
మధ్యప్రదేశ్లోని సత్నాజిల్లాలో గల చిత్రకూటం ప్రకృతి సౌందర్యానికే కాదు... ఎందరో పురుషుల తపోదీక్షకు కేంద్రంగా ఉంది. అత్రి, అనసూయ, మార్కండేయుడు వంటి మునిపుంగవులు, గురువులకే గురువు దత్తాత్రేయుడు వంటి వారు తపస్సు ఆచరించేందుకు ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, పర్ణశాలలు నిర్మించుకుని, ఇక్కడి మందాకినీ నదిలో స్నానమాచరించి, నది ఒడ్డునే తపస్సు చేసుకున్నట్లు స్థలపురాణ చెబుతోంది.
మధ్యప్రదేశ్ అడవులలో ఉత్తరప్రదేశ్ సరిహద్దులలో ఉన్న ఈ పవిత్రస్థలిలో ప్రతి కొండా, గుట్టా, రాయీ రప్పా, చెట్టూ పుట్టా, వాగూ వంకా, తీర్థమూ జలపాతమూ... ఇలా ప్రతి ఒక్కటీ కూడా సీతారామ లక్ష్మణులు, వారి దాసుడైన హనుమంతుడి పేర్లతోనే ముడిపడి ఉంటాయి. కేవలం జీవంలేని ప్రదేశాలే కాదు.. ఇక్కడ జీవం పోసుకున్న ప్రతి వారి పేర్లలో సీతా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడూ ఉంటారు. వారి పిలుపులు కూడా రామ్ రామ్ అనే ఉంటాయి. తమకు తారసపడిన ప్రతి వారినీ రామ్ అనే పిలవడం వీరి ఆచారం. కొండగుహలన్నీ రామనామ జపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లమీద సీతమ్మ చీరలు ఆరవేసుకున్నట్లుగా... రామయ్య శయనించినట్లుగా... లక్ష్మణుడు సేదదీరినట్లుగా... హనుమంతుడు గంతులు వేసినట్లుగా ఆనవాళ్లుంటాయి.
అంతర్వాహినిగా గుప్తగోదావరి: మందాకినీ నదితోపాటూ యమునా నది కూడా ఇక్కడికి దాపులలోనే ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన పాదచారులకు తన చల్లని స్పర్శతో, గలగల శబ్దాలతో అంతర్వాహినిగా ప్రయాణిస్తూ ఓ గోదావరీపాయ గుప్తగోదావరిగా పేరు తెచ్చుకుంది.

రామ్ఘాట్: మందాకినీ నది ఒడ్డున గల ఈ స్నానఘట్టంలోనే రాముడు రోజూ స్నానం చేసేవాడట. రామలక్ష్మణులు స్నానం చేసి వస్తున్నట్లుగా తులసీదాసు తన మనోనేత్రాలతో దర్శించాడట. అందుకే దీనిని తన రామచరిత్ మానస్లో రామ్ఘాట్ అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు.
కామద్గిరి: మందాకినీ నది పరిక్రమ చే సే భక్తులు ఇక్కడ గల రామాలయాన్ని సందర్శించి, మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే కామదనాథుడనే పేరుగల రాముడు కోరిన కోరికలు తీర్చే వేల్పుగా ప్రసిద్ధి΄÷ందాడు. ఇక్కడే అనేక ఆలయాలున్నాయి.
భరత్ మిలాప్: తన అన్నగారు ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న భరతుడు వేలాదిమంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చి, రాముణ్ణి కలిసిన ప్రదేశమిది. రాముణ్ణి భరతుడు కలిసిన ప్రదేశం కాబట్టి, భరత్ మిలాప్ అనే పేరొచ్చింది. ఇక్కడ భరతుడికి చిన్న మందిరం ఉంది.
జానకి కుండ్: రాముడు స్నానం చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే సీతాదేవి స్నానం చేసేదట. అందుకే ఈ ఘట్టానికి జానకి కుండ్ అనే పేరొచ్చింది.
సతీ అనసూయ ఆశ్రమం: అత్రి మహాముని పత్ని, సతీ అనసూయా దేవి ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుడిని, ఆయన సోదరులను సాకిందట. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అనసూయా శ్రమాన్ని సందర్శించారట. అప్పుడు అనసూయ సీతకు పాతివ్రత్య ధర్మాలను బోధించడంతో΄ాటు, రకరకాల లేపనాలను, రుచిగల పండ్లను, చీరలను కానుకగా ఇచ్చిందట.
హనుమాన్ ధార: చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశానికి చేరాలంటే కనీసం రెండువేల మెట్లను ఎక్కవలసిందే! ఎంతో ప్రయాసకు ఓర్చి ఇక్కడ వరకు వచ్చిన వారి అలసట, మార్గాయాసం అంతా తీరిపోయేలా పురాతన హనుమద్విగ్రహం దర్శనమిస్తుంది. ఎక్కడినుంచి పడుతోందో తెలియని విధంగా నిత్యం జలధార పడుతూ, విగ్రహాన్ని అభిషేకిస్తుంటుంది.

రామశయ్య: సీతారామలక్ష్మణులు తాము శయనించేందుకు వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతిప్రదేశాన్ని శయ్యలా చెక్కారట. ఈ రాతిపరుపు పైనే సీతారాములు శయనించేవారట. వారు ఇక్కడ సేదదీరేవారనడానికి గుర్తుగా సీతారామలక్ష్మణుల ముగ్గురి విగ్రహాలూ దర్శనమిస్తాయి. దీనికే రామశయ్య అని పేరు వచ్చింది.

స్ఫటిక శిల: సీతారాములు కూర్చున్న ఒక రాతితిన్నెకే స్ఫటిక శిల అని పేరు. సీతారాముల పాదముద్రలు ఈ శిలపై మెరుస్తూ కనిపిస్తాయి.
ఉత్సవాలు... పర్వదినాలు: చిత్రకూటంలో ప్రతి అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇంకా దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది వంటి అన్ని హిందూ సంప్రదాయ పండుగలప్పుడూ ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి.
భోజన, వసతి సదుపాయాలు: చిత్రకూటాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖలవారు విడివిడిగా అందుబాటు ధరలలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక ప్రైవేటుగా బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి.
– డి.వి.ఆర్.
ఎలా వెళ్లాలంటే :
విమాన మార్గం: చిత్రకూటానికి దగ్గరలో గల ఏర్΄ోర్ట్ ఖజురాహోనే. అయితే ఇక్కడినుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో గల చిత్రకూటానికి వెళ్లాలంటే మాత్రం మళ్లీ బస్సు లేదా రైలుప్రయాణం తప్పదు మరి. వారణాసి, జబల్పూర్ విమానాశ్రయాలయితే ఇంకా దూరం.
రైలు ద్వారా: ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి వంటి ప్రధాన నగరాలనుంచి రైలు ద్వారా కార్వి రైల్వేస్టేషన్కు చేరుకోవచ్చు. అక్కడినుంచి 12 కిలోమీటర్ల దూరంలోని చిత్రకూటానికి ప్రైవేటు వాహనాలుంటాయి.
రోడ్డు మార్గం: అలహాబాద్, సత్నా, పన్నా, బండాల నుంచి చిత్రకూటానికి మంచి రోడ్డుమార్గం ఉంది. బస్సులు లేదా ప్రైవేటు
వాహనాలలో చేరుకోవచ్చు.