
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళాశక్తి కనిపించింది.
ఆపరేషన్కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం. ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్...
భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్ను కొనసాగించడంలో ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పాత్రను వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు.
ఆ ఇల్లు సైనిక శిబిరం
అది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు.
చరిత్ర సృష్టించి...
పుణెలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్.
గర్వించదగిన కాలం
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.
ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్. భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది.
ఆకాశ పుత్రిక
ఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!
‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్.
ఎన్సీసీ పునాదిపై...
ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.
జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు.
కమాండర్ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్తో సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్ప్రదేశ్లో కీలక రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం.
ఆ ఇద్దరు... ది స్ట్రెంత్ ఆఫ్ ఇండియా
కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్ గుర్మెహర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.