
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృచ్ఛికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్హోల్స్లోకి అంతర్ధానమవుతున్నాయట.
అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట!