
2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు. తెలంగాణ ఆత్మ గౌరవం నిలువెత్తుగా నిలి చిన రోజు. తెలంగాణ సమాజం ఏ బాధలు పడ్డదో ఆ బాధల నుంచి విముక్తి పొందేందుకు సాగిన తెలంగాణ పునర్ని ర్మాణ ప్రక్రియ కూడా ఉద్యమ ఉత్తేజంతోనే కొనసాగింది. ఎవరు ఎన్నెన్ని విమర్శలు చేసినా దేశంలోనే తెలంగాణ అనేక విషయాల్లో నమూనాగా నిలవటానికి కారణం తెలంగాణ తొలి ప్రభుత్వ కృషే. తొలిసారి, మలిసారి కూడా ముఖ్యమ్రంతిగా కేసీఆర్ చూపిన దార్శనికత చూసి దేశమే ముచ్చట పడింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో అడు గడుగునా అడ్డుపడ్డశక్తులు రాష్ట్రం వచ్చాక కూడా ఆపసోపాలు పడి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. తెలంగాణలో నిజంగా ప్రభుత్వాన్ని నడపడమంటే అభివృద్ధి ఉద్యమాన్ని నడపడమే. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పాలన చేయాలి. ఎన్నికల్లో గెలవటం, ఓడటాలు ప్రామాణికంగా చూడకుండా గాయాల నుంచి బయటపడ్డ తెలంగాణకు భవి ష్యత్తును అందించే ప్రాణవాయువుగా పాలన కొనసాగాలి.
ఈ విషయంలో రాజీపడే ఆలోచనలు రానివ్వవద్దు. జూన్ 2 స్ఫూర్తితో ప్రతి తెలంగాణీయుడు మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించుకుంటూ ముందుకు సాగే శక్తులు బలంగా నిలవాలనే కోరుకోవాలి. ఇందుకు భిన్నమైన ఆలోచన చేయటమంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయటంగానే భావించవలసిఉంటుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే శక్తులు, అస్తిత్వంపై దాడి చేసే శక్తులు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉంటాయి. ఈ సందర్భంలో ప్రతి మలుపులోను తెలంగాణ సమాజం తన చైతన్యాన్ని ఎప్పటికీ మెరుగుపరుచుకుంటూనేఉంటుంది. ఇక్కడ చిక్కుముడి విప్పాల్సిందేమిటంటే – ప్రతి పదేళ్ళకు వచ్చే మార్పు కొత్త తరాన్ని ముందుకు తెస్తుంది.
1997 నుంచి రాజుకున్న మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్ 27న అగ్గిలాగామండింది. యువకుల ఆత్మ బలిదానాల దగ్గర్నుంచి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష వరకూ ఉద్యమాన్నే మలుపు తిప్పిన ఘటనలు ఉన్నాయి. కొత్తతరం అవలోకనం చేసుకునేవిధంగా ఈ చరిత్రను వారిచేతికి అందించాలి. 1969 తొలిదశ ఉద్యమం తర్వాత 2001 నుంచి అగ్గిమంటైన మలిదశ ఉద్యమ ఘట్టాలు, వాటి నేపథ్యాలన్నీ ఈ తరం లోతుగా అవలోకనం చేసినప్పుడే ఉద్యమకారులెవరు? ఉద్యమ ద్రోహు లెవరో తెలుస్తుంది. తెలంగాణ అస్తిత్వ భావనను జీవితకాలం విడనాడని కొత్తపల్లి జయశంకర్లాంటి వాళ్ళు మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా టీఆర్ఎస్ కొనసాగించిన ఉద్యమ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ విషయం లోతుగా అధ్యయనం చేస్తేనే, ‘సకలజనుల సమ్మె’ దగ్గర నుంచి ‘మిలి యన్ మార్చ్’, ‘సాగరహారాల’ వరకు జరిగిన ఉద్యమం అర్థమవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ ఎగువభూములకు నీళ్ళందేవి కావు. కాళేశ్వరమే తెలంగాణ కరవు, నేలల దప్పిక తీర్చింది. జూన్ 2ను స్మరించుకోవటమంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం దశాబ్దకాలంలో ఎలా దేశానికి నమూనాగా
మారిందో తెలుసుకోవడమే! కరవు బారిన పడ్డ తెలంగాణ దేశానికే ఆకలితీర్చే ధాన్యాగారంగా మారింది. సమైక్యాంధ్రలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలోనే అందనంత ఎత్తుగా శరవేగంతో సాగింది. సామాజిక న్యాయానికి బాటలు పడ్డ స్థితిని చూస్తున్నాం. అదింకా పరిపూర్ణం కావాల్సి ఉంది. ‘దళితబంధు’ పథకం విప్లవాత్మకం. గొర్రెల పంపిణీ జరిగింది. చెరువుల్లో జలసంపదలు పెరిగాయి.
పల్లెకు కావాల్సిన మౌలిక వసతులన్నీ తొలి తెలంగాణ ప్రభుత్వం అందించింది. అది ఏ పల్లెనడిగినా చెబుతుంది. హైదరాబాదు విశ్వ నగరంగా ఐటీ విస్తరణ నగరంగా మారింది. అడవులు పెంచే కార్యక్రమం జరిగింది. వనసంపద పెరిగింది. జలసంపద పెరిగింది. భూముల విలువలు పెరిగాయి. పాలన ప్రతి గడపదాకా పోయింది. ఇవన్నీ కళ్ళు చూపించే సత్యాలు. ఇవన్నీ నేడు మననం చేసుకోక తప్పదు.రాష్ట్ర అవతరణ ముందు, ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్న వారిని కని పెట్టకపోతే ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సాకారం అర్థ రహితమవుతాయి.
‘నీళ్ళు, నిధులు, నియామకాలు’ మలిదశ ఉద్యమ ట్యాగ్ లైన్. స్వరాష్ట్ర సిద్ధి తర్వాత నీళ్ళు, నిధులు, నియా మకాలు అమలు జరిగేందుకు కృషి ప్రతి తెలంగాణీ యుడికి తెలియంది కాదు. గోదావరి జలాలను రక్షించుకోవలసిన బాధ్యత ఉంది. స్వరాష్ట్రం వచ్చినా నదీ జలాల మళ్ళింపు విషయంలో అప్రమత్తంగా లేకపోతే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను భంగపరిచే ఏ పని చేసినా అది తెలంగాణ అస్తిత్వానికే దెబ్బతగులుతుంది. కాళేశ్వరం జలాలతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా వర్ధిల్లాలి. అదే జూన్ 2 స్ఫూర్తితో పాలకులు అడుగులు వేయాలి.
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర
తొలి బీసీ కమిషన్ సభ్యులు
(జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం)