
టాక్సీ అడ్డా..
కళాభవనం..
వరంగల్: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్ నగరంలో మంజూరు చేసిన మల్టీపర్పస్ కల్చ రల్ కాంప్లెక్స్ (మినీ రవీంద్రభారతి) నిర్మాణ స్థలం ప్రస్తుతం టాక్సీల స్టాండ్గా మారింది. 24–05–2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరు చేయగా.. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో హైదరాబాద్కు చెందిన శ్రీకో సంస్థ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటక శాఖ నుంచి కళాభవనం నిర్మాణానికి కోటి రూపాయల నిధులు విడుదల చేయగా పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్తోపాటు పిల్లర్లు, జనరేటర్ రూం నిర్మించిన కాంట్రాక్టర్కు రూ.69.88 లక్షలను చెల్లించారు. నిధులు విడుదల అయితే తప్ప మిగిలిన పనులు చేపట్టేది లేదని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాభవనం నిర్మాణ దశలోనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో అసంపూర్తిగా ఉన్న పిల్లరు ఆకాశాన్ని చూస్తున్నాయి. నిధులు లేని కారణంగానే పనులు పూర్తిచేయలేక పోతున్నామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
నిధులు తేవడంలో ప్రజాప్రతినిధుల విఫలం
రూ.12 కోట్లతో చేపట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణ వ్యయం సుమారు రూ.100 కోట్లకు పెరిగింది. వరంగల్ పశ్చిమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించి పూర్తి చేసి ప్రారంభించుకున్నారు. రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన కళాభవనానికి నిధులు తేవడంలో జిల్లాతోపాటు తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్సిటీ ప్రాజెక్టుకు వస్తున్న వందల కోట్ల రుపాయలతో వృథా పనులు చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు.
మూడుసార్లు శంకుస్థాపనలు..
వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలో మల్టీపర్సస్ కల్చరల్ కాంప్లెక్స్ (కళాభవనం)కు ఇప్పటికీ మూడుసార్లు శంకుస్థాపనలు చేసినా పూర్తికాలేదు. మినీ రవీంద్రభారతిని పూర్తిచేయాలని జిల్లాలోని కళాకారులు పలుమార్లు అధికారులు, నాయకులను కోరినా పట్టించుకోలేదు. నిధులు మంజూరు చేయకపోవడంతో కళాభవనం నిర్మాణం బేస్మెంట్తో ఆగిపోయింది.
హామీలకే హరిత హోటల్..
కళాభవనం స్థలంలో హరిత హోటల్ నిర్మించాలని మూడేళ్ల క్రితం అప్పటి తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు అప్పటి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ తూర్పులో కళాభవనం నిర్మించాలని సాంస్కృతిక కళాకారులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కళాభవనంతోపాటు హరిత కాకతీయ హోటల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
వరంగల్లో లేని ఆడిటోరియాలు..
వరంగల్, హనుమకొండ జిల్లాల ఏర్పాటుతో ఆర్ట్స్ కళాశాల, నేరెళ్ల వేణుమాధవ్, పోతన ఆడిటోరియాలతోపాటు ఇటీవల రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ తూర్పులో ఆడిటోరియాలు లేకుండా పోయాయి. జిల్లా సమీక్షలు హనుమకొండ లేదా ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మెగా జాబ్మేళాను వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు ఫంక్షన్హాల్లో నిర్వహించారు. స్థలం సరిపోక వచ్చిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాభవనం పూర్తయితే జిల్లాలో తమకు ఆదరణ లభిస్తుందనే ఆశతో జిల్లాలోని కళాకారులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఈ భవన నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఈభవన నిర్మాణం కోసం కృషిచేసిన ఎమ్మెల్సీ సారయ్య సైతం అదే పార్టీలో ఉన్నారు. ఇప్పటికైనా కళాభవనం నిర్మాణంపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా వరంగల్లో ప్రత్యేకంగా కళావేదిక లేకపోవడం, సంస్థలు రాకపోవడంతో కళాకారులు దూరం వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోంది. శిక్షణ అకాడమీలు ఒకే సమయంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఆడిటోరియం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు మంజూరు చేయించి కళాభవనం నిర్మాణాన్ని పూర్తిచేయించాలి.
– ఆడెపు రవీందర్,
శ్రీబాలాజీ క్రియేషన్స్ అధినేత
నిధులు లేక వరంగల్లో పూర్తికాని మినీ రవీంద్రభారతి
12 సంవత్సరాలుగా
పిల్లర్లకే పరిమితం
తూర్పు నియోజకవర్గ నాయకుల
నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు

టాక్సీ అడ్డా..

టాక్సీ అడ్డా..