మూడు దశాబ్దాలక్రితం కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలోని బ్రహ్మపుత్ర బోర్డు భావించింది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రూపకల్పన చేస్తే అటు జలవిద్యుత్ ఉత్పత్తికి సైతం దోహదపడుతుందని అంచనా వేసింది. ఆ ప్రాజెక్టు పనులు మొదలైన కొన్నాళ్లకే అరుణాచల్ ప్రదేశ్ అభ్యంతరాలు లేవనెత్తడంతో విరమించుకుంది. తమ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో సహా విస్తారమైన ప్రాంతం దీనివల్ల ముంపునకు గురవుతుందని అరుణాచల్ వాదించింది. ప్రాజెక్టుల నిర్మాణం సరికాదనే పర్యావరణవేత్తల అభ్యంతరాల సంగతలా ఉంచి బ్రహ్మపుత్ర వంటి అతి పెద్ద నది భారీమొత్తంలో తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురదనీరు ఆ ప్రాజెక్టును దీర్ఘకాలం మన్నికగా ఉండనీయడం కూడా కష్టం. అందుకే సమస్య మూలం ఎక్కడుందో గమనించాలి. బ్రహ్మపుత్ర వరదల్ని అరికట్టడానికి మనం ఒక్కరం వ్యూహాలు పన్నడం వల్ల ప్రయోజనం లేదు. మనతోపాటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్వంటి నదీ పరివాహ ప్రాంత దేశాలన్నీ సమష్టిగా ఆలోచించి, పరస్పర సహకరించుకుంటేనే వరదల్ని ఏదో మేరకు అరికట్టడం సాధ్యమవుతుంది. ఈలోగా తీసుకునే చర్యలన్నీ తాత్కాలిక ఉప శమనం ఇస్తాయే తప్ప శాశ్వత పరిష్కారానికి తోడ్పడవు. మన వంతుగా చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. అది చేయనంతకాలమూ ఈ వరదల బెడద తప్పదు.