
క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ డీఎస్ఏ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ శిబిరాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ గురువారం ఇండోర్ స్టేడియం వద్ద దరఖాస్తులు స్వీకరించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా 23 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అశోక్కుమార్ తెలిపారు. 4 వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల వరకు క్రీడా శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లాకు 20 మంది
స్పౌజ్ టీచర్లు
విద్యారణ్యపురి: రాష్ట్రంలో 317 జీఓ ద్వారా నష్టపోయిన స్పౌజ్ టీచర్లలో మరో 165 మందిని బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా హనుమకొండ జిల్లాకు 20 మంది స్పౌజ్ టీచర్లను వివిధ జిల్లాల నుంచి బదిలీ చేశారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీల్లో భాగంగా.. ఈ బదిలీలు జరిగాయి. భార్య ఒక జిల్లాలో భర్త మరో జిల్లాలో ప్రస్తుతం ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు హనుమకొండ డీఈఓకు బదిలీ అయిన స్పౌజ్ టీచర్ల జాబి తాను పంపారు. ఆయా టీచర్లు ఈనెల 22న తాము ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి రిలీవ్ అయ్యి ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినమైన ఈనెల 23న హనుమకొండ జిల్లాలో కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి హనుమకొండ జిల్లాకు బదిలీ అయిన 20 మందిలో ఎస్జీటీలు 16 మంది, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఇద్దరు, ఒకరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, మరొకరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉన్నారు.
సీనియర్ సివిల్ జడ్జీల బదిలీ
వరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సివిల్ జడ్జీలను బదిలీచేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి.విరోధిని వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ అయ్యారు. హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జి జే.ఉపేందర్రావును 16వ అదనపు జడ్జిగా సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎల్బీ నగర్ 3వ అదనపు సివిల్ జడ్జి జి.రామలింగాన్ని నియమించారు. భూపాలపల్లి సీనియర్ సివిల్ జడ్జి కె.జయరామ్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేయగా.. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కెనాగరాజును బదిలీ చేశారు. మహబూబాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సి.సురేశ్ను ఫస్ట్ అదనపు జడ్జి సివిల్ సిటీ కోర్టు సికింద్రాబాద్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి శాలిని శఖీలాను నియమించారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
21నుంచి ప్రత్యేక
వ్యాధి నిరోధక టీకాలు
హసన్పర్తి: ఈ నెల 21నుంచి 28వ తేదీ వరకు వారంరోజుల పాటు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ ఽఅధికారి మహేందర్ తెలిపారు. హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాఽధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టీకాలు ఇచ్చిన వారి వివరాలు పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అతుల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్స్పెక్టర్ సంజీవ్ బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ బి.సంజీవ్ కరీంనగర్ కమిషనరేట్లోని మానకొండూరు సర్కిల్కు బదిలీ అయ్యారు. మల్టీ జోన్–1లో జరిగిన బదిలీల్లో మల్టీజోన్ ఐజీ దగ్గర వెయిటింగ్లో ఉన్న పైండ్ల మల్లయ్య వరంగల్ పోలీస్ కమిషనరేట్కు వచ్చారు.

క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులు