బాలిక అదృశ్యంపై కేసు
మంగళగిరి టౌన్: బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. మంగళగిరి పార్కు రోడ్డులో ఉంటున్న బాలిక గుంటూరు సమీపంలోని సిమ్స్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి కొంత కాలం క్రితం మరణించడంతో బాలిక తల్లి తిరుపతమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఫిబ్రవరి 14న కాలేజీకి వెళ్లిన కుమార్తె సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పసుపు యార్డుకు 168 బస్తాలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 168 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సరుకు 139 బస్తాలకు కనిష్ట ధర రూ.8,400 గరిష్ట ధర రూ.10,750 మోడల్ ధర రూ.10,750, కాయలు 29 బస్తాలకు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,001, మోడల్ ధర రూ.10,001 పలికింది. మొత్తం 126 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.
బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి
మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో చేనేత రంగానికి రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ.172 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేలకు పెంచాలని కోరారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment