
ఆస్పత్రిలో పాలన అస్తవ్యస్తం
ఆస్పత్రిలో పాలన అస్తవ్యస్తం
అందుబాటులో లేని కెమికల్స్, మెడిసిన్స్
భర్తీ కాని పాలనాధికారుల పోస్టులు..
జాడ లేని వైద్యులు
రోగులకు అరకొర సేవలు
గత కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రిని కెమికల్స్, ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్య సిబ్బంది ఔషధాలు లేవంటూ.. రోగులను బయటకు పంపిస్తున్నారు. కానీ అధికారులు స్టోర్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. విచారణ చేసి అడిగిన రోజు మాత్రమే ఔషధాల కొరత ఉందని పేర్కొంటున్నారు. ఇలా ఆస్పత్రికి వచ్చే పేద రోగుల జేబులు ఖాళీ చేస్తూ పాలన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
ఎంజీఎం: ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో పాలన అస్త్యవస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినప్పటికీ ఆస్పత్రిలోని సమస్యలపై దృష్టి సారించకపోవడంతో పేద ప్రజలు ఎంజీఎం ఆస్పత్రికి రావడానికి జంకుతున్నారు. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో పెద్ద ఎత్తున ఆస్పత్రి వైద్యులు బదిలీ అయ్యారు. ఆ స్థానాలను భర్తీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు.
ఆస్పత్రిలో కొన్ని నెలలుగా ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పాలన సాగుతోంది. ఎప్పటికప్పుడు సేవలను పర్యవేక్షించే ఆర్ఎంఓలు లేకపోవడం.. విధులకు వస్తున్న వైద్యులు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియకపోవడంతో ఆస్పత్రిలో అన్ని వ్యవస్థలు కూప్పకూలుతున్నాయి. విభాగాల వారీగా సమస్యలు నెలకొనడంతో పాటు కనీసం నెల రోజుల్లో పూర్తి చేయాల్సిన టెండర్ ప్రక్రియలను నోటిఫికేషన్ వెలువడి 8 నెలలు కావొస్తున్నా పూర్తి చేయలేకపోతున్నారంటే పాలన ఎలా సాగుతుందో అర్థమవుతుంది.
అంతా గందరగోళం..
ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతీ రోజు వేలాది మంది రోగులు చికిత్స పొందుతుంటారు. రోగుల సౌకర్యార్థం పాలనా విభాగంలో ముగ్గురు ఆర్ఎంఓలు, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ నిత్యం పర్యవేక్షిస్తూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉండాలి. కానీ.. సంవత్సర కాలానికిపైగా కీలకమైన ఆర్ఎంఓ–1, పదవి ఖాళీగా ఉంది. కాగా గత కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్పై కొనసాగుతున్న ఆర్ఎంఓ–2ను బదిలీ చేశారు.
ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గత రెండు వారాల క్రితం ఆస్పత్రిలో కొనసాగుతున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు, ఇన్చార్జ్ ఆర్ఎంఓలకు సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్ బాధ్యతలు అప్పగించారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆస్పత్రి పాలన గాడిన పెట్టే పూర్తి స్థాయి సూపరిండెంట్ను నియమించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆస్పత్రిలో పూర్తి స్థాయి సూపరింటెండెంట్ను నియమించాలని ఏకంగా ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిదులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
9 నెలలైనా పూర్తి కాని టెండర్..
ఎంజీఎం ఆస్పత్రిలో పేద రోగులకు 80 శాతం ఔషధాలను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సరఫరా చేస్తుంటారు. అక్కడి నుంచి అందుబాటులోని ఔషధాలను 20 శాతం బడ్జెట్ ద్వారా టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. ఈటెండర్ను సంవత్సరానికి ఒక్కసారి పిలుస్తుంటారు. ఈప్రక్రియ దాదాపుగా 15 రోజుల్లో పూర్తి చేస్తారు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిలో అధికారుల కొరత.. పట్టింపులేని తనం వెరసి 9 నెలలు గడస్తున్నా.. టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. గత జూన్ 25న సర్జికల్స్ మెడికల్స్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం జూలై 12వ తేదీ టెండర్ ఓపెన్ చేసి ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో నేటి వరకూ టెండర్ ప్రక్రియ పూర్తి చేయకుండా పాత కాంట్రా క్టర్లతో కొనాల్సిన దుస్థితి నెలకొంది.
త్వరలో పూర్తి చేస్తాం..
ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను 60 క్రితం చేపట్టాం. బాధ్యతలు చేపట్టినప్పటికీ వివాదాస్పదంగా ఉన్న ఏజెన్సీ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం, 2 వేల పడకల ఆస్పత్రి సమీక్షలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాం. టెండర్ ప్రక్రియలను సైతం అతి త్వరలో పూర్తి చేస్తాం.
– కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్

ఆస్పత్రిలో పాలన అస్తవ్యస్తం

గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025