అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు | Meet TNadu Moringa Queen10th Dropout to entrepreneur Rs 12 Lakh | Sakshi
Sakshi News home page

Ponnarasi: అపుడు ఎన్నో అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు

Published Wed, Mar 5 2025 12:19 PM | Last Updated on Wed, Mar 5 2025 2:47 PM

Meet TNadu Moringa Queen10th Dropout to entrepreneur Rs 12 Lakh

ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు

దేశ విదేశాలకు మునగ నూనె  తదితర ఉత్పత్తుల ఎగుమతి

సోషల్‌ మీడియా సాయంతో  ఖండాంతరాల్లో వ్యాపారం

పదో తరగతి డ్రాపవుట్‌..  రూ. ఏటా 12 లక్షల ఆదాయం

పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే,  ప్రాసెసింగ్‌ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. 

అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు  పాటించటంతో దేశంలో వివిధ  ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్‌ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే  పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!

తమిళనాడులోని దిండిగల్‌  ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్‌ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి  ప్రాసెసింగ్‌లోకి అడుగు పెట్టిందీ   పొన్నరాసి వివరించారు.

అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్‌ జాన్‌ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్‌ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్‌ కెనడీ సార్‌ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.

కిలో మునగ నూనె రూ. 5 వేలు
కెనడీ చెప్పిన విషయాలు  పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్‌ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్‌ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్‌లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని   పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం  ప్రారంభమైంది.

కరువును తట్టుకునే మూలనుర్‌ మునగ
మునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్‌ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట.  అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన   పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.

నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్‌ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి  పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని  పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి.  

విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్‌ ఫుడ్‌ ఎడిబుల్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ (ఐఇఎఫ్‌ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్‌ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్‌లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో  పొలంలోనే  ప్యాక్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్‌ బామ్స్‌ తయారీలో వాడేందుకు  పొడిని.. సూప్‌ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.

కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ   పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా  చెప్పారు.

ఫేస్‌బుక్, వాట్సప్‌..
పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్‌బుక్, వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్‌ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్‌ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్‌ వాసులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు.

ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్‌ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్‌ పొన్నరాసికి బెస్ట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.

చ‌ద‌వండి:  కార్బ‌న్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?

ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు   పొన్నరాసి. సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్‌బుక్‌లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్‌బుక్, వాట్సప్‌ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని   పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!

ప్రచారాలను  పట్టించుకోకూడదు..
‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. 
–  పొన్నరాసి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు,  దుండిగల్, తమిళనాడు     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement