2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ 1గా తెలంగాణ: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says Telangana to be number 1 in the world by 2047 | Sakshi
Sakshi News home page

2047 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ 1గా తెలంగాణ: సీఎం రేవంత్‌

Jun 3 2025 1:13 AM | Updated on Jun 3 2025 1:13 AM

CM Revanth Reddy Says Telangana to be number 1 in the world by 2047

హైదరాబాద్‌లోని గన్‌పార్కులో స్మారకవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పదేళ్లలో ట్రిలియన్‌ ఎకానమీ.. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ: రేవంత్‌ 

ఆ దిశగా ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన 

ప్రజా ఆలోచనలే ఆచరణగా ప్రజా ప్రభుత్వం ముందుకు.. 

పదేళ్లలో నాశనమైన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం 

అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం 

సన్న బియ్యం ఓ ట్రెండ్‌ సెట్టర్‌.. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం 

పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం 

ముఖ్యఅతిథిగా హాజరైన జపాన్‌ కితాక్యూషు నగర మేయర్‌ టకేచి

కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారం

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌–2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. 

పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్‌లోని కితాక్యూషూ నగర మేయర్‌ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అరి్పంచారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతున్నాం.. 
‘రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కట్టు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ప్రజా ఆలోచనలే ఆచరణగా ముందుకు సాగుతున్నాం. 

నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం.  

ఇందిరా మహిళా శక్తి మిషన్‌ 
మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్‌ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. 

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే 150 బస్సులను అందజేశాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లులాంటి పథకాలు అమలు చేస్తున్నాం. 

రైతన్న సంక్షేమానికి పెద్దపీట 
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 8 నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. వారికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. 

యువతే మన భవిష్యత్తు..  
యువతే మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా టీచర్లను నియమించాం. సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. 

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్‌ లక్ష్యంగా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్‌ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. అన్నివర్గాల విద్యార్థులు ఒకేదగ్గర ఉండేందుకు వీలుగా తొలిదశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణం చేపట్టాం. 
 
కులగణనతో దేశానికి ఆదర్శంగా.. 
కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. 

నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు 
ఇళ్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు.. వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణలో 3 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 

సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్‌ సెట్టర్‌. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్, సింగపూర్, జపాన్‌ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్‌ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్‌లో ఇదొక తొలి మెట్టు. 

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ 
మూసీని పునరుజ్జీవింప చేయడంతో పాటు బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్‌ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్‌ సమ్మిట్‌’కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం.  

దేశ సమగ్రత కోసం రాజకీయాలకు అతీతంగా..
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. 100కు పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్‌ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ‘తెలంగాణ.. జరూర్‌ ఆనా’అంటూ ప్రపంచం నలుదిశలా చాటారు.  పహల్గాం దాడి నేపథ్యంలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. 

కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, జపాన్‌లోని కితాక్యూషూ సిటీ మేయర్‌ కజుహిసా టకేచీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. వివిధ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జరిపిన కవాతు ఆకట్టుకుంది. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తినిచ్చిన 9 మంది కవులు, కళాకారులకు సీఎం రేవంత్‌రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. 2024 డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పురస్కారాలను చెక్కుల రూపంలో అందించిన సీఎం.. వారి సేవలను కొనియాడారు.  

అవార్డు అందుకున్న గద్దర్‌ సతీమణి.. 
దివంగత ప్రజాకవి గద్దర్‌ తరఫున ఆయన సతీమణి విమల, గూడ అంజయ్య తరఫున ఆయన సతీమణి హేమనళిని, బండి యాదగిరి తరఫున ఆయన కుటుంబసభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్న విదేశాల్లో ఉండడంతో ఆయన కుమార్తె సుప్రజ స్వీకరించారు. వీరితోపాటు అందెశ్రీ, సుద్దాల అశోక్‌ తేజ, జయరాజు, శిల్పి ఎక్కా యాదగిరి రావు, జర్నలిస్టు పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందజేశారు. బహు భాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం అందించి గౌరవించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్‌ అధికారులకు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, మరో 11 మందికి మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డులను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement