
ఇంటర్ పుస్తకాల పంపిణీ
ఏలూరు (ఆర్ఆర్పేట): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను జిల్లాలోని వివిధ కళాశాలలకు పంపిణీ చేశారు. మంగళవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆయా కళాశాలలకు వివిధ వాహనాల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది ప్రస్తుతం అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలలకు 67,800 నోటు పుస్తకాలు వచ్చాయని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాను తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 5751 టెక్ట్స్ పుస్తకాలు వచ్చాయని, వాటిని కూడా ఆయా కళాశాలలకు తరలించామని తెలిపారు.
ముగిసిన పదో తరగతి పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 22,413 మంది హాజరయ్యారు. 22,704 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,244 మంది హాజరు కాగా ఒకసారి అనుత్తీర్ణులైన వారిలో 295 మంది విద్యార్థులకు 169 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా పరిశీలకుడు 4 కేంద్రాల్లో, జిల్లా విద్యాశాఖాధికారి 4 కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ 3 కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 29 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
కూల్డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ డిపోలో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ డిపోలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గడువు దాటిన కూల్డ్రింకులు దుకాణాలకు పంపిణీ చేస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ రామరాజు స్థానిక నరసింహరావు పేటలోని జమ్ ఎంటర్ప్రైజెస్ కోకాకోలా సేల్స్ డిపోలో ఫిర్యాదుదారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులకు గడువు తేదీ ముగిసిన డ్రింకులు ఏమీ లభ్యం కాలేదు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కల్తీ విషయంలో ఎలాంటి ఫిర్యాదులందినా వెంటనే తనిఖీలు చేస్తామని, కల్తీ జరిగినట్టు గుర్తిస్తే సంబంధిత పదార్థాల సాంపిళ్ళు ల్యాబ్లకు పంపి పరీక్షిస్తామన్నారు. కల్తీ జరిగిటన్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గురుకుల పాఠశాలల్లో చేరికకు 25న ప్రవేశ పరీక్ష
టి.నరసాపురం: జిల్లాలోని గురుకుల పాఠశాలలు అప్పలరాజుగూడెం(బాలురు), నాగిరెడ్డిగూడెం (బాలికలు), ముసునూరు (బాలికలు)లో 5, 6, 7, 8 తరగతులలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అప్పలగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డీఎస్బీ శంకరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవా కేంద్రం ద్వారా వెబ్సైట్లో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందన్నారు. వివరాలకు 87126 25030 నెంబరులో సంప్రదించాలన్నారు.
ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దూబచర్ల డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను ఎఫ్ఎస్టీసీ విధానంలో భర్తీ చేసే నిమిత్తం అర్హత, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని యాజమాన్యాల్లోని(ప్రభుత్వ/ జిల్లా పరిషత్/ మున్సిపల్) పాఠశాలల్లో పని చేస్తున్న మండల విద్యాశాఖాధికారులు/ ప్రధానోపాధ్యాయులు/ స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలు డీఈఓ ఏలూరు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

ఇంటర్ పుస్తకాల పంపిణీ