కోర్టులోనూ అమెరికాది అదే పాట! | Sakshi Guest Column On Donald Trump | Sakshi
Sakshi News home page

కోర్టులోనూ అమెరికాది అదే పాట!

Jun 5 2025 12:18 AM | Updated on Jun 5 2025 12:20 AM

Sakshi Guest Column On Donald Trump

విశ్లేషణ

భారత్‌–పాకిస్తాన్‌లను ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరింపజేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టముకు వేసుకోవడంపై ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఆయన మాటల్లో వాస్తవం లేదని భారత్‌ చెబుతున్నా, ట్రంప్‌ మాత్రం తాను శాంతి దూతగా వ్యవహరించినట్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ‘‘ఈ ఒప్పందం కుదర్చగలగడం నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే, బులెట్లకు బదులు వాణిజ్యం ద్వారా భారత్‌–పాకిస్తాన్‌లను దారికి తేగలిగాను. ఆ రెండింటి మధ్య ఘర్షణ అణ్వస్త్ర యుద్ధంగా పరిణమించకుండా ఆపగలిగాను’’ అని ట్రంప్‌ మే 30న ప్రకటించారు. 

నేనే శాంతిదూతను!
మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ సందర్భంగా ఆయన చెప్పిన మూడు అంశాల సారాంశంగా ఈ వ్యాఖ్య నిలుస్తోంది. ఒకటి – తానే పెద్దమనిషిగా వ్యవహరించినట్లు చెప్పుకోవడం. రెండు – ఘర్షణ అణు యుద్ధంగా మారగల అవకాశం ఎంతైనా ఉందని భావించడం. మూడు – రెండు దేశాలతోను వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటానని తాను హెచ్చరించినట్లు చెప్పడం. ఆ విధంగా రెండు దేశాలను కాల్పుల విరమణకు అంగీకరించేట్లు చేయడం. 

పాకిస్తాన్‌కు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంఓ) భారత్‌లోని తన సహచరునికి మే 10న ఫోన్‌ చేసిన తర్వాతనే దాడి ప్రతిదాడులు ఆగాయని భారత్‌ ప్రకటించింది.  ఘర్షణ సంప్రదాయ చట్రం లోపలికే పరిమితమైందనీ, అణ్వస్త్రాన్ని బయటకు తీస్తాననే సంకేతం పాక్‌ నుంచి ఏమీ రాలేదనీ కూడా భారత్‌ తేటతెల్లం చేసింది. 

‘‘ఆపరేషన్‌ సిందూర్‌ మే 7న మొదలైనప్పటి నుంచి, కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయాలని మే 10న ఒక అవగాహనకు వచ్చేంత వరకు, మారుతూ వస్తున్న సైనిక పరిస్థితులపై భారత్‌–అమెరికా నాయకుల మధ్య సంభాషణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ మాటల్లో వాణిజ్య అంశం ప్రస్తావనకు రానేలేదు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మే 13న చెప్పిన సంగతి గమనార్హం. 

కాల్పుల విరమణ కుదిర్చేందుకు ట్రంప్‌ వాణిజ్య అంశాన్ని లేవనెత్తారని అమెరికా వాణిజ్య మంత్రి హవర్డ్‌ లట్‌నిక్‌ ఒక అమెరికన్‌ కోర్టులో వాఙ్మూలం ఇచ్చిన సంగతిని మే 29న  జైస్వాల్‌ దృష్టికి తెచ్చినపుడు, ‘‘కోర్టు ఉత్తర్వును కూడా మీరు చూసే ఉంటారు’’ అని ఆయన జవాబిచ్చారు. తర్వాత, జైస్వాల్‌ తాను మే13న చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. 

కోర్టు ఉత్తర్వు గురించి ప్రస్తావించడంలో ఆయన తొందరపడ్డారనిపించింది. ఎందుకంటే, అమెరికాలోని మరో పైకోర్టు అదే రోజు (మే 29)న దిగువ కోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. ఆ అధికార ప్రతినిధి భారత్‌ వైఖరిలోని సత్యసంధతను నిరూపించేందుకు దిగువ కోర్టు నిర్ణయంపై ఆధారపడకుండా ఉండాల్సింది. 

ఇంకో ఆరు దేశాలు!
వివిధ దేశాలు జోక్యం చేసుకున్న ఫలితంగా కాల్పుల విరమణ సాధ్యమైందని పాకిస్తాన్‌ వెల్లడించింది. పాకిస్తాన్‌ సైనిక దళాల సంయుక్త కమిటీ చైర్మన్‌  జనరల్‌ సాహిర్‌ షంషాద్‌ మీర్జా, గత వారం సింగపూర్‌లో సాగిన షాంగ్రి–లా  డైలాగ్‌ సందర్భంగా, ఆరు దేశాల పేర్లను ప్రస్తావించారు. అవి – అమెరికా, బ్రిటన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, తుర్కియే, చైనా. తాను కుదిర్చిన ఉత్తమ ‘ఒప్పందానికి’ మొత్తం ఘనత తనదేనని చెప్పుకుంటున్న ట్రంప్‌కు ఆ మాటలు ఇంపైనవి కావని వేరే చెప్పనవసరం లేదు. 

ఈ ఘర్షణ సంప్రదాయ చట్రం పరిధిని మించగల ప్రమాదం ఉందని ఇస్లామాబాద్‌ అనలేదు. జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులు తగినంత సమయాన్ని వెచ్చించకపోతే, భారత్‌ చలన శక్తి, పరస్పర అణ్వాయుధ ప్రయోగాలకు దారితీయగల అవకాశముందని తనకున్న సాధారణ ఆందోళనను పాక్‌ ఈ సందర్భంగా పునరు ద్ఘాటించింది. ఘర్షణలను నిలిపివేయకపోతే వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తానని బెదిరించినట్లు ట్రంప్‌ చెప్పుకోవడంపై పాకిస్తాన్‌ ఏ విధమైన వ్యాఖ్యా చేయలేదు. మరోవైపు పాకిస్తాన్‌–అమెరికాల మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమైంది. 

వాణిజ్యానికి సంబంధించి భారత్‌ సంవేదనలపై ట్రంప్‌ ప్రభుత్వం ఎందుకంత ఉపేక్ష వహించినట్లు? పైగా, లట్‌నిక్‌ ఒక అమెరికా కోర్టుకు మే 23న సమర్పించిన అఫిడవిట్‌లో కూడా దాన్ని ఎందుకు చేర్చినట్లు? ట్రంప్‌ అనుసరిస్తున్న సుంకాల విధానాలకు ఎదురవుతున్న చట్టపరమైన సవాల్‌కు సంబంధించిన కేసు అది.

అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐ.ఇ.ఇ.పి.ఏ.) అని అమెరికాలో ఓ చట్టం ఉంది. దానికింద, ట్రంప్‌ సుంకాల విధా నాలను సమర్థించుకుంటున్నారు. సాంకేతికంగా చూస్తే, లట్‌నిక్‌ ఒక డిక్లరేషన్‌ ఇచ్చినట్లే లెక్క. ‘‘అంతకుముందు పేర్కొన్న మాటలు సత్యమైనవి, సరైనవి’’ అని ఆయన ప్రకటించారు. 

కాల్పుల విరమణను అమలులోకి తెచ్చేందుకు వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నట్లు ట్రంప్‌ చేసిన లాంటి రాజకీయ ప్రకటనను ఒక దేశం లీగల్‌ డాక్యుమెంట్‌గా మార్చడం కనివిని ఎరుగనిదని నా దౌత్యపరమైన అనుభవం సూచిస్తోంది. దీని వల్ల ట్రంప్‌ చెప్పుకుంటున్న గొప్పను అమెరికా కాదనలేని అనివార్య స్థితి ఏర్పడుతోంది. 

ట్రంప్‌ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. తరచూ తన ప్రకటనలకు తానే విరుద్ధంగా మాట్లాడు తూంటారు. కానీ, లీగల్‌ డాక్యుమెంట్‌ను తారుమారు చేయడం కుదరదు. పైగా, భారత్‌–అమెరికాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న సమయంలో, అమెరికా అలాంటి వాఙ్మూలం ఇవ్వడం ఈ అంశంపై భారత్‌ వైఖరికి విరుద్ధంగా ఉంది. 

స్నేహం ఉన్నట్టేనా?
‘‘పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యం చేసుకుని అమెరికాతో వాణిజ్య సౌలభ్యాన్ని రెండు దేశాలకు ఇవ్వచూపబట్టే కాల్పుల విరమణ సాధ్యమైంది. ఈ కేసులో, అధ్య క్షుడి అధికారాన్ని నిరోధించే విధంగా ఎటువంటి ప్రతికూల తీర్పు నిచ్చినా, ట్రంప్‌ ఇచ్చిన ఆఫర్‌ చట్టబద్ధతను భారత్‌–పాకిస్తాన్‌లు ప్రశ్నించగల స్థితి తలెత్తుతుంది. అది ఒక మొత్తం ప్రాంత భద్రతకు, కోట్లాది మంది జీవితాలకు ముప్పుగా పరిణమిస్తుంది’’ అని కూడా లట్‌నిక్‌ పేర్కొన్నారు. 

లట్‌నిక్‌ డిక్లరేషన్‌పై మే 29న అడిగిన మరో ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహం ముటకరించుకుని ‘‘నేను నా వైపు నుంచి పరిస్థితిని వివరించాను. రెండు వైపుల దేశ పతాకాలను పెట్టుకుని, భారతదేశ ప్రభుత్వ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నేను ఆ పని చేసినట్లు లెక్క. దానికి పర్యవసానాలుంటాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయని అర్థం చేసుకోవాలి’’ అన్నారు.

నిజమే! అమెరికా వాణిజ్య మంత్రి ఒక అమెరికన్‌ కోర్టులో తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చారని మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రక టిస్తే, వ్యవహారం మరింత పెద్దదవుతుంది. 

భారత్‌ విషయానికి వస్తే – ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి ట్రంప్‌ చర్యలు, ప్రకటనలు చూసి, నమ్మక ద్రోహానికి గురయ్యామని
భావించడం తప్ప చేయగలిగింది లేదు. హిందీ సినిమా ‘సంగమ్‌’ లోని ‘దోస్త్‌ దోస్త్‌ న రహా...’ పాట నేటి భారత్‌ స్థితికి అద్దంపడుతుంది. ‘హోడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్‌’ అంటూ జబ్బలు చరుచు కున్న ఘట్టాల రోజులు ఇపుడు సుదూర జ్ఞాపకాలుగానే ఉంటాయి. 

వివేక్‌ కాట్జూ 
వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement