desert
-
డాకర్ ర్యాలీ 2025 - ఎడారిలో దూసుకెళ్లిన కార్లు (ఫోటోలు)
-
2025 డాకర్ ర్యాలీ - ఎడారిలో దుమ్ములేపుతున్న బైకులు (ఫోటోలు)
-
ఎడారి ఓడల వేడుక
ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్లోని బికనీర్లో జరిగే కేమెల్ ఫెస్టివల్కు వెళ్లాల్సిందే!బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. -
సౌదీలో ఎన్నడూ చూడని వింత.. తెగ ఆశ్చర్యపోతున్న జనం
రియాద్: సౌదీ అరేబియాలో ఎన్నడూ కానరాని వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎడారి ప్రాంతమైన సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడతో పాటు మంచుకురుస్తోంది. సౌదీ చరిత్రలో ఎన్నిడూ చూడని వాతావరణాన్ని ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు అంటున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అల్-జౌఫ్ ప్రాంతంలో భారీగా మంచుకురిసింది. దేశంలో తొలిసారిగా శీతాకాలపు వాతావరణం కనిపించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడం, వడగళ్ల వానలు పడటం, హిమపాతం ఏర్పడటమనేది ఎన్నడూ జరగలేదు. అల్-జౌఫ్ ప్రాంత ప్రజలు ఉదయం నిద్ర నుంచి లేవగానే తెల్లని మంచును చూశామని ఎంతో గొప్పగా చెబుతున్నారు. 📹 Incredible: Snow Blankets Parts of Saudi Arabia After Heavy Rain & Hail pic.twitter.com/mhn3VHHe5D— RT_India (@RT_India_news) November 4, 2024సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ ప్రాంతంలోని హిమపాతాన్ని, జలపాతాలను హైలైట్ చేసి చూపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను వచ్చే అవకాశం ఉందని, భారీ వర్షంతో పాటు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇలాంటి వాతావరణ మార్పులు కనిపించాయి.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు -
ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!
ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నాం. క్షణాల్లో మనకు నచ్చిన ప్రదేశానికి చేరిపోతున్నాం. జేబు నిండా డబ్బులు ఉంటే చాలు పని ఈజీ. ఇంతవరకు కారు, బైక్ రైడ్లు చూసుంటారు. కానీ ఈ మహిళ బుక్ చేసిన రైడ్ లాంటిది దొరకడం మాత్రం కష్టం. ఔను ఇది కొంచెం కష్టం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఎడారిలో చిక్కుకుపోయి ఉంటారు. వారి వాహనం పాడవ్వడంతో ఉబర్ యాప్తో రైడ్ బుక్ చేద్దామని భావిస్తారు. అందులోని ఆప్షన్స్లో ఊహకందని రైడ్ కనిపించే సరికి షాకవ్వుతారు. సరే ఒంటె రైడ్ బుక్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని భావిస్తారు. ఇంతలో ఉబర్ ఒంటె రైడ్ రావడం జరుగుతుంది. అది చూసి ఒక మహిళ ఆశ్చర్యపోతూ..ఇది ఉబెర్ ఒంటె రైడేనా అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి తనను ఉబెర్ ఒంటె డ్రైవర్గా పరిచయం చేసుకోవడంతో నోట నుంచి మాట రాదు. సదరు వ్యక్తి తాము ఉబెర్ ఒంటెను నడుపుతున్నామని, ఇలా ఎడారిలో దారితప్పిన వ్యక్తులకు సహయం చేయడమే తమ డ్యూటీ అని చెప్పారు. తాము దారి తప్పడంతో ఒంటెని ఆర్డర్ చేసినట్లు తెలిపింది సదరు మహిళ. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి దుబాయ్లో మాత్రమే ఇలా ఒంటెని ఆర్డర్ చేయగలరు, ఇదేమి పెద్ద విషయం కాదని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by JETSET DUBAI (@jetset.dubai) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు
రబాత్: ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈత చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి, అరుదైన దృశ్యాలను మన కళ్లముందు ఉంచాయి.ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తాయి. అయితే సెప్టెంబరులో ఈ ప్రాంతంలో వార్షిక సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో ప్రభుత్వం తెలిపింది. రాజధాని రబాత్కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగౌనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మి.మీ. కంటే అధిక వర్షపాతం నమోదైంది.విషయం తెలుసుకున్న పర్యాటకులు ఈ ఎడారి ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడి ఈత చెట్ల మధ్య ఏర్పడిన నీటి మడుగులను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ వారు చెబుతున్నారు. గడచిన 50 సంవత్సరాలలో మొదటిసారిగా, ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన హుస్సేన్ యూఅబెబ్ తెలిపారు.ఈ ప్రాంతంలో వరుసగా ఆరేళ్ల పాటు కరువు తాండవించింది. దీంతో రైతులు తమకున్న కాస్త పొలాలను బీడుగా వదిలివేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు ఎడారి దిగువన ఉన్న భూగర్భజలాల నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా అల్జీరియాలో 20 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సహాయ నిధులను విడుదల చేయాల్సి వచ్చింది. జగోరా- టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ఇరికి సరస్సు నీటితో నిండుగా ఉండటాన్ని నాసా ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..! -
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకుని తెలంగాణ వాసి మృతి
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖలీ అనే ఎడారిలో చిక్కుకుని 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఎడారిలో దారితప్పి..ఎటు వెళ్లాలో తెలియక.. మరోవైపు తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం లేక ఐదు రోజులుపాటు నరకయాతన అనుభవించి అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. వివరాల్లోకెళ్తే..కరీంనగర్కి చెంఇన 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు.జీపీఎస్ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్మెంట్కు చెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు.దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.(చదవండి: వైద్యుడి రూపంలోని రాక్షసుడు) -
కరవు పాట
దేశానికి ఎదురయ్యే నానా సమస్యల్లో కరవు ఒకటి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ వరకు ఎదిగినా, కరవు కాటకాలను పూర్తిగా రూపుమాపే స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. రాజ్యానికి వాటిల్లే అనేకానేక ఆపదల్లో దుర్భిక్షాన్ని కూడా ఒకటిగా మన ప్రాచీన సాహితీవేత్తలు గుర్తించారు. అయితే, ఇందులో మానవ ప్రమేయాన్ని మాత్రం పాపం వారు గుర్తించలేకపోయారు. ‘అమానుషోగ్నిః, అవర్షం, అతివర్షం, మారకః, దుర్భిక్షం, సస్యోపఘాతః, జంతుసర్గః, వ్యాధిః, భూత పిశాచ శాకినీ సర్ప వ్యాళ మూషక క్షోభాశ్చేత్యాపదః’ అన్నాడు సోమదేవుడు. ఈ శ్లోకం ఆయన రాసిన ‘నీతి వాక్యామృతం’లోనిది. అంటే, మనుషుల వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల వాటిల్లే అగ్నిప్రమాదాలు, వర్షాలు లేకపోవడం, అతి వర్షాలు, మహమ్మారి వ్యాధులు, దుర్భిక్షం, పంటలకు నష్టం కలగడం, అడవి జంతువుల సంఖ్య విపరీతంగా పెరగడం, రోగాలు, భూత పిశాచాదులు, పాములు, అదుపు తప్పిన ఏనుగులు, ఎలుకలు– ఇవీ రాజ్యంలో కలిగే ఆపదలు. పురాతన రాజ్యాల్లోనే కాదు, దుర్భిక్ష పరిస్థితులు వర్తమాన దేశాల్లోనూ ఉన్నాయి.పురాతన కాలంలో ఆనకట్టలు కట్టే పరిజ్ఞానం లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆనకట్టలు కట్టడం నేర్చుకున్నాం. నీటిపారుదలను మెరుగుపరచుకున్నాం. అయినా ఎక్కడో ఒకచోట కరవు తాండవిస్తూ ఉండటమే విచారకరం. ముందుచూపు లేకుండా అడవులను నరికివేయడం వల్లనే ప్రపంచంలో చాలా చోట్ల కరవు కాటకాలు తలెత్తుతున్నాయి. ఒకప్పటి పచ్చని నేలలు ఇప్పుడు బీడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. ‘విచారకరమైన సంగతేమిటంటే, అడవిని సృష్టించడం కంటే ఎడారిని సృష్టించడం సులువు’ అన్నాడు ఇంగ్లిష్ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్లాక్. కష్టమైన పనులు చేపట్టే బదులు సులువైన పనులు చేయడమే కదా మనుషుల సహజ లక్షణం. అందుకే సునాయాసంగా ఎక్కడికక్కడ ఎడారులను సృష్టిస్తున్నారు.కరవు సాహిత్యం మనకు కరవు కాదు. దుర్భిక్ష వర్ణన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడితో మొదలైంది. అప్పట్లో కరవు కాటకాలకు ఆలవాలమైన పలనాటి సీమలో ఆకుకూరలతో జొన్నకూడు తినలేక శ్రీనాథుడు నానా తిప్పలు పడ్డాడు. చివరకు ఉక్రోషం అణచుకోలేక ‘ఫుల్ల సరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా/డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ/పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటిలో/ మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్’ అంటూ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే సవాలు విసిరాడు. కేవలం పలనాడులోనే కాదు, రేనాటి సీమలో కూడా శ్రీనాథుడికి కారం కలిపిన జొన్నకూడు తినవలసిన దుర్గతి తటస్థించింది. అప్పుడు ‘గరళము మ్రింగితి ననుచుం/బురహర గర్వింపబోకు పో పో పో నీ/ బిరుదింక గానవచ్చెడి/ మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ’ అని పరమశివుడిని సవాలు చేశాడు. దుర్భిక్ష దుర్గతిని అనుభవించి పలవరించిన తొలి తెలుగు కవి శ్రీనాథుడు.ఆధునికులలో విద్వాన్ విశ్వం రాయలసీమలోని పెన్నా పరివాహక ప్రాంతంలోని పల్లెల కరవు కష్టాలకు చలించిపోయి, ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు’ అంట ‘పెన్నేటి పాట’ను హృదయ విదారకంగా రాశారు. కరవు మనిషిని నానా రకాలుగా దిగజారుస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది. ‘కరవు కాలంలో రొట్టెముక్కను దొంగిలించిన మనిషిని దొంగగా చూడరాదు’ అన్నాడు బ్రిటిష్ గీత రచయిత క్యాట్ స్టీవెన్స్. అయితే, కరవు కాలంలో మనుషుల్లో అంత ఔదార్యం మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే! మొదటి ప్రపంచయుద్ధం దెబ్బకు 1914–23 కాలంలో భారత్ సహా నలబై ఐదు దేశాలు కరవు కాటకాలతో అల్లాడిపోయాయి. అప్పటి కరవుకాలంలో అమెరికా ఈ దేశాలను ఆదుకున్న తీరును, ఆనాటి కరవు తీవ్రతను వివరిస్తూ అమెరికన్ రచయిత, సామాజిక కార్యకర్త హెర్బర్ట్ హూవర్ ‘యాన్ అమెరికన్ ఎపిక్: ఫేమిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ నేషన్స్’ అనే పుస్తకం రాశాడు. నేటి ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేసే దేశాల్లో సోమాలియా ముందు వరుసలో ఉంటుంది. ప్రకృతి కారణాలే కాకుండా; యుద్ధాలు, సంక్షోభాలు అక్కడి కరవును మరింత కర్కశంగా మారుస్తున్నాయి. ‘ఆకలి నా అనుదిన ఆహారం/ కరవు నా ఊపిరి/ నిర్లక్ష్యమే నా సంరక్షణ/ దాతల జోలపాటకు నేను నిద్రపోతాను/ ఆ పాట ఎలా పాడాలో వితరణ సంస్థలకు తెలుసు’ అంటాడు ‘నేను సోమాలీ శిశువును’ అనే కవితలో సోమాలీ కవి అబ్ది నూర్ హజీ మహమ్మద్. నేడు కరవు, ఎడారీకరణలపై పోరాట దినం. ప్రస్తుత ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు గడచిన ఆర్థిక సంవత్సరంలో కరవు ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలైతే, వరుసగా నలభై ఏళ్ల నుంచి కరవుతోనే సతమతమవుతున్నాయి. కరవు కాటకాలు ఉన్నచోట అశాంతి, అలజడులు తప్పవు. మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ‘హింస కలుపుమొక్కలాంటిది. ఎంతటి కరవు వాటిల్లినా అది చావదు’ అన్నాడు ఆస్ట్రియన్ రచయిత సైమన్ వీసెంతాల్. నాజీల మారణకాండ నుంచి తప్పించుకుని, బతికి బట్టకట్టిన వాడాయన. కరవు కాటకాలు కనుమరుగైతే తప్ప ప్రపంచంలో శాంతి సామరస్యాలు సాధ్యంకావు. అయితే, అలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా? మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘నిజంగానే నిఖిలలోకం / నిండు హర్షం వహిస్తుందా?/ మానవాళికి నిజంగానే/ మంచికాలం రహిస్తుందా?’ -
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు!
ఆత్రేయపురం పూతరేకులు అమెరికా వరకు ప్రసిద్ధి పొందాయి. పూతరేకులను తలపించే పిండివంటకం ప్రపంచంలో మరెక్కడా లేదనుకుంటాం గాని, ఇరాన్లో పూతరేకులను తలపించే మిఠాయి పిండివంటను తయారు చేస్తారు. ఇరాన్లోని గిలాన్ ప్రావిన్స్లో ప్రసిద్ధి పొందిన ‘రెష్తే ఖోష్కర్’ అనే ఈ మిఠాయి తయారీ దాదాపు పూతరేకుల తయారీ పద్ధతిలోనే ఉంటుంది. దీని తయారీకి ఎక్కువ పరిమాణంలోని వరిపిండికి, గోధుమపిండి కలిపి జారుగా ఉండేలా పిండిముద్దను తయారు చేస్తారు. దీనిని జంతికల గొట్టంలాంటి సాధనంలో వేసి, మంటపై బోర్లించిన మూకుడు మీద సన్నని గడులు గడులుగా వచ్చేలా వేస్తారు. ఇలా పొరలు పొరలుగా సన్నని వలలా వేసి, వీటి మధ్యలో ఏలకులు, దాల్చిన పొడి, వాల్నట్స్, బాదం, పిస్తా, చక్కెర వేసి పూతరేకుల మాదిరిగానే జాగ్రత్తగా చుడతారు. ఏటా రంజాన్ నెలలో దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
రంధ్రాలున్నాయ్ జాగ్రత్త!
సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ.. మైనింగ్ నుంచి మొదలై.. కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది. అసలు ఇక్కడ ఒపాల్ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు. వేడి నుంచి తప్పించు కోవడానికి.. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు. అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది. నాలుగు మీటర్ల లోతులో.. కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా? -
సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
జీవం ఉనికితో పాటు భూమి ఇతర గ్రహాలకు చాలా భిన్నమైనది. ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో వాతావరణం తీరుతెన్నులు సంపూర్ణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులు ఇతర గ్రహాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సహారా ఎడారిగా పచ్చగా ఉండేదనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఇలాంటి మార్పు ఎలా సంభవించిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అయితే తాజా పరిశోధన దీనిపై కొంత క్లారిటీని తీసుకువచ్చింది. ఎడారిలో నదులు, సరస్సులు ఆఫ్రికాలోని సహారా ఎడారి 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఇది ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు ఇక్కడ నీటిపై ఆధారపడే జంతువులు, సవన్నా మైదానాలు, నదులు, సరస్సులు కనిపిస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన అధ్యయనంలో సహారా ఎడారిలో ఎప్పుడు తడి కాలాలు సంభవిస్తాయి? దీనికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష్య ఎలాంటి పాత్రను పాత్ర పోషిస్తుందో వివరించారు. భారీ పర్యావరణ మార్పులలో ఇదొకటి సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించింది. బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సహారా ఎడారిని సవన్నాలేదా ఫారెస్ట్గా మార్చే ప్రక్రియ భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పులలో ఒకటని పేర్కొన్నారు. ఈ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరిగాయో వెల్లడించడానికి ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగిందన్నారు. ఇటువంటి మార్పులు అనివార్యం చరిత్రలో సహారా ఎడారి పచ్చగా మారుతుందనే వాదనకు మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అధ్యయనంలో ఈ పచ్చదన ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని సూచించారు. భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా భూమిపై ఏర్పడే రుతువులు దాదాపు ప్రతి 21 వేల కాలచక్రాలకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా వర్షపాత పరిస్ధితులు ఏర్పడి ఆఫ్రికా రుతుపవనాలు నియంత్రితమవుతాయి. ఫలితంగా సహారాలో పచ్చదనం వ్యాపిస్తుంది. ప్రతి 21 వేల సంవత్సరాలకు.. ఉత్తర ఆఫ్రికాలో ప్రతి 21 వేల సంవత్సరాలకు విపరీత వాతావరణమార్పులు సంభవిస్తాయని, వీటిని భూమి తిరిగే కక్ష్య నిర్ణయిస్తుందనేది నిర్ధారించడానికి ఈ అధ్యయనంలో క్లిష్టమైన వాతావరణ నమూనాలను ఉపయోగించారు. ఈ మార్పు ఉత్తర అర్ధగోళంలో, పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవన వ్యవస్థ శక్తిని మరింతగా పెంచుతుంది. ఫలితంగా సహారాలో వర్షపాతం విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ఎడారిలో పచ్చదనం కనిపిస్తుంది. 12 వేల ఏళ్ల తరువాత.. ఈ అధ్యయనంలో కనుగొన్న ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉత్తర ఆఫ్రికాలోని తేమతో కూడిన ప్రాంతాలు విపరీత వాతావరణమార్పులకు అంతగా గురికావు. ఎందుకంటే అక్కడి మంచు పలకలు అధిక అక్షాంశాలలో వ్యాపిస్తాయి. ఈ షీట్లు వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా రుతుపవనాల ప్రభావం కనిపించదు. సహారాలో సుమారు 5000 సంవత్సరాల క్రితం వరకు పచ్చదనం ఉండేది. ఇది భూమి కక్ష్య యొక్క వంపు 24.1 డిగ్రీలుగా మారిన సమయంలో జరిగింది. ప్రస్తుతం భూమి వంపు 23.5 డిగ్రీలలో ఉంది. అంటే ఇప్పుడు సహారాలో తదుపరి మార్పు సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం సహారా ఎడారి పచ్చగా మారడాన్ని చూడగలుగుతాం. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు
నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్... అతిపెద్ద థార్ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్ భేరారం భాఖర్. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్కుచెందిన భేరారం భాఖర్ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్కు తీసుకెళ్లారు. ఈ టూర్లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. ట్రీ టీచర్గా... మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్కు ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్ సైకిల్ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్గా మారాడు భేరారం. అడవి కూడా కుటుంబమే... బర్మార్లో పుట్టిపెరిగిన భాఖర్కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాలుగు లక్షలకుపైగా... అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. -
నీళ్లు లేక బోసిపోయిన కందకుర్తి త్రివేణి సంగమం
-
అదో అధోజగత్తు.. శ్మశానసదృశ ప్రాంతం.. మృతప్రాయ నక్షత్రాల అడ్డా!
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృచ్ఛికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్హోల్స్లోకి అంతర్ధానమవుతున్నాయట. అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట! -
అద్భుతం..అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిలో పూల నందనమా!
అవును మరి.. ఇది అద్భుతమే.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిగా పేరొందిన అటకామా. చూశారుగా.. నిజంగానే ఎడారా అని అనుమానం కలిగేలా.. పూలతో నందనవనాన్ని తలపిస్తోంది. ఇక్కడ వర్షం అరుదు. ఏడాదికి సగటు వర్షపాతం 15 మిల్లీమీటర్లు.. చాలా ప్రాంతాల్లో అది కూడా పడదు. అయితే, ఎప్పుడూ లేనంతగా కుండపోత వర్షం కురిసినప్పుడు.. ఎడారి మురిసిపోతుంది.. విరులతో ఇలా మెరిసిపోతుంది. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో షేర్ చేశారు. 5–7 ఏళ్లకోసారి అటకామాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటుందట. చదవండి: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా? -
ఎడారుల్లో పచ్చదనం కోసం...
ఎడారుల్లో మొక్కలు పెంచితే ఎంతో బాగుంటుంది కదూ! ఇది సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా? అసాధ్యమైన ఈ పనిని సుసాధ్యం చేసేందుకు నడుం బిగించారు దుబాయ్ శాస్త్రవేత్తలు. ఎడారుల్లో మొక్కలు నాటడానికి ఏకంగా ఒక రోబోనే తయారు చేశారు. ఈ రోబో ఎడారుల్లో ఎంత దూరమైనా సునాయాసంగా ముందుకు సాగుతూ, విత్తనాలు నాటి, అవి మొలకెత్తి ఏపుగా ఎదిగే వరకు సమస్త బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తుంది. దుబాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అక్కడి విద్యార్థులు ఈ రోబోను రూపొందించారు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. ఎడారులు, బీడభూముల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతోనే దీనిని రూపొందించామని ఈ రోబో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త మజ్యర్ ఇత్తెహాది తెలిపారు. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
Desert Of Maine: ముచ్చటైన ఎడారి
ఎడారి అనగానే.. ఎటు చూసినా ఇసుక తెన్నెలు, అక్కడక్కడా బ్రహ్మజెముడు, నాగజెముడు పొదలు అనే తలపే వస్తుంది కదా! కానీ, అమెరికాలోని ఫ్రీపోర్ట్ పట్టణానికి సమీపంలో ఉన్న ‘మైనె డెజర్ట్’లో మాత్రం ఇసుక, నీరు, చెట్లు.. అన్నీ పుష్కలంగా ఉంటాయి. పైగా నిత్యం వందలాది పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. ఎందుకంటే, ఇది నిజమైన ఎడారి కాదు. మనిషి నిర్మించిన కృత్రిమ ఎడారి. నిజానికి శతాబ్దం కిందట ఇదొక వ్యవసాయ భూమి. గోధుమ, వరి పండించే పంటపొలం. పర్యావరణ మార్పుల కారణంగా భూసారం కోల్పోయి, ఇసుక మేట వేసింది. దీంతో చాలామంది భూమిని అమ్ముకుని ఊరు విడిచి వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువ భాగాన్ని అంటే 40 ఎకరాలను కొన్న టటిల్ అనే వ్యక్తి , కొంతకాలం గొర్రెలు మేపడంతో అక్కడ అసలు గడ్డి అనేదే లేకుండా పోయింది. తర్వాత ఆ నలభై ఎకరాలను 1919లో హెన్రీ గోల్డ్రప్ కొనుగోలు చేసి, నిజంగానే ఆ ప్రాంతాన్ని ఓ ఎడారిలా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మరికొంత ఇసుకను తెప్పించి 2.5 మీటర్ల ఎత్తుమేర మొత్తం చల్లించి, అందమైన ఎడారిలా మార్చాడు. సందర్శకుల కోసం అక్కడక్కడ చెట్లు కూడా పెంచాడు. పిల్లలు ఆడుకోవడానికి ఓ ప్రత్యేక ఆటస్థలం, మ్యూజియం కూడా ఉన్నాయి. బాగుంది కదా ఈ కృత్రిమ ఎడారి! -
గులాబీ రంగు అమ్మాయిలకే కాదు బ్రిటిష్ ఆర్మీకీ ఇష్టమే!.. పింక్ పాంథర్స్ విశేషాలు తెలుసా!
అమ్మాయిలకు గులాబీలన్నా.. గులాబీ రంగన్నా ఇష్టం అంటారు. నిజానికి గులాబీ రంగు బ్రిటిష్ ఆర్మీకి ఇష్టమట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎడారి ప్రాంతాల్లోని సైనిక దళాలకు సహాయం చేసిన వాహనాల రంగు ఈ గులాబీనే. వీటికి ‘పింక్ పాంథర్స్’ లేదా ‘పింకీస్’అని పేరు. సాధారణంగా అడవులు, కొండల్లో కాపలాకాసే సైనికులను, శత్రువులు త్వరగా గుర్తించకుండా ఉండటానికి ఆర్మీ ఎక్కువగా ఆకుపచ్చ, గోధుమరంగులను ఉపయోగిస్తుంది. కానీ, ఈ రంగులు ఎడారి ప్రాంతాల్లో ఉపయోగపడవు. ఇందుకోసం 1968– 1984 బ్రిటిష్ ఎస్ఏఎస్ ఈ పింక్ పాంథర్ జీప్లను ఉపయోగించింది. ఈ ఉపాయం బాగా పనిచేసింది. దగ్గరగా చూస్తే కాని కనిపించని ఈ వాహనాలు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడాయి. తర్వాత ఇదే ఉపాయాన్ని ఇంకొన్ని దేశాలు కూడా ఉపయోగించాయి. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వినియోగం ఆగిపోయింది. అప్పట్లో మిగిలిపోయిన వాటిలో ఇరవై వాహనాలను ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2019లో నిర్వహించిన ఓ వేలంలో 1968 ల్యాండ్రోవర్ 2ఏ పింక్ పాంథర్ రూ. 64 లక్షలకు అమ్ముడుపోయింది. మిగిలినవి మ్యూజియంలో ప్రదర్శనల్లో ఉపయోగిస్తున్నారు. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
భూమ్మిదే మనుషులు సృష్టించిన మార్స్.. ఎక్కడంటే..
అవును.. భూమ్మీదే మార్స్.. మనుషులే దాన్ని సృష్టించేశారు.. ఎక్కడ అంటే.. ఇజ్రాయెల్లోని నెగేవ్ ఎడారిలో.. ఇంతకీ ఎందుకిలా చేశారు.. అక్కడ స్పేస్ సూట్స్ వేసుకుని వీళ్లంతా ఏం చేస్తున్నారు? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే.. చలో ఇజ్రాయెల్... భవిష్యత్ సంక్షోభాల దృష్ట్యా ప్లానెట్ ‘బి’ సృష్టించడం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అంగారకుడి మీద కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నా... ఇప్పటి దాకా జీవం ఉన్న దాఖలాలు లేవు. రెడ్ప్లానెట్ మీద మానవులు జీవించడానికి ఏ మాత్రం అవకా శం ఉందనే పరిశోధనలకోసం నాసా 2030లో మార్స్ మీదకు వ్యోమగాములను పంపనుంది. ఆ ప్రయోగం కోసమే అంగారక గ్రహం భౌగోళిక స్థితులను పోలిన ఇజ్రాయిల్లోని ‘నెగేవ్’ ఎడారిలో రెడ్ప్లానెట్ నమూనాను తయారు చేసింది. ఇక్కడ ఆరుగురు వ్యోమగాములు, నాలుగు వారాలపాటు నివసించనున్నారు. ఏఎమ్ఏడి ఈఈ–20గా పిలుచుకునే ఈ బృందంలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఆ నమూనా ఎలా ఉంటుంది? మార్స్ బేస్ లోపలి వాతావరణాన్ని పోలిన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉండటం కోసం ఏర్పాటు చేసినట్లుగానే ఈ ఆవాసం ఉంటుంది. అంగార కుడి మీద ప్రయోగాలకోసం ఉన్న సానుకూలత లను, పరిమితులను కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ఆవాసాన్ని తయారు చేశారు. బయటికి వచ్చినప్పుడు స్పేస్సూట్స్ అంతే కాదు... రోవర్లు, డ్రోన్లతోపాటు ఇతర పరిక రాలన్నింటినీ ఈ అంగారకుడిమీద పరీక్షించనున్నారు ఆస్ట్రోనాట్స్. జీవం ఉండేందుకు ఉన్న అవ కాశాలు, వ్యోమగాముల ఆరోగ్యపరిస్థితులు, వాళ్ల మానసిక స్థితిగతులు, మార్స్ మీద పరిస్థితులు, ఇంజనీరింగ్ విభాగాల్లో 20కిపైగా ప్రయోగాలను 4 వారాలపాటు నిర్వహించనున్నారు. మార్స్ మీద బయటకు వెళ్లినప్పుడు ధరించినట్టుగా నే ఇక్కడా ఆ ఆవాసం నుంచి బయటికి వచ్చిన ప్పు డు, రోవర్స్, డ్రోన్స్ నిర్వహించేప్పుడు వ్యోమ గా ములు తప్పనిసరిగా స్పేస్ సూట్స్ను ధరిస్తారు. తీసుకునే ఆహారం, పీల్చేగాలి... వ్యోమగాములు తీసుకునే ఆహారం, పీల్చేగాలి పూర్తిగా మార్స్పైన బేస్లో ఉన్నట్టుగానే ఉంటాయి. వ్యర్థాల రీసైక్లింగ్, నీటిబుడగలకు అనువైన ఉన్నట్టుగానే అసాధారణ పరిస్థితులను సృష్టించి ఒంటరిగానూ, ఇద్దరు ముగ్గురు కలిసి సహకరించుకుంటూ ప్రయోగాలు చేస్తారు. ఇతర గ్రహాల మీద ఉన్న దుమ్ము, ధూళి వ్యోమగాములకు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగించడమే కాదు... యంత్రాలను పనిచేయకుండా చేసే అవకాశం ఉంది. అందుకే దుమ్ము, ధూళిని శుభ్రం చేసే టెక్నాలజీని సైతం ఇక్కడ పరీక్షించనున్నారు. నాలుగువారాలపాటు ఐసోలేషన్... మార్స్ మిషన్ కోసం ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఔత్సాహికుల నెట్వర్క్తో ఏర్పాటైన ఆస్ట్రియన్ స్పేస్ ఫోరమ్ నిర్వహిస్తున్న 13వ అనలాగ్ ఆస్ట్రోనాట్ మిషన్ ఇది. ఇందుకు అవసరమైన క్రూ, పరికరాలు, సౌకర్యాలను ఇజ్రాయేల్ స్పేస్ ఏజెన్సీ సమకూర్చింది. సోమవారం ప్రారంభమైన ఈ ఐసోలేషన్ దశ అక్టోబర్ 31తో ముగియనుంది. అప్పటివరకు మిషన్ కంట్రోల్తో మాత్రమే వ్యోమగాములు మాట్లాడతారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ నిధులు అందిస్తున్న అతి పెద్ద ప్రయోగం ఇది. ఈ మిషన్లో 25 దేశాల నుంచి 200 మంది పరిశోధకులు పాలుపంచుకున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రెండే ఆకులతో వేల ఏళ్లు బతుకుతుంది!
ఏవైనా మొక్కలు, చెట్లు ఎన్ని రోజులు బతుకుతాయి. కొన్ని అయితే నెలలు, మరికొన్ని అయితే సంవత్సరాలు.. అత్యంత భారీ వృక్షాలు అయితే కొన్ని వందల ఏళ్లు బతుకుతాయి. కానీ కేవలం రెండే ఆకులతో, రెండు మూడు అడుగుల పొడవు మాత్రమే ఉండే ఓ చిన్న మొక్క కొన్ని వేల ఏళ్లు బతుకుతుంది తెలుసా? ఆ మొక్క పేరు.. ‘వెల్విస్చియా’. భూమ్మీద అత్యంత పురాతన ఎడారుల్లో ఒకటైన నమీబియా ఎడారిలో ఈ మొక్కలు కనిపిస్తాయి. ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ వెల్విస్చ్ 1859లో ఈ చిత్రమైన మొక్కలను గుర్తించారు. ఆయన పేరుమీదుగానే దీనికి ‘వెల్విస్చియా’ అని పేరుపెట్టారు. ఎప్పటికీ చావదని.. వెల్విస్చియా మొక్కలను ఆఫ్రికాలో స్థానికంగా ‘ట్వీబ్లార్కన్నీడూడ్’ అని పిలుస్తారు. ఈ పదానికి ‘ఎప్పటికీ చావులేని రెండు ఆకులు’ అని అర్థం. దీనికి తగ్గట్టే రెండే ఆకులు ఉండే ఈ మొక్క.. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను తట్టుకుని మరీ కొన్ని వేల ఏళ్లు బతుకుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఉన్న రెండు ఆకులే పొడవుపెరుగుతున్న కొద్దీ చీలిపోతూ చుట్టూ విస్తరిస్తాయని తేల్చారు. కొన్ని మొక్కల శాంపిల్స్ను తీసుకుని పరీక్షించారు. వాటిలో కొన్ని మూడు వేల ఏళ్ల కిందటే పుట్టి, ఇప్పటికీ బతుకుతున్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. చాలా మొక్కల వయసు వెయ్యేళ్లకుపైనే ఉన్నట్టు వెల్లడికావడం గమనార్హం. ఆ మార్పులతో వ్యవసాయానికి తోడ్పాటు అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటూ.. అతి తక్కువ శక్తిని వినియోగించుకునేలా ఈ మొక్కల్లో జరిగిన జన్యుమార్పులను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. వీటిని వ్యవసాయంలో అమలు చేయగలిగితే.. క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా, తక్కువ నీళ్లు, ఎరువులను వినియోగించుకునేలా పంటలను అభివృద్ధి చేయవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ లీబెన్స్ తెలిపారు. -
మిస్టరీ: ఇక్కడ మాయం.. అక్కడ ప్రత్యక్షం
బుకారెటస్ట్, రొమేనియా: గత నెల ఉటా ఎడారిలో ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షం అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. సడెన్గా ప్రత్యక్షం అయిన దిమ్మె.. అంతే సడెన్గా మాయమవ్వడంతో ఏలియన్స్ పనే అని చర్చించుకుంటున్నారు నెటిజనులు. లోహపు దిమ్మె కనిపించకుండా పోయినప్పుడు ‘ఉటా ఎడారి నుంచి మాయమయ్యింది.. ఇక ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షం కానుందో’ అంటూ కామెంట్ చేశారు కొందరు నెటిజనులు. వారి మాటలు నిజమయ్యాయి. ఉటాలో మాయమైన లోహపు దిమ్మె ప్రస్తుతం యూరప్లో ప్రత్యక్షమయ్యింది. యూరప్ దేశం రొమేనియాలో... ఓ లోహ స్తంభం సడెన్గా ప్రత్యక్షమైంది. త్రికోణ ఆకారంలో ఉన్న ఈ లోహ స్తంభం... రొమేనియాలోని... పియత్రా నీమ్త్లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల అవతల కనిపించిందని డైలీ మెయిల్ తెలిపింది. తాజా స్తంభం... 13 అడుగుల ఎత్తు ఉంది. సియాహ్లూ పర్వతం వైపు చూస్తున్నట్లుగా ఉంది. రొమేనియాలోని సహజమైన 7 వింతల్లో ఆ పర్వతం కూడా ఉంది. ఐతే... ఉటా ఎడారిలో మాయమైన లోహపు దిమ్మె, ఇదీ... రెండు వేరు వేరని చెబుతున్నారు. ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మె 10-12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్తో తయారై ఉంది. ఇక ఈ లోహపు దిమ్మె తమ దేశంలో ప్రత్యక్షం కావడంతో రొమేనియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాని మిస్టరీ విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే... మేమూ దాన్ని మొదటిసారి చూస్తున్నాం అని చెబుతున్నారు. అది ప్రభుత్వానికి చెందినది కాదనీ... అందువల్ల దాన్ని తాము ఏమీ చెయ్యలేమనీ... కాకపోతే... దాని ఓనర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అధికారులు. అది చారిత్రక, పురాతత్వ రక్షణ వలయ ప్రాంతంలో ఉండటం వల్ల ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా వస్తువును అక్కడ ఉంచాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవి లేకుండా రాత్రికి రాత్రే ఈ లోహపు స్తంభం ఇక్కడ ప్రత్యక్షం కావడంతో ప్రజలతో పాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది) ఉటా ఎడారిలో నుంచి దాన్ని తొలగించింది మేమే ఇక ఉటా ఎడారిలో కనిపంచిన లోహపు దిమ్మెను ఎవరు తొలగించారనే దానికి సమాధానం లభించింది. అయితే దాన్ని తొలగించింది ఏలియన్స్ మాత్రం కాదు. నలుగురు వ్యక్తులు దాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని రాస్ బెర్నార్డ్స్ అనే ఫోటోగ్రాఫర్ తెలిపారు. ఎడారిలో ఉన్న లోహపు దిమ్మెని ఫోటో తీయడానికి వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు దాన్ని తొలగించడం తన కెమరా కంటికి చిక్కిందని తెలిపాడు. అంతేకాక వారి ఫోటోలను తన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు బెర్నార్డ్స్. మంగళవారం తరువాత, 34 ఏళ్ల స్లాక్లైన్ ప్రదర్శనకారుడు, సాహస క్రీడాకారుడు ఆండీ లూయిస్ ‘మేము ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెని తొలగించాం’ అంటూ ఓ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు. -
ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది
వాషింగ్టన్: అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం ఓ వింత వస్తువు ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. 12 అడుగుల పొడవున్న ఈ లోహపు దిమ్మె నర సంచారం లేని ఆ ఎడారిలోకి ఎలా వచ్చేందనే విషయం ఇంకా మిస్టరీగానే ఉండగా... తాజాగా మరో వింత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కనిపించకుండా పోయింది. దాంతో తప్పకుండా ఇది ఏలియన్స్ పనే అంటున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో ల్యాండ్ మేనేజ్మెంట్ బ్యూరో అధికారులు ‘ఒక్కరు లేదా కొందరు వ్యక్తులు కలిసి ఈ దిమ్మెను శుక్రవారం రాత్రి తొలిగించినట్లు మాకు తెలిసింది’ అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. ‘లోహపు దిమ్మెను తొలగించారు. బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాతిన లోహపు దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని దానిలో పేర్కొన్నారు. ఈ నిర్మణాన్ని తొలగించినట్లు ఉటా హైవే పాట్రోల్ సీపీఎల్ అధికారి ఒకరు ఆదివారం వాషింగ్టన్ పోస్ట్కు తెలియజేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. (చదవండి: ఏముంది.. అక్కడే పడుకో: భార్య) ‘అసలు ఆ దిమ్మెను ఎడారిలో ఎవరు నిలబెట్టారు.. ఇప్పుడు ఎవరు తొలగించారు. అంతా మాయాలా ఉంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం దీని గురించి ఇంటర్నెట్లో తెగ చర్చ నడుస్తోంది. ‘ఏలియన్స్ వచ్చి దాన్ని తీసుకెళ్లాయి’.. ‘ఇప్పుడు ఆ దిమ్మె మరో చోట ప్రత్యక్షం అవుతుందేమో’.. ‘ఆ దిమ్మె ఏలియన్స్కు సంబంధించిన వస్తువు. అందుకే అధికారుల సీక్రేట్గా దాన్ని తొలగించారు.. దాని ఏం మాట్లాడటం లేదు’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఈ నెల 18న కొందరు కార్మికులు ఈ నిర్మణాన్ని గమనించారు. రెడ్ రాక్ రిమోట్ ఏరియాలో దిమ్మె ప్రత్యక్షం అయ్యిందని తెలిపారు. నాటి నుంచి ఈ దిమ్మె తెగ వైరలయ్యింది. ఇక ఈ దిమ్మె ఎక్కడ ఉంది అనే దాని గురించి ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. -
ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!
అమెరికా: ఉటా ఎడారిలో అకస్మాత్తుగా ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఎవరికీ తెలియదు కానీ.. ఇది సుమారు 12 అడుగుల పొడవుందని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్లు ప్రకటించారు. ఎడారి ప్రాంతంలోని అడవి గొర్రెల సంతతిని లెక్కించేందుకు గత బుధవారం తాము హెలికాప్టర్లో సర్వే నిర్వహించిన ప్పుడు ఉటా నైరుతి దిక్కున ఎర్ర రాళ్ల మధ్య ఈ లోహపు దిమ్మె కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ దిమ్మెను అక్కడికి ఎవరు తెచ్చారో? ఎలా తెచ్చారో తెలియలేదని, అక్కడ పాతిన ఆనవాళ్లూ ఏవీ కనిపించ లేదన్నారు. ఈ దిమ్మె కచ్చితంగా ఎక్కడుందో చెప్పేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు వెళ్లలేని ప్రాంతంలో అది ఉందని, ఒకవేళ ఎవరైనా వెళ్లినా వాళ్లను రక్షించేందుకు మళ్లీ తామే వెళ్లాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అచ్చం ఆ సినిమాలో ఉన్నట్లే... ఉటా ఎడారిలో గుర్తించిన లోహపు దిమ్మె అచ్చం 1968లో విడుదలైన ‘‘2001: ఎ స్పేస్ ఒడెస్సీ’’ చిత్రంలో గ్రహాంతర వాసులకు చెందినదిగా చూపిన నిర్మాణం మాదిరిగానే ఉండటంతో ఈ వార్తపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఉటా హైవే ఫేస్బుక్ పేజీలో ఈ మిస్టరీ నిర్మాణంపై పలువురు హాస్యాన్ని జోడించి మరీ కామెంట్లు పెట్టారు. మరోవైపు ఈ నిర్మాణంపై అధికారులు స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకమని, తగిన అనుమతుల్లేకుండా ఇలా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయడం ఎర్త్ లాను ఉల్లంఘించడమేనని హెచ్చరిస్తున్నారు. ఆ దిమ్మె ఏమిటి? అక్కడకు ఎలా వచ్చిందన్నది ప్రస్తుతానికైతే మిస్టరీనే! స్ప్రే చేస్తే చాలు.. కదులుతాయి! శరీరం లోపలి భాగాలకు నేరుగా మందులు అందించేందుకు హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత పదార్థపు స్ప్రేతో ఏ వస్తువునైనా మిల్లీ రోబోగా మార్చేయగలగడం ఇందులోని కీలక అంశం. పాలివినైల్ ఆల్క హాల్, గ్లుటెన్, ఇనుప రజనుతో తయారైన ఈ స్ప్రే చేసిన వస్తువును శరీరంలో కావాల్సిన చోటికి నడిపించవచ్చు లేదా దొర్లేలా చేయవచ్చు. పాక్కుంటూ కూడా వెళ్లగలదు. కేవలం మిల్లీమీటర్లో నాలుగో వంతు మందం ఉండే ఈ స్ప్రేను మాత్రలపై ఉప యోగించడం ద్వారా మందులను నేరుగా శరీర భాగాలకు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ షెన్ యాజింగ్ తెలిపారు. ఎం–స్ప్రే అని పిలిచే ఈ కొత్త పదార్థం శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవసరమైన సమయంలో తనంతట తానే నాశనమై వ్యర్థంగా బయటకు వచ్చేస్తుంది. గమనాన్నీ నియంత్రించొచ్చు.. అంతేకాదు.. ఎం–స్ప్రే కోటింగ్ ఉన్న వస్తువు ఏ రకంగా ప్రయాణించాలో నిర్ణయించవచ్చని, అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కోటింగ్పై కణాల అమరికను మార్చడం ద్వారా ఇది సాధ్యమని యాజింగ్ వివరిస్తున్నారు. కొన్ని మాత్రలకు తాము ఈ కోటింగ్ ఇచ్చి ఎలుకలపై ప్రయోగించామని, ఆ తరువాత ఇవి ఎలుకల శరీరంలో ఎలా ప్రయాణించాయో స్పష్టంగా గమనించగలిగామని, కావాల్సిన ప్రాంతానికి చేరుకోగానే కోటింగ్ కరిగిపోయి మందు మాత్రమే విడుదలైందని చెప్పారు. ఈ స్ప్రేను వైద్య రంగంలో ఉపయోగించడమే కాకుండా మిల్లీ రోబోల తయారీ ద్వారా కదిలే సెన్సర్లుగానూ వాడుకోవచ్చునని యాజింగ్ అంటున్నారు. గుండెజబ్బుల చికిత్స కోసం శరీరంలోకి చొప్పించే క్యాథిటర్ను కూడా ఈ కోటింగ్ ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. -
దేవుడు సృష్టించిన వింతా?
-
ఎడారిలో పూలు పూచేనా?
సారవంతమైన భూమి నాణ్యత కోల్పోతోంది. ప్రపంచంలో ఏ దిక్కు చూసినా ఎడారులే కనిపిస్తున్నాయి. ఈ ఎడారీకరణ విసురుతున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. గ్రేటర్ నోయిడాలో ఎడారీకరణ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ సదస్సులో ఎన్నో విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇంతకీ ఎడారీకరణ అంటే ఏంటి? ప్రపంచ దేశాల్లో ఎందుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎడారీకరణ అంటే? బంగారు పంటలు పండే భూములు సారాన్ని కోల్పోతూ నిరుపయోగంగా మారిపోవడాన్ని ఎడారీకరణ అంటున్నారు. దీనికి ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగే. రుతువులు గతి తప్పి అతివృష్టి, అనావృష్టి ఏర్పడటం, చిత్తడి నేలలు నాశనం కావడం, జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, కొండచరియలు విరిగిపడి సారవంతమైన నేల కోతకు గురవడంతో ఉత్పాదకత దెబ్బతింటోంది. జనాభా పెరుగుదలతో పట్టణీకరణ జరగడమూ ఎడారీకరణకు దారి తీస్తోంది. ఎంత నష్టం? ఎడారీకరణతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల కోట్ల డాలర్లు నష్టం వస్తోంది. ప్రపంచ ఆర్థిక వనరుల్లో 10–17శాతం కోల్పోతున్నట్లు ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన విభాగం (యూఎన్సీసీడీ) వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచంలో 360 కోట్ల మందికి ఏడాదిలో నెల రోజుల పాటు నీటి చుక్క కూడా దొరకట్లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే 2050 నాటికి 500 కోట్ల మందికి నీరు అందే పరిస్థితి ఉండదు. భారత్లో పరిస్థితి ఎలా? 2018లో వేసిన అంచనాల ప్రకారం 9.64 కోట్ల హెక్టార్ల భూమి మన దేశంలో ఎడారీకరణకు లోనవుతోంది. అంటే దాదాపుగా 30 శాతం భూములు సారాన్ని కోల్పోతున్నాయి. భారత్లో ఎడారీకరణతో ఏడాదికి 4,800 కోట్ల డాలర్ల నష్టం వస్తోంది. ఇది 2015 జీడీపీలో 2.5 శాతంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 31.4, ఏపీలో 14.35శాతం శాతం భూములు నిరుపయోగంగా మారాయి. అనంతపురం, నల్లగొండలో సమస్య ఎక్కువగా ఉంది. కంప చెట్టు కొంప ముంచింది.. ప్రాస్పిస్ జులీఫ్లోరా అంటే తెలుసా? దాన్నే కంప చెట్టు అంటారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నీళ్లల్లో ఉప్పు శాతాన్ని తగ్గించడం కోసం ఈ చెట్లను నాటాలని 1960లో ప్రణాళిక సంఘం సిఫారసు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో అప్పట్లో లేకపోవడంతో అవగాహనా రాహిత్యంతో హెలికాప్టర్ నుంచి 3 వేలకు పైగా హెక్టార్లలో ఈ కంప విత్తనాలు జల్లారు. ఆ కంప చెట్లు అలా అలా పెరిగి పర్యావరణాన్ని నాశనం చేయడమే కాదు.. ఆర్థిక వ్యవస్థే కంపించేలా చేస్తున్నాయి. 1997లో 6% భూముల్లో ఉన్న ఈ కంప చెట్లు 2009 సరికి 33% భూముల్లో విస్తరించాయి. 2015 నాటికి 54% భూముల్లో పెరిగాయి. ఇవి విపరీతంగా నీటిని పీల్చుకోవడంతో కచ్ ప్రాంతంలో ఎడారీకరణ పెరిగిపోయింది. పరిష్కార మార్గాలేంటి? నీటి వనరుల సక్రమమైన నిర్వహణే ఎడారీకరణకు అసలు సిసలు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా నిర్ణయించుకొని నాణ్యత కోల్పోయిన భూముల్ని తిరిగి సాగులోకి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం భారత్ రిమోట్ సెన్సింగ్, స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం.. - ప్రపంచ దేశాల్లో 40 శాతానికిపైగా భూములు ఎడారీకరణలో ఉన్నాయి. - 100కి పైగా దేశాల్లో ఎడారీకరణ ముప్పు ఉన్నాయి. - ఈ భూమిలో 75 శాతం భూమి నాణ్యత దెబ్బ తింది. - ఎడారీకరణకు గురైన ప్రాంతాల్లో 302 కోట్ల మంది జీవిస్తున్నారు. - 2030 నాటికి 500 కోట్ల మంది ప్రజలు ఎడారీకరణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా - 2050 నాటికి 90 శాతానికి పైగా భూమి సారాన్ని కోల్పోతుందని అంచనా. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇప్పటి ఎడారి.. ఒకప్పటి సముద్రం
జైపూర్ : ఎడారి.. కనుచూపు మేర ఇసుక తప్ప మరొకటి కనిపించని ప్రాంతం. మచ్చుకోక చోట మాత్రమే నీరు. మన దేశంలో ఎడారి అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజస్ధాన్. అయితే ఇప్పటి ఈ ఎడారి ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా..? పూర్తిగా నీరు ఆవరించి ఉండేది. చెలమలు, చెరువుల కాదు.. ఏకంగా సముద్రం. అవును ఇప్పటి ఈ ఎడారి ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేదంట. నమ్మడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఏడాది నుంచి గుజరాత్, రాజస్థాన్లో విస్తరించిన ఎడారి ప్రాంతంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. పాలియెంటాలజీ(శిలాజాల అధ్యాయనం) విభాగం డైరెక్టర్ దేబసిష్ భట్టాచార్య అధ్వర్యంలో నిర్వహస్తున్న ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జైసల్మేర్ జిల్లాలోని ఈ ఎడారి ప్రాంతంలో పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన అనేక శిలాజాలు బయటపడ్డాయి. వీటిలో తొలి తరం తిమింగలానికి సంబంధించినవి, షార్క్, మొసలి దంతాలు, తాబేలు ఎముకకు సంబంధించిన శిలజాలు ఉన్నాయి. ఇవన్ని పూర్వ చారిత్రక యుగానికి సంబంధించినవే కాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇవన్ని జలచరాలు. ఇవన్ని మధ్య శిలాయుగానికి చెందినవి. జైసల్మేర్ జిల్లాలో దొరికిన ఈ శిలజాలు అన్ని మధ్య శిలా యుగానికి చెందినవిగా భట్టాచార్య టీం గుర్తించింది. మధ్య శిలా యుగం అంటే దాదాపు 47 లక్షల సంవత్సరాల కాలం నాటి జీవజాలం. అంటే ప్రస్తుతం ఎడారి విస్తరించిన ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల క్రితం సముద్రం ఉండేదని స్పష్టంగా అర్ధమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల క్రమేణ వచ్చిన వాతావరణ మార్పులు మూలంగా ప్రస్తుతం ఉన్న ఎడారిగా రూపాంతరం చెంది ఉంటుందని శ్రాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాక గుజరాత్, కచ్ బేసిన్ ప్రాంతాల్లో ఒకే రకమైన వాతావరణ మార్పులు సంభవించి ఉంటాయని భట్టాచార్య టీం అంచనా వేస్తుంది. అయితే ఒకప్పుడు ఉన్న సముద్రం అంతరించి ఇప్పటి ఎడారి ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత పరిశోధన చేయాల్సి ఉంటుందని భట్టాచార్య ప్రకటించారు. -
వాన నీటి సుల్తాన్
రాబోయేది వానా కాలం. వాన వస్తుంది... వెళుతుంది అనుకుంటున్నారా? మధ్యలో చాలా పని చేయవచ్చు. వానను వాగు చేయొచ్చు. వరద చేయొచ్చు. బంధించి సంవత్సరం పొడవునా పనికి వచ్చే గింజలు ఇచ్చే జీవజలం కూడా చేయవచ్చు. అనంతపురం జిల్లా నీటి వసతి లేని జిల్లా అని అందరూ అంటారు. కాని ఈ రైతు తన పొలంలో నీటిని బంధించాడు. వాన నీటినే దాహానికీ సేద్యానికీ నిలువ చేయగలిగాడు. ఇవాళ అక్కడ మామిడి పండుతోంది. అంతేనా... చుట్టు పక్కల అడవుల నుంచి పక్షులు, పశువులు వచ్చి నట్ట నడెండలో ఈ వయాసిస్సులో దప్పిక తీర్చుకొని పోతున్నాయి. నూర్ మహమ్మద్ ఇది ఎలా సాధించాడో ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రశ్న: నూర్మహమ్మద్ గారూ.. ఎడతెగని కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో మీ తోటను ఎడారిలో ఒయాసిస్సుగా మార్చారు గదా.. మీ కృషి ఎప్పుడు ప్రారంభమైంది..? నూర్ మహమ్మద్: నేను వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తుండగా బుక్కపట్నం మండలంలో 8 ఎకరాల భూమి కొన్నాను. అప్పట్లో అది బీడు భూమి. ఈ బీడు ఎందుకు తీసుకున్నారు? అని అందరూ అనేవారు. నీళ్లు చుక్క లేకుండా ఈ భూమిని ఏం చేసుకుంటావు? అని అడిగేవారు. నిజమే, నీటి వసతి లేని భూమి వృధానే. కానీ, ఫ్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు సాధించవచ్చు. మబ్బుల్లో వాన ఉంటుంది కదా.. చాలు అనుకున్నాను. డిపార్ట్మెంట్లో నేను భూవనరుల సంరక్షణ విభాగంలో పనిచేసే వాడిని కనుక, ప్రతి నీటి బొట్టు విలువ తెలుసు కనుక ఎవరేమన్నా పట్టించుకోకుండా పదేళ్ల క్రితం నుంచి నీటి సంరక్షణ పనులు మొదలుపెట్టాను. అప్పట్లోనే లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేశా. భూగర్భంలో నీటిని దాచుకోవడానికి స్టెప్ బై స్టెప్ పని చేయడం మొదలుపెట్టా. ప్రశ్న:ఎలా మొదలుపెట్టారు..? మా బీడు భూమిలో నుంచి ఒక వంక వెళుతూ ఉంది. మొదట దానిపైన చెక్డ్యాం నిర్మించాం. తర్వాత తోట మధ్యలో అక్కడక్కడా 2.5 మీటర్ల వెడల్పు, మీటరు లోతులో మట్టికట్టలు కట్టాం. మట్టికట్ట చివరన మలుపులో నీటి కుంట తవ్వాం. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాకు జూన్, జూలై నెలల్లోనే వర్షం ఎక్కువ పడుతుంది. పది రోజుల వాన ఒకేసారి పడుతూ ఉంటుంది. అంత పెద్ద వర్షానికి వచ్చే నీటి వరదను ఆపగలిగేలా మట్టి కట్టలు వేశాం. ప్రశ్న:కందకాలు ఎప్పుడు తవ్వారు? సాక్షి టీవీ, పేపరు ద్వారా కందకాల గురించి చదివి తెలుసుకున్న తర్వాత గత ఏడాది తవ్వాం. రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పున తోట చుట్టూ తవ్వాం. ప్రశ్న:మీరు చేపట్టిన వాన నీటి సంరక్షణ పనుల ప్రభావం ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెట్టిన ప్రతి రూపాయికీ కొన్ని వందల రెట్లు ప్రతిఫలం దక్కింది. మా దిగువన కిలోమీటరున్నర వరకూ భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యాయి. దిగువ రైతులకూ నీటి భద్రత చేకూరింది. ప్రశ్న:మీ తోటకు ఎంత మేలు జరిగింది? మా 8 ఎకరాల తోటలో 9 రకాల మామిడి చెట్లు 500 వరకు ఉంటాయి. మా తోట ఎంతో బాగుంది. పచ్చగా, ఆరోగ్యంగా మంచి దిగుబడి వస్తోంది. ఏటా నికరంగా రూ. పది లక్షల ఆదాయం వస్తున్నది. మాకు ఎప్పుడూ నీటి కరువు లేదు. మా మండలంలో గత ఏడాది 250 ఎకరాల్లో మామిడి తోటలు నీరు లేక నిలువునా ఎండిపోయాయి. మా పొలంలో కురిసిన వానలో నుంచి చినుకు కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడటం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రశ్న:మీ తోట దగ్గర పశువులకు, అటవీ జంతువులకూ నీరు అందుబాటులో ఉంచారట కదా..? అవును సార్. మాకు చాలా సంతోషం కలిగించే సంగతి ఇది. మా తోట దగ్గర్లో ఉన్న అడవిలో కూడా జంతువులు తాగడానికి నీరు లేదు. తోట ఎదుట సిమెంటు తొట్టిని నిర్మించాం. అందులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తున్నాం. పక్షులు కూడా వచ్చి దప్పిక తీర్చుకుంటాయి. రాత్రుళ్లు అటవీ జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటుంటాయి. ప్రశ్న:రైతులు ఎలా స్పందిస్తున్నారు..? పది మందికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత రైతులంతా మాతో బాగుంటారు. చాలా మంది వచ్చి చూసి వెళుతూ ఉంటారు. మా తోట గురించి ఎవరైనా కొత్తవారు వచ్చి అడిగితే.. సాయిబు తోట అనో మరోటో అనరు. ఆప్యాయంగా ‘సార్ తోట’ అని చెబుతారు. కరువు నేలలో సిరులు పండించవచ్చంటున్న నూర్ మహమ్మద్, ఇంత వేసవిలోనూ ఇన్ని నీళ్లున్నాయి ఎడారిలో ఒయాసిస్సు! ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు నిరంతర కరువు మండలాలు. రబీ కాలంలో జిల్లా సగటు వర్షపాతం 100 ఎం.ఎం. ఉంటుంది. ఈ మండలాల్లో 20 ఎం.ఎం.కు మించదు. ఈ కారణంగా కరువు మండలాల జాబితాలో గత నాలుగైదేళ్లుగా ఈ మండలాలు క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఈ ప్రాంతంలో 250 ఎకరాల్లో మామిడి తోటలు నిలువునా ఎండిపోయాయి. కటిక కరువు తాండవించే అటువంటి ప్రాంతంలో మామిడి రైతు నూర్మహమ్మద్, అతని కుమారుడు అజీజ్ ఎడారిలో ఒయాసిస్సును సృష్టించారు. ముందుచూపుతో పదేళ్ల క్రితం నుంచి చేపట్టిన నీటి సంరక్షణ పనులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాయి. కొత్తచెరువుకు చెందిన నూర్మహమ్మద్, ఆయన కుమారుడు అజీజ్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని తమ 8 ఎకరాల తోటలో మామిడి సాగు చేస్తున్నారు. వాన నీటి సంరక్షణ చర్యల ద్వారా జలసిరులను ఒడిసిపడుతున్నారు. గత పదేళ్లుగా తమ పొలంలో కురిసిన ఒక్క చుక్కను కూడా బయటకు పోకుండా పూర్తిగా భూమిలోపలికి ఇంకింపజేస్తున్నారు. ఫలితంగా వీరి తోటలో నీటి కుంటల్లో పుష్కలంగా నీరు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మామిడి చెట్లు నిండైన పండ్ల కాపుతో కళకళలాడుతూ లాభాల సిరులు తెచ్చిపెడుతున్నాయి.అంతేకాదు, కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు 250 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అడవిలో కూడా తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో వీరి తోట బయట నీటి తొట్టిని ఏర్పాటు చేసి పశువులు, అటవీ జంతువుల దాహం తీర్చుతుండడం ప్రశంసనీయం. నూర్మహమ్మద్ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగంలో ఉండగానే పాతికేళ్ల క్రితం 8 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. కరువు తీవ్రమవుతున్న దశలో పదేళ్ల క్రితం నుంచి ముందుచూపుతో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టారు. తోట చుట్టూ 2 మీ. లోతు, 2 మీ. వెడల్పుతో కందకాలు తవ్వారు. తోట మధ్యలో నుంచి వెళ్తున్న వంకపై చెక్ డ్యాం నిర్మించారు. 40 మీటర్లకు ఒకచోట వాలుకు అడ్డంగా మట్టికట్టలు వేశారు. తోట నాలుగు వైపులా నాలుగు నీటి కుంటలు తవ్వించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క చుక్క నీరు కూడా బయటకుపోకుండా నేలలో ఇంకిపోయేలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎండాకాలంలో సైతం చెక్డ్యామ్ వద్ద నీరు నిల్వ ఉండటం విశేషం. మామిడి తోట ఎలాంటి పరిస్థితుల్లోనూ దెబ్బ తినకుండా నీటి భద్రత నెలకొంది. రెండు బోర్లలోనూ నీళ్లు పుష్కలంగా ఉండటం వలన డ్రిప్ కూడా లేకుండా చెట్టు పాది నిండా నీళ్లు పెడుతున్నారు. 25 సంవత్సరాల వయస్సుగల చెట్టుకు 40 నుంచి 50 కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. దీంతోపాటు, కుమారుడు అజీజ్ సహాయంతో వర్మీ కంపోస్ట్(ఎర్రల ఎరువు)ను తోటలోనే తయారు చేసి వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నివారణ కోసం పుల్లని మజ్జిగను చెట్టు మొత్తం తడిసే విధంగా పిచ్చికారీ చేస్తున్నారు. 8 ఎకరాలలో సంవత్సరానికి ఖర్చులు పోను రూ. 10 లక్షల వరకు నికరాదాయం వస్తోందని నూర్మహ్మద్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం, పుష్కలంగా నీటి తడులు ఇవ్వటం వల్ల కాయలు బాగా పెద్దవిగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని తెలిపారు. ‘తలమార్పిడి’తో చెట్లకు పునరుజ్జీవం! కాత రాని, పనికిరాని చెట్లను 3 మీటర్ల ఎత్తున కోసి.. మల్లిక, బాదుషా వంటి మేలు జాతి మొక్కలను అంటు కట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఒక చెట్టుకు 10–15 వరకు అంట్లు కడుతున్నాం. ఇలా ‘తలమార్పిడి’తో అంటుకట్టిన చెట్లు మూడేళ్లలోనే పూర్తిస్థాయి కాపును ఇస్తున్నాయి. ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు మాత్రమే వాడుతున్నాం. రసాయనిక ఎరువులు ఎన్నడూ వాడలేదు. కాయ మంచి సైజు వస్తున్నది. ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ. 10 లక్షల నికరాదాయం వస్తున్నది. – నూర్మహ్మద్ (94409 83644), కొత్తచెరువు, అనంతపురం జిల్లా కుమారుడు అజీజ్తో నూర్మహమ్మద్ – కడప గంగిరెడ్డి, సాక్షి, బుక్కపట్నం, అనంతపురం జిల్లా -
మారకపోతే... పావు వంతు ఎడారే!
భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే చాలు... పావు వంతు నేల బతికేందుకు వీల్లేని రీతిలో ఎడారిగా మారిపోవడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేనా. దీనివల్ల వ్యవసాయం దెబ్బతినడమే కాదు... జీవవైవిధ్యం అంతరించిపోయి, మరిన్ని కరువుకాటకాలు, కార్చిచ్చులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాలన్నీ గతంలో విన్నవే అయినప్పటికీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇంకోసారి ఈ విపరిణామాలను ధ్రువీకరించింది కాబట్టి ప్రాధాన్యమేర్పడింది. నేచర్ క్లయిమేట్ ఛేంజ్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం... ప్రపంచ వాతావరణ భవిష్యత్తుకు సంబంధించి అందుబాటులో ఉన్న 27 కంప్యూటర్ నమూనాల విశ్లేషణ ద్వారా తుది అంచనాకు వచ్చారు. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువులను తగ్గించకపోతే 2052 – 70 మధ్య కాలానికే సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువవుతుందని వారు హెచ్చరించారు. ఆస్ట్రేలియాలోని దక్షిణ భాగం, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్య అమెరికా ప్రాంతాల్లో ఈ ఎడారీకరణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దాదాపు 150 కోట్ల మంది ప్రభావితమవుతారని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త మనోజ్ జోషీ తెలిపారు. అయితే ప్యారిస్ ఒప్పందంలో నిర్ణయించిన మాదిరిగా సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయగలిగితే మాత్రం ఈ ప్రమాదాన్ని దాదాపుగా పరిహరించవచ్చునని వివరించారు. -
అటకామా ఎడారిలో హెచ్ఐవీకి మందు!
లండన్: భూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన ప్రదేశాల్లో చిలీలోని అటకామా ఎడారి ఒకటి. ఎయిడ్స్ చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను ఈ ఎడారి ప్రాంతంలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన ఎడారి మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయి. మన పర్యావరణ వ్యవస్థలో యాక్టినోబ్యాక్టీరియా జాతి చాలా ప్రధానమైందని, ఇది జీవక్రియా మిశ్రమాల గని అని బ్రిటన్లోని న్యూకాస్టిల్ వర్సిటీ∙పరిశోధకులు గుడ్ఫెల్లో చెప్పారు. హెచ్ఐవీ వైరస్ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్ను నిరోధించడంలో బ్యాక్టీరియాలోని చిన్నభాగమైనా సహకరిస్తుందని.. దీంతో ఔషధాలను కనుగొనడంలో ఉపయోగపడుతుందని అన్నారు. -
ఎడారి చేస్తున్నారు
-
ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీమ ఎడారి
బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు కపిలేశ్వరయ్య పత్తికొండ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాయలసీమ ఎడారిగా మారుతుందని బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు కపిలేశ్వరయ్య చెప్పారు. ఇప్పటికైనా సర్కారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వారానికి ఒకసారి నీళ్లు సరఫరా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రిజర్యాయర్ల నుంచి వంద చెరువులకు నీళ్లు ఇస్తామన్న నేతలు ఇంతవరకు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆనావృష్టితో పంటలు పూర్తిగా ఎండి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. మిర్చిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లాల్లో తాగునీరు, గ్రాసం సమస్యలతో పాటు చెరువులకు నీరు సరాఫరాపై కొత్త కలెక్టరు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న ఆనాలోచిత నిర్ణయాలతో కర్నూలు జిల్లాకు సాగు, తాగునీరు అందడం లేదన్నారు. దీనిపై సీమప్రజలు స్పందించాలన్నారు.గ్రామ స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్బాబు, జిల్లా ఇన్చార్్జ అంబటి రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి పెరవలి రంగస్వామిగౌడు, జిల్లా ఉపా«ధ్యక్షుడు దండి మల్లికార్జున, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూనా మల్లికార్జున, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. -
తుంగఛిద్రం!
బింగిరాళ్లకు రెక్కలు - హద్దులు దాటుతున్న విలువైన ఖనిజం - బాల కార్మికులతో సేకరణ - నదీ తీరంలో టీడీపీ నేత పాగా - ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారం - చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు తుంగభద్ర ఎడారిగా మారుతోంది. నదీ తీరంలో కోట్లాది రూపాయల విలువైన బింగిరాళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అధికార పార్టీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా నేత కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. ఐదేళ్లుగా అడిగే నాథుడే లేకపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక టీడీపీ నేత అండతో పాటు అధికారుల చేతులు తడుస్తుండటంతో ఎవ్వరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): జిల్లా మీదుగా ప్రవహిస్తున్న తుంగభద్ర తీరంలోని బింగిరాళ్లకు(పెబ్బెల్ క్వార్ట్ ్జ) రెక్కలొచ్చాయి. ఎలాంటి ఉపయోగం లేని విధంగా కనిపించే ఈ రాళ్ల ధర టన్ను రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. నదీ తీరంలో వందల ఎకరాల్లో విస్తరించిన ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వరద ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఈ రాళ్లు వేగంగా వచ్చే నీటిని నిలువరించే వీలుంటుంది. తద్వారా భూగర్భ జలాల పెంపునకు ఈ రాళ్లు దోహదం చేస్తాయి. ఇంతటి విలువైన రాళ్లను అక్రమార్కులు సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వందలాది మంది కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.120 చెల్లిస్తూ ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. కూలీలు సేకరించిన రాళ్లను 10-20 ఎంఎం, 20-30, 30-40 ఎంఎం.. ఇలా వంద వరకు సైజుల్లో నదీ తీరంలోనే విభజించి ఓ ప్రముఖ ప్రయివేట్ పాఠశాల వద్దకు రాత్రిళ్లు ఆటోల్లో తరలించి డంప్ చేస్తున్నారు. అక్కడ రాళ్లను సంచుల్లో నింపి బెంగళూరు, హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, అమరావతితో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కోట్లు కురిపిస్తున్న ఖనిజం ఒక్క పంచలింగాల ప్రాంతంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి ఈ రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూలీలు ప్రతి రోజూ 40 టన్నుల రాళ్లు సేకరించి లారీల ద్వారా హద్దులు దాటిస్తున్నారు. ఇటీవల నల్గొండతో పాటు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో ఖనిజానికి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో లారీలో 40 టన్నుల వరకు తరలించే అవకాశం ఉండటంతో.. టన్ను రూ.3వేలు చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క లోడుతో రూ.1.20 లక్షలు ఆక్రమార్కుల జేబుకు చేరుతోంది. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారాన్ని పరిశీలిస్తే కోట్లాది రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సాగిస్తున్న ఈ వ్యవహారంలో బాల కార్మికులను కూలీలుగా మార్చడం గమనార్హం. బహిరంగమే.. నోరు మెదపరు నగరానికి కూతవేటు దూరంలోని నదీ తీరంలో రాళ్ల తరలింపు నిత్యకృత్యమే అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతి లేకుండా నది వద్దే రాళ్లను గ్రేడింగ్ చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గనుల శాఖలోని ఓ అధికారితో పాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సదరు వ్యాపారి లారీకి రూ.2వేల చొప్పున మామూళ్ల రూపంలో ముట్టజెబుతుండటం వల్లే వ్యవహారం సాఫీగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. బింగిరాళ్ల ఉపయోగం - మంచినీటిని శుద్ధి చేసే ట్యాంకుల్లో.. - వాటర్ ప్యూరిఫయర్లలో.. - రహదారులు, హోటళ్లు, విలాసవంతమైన ఇళ్లకు అలంకరణ. మా దృష్టికి రాలేదు తుంగభద్ర నుంచి పెబ్బెల్క్వార్ట్ ్జను అక్రమంగా తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - వెంకటరెడ్డి, భూగర్భ గనుల శాఖ -
ఎడారిని ఓడించారు
-
ఎడారిలో మంచు కురిసింది!
గల్ఫ్ దేశాలు అంటే ఎవరికై నా ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి ఎడారులే. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడి ఎడారులన్నీ తెల్లటి మంచుతో మెరిసిపోతున్నాయి. జనం ఏసీలు వేసుకోడానికి బదులు రూం హీటర్లు పెట్టుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్తే ఎప్పుడూ లేనట్లుగా స్వెటర్లు, మఫ్లర్లు లాంటి దుస్తులతో వెళ్లాల్సి వస్తోంది. ఆరు బయట కురుస్తున్న మంచుతో అమెరికా లాంటి దేశాల్లో కనబడే ’’స్నోమాన్’’ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు -3 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోయాయి. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఇక్కడ అక్టోబర్ వరకు ఓ మాదిరి వర్షపాతం ఉంటుంది. కానీ ఇప్పటికీ అక్కడ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ శీతాకాలంలో ఇంత పెద్ద ఎత్తున మంచు పడటం ఉండదు. దాంతో ఇప్పుడు కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీ అరేబియన్లు, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్నోమాన్ బొమ్మలు చేసి వాటితో సెల్ఫీలు దిగుతున్నారు. -
తీరం.. శోకం!
ఎడారిని తలపిస్తున్న తుంగభద్ర – ఎత్తిపోతల పథకాలలకు నీరందక అన్నదాత అవస్థలు – పంట పొట్ట దశలో తీవ్రమైన నీటి ఎద్దడి – నీరు ఇవ్వాలని కోరినా స్పందించని ప్రభుత్వం – నదీ తీరంలో ఎండుతున్న పంటలు – సుమారు రూ.150 కోట్ల పంట నష్టపోయే ప్రమాదం కర్నూలు సిటీ/నందవరం: వరుస కరువు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం నేపథ్యంలో తుంగభద్ర నదీ తీరంలో సాగు చేసిన పంటల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలతో ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసిన పంట చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా వరి, మిరప పైర్లు సాగు చేసిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు నెల రోజులుగా నదిలో నీటి ప్రవాహం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. అయితే నదికి నీటిని విడుదల చేయించే విషయంలో అధికార పార్టీ నేతలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారంలోపు నీరివ్వకపోతే పంట ప్రశ్నార్థకం జిల్లాలో 88 ఎత్తిపోతల పథకాలు.. తుంగభద్ర నదీ తీరంలో మొత్తం 20 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 25వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో పాటు మరో 30వేల ఎకరాల ఆయకట్టు నది నీటి ద్వారా సాగవుతోంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడం వల్ల నది ఎడారిని తలపిస్తుంది. అధిక శాతం వరి, మిరప, చెరుకు, పత్తి, మొక్క జొన్న పంటలు సాగు చేశారు. ఈ పంటల సాగుకు ఎకరాకు రూ.20 వేలు నుండి రూ.30 వేలు వరకు పంటను బట్టి పెట్టుబడి పెట్టారు. ప్రస్థుతం వరి పంట కంకి దశలో ఉంది. ఈ దశలో నీరందకపోతే పంట దిగుబడి ప్రశ్నార్థకం అవుతుంది. మిగతా పంటల పరిస్థితీ అంతే. నదికి వారంలోపు నీరు రాకపోతే సుమారు రూ.150 కోట్ల రూపాయల పెట్టుబడులు గంగలో కలిసినట్లే. కేసీ వాటాగా ఉన్న 1.55 టీఎంసీల నీరు నదికి విడుదల చేయాలని జల వనరుల శాఖ ఇంజినీర్లు ఉన్నతాధికారులను ప్రాధేయపడుతున్నా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. పైరు కంకి దశలో ఉంది తుంగభద్ర నది నీటిపై ఆధారపడి 15 ఎకరాల్లో వరి పంట సాగు చేసినా. అప్పు చేసి నది నుండి ప్రత్యేకంగా పొలం వరకు పైపులైను వేసుకున్నా. ఇందులో 7 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి.. సొంతంగా మరో 8 ఎకరాల్లో వరి పంట వేసినా. పంట సాగుకు కౌలు కింద ఎకరాకు రూ.40 వేలు, సొంత పొలం కింద ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఖర్చయింది. పంట కంకి దశలో ఉంది. ఇప్పుడు నీరందిస్తేనే గింజ గట్టిపడుతుంది. నదిలో నీరు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది. – భీమారెడ్డి, రైతు, చిన్నకొత్తిలి పెట్టుబడులకు అప్పులు చేసినా నందవరం ఎత్తిపోతల పథకం కింద 12 ఎకరాల్లో పత్తిన సాగు చేసినా. ప్రస్తుతం నదిలో నీరు లేదు. చెలమలు తవ్వినా చుక్క నీరు కనిపించట్లేదు. ఈ పథకం కింద దెబ్బతిన్న పైపులైన్ను పట్టించుకునే వారే లేరు. రూ.1.50 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టినా. అయితే నీరందక పంట ఎండిపోతోంది. పైరుకు నీరందిస్తే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుంది. – నాగరాజు, రైతు, నందవరం టీబీ డ్యాం నుంచి నీరివ్వాలని కోరాం తుంగభద్ర డ్యాం నుంచి కేసీ వాటా నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఇటీవల విజయవాడ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాం. నీటి విడుదలపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఎస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ -
ఎడారి పండ్లు!
చుట్టూ ఎక్కడ చూసినా ఇసుక... ఎర్రటి ఎండలేగానీ.. మచ్చుకు పచ్చటి ఆకు కూడా కనిపించదు. నిన్నమొన్నటి వరకూ దక్షిణ ఆస్ట్రేలియాలోని పోర్ట్ అగస్టా సమీపంలోని ఎడారి ఇలాగే ఉండేది. మరిప్పుడు? అక్కడో పచ్చటి ఒయాసిస్సు వెలసింది! సూర్యుడి శక్తిని ఒడిసిపట్టుకుని... సముద్రపు నీటిని వాడుకుని పంట సిరులు కురిపిస్తోంది!. ఫొటోలో కనిపిస్తోందే... అదే సన్డ్రాప్ ఫార్మ్స్ కంపెనీ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ వ్యవసాయ క్షేత్రం! మట్టి మాత్రమే కాదు.. ఈ హైటెక్ పొలంలో వ్యవసాయం చేసేందుకు పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల వాడకమూ లేదు. క్రిమి, కీటకనాశినులు, ప్రమాదకరమైన రసాయన ఎరువులకూ ఫుల్స్టాప్ పెట్టేశారు. విశాలంగా పరచుకున్న 23 వేల సోలార్ ప్యానెళ్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే దాంతో పక్కనే ఉన్న సముద్రపు నీటిని మంచినీటిగా మార్చడం మాత్రమే. ఈ నీటితో పాటు గ్రీన్హౌస్లలోని కొబ్బరి పీచు, ఇతర సహజ పోషకాలతో పంటలు పండుతాయి. మిత్రపురుగుల సాయంతోనే పంటలకు చేటు తెచ్చే క్రిమి కీటకాలను నాశనం చేయడం మరో విశేషం. ఇంతకీ ఈ ఇరవై హెక్టార్ల సోలార్ వ్యవసాయ క్షేత్రంలో ఏం పండుతాయో... దిగుబడి ఎంతో తెలుసా? ప్రస్తుతానికి ఇక్కడ టమోటాలను మాత్రమే పండిస్తున్నారు. ఏడాదికి 18 వేల టన్నులు.. ఇంకోలా చెప్పాలంటే రోజుకు 50 టన్నుల దిగుబడి వస్తోంది. త్వరలోనే తాము క్యాప్సికమ్, కీర వంటి పంటలూ పండిస్తామని, అమెరికా, యూరప్లలోనూ ఎడారి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తామని అంటోంది సన్డ్రాప్స్ ఫార్మ్స్! -
మేల్కొనకపోతే సీమ ఎడారే
– రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఎమ్మిగనూరు: కోస్తాంధ్రపై వ్యామోహంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందరూ మేల్కొనకపోతే సీమ ఎడారిగా మారే ప్రమాదముందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరతరామిరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మిగనూరు కుర్ణి కల్యాణ మండపంలో, హŸళగుందలోని సినిమా టాకీస్ యజమాని వేణుగోపాల్రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడారు. సాగునీటి విషయంలో రాయలసీమ జిల్లాలకు అనాదిగా నష్టం జరుగుతూనే ఉందన్నారు. పైభాగంలో ఉన్న రాయలసీమకు కాకుండా కింది ప్రాంతంలో ఉన్న కోస్తాంధ్రకు సాగునీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. స్థిరీకరించిన సాగునీటి ప్రాజెక్టులన్నీ దిగువ ప్రాంతంలో కడుతున్నారని విమర్శించారు. తుంగభద్ర నదిపై మేళిగనూరు, ఆర్డీఎస్ రైట్ కెనాల్, గుండ్రేవుల ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్నారు. తుంగభద్ర డ్యాంలో వాటాను 26 టీఎంసీల నుంచి 16కు తగ్గించినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వాటా నీటి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం రాయలసీమ వాసులు ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న ఆదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నాకు ఎల్లెల్సీ రైతులు తరలి రావాలన్నారు. పులికనుమ ప్రాజెక్టు పూర్తికోసం భవిష్యత్తులో పాదయాత్ర చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామనీ ఆయన తెలిపారు. సదస్సులో టీబీ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, ఎల్లెల్సీ డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి, ఐరన్గల్ శ్రీనివాసరెడ్డి, కామినేని వేణుగోపాల్రెడ్డి, ఆది నారాయణరెడ్డి, విరుపాక్షప్ప తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ల చుట్టూ ఆయకట్టు.. ఎకరం పారితే ఒట్టు!
లింగాలఘణపురం రైతుల ఆర్తనాదాలు వినేవారే కరువు ఏళ్లుగా సా..గుతున్న భూసేకరణ ప్రక్రియ వర్షాకాలంలోనూ మండల ప్రజలకు తప్పని తాగునీటి తిప్పలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరిక లింగాలఘణపురం మండలంలో గత నాలుగేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతం ఎడారిగా మారొచ్చు. అక్కడ భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయాయి. వర్షాకాలంలోనూ తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు.ఇది సాక్షాత్తూ కేంద్ర జల వనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైన నిప్పులాంటి నిజం. ఇటువంటి కరువు పీడిత ప్రాంతాల గురించి ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది. అయినా ఏం లాభం? కరువు నివారణ చర్యలు మచ్చుకు కూడా కానరావడం లేదు. మండలం పరిధిలో పేరుకు నాలుగు రిజర్వాయర్లు ఉన్నా.. నేటికీ చుక్క సాగునీరూ అందడం లేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ కారణంగా ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెంతనే రిజర్వాయర్లు ఉన్నా.. ఫలితం సున్నా అన్న చందంగా తయారైంది ఆయకట్టు రైతుల పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. – లింగాలఘణపురం లింగాలఘణపురం మండలం స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లోని నాలుగు రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు కలిగి ఉంది. నామమాత్రంగా నాలుగు జలాశయాలు(రిజర్వాయర్లు) ఉన్నాయి. వాటితో స్థానిక రైతులకు ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదు. రిజర్వాయర్లకు సంబంధించిన ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణం కోసం భూములను సమీకరించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీన్ని వేగవంతం చేయాలంటే సంబంధిత అధికారులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మండల కేంద్రంలో ప్రజలు తాగునీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. వర్షాకాలంలోనూ ట్యాంకర్లతో నీటిని కొనుక్కుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అశ్వారావుపల్లి రిజర్వాయర్ పరిధిలో.. మండలంలోని నవాబుపేట, అశ్వారావుపల్లి, ఆర్ఎస్ ఘన్పూర్, చీటకోడూరు రిజర్వాయర్ల పరిధిలో సుమారు 24,500 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 0.73 టీఎంసీ సామర్థ్యం కలిగిన అశ్వారావుపల్లి రిజర్వాయర్ పరిధిలో లింగాల ఘణపురం, కళ్లెం, నాగారం, నెల్లుట్ల, జీడికల్, సిరిపురం గ్రామాల్లో 11,400 ఎకరాల ఆయకట్టు ఉంది. 35 కిలోమీటర్ల ప్రధాన కాల్వతో నల్గొండ జిల్లా ఆలేరు వరకు ఆయకట్టు విస్తరించి ఉంది. అశ్వారావుపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి పదేళ్లు గడిచినా ప్రధాన కాల్వల నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. జనగామలో రైల్వే ట్రాక్, యశ్వంతాపూర్ వాగు, జనగామ పట్టణంలోని ప్లాట్ల మధ్య పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రధాన కాల్వ నిర్మాణ పనులు పడకేశాయి. వెరసి సాగునీటితో పంటలు పండించుకోవాలనే ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ ఎన్నడో పూర్తయినా.. ఎన్నడో పూర్తయిన ఆర్ఎస్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి 9ఎల్, 10ఎల్, 8ఎల్లో కొంతభాగం కుందారం, చీటూరు, నేలపోగుల గ్రామాల్లో 5,424 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. 214 ఎకరాల భూసేకరణలో ఇప్పటివరకు 14 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా భూసేకరణ జరుగుతూనే ఉంది. జనగామ పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన చీటకోడూరు రిజర్వాయర్ నుంచి పటేల్గూడెం, కళ్లెం గ్రామాల్లోని కొంత ఆయకట్టు ఉండగా, అత్యంత ఎక్కువ ఆయకట్టు నవాబుపేట రిజర్వాయర్కు ఉంది. 2009 సంవత్సరంలో రూ.262 కోట్లతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దీనికి శంకుస్థాపన చేశారు. 0.47 టీఎంసీ సామర్థ్యంతో లింగాల ఘణపురం, దేవరుప్పుల, నల్గొండ జిల్లా ఆలేరు, గుండాల మండలాల్లో 53,444 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ఈ రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. 2891 ఎకరాల భూసేకరణలో భాగంగా ఇప్పటిదాకా 2000 ఎకరాలను సేకరించి పనులు చేపట్టారు. మరో 800 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనికి లింగాలఘణపురం మండలంలోని వడిచర్ల, కొత్తపల్లి, నేలపోగుల, నవాబుపేట, వనపర్తి, గుమ్మడవెల్లి, లింగాలఘణపురం గ్రామాల్లో 7,583 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో ఏ ఒక్క రిజర్వాయర్ నుంచి కూడా కనీసం ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. ఏం చేయాలంటే.. ఎడారిగా మారే ప్రతికూల పరిస్థితులతో పోరాడుతున్న లింగాల ఘణపురం మండలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులపై ఉంది. వర్షాకాలంలోనూ నీళ్లు కొనాల్సిన దుస్థితి ఇకపై రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా అశ్వారావుపల్లి రిజర్వాయర్ ప్రధాన కాల్వ పనులను వేగవంతం చేయాలి. ఆ పనులను జనగామ రైల్వే ట్రాక్, యశ్వంతాపూర్ వాగు, జనగామ పట్టణంలోని ప్లాట్ల మీదుగా నల్గొండ జిల్లా సూర్యాపేట రోడ్డు వరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే రాజయ్య, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషిచేయాలి. చీటకోడూరు రిజర్వాయర్ నుంచి జలాలు మండలానికి చేరాలంటే పెంబర్తి, నాగారంలోని కాల్వల ద్వారా పారాల్సి ఉంది. జనగామ పట్టణానికి తాగునీరు అందించే లక్ష్యంతో చీటకోడూరు రిజర్వాయర్ను ఏర్పాటు చేయగా , అక్కడ అవసరానికి మించి నీరు చేరితే తప్ప పెంబర్తి, నాగారం మీదుగా మండల కేంద్రానికి జలాలు చేరే అవకాశం లేదు. -
ఎడారిలో చీతాతో చిన్నోడు..
పెంపుడు జంతువులు పసిపిల్లలకు దగ్గర కావడం...పరస్పరం ప్రాణ స్నేహితుల్లా సన్నిహితంగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ చిచ్చరపిడుగు ఎడారి లో చిరుతతో చెలగాటాలాడాడు. .. సరదాగా నవ్వుతూ.. ఏదో ఓ బుజ్జి పప్పీతో ఆడుకుంటున్నంత ఈజీగా గేమ్స్ ఆడుకున్నాడు. నమ్మ బుద్ధికాకపోయినా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుర్తు తెలియని ప్రదేశంలో ఎడారినేలలో చిత్రీకరించిన ఈ వీడియోలో ఒకరినొకరు వెంటాడుకుంటూ...బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మెలగడం పలువురిని ఆకట్టుకుంటోంది. అమితమైన చిరుతపులి వేగాన్ని చూసిన పిల్లవాడి తండ్రి భయపడి చటుక్కున ఆ అబ్బాయిని చేతుల్లోకి తీసుకోగా... ఈ బుడతడు నవ్వులు చిందిస్తూ దాన్ని వాటేసుకున్న ఆ అద్భుతమైన వీడియో మీకోసం... కాగా భూమి మీద వేగంగా పరుగెట్టే జంతువుల్లో చిరుతపులి ఒకటి, గంటలకు 75 కి.మీ వేగంతో దూసుకు పోవడం చీతా ప్రత్యేకత. పురాతన ఈజిప్షియన్లకు చిరుతపులి మంచి పెంపుడు జంతువుగా ఉండేది. -
ఎడారుల్లో కల్పవృక్షం
తిండి గోల ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఇతమిత్థంగా తెలియదు కానీ, ప్రాచీన కాలం నుంచే ఖర్జూర పండ్లను ఆహారంగా వినియోగిస్తున్నాం. రంగు, రుచి, ఆకారాలని బట్టి వీటిలో చాలా రకాలున్నాయి. కొలరాడో నదీతీరాన ముదురు రంగులో, నున్నగా ఉండే మెడ్జూల్ రకానికి చెందిన డేట్స్కి కింగ్ ఆఫ్ డేట్స్ అని పేరు. తరువాతి స్థానం గుండ్రంగా, మృదువుగా, తియ్యగా ఉండే బార్హీ రకానిది. దీన్ని హనీబాల్ అంటారు. ఇంకా అచ్చం తేనెలా ఉండే హనీ, నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే బ్లాక్ డేట్స్, బంగారు రంగులో ఉండే గోల్డెన్ ప్రిన్సెస్... ఇలా ఎన్నో రకాలున్నాయి. వేసవిలో ఎండు ఖర్జూరం వేసిన నీళ్లు తాగిస్తే పిల్లలకు మంచిది. స్వీట్లు, పుడ్డింగులు, కేకులు, డెజర్టుల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే. రమ్జాన్ ఉపవాస దీక్ష విరమణకు ముస్లిమ్లు ఖర్జూరానికే ప్రాధాన్యత ఇస్తారు. -
ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు
పరిపరి శోధన నిండా ముళ్లతో కనిపించే ఎడారి మొక్కలను ఏం చేసుకుంటాం అనుకుంటున్నారా? ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ఎడారి మొక్కల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయని, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే, మధుమేహం, స్థూలకాయం, గుండెజబ్బులు వంటి చాలారకాల వ్యాధులు దరిచేరవని న్యూయార్క్కు చెందిన న్యూట్రిషన్ నిపుణురాలు షాపిరో చెబుతున్నారు. ఎడారి మొక్కల పైభాగంలో కనిపించే ముళ్లతో నిండే తొక్కలను తొలగించి, గుజ్జుతో నిండిన భాగాన్ని జ్యూస్, జామ్, సలాడ్ వంటి వంటకాల తయారీలో భేషుగ్గా ఉపయోగించుకోవచ్చని ఆమె అంటున్నారు. -
మా దాహం తీర్చండి మహాప్రభో!
లాతూర్(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని మాసుర్ది, లాతూరులో భయంకరమైన కరువు సంభవించింది. త్రాగునీరు దొరకపోవడంతో అక్కడి గ్రామాల్లోని జనం అల్లాడిపోతున్నారు. కరువు కారణంగా పంట పోలాలు, కాలువలు, చెరువుల్లో నీరు ఎండిపోయి బీటలు వారిపోతున్నాయి. 20 కిలోమీటర్లు వెళ్తేనేగానీ త్రాగునీరు దొరకని పరిస్థితి నెలకొనడంతో లాతూరులో నివసించే జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కొరత కారణంగా కొన్నిచోట్ల మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అంతేకాక నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు రైళ్ల ద్వారా మంచినీరును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి ప్రజలు తమకు సాధ్యమైనంత తొందరగా త్రాగునీటిని సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు వాటర్ ట్యాంకర్లతో త్రాగునీటిని కరువు ప్రాంతాల్లో అందించే చర్యలు తీసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక్కరోజు వాటర్ ట్యాంకర్ రాకపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వాటర్ ట్యాంక్ రాకపోతే నీటిని అప్పుగా తీసుకునైనా సరే తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. లాతూరుకు వాటర్ ట్యాంకర్ రాగానే అక్కడి జనమంతా బారులు తీరి నీళ్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ఈ వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడిన గ్రామస్తులు నీరు తెచ్చే దాకా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ట్యాంకర్లు రాకపోతే చేసేది ఏమిలేక కొన్ని మైళ్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైన కరువు దాపరించడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో కొందరు గ్రామస్తులు ఊరు వదిలిపోతున్నారు. -
ఎడారికి పయనమైన చిన్నారి ముహమ్మద్
కన్న కొడుకులకన్నా మిన్నగా ప్రేమించి, ఆదరించి, చిన్నారి ముహమ్మద్ (స) మనోగాయాన్ని మాన్పడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేశారు. చిన్నారి ముహమ్మద్ విషయంలో ఆయన సంతానాన్ని కూడా లెక్క చేసేవారుకాదు. ఎటు వెళ్తే అటు వెంట తీసుకెళ్లేవారు. సుమారు పన్నెండేళ్ల వయసులో చిన్నారి ముహమ్మద్ (స) తోటిపిల్లలతో కలిసి మేకలు కాయడానికి అడవికి వెళ్లేవారు. ఆ కాలంలో అరేబియాలో మేకలు కాయడం పిల్లల శిక్షణలో ఒక భాగమే తప్ప, అదేమీ అవమానకర విషయం కాదు. గొప్ప వంశం పిల్లలు కూడా తప్పకుండా ఈ శిక్షణ పొందేవారు. ఈ క్రమంలోనే ఒకసారి అబూతాలిబ్ వ్యాపార నిమిత్తం సిరియా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దూరతీరాల ప్రయాణం, పైగా కష్టనష్టాలతో కూడుకున్నది కావడం వల్ల చిన్నారి ముహమ్మద్ను వెంట తీసుకువెళ్లడం ఆయనకు ఇష్టం లేకపోయింది. కాని చిన్నారి ముహమ్మద్ (స) మాత్రం బాబాయిని వదిలి ఉండడానికి సిద్ధంగా లేరు. తీరా బయలుదేరుతున్న సమయంలో వచ్చి కాళ్లను చుట్టేశాడు. నిజానికి ఆయనకు కూడా అబ్బాయిని విడిచిపెట్టి వెళ్లాలని లేదు. ప్రయాణ మార్గం చాలా కఠినతరమైంది కావడం, సుదూరప్రయాణం కావడం వల్ల ఇంటి దగ్గరే వదిలేసి వెళదామనుకున్నారు. కాని చిన్నారి ముహమ్మద్ (స) మారాం చూసిన తరువాత, ఒంటరిగా వెళ్లడానికి మనస్కరించలేదు. ఆయన్ని వెంటబెట్టుకొనే సిరియా పయనమయ్యారు అబూతాలిబ్. మక్కా నుండి బయలుదేరిన ఈ వర్తక బిడారం అనేక ప్రాంతాలు, పట్టణాలు దాటుకుంటూ, దుర్భరమార్గాలగుండా ప్రయాణం కొనసాగిస్తోంది. చిన్నారి ముహమ్మద్ ప్రయాణంలోని కష్టనష్టాల కారణంగా, అలసటకు గురై తనకు భారమౌతారేమోనని భావించారు అబూతాలిబ్. కాని ఏమాత్రం అలసిపోకుండా, ఎంతో ఉత్సాహంతో ప్రయాణంలోని ఇతర వృద్ధులు, బలహీనులకు కూడా సహకరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విధంగా ఈ వ్యాపారబృందం సిరియా సరిహద్దుల్లోకి ప్రవేశించి, ముఖ్యపట్టణం బస్రాలో విడిది చేసింది. సమీపంలో ఓ చర్చీ ఉండేది. చుట్టుపక్కల ప్రజలకు అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. ‘బహీరా’ అనే పేరుగల ఓ ప్రఖ్యాత క్రైస్తవ పండితుడు ఉండేవాడు. బైబిల్ జ్ఞానంతో పాటు, తౌరాత్ను కూడా ఔపోసన పట్టిన మహా పండితుడు. దైవప్రోక్తగ్రంథాల అధ్యయనం, సునిశిత పరిశీలనా దృష్టి, అపారమైన ధార్మిక పరిజ్ఞానం వల్ల భవిష్యత్తులో జరగబోయే విషయాల అవగాహన కూడా ఉందతనికి. బాహీరా చర్చీకి దగ్గరలోనే అబూతాలిబ్ విడిది చేయడం వల్ల అతడి దృష్టి చిన్నారి ముహమ్మద్ (స)పై పడింది. - యం.డి. ఉస్మాన్ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
‘ఎడారిలో ఒయాసిస్ బాలోత్సవ్’
పారంభోత్సవ సభలో ప్రొఫెసర్ కోదండరాం తొలిరోజు 9 రాష్ట్రాల నుంచి 9 వేలమంది చిన్నారులు కొత్తగూడెం(ఖమ్మం): ‘చిన్నారులు ఆడుకుందామంటే సరైన ఆటస్థలాలు లేవు.. చదువుకుందామంటే పుస్తకాలు సక్రమంగా లేవు.. ఇలాంటి పరిస్థితిలో చిన్నారులలో ఉన్న అభిరుచిని వెలికితీసేందుకు ఈ జాతీయస్థాయి బాలోత్సవ్ ఎడారిలో ఒయాసిస్లా పనిచేస్తుంది.’ అని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎ.కోదండరాం అన్నారు. 24వ అంతర్బాలల సాంసృ్కతిక ఉత్సవాలు (జాతీయస్థాయి బాలోత్సవ్ - 2015) ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఖమ్మం పట్టణానికి చెందిన బాలమేధావి ఎస్.కె.సాధిక్పాషా బెలూన్లు ఎగురవేసి ప్రారంభించాడు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా చదివే పరిస్థితులు లేవన్నారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుందని, దానిని ప్రొత్సహిస్తే వారిలో ఉన్న ప్రతిభ, వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. గతంలో కొత్తగూడెం పట్టణం అంటే తనకు కేవలం బొగ్గు మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంతమంది చిన్నారులను చూసి మరోకోణం నేర్చుకున్నానని తెలిపారు. దాదాపు పాతికేళ్లుగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమాన్ని మరో వందేళ్లపాటు కొనసాగించాలన్నారు. పిల్లలు పెద్దలై.. పెద్దలకు నేర్పే విషయాలను ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలన్నారు. వచ్చే ఏడాది కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని తెలిపారు. బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్బాబు మాట్లాడుతూ 24 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వందల మంది తనకు తోడ్పాటునందించారన్నారు. బాలల కోసం ఏదైనా చేయాలనే తపనతో తాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖకవి అంద్శై కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాథ్, డీఎస్పీ సురేందర్రావు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. తొలిరోజు 16 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన పాఠశాలల నుంచి సుమారు తొమ్మిదివేల మంది బాలబాలికలు హాజరయ్యారు. -
తాలిబన్గా తయారవుతాడేమోనని భయపడి..
హెలెనా(అమెరికా): ఓ శిక్షణ కార్యక్రమం వచ్చి అఫ్గనిస్థాన్ సైనికాధికారిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఏ శిక్షణ కోసమైతే అతడు వచ్చాడో దానికి హాజరుకాకుండా ఆ బాధ్యతలను వదిలేసి తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఓ రైలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్తాఫా టానిన్ అఫ్గనిస్థాన్లో లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అమెరికా, అఫ్గనిస్థాన్ దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా టెక్సాస్ లోని సాన్ అంటానియో వద్దగల లాక్లాండ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ప్రత్యేకంగా నిర్వర్తిస్తున్న బేసిక్ అమెరికన్ లాంగ్వేజ్ ఇన్ స్ట్రక్టర్ కోర్స్ చేసేందుకు మరికొందరు అఫ్గనిస్థాన్ సైనికులతో కలిసి వచ్చాడు. ఈ శిక్షణలో వారికి ఆంగ్లంపై పట్టు నేర్పుతారు. దానిని వారు నేర్చుకుని వారి దేశాల్లో మిగతా సైనికులకు చెప్పాల్సి ఉంటుంది. అలా శిక్షణ కోసం వచ్చిన టానిన్ ఎవరికీ చెప్పకుండానే గత నెల సెప్టెంబర్ 25న మధ్యలోనే ఆ కార్యక్రమంలో నుంచి తప్పించుకుని తిరిగి రాకుండా వెళ్లిపోయాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకు శిక్షణా సంస్థ అధికారులు తెలిపారు. దీంతో అతడికోసం తీవ్రంగా గాలింపులు జరిపిన పోలీసులు చివరికి మంగళవారం మోంటానా వద్ద ఓ రైలులో అరెస్టు చేశారు. అప్పటికే అనుమానంతో అమెరికా అధికారులు అతడి వీసాను కూడా రద్దు చేశారు. అఫ్గనిస్థాన్లోని సైనికులు ఒక్కోసారి తాలిబన్లకు అనుకూలంగా మారి దాడులకు పాల్పడే అవకాశం ఉందనే భయంతో అమెరికా అతడి విషయంలో వేగంగా స్పందించింది. -
'నీరు నిప్పు పెనవేసుకుంటే..'
దుబాయ్: పాలు నీళ్లు కలుస్తాయి. పెట్రోల్ కిరోసిన్ కూడా కలుస్తుంది. కానీ నీరు నిప్పు కలిసుంటాయా? అలా జరగడం సాధ్యమేనా? రెండు కలిసి ఒకే మార్గంలో ఒకదానిని ఒకటి పెనవేసుకొని నిరంతర ప్రయాణం సాగించడం జరుగుతుందా? అంటే ఈ విషయం తెలిశాక జరుగుతుందని నమ్మాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇలాంటి సంఘటన చూసేందుకు ఇప్పుడు దుబాయ్లోని ప్రజలంతా మలేహా రహదారి వెంట పరుగులు తీస్తున్నారు. ఆ మిరాకిల్ దృశ్యాన్ని చూసి కనులవిందు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఆ చిత్రాన్ని వీడియో తీస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందంటే.. మలేహా రహదారి పక్కనే ఉన్న ఓ ఏడారిలోని ఇసుక నుంచి నీళ్లు ధారగా వస్తుండగా దానితోపాటు అగ్ని కూడా పెనవేసుకొని వస్తోంది. అది కూడా సంక్రాంతి పండుగకు ముందు వేసుకునేంత భోగి మంటలంతటి స్థాయిలో వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ట్రెండ్ అవుతోంది. -
అయ్యో ‘శ్రీరామా..’!
►ఎడారిని తలపిస్తున్న ఎస్సారెస్పీ ► 8.26 టీఎంసీలకు పడిపోయిన నిల్వ ►ఇంత దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవంటున్న అధికారులు ►వర్షాల్లేక ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్కు చేరని నీరు ►ఉత్తర తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం ► ప్రశ్నార్థకంగా 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు ► తాగునీటి పథకాలపైనా ప్రభావం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతోంది! నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్లగొండకు సైతం సాగునీరు అందించే ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ 8.26 టీంఎసీలకు పడిపోయింది. ఎంతటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినా.. ప్రాజెక్ట్లో నీటి నిల్వ ఇంతలా తగ్గిపోయిన దాఖలాల్లేవు. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ సహా 11 ప్రాజెక్టులు వరద నీటికి అడ్డంకిగా మారాయి. ఎస్సారెస్పీపై ఆరు జిల్లాల్లో 17,85,605 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉండగా, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రక్షిత మంచినీటి పథకాలకు ఈ ప్రాజెక్ట్ నీరే ఆధారం. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్ట్ ఎడారిని తలపిస్తోంది. ప్రశ్నార్థకంలో ఆయకట్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరితే తెలంగాణలో 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రాజెక్ట్లో నీరు లేక పోతే ఆ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 1,60,578 ఎకరాలు, ఆదిలాబాద్లో 1,45,387, వరంగల్లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీరందుతోంది. అలాగే నిజామాబాద్లో 19 ఎత్తిపోతల పథకాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలకు నీరు ఉపయోగపడుతోంది. ఈ సంవత్సరం ఆయకట్టు పడావు పడనుండగా.. ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మారే ప్రమాదం నెలకొంది. పడిపోతున్న నిల్వ సామర్థ్యం ప్రాజెక్టులో పూడిక ఎక్కువగా పేరుకు పోయిందని సర్వేలు చెబుతున్నా.. ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. 1978లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాగానే సర్వే చేపట్టగా.. 112 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని తెలిపారు. 1994లో చేపట్టిన సర్వేలో నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. 2006లో సర్వే చేపట్టగా.. నీటి సామర్థ్యం 78 టీఎంసీలకు పడిపోయినట్లు వెల్లడైంది. అయితే ప్రాజెక్ట్ అధికారులు ఈ సర్వేను కొట్టి పారేశారు. 2013, 2014లో ఏపీఈఆర్ఎల్ సర్వే చేపట్టినా నివేదిక ఇంకా గుట్టుగానే ఉంది. ఈ నివేదిక వెల్లడైతే శ్రీరాంసాగర్లో ప్రాజెక్ట్ వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం, నీటి నిల్వల వివరాలు బట్టబయలు కానున్నాయి. తాగునీరూ కష్టమే.. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1,053.60 (8.26 టీఎంసీల) అడుగులే ఉంది. ఇటీవల రెండు రోజులు భారీగా వర్షాలు కురిసినా వరద నీరు 10-15 వేల క్యూసెక్కులను మించి రాలేదు. భవిష్యత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కింద ఆరు జిల్లాల్లో స్థిరీకరించిన 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్లో 5 టీఎంసీలు డెడ్స్టోరేజీకే సరిపోతోంది. ఎండ వల్ల ఆవిరి, లీకేజీలు కలుపుకుంటే ఏడాదికి 5 టీఎంసీలు పోతుంది. ప్రస్తుతం 8.26 టీఎంసీలే ఉండటంతో ఆ నీటితో ఆయకట్టుకు నీరందించడం కుదరదు. కనీసం తాగునీటి అవసరాలు కూడా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్పై ఆధారిత ప్రాజెక్ట్లు, ఆయకట్టు వివరాలు.. పథకం ఎకరాల్లో శ్రీరాంసాగర్ ఒకటో దశ 9,68,640 శ్రీరాంసాగర్ రెండో దశ 4,40,000 ఇందిరమ్మ వరద కాలువ 2,20,000 సదర్మట్ ఆనకట్ట 12,000 కడెం ప్రాజెక్ట్ 68,000 అలీసాగర్ ఎత్తిపోతలు ---- గుత్ప ఎత్తిపోతలు ---- హన్మంతరెడ్డి పథకం 11,600 నిజామాబాద్లోని 14 ఎత్తిపోతలు 34,948 ఆదిలాబాద్లోని 19 ఎత్తిపోతలు 30,417 మొత్తం 17,85,605 ఎస్సారెస్పీ నీటి నిల్వ సంవత్సరాల వారీగా.. (ప్రస్తుత సమయూనికి) సంవత్సరం నిల్వ(టీఎంసీల్లో) 2010 71.65 2011 57.72 2012 12.72 2103 90 2014 23.5 2015 8.26 -
ఎడారిగా గోదావరి
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. ప్రభుత్వం బోర్లు వేసిన ప్రాంతాల్లో మినహా మిగతా చోట నీటి చుక్క సైతం కనిపించడం లేదు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి అందుకు ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఇప్పటికే బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు పడరాని పాట్లు పడుతుండగా, పుష్కరాల నాటికి సమృద్ధిగా వర్షాలు పడకుంటే.. . పుష్కరస్నానాలకు మరిన్ని కష్టాలు తప్పవేమో మరి.. -
ఎడారిని తలపిస్తున్న గోదావరి
-
అద్భుతాలమయం మోషే జీవితం
అగ్నిగుండాన్ని తలపించే దుర్భరమైన సీనాయి ఎడారి వేడిమిలో అక్కడక్కడా కనిపించే పచ్చని పొదలే పశువులకు ఆహారం, కాస్త నయనానందకరం కూడా! అలాంటి ఒక పచ్చని పొదలో మంటలు లేవడం విచిత్రమనిపించి మోషే దాని వద్దకు వెళ్తే, అద్భుతంగా అందులో నుండి దైవస్వరం వినిపించింది. చారిత్రాత్మకమైన గొప్ప బాధ్యతను దేవుడక్కడ మోషేకిచ్చాడు. నాలుగొందల ఏళ్ల ఈజిప్టు బానిసత్వం నుండి యూదులను విడిపించి వాగ్దాన దేశమైన ఇజ్రాయెల్ దాకా నడిపించే బాధ్యత అది. నిజానికి మోషే జీవితం నిండా అద్భుతాలు, విచిత్రాలే! జన్మరీత్యా యూదుడైనా బద్ధశత్రువైన ఈజిప్టురాజు ఫరో సంరక్షణలో మోషే పెరగడం ఒక అద్భుతం. ఆదరించవలసిన సొంత ప్రజలైన యూదులే తరిమి కొట్టడం మరో విచిత్రం. అలా ప్రాణభయం, అవమాన భారంతో మిద్యానుగా పిలిచే సీనాయి ఎడారికి చేరి, ఫరో పెంపకపు వైభవాన్ని, సకలశాస్త్ర పాండిత్యాన్ని వీడి ఐగుప్తీయులు ఏవగించుకునే పశువుల కాపరి వృత్తి చేపట్టి మోషే తన మామగారి మందలు మేపుతూ నలభైఏళ్ల పాటు అనామకుడుగా బతకడం మరో విచిత్రం. పిదప మండే పొద ద్వారా పొందిన దైవ దర్శనానికి విధేయుడై యూదుల స్వేచ్ఛోద్యమానికి సారథ్యం చేసి ఆరు లక్షలమంది యూదులను దాస్యవిముక్తులను చేసి వాగ్దానదేశపు దారిలో ఒక మహారణ్యంలో నలభై ఏళ్లపాటు వారికి దేవుని విధి విధానాలు, క్రమశిక్షణ నేర్పించి ఆయన వారిని తిరుగులేని దేవుని జనాంగంగా తీర్చిదిద్దడం అద్భుతాల్లో కెల్లా మహాద్భుతం. అంతటి ఘనచరిత్రను కలిగే దేవునిలో నిశ్చలంగా ఉంటూ, మోషే మిక్కిలి సాత్వికుడు... నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటూ దేవుని చేతే కితాబు పొందడం అద్భుతం (సంఖ్యా 12:3, 7). తన నిరాడంబరత్వాన్ని, భక్తిని, సాత్వికత్వాన్ని, నమ్మకత్వాన్ని, నిబద్ధతను కాపాడుకున్న మోషే వంటివారు లోకంలో ఎందరున్నారు? దేవుని ఉనికి ఒకప్పుడు చరిత్రలో తత్వశాస్త్రం, తర్కశాస్త్రం పరిధిలోనిది. ఆధునిక శాస్త్ర విజ్ఞానయుగం దేవుణ్ణిప్పుడు ప్రయోగశాలల్లో నిలబెట్టి ఆయన్ను రుజువు చేసే విఫలయత్నం చేస్తోంది. ఆది సంభూతుడు, అనంత శక్తిసంపన్నుడు, సర్వానికి సృష్టికర్తయైన దేవున్ని నిన్న మొన్నే కళ్లు తెరిచ్చిన సైన్సు ఎలా రుజువు చేస్తుందన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే! మహాసముద్రపు నీటిని ముంతలతో కొలిచే ప్రయత్నమే! తన ఉనికిని చాటుకొని తనను తాను రుజువు చేసుకునే అవసరం దేవునికి లేదు. అయితే దేవుడున్నాడనడానికి, దేవుని అత్యున్నతమైన ప్రేమకు మోషే వంటి మహానాయకుల జీవితాలు, వారి విజయాలే నిదర్శనాలు. దేవునికి తలవంచిన వారి ముందు లోకం తలవంచుతుందన్నదే దేవుడు వారి జీవితాల ద్వారా చాటే అసమాన సందేశం. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
జాగృతం కాకపోతే కోలారు ఎడారే
మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ చెరువుల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగంపై పరిమితి లేకపోవడంతోనే అనర్థాలు కోలారు : నీటి వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో కోలారు జిల్లా ఎడారి కాక తప్పదని రాజస్తాన్కు చెందిన ప్రముఖ జలవనరుల నిపుణుడు, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ హెచ్చరించారు. జల నిర్వహణపై కోలారులోని చన్నయ్య రంగమందిరంలో శుక్రవారం నిర్వహించిన ఒక రో జు వర్కషాప్లో ఆయన ప్రసంగించారు. నీటి వినియోగంలో కోలారు జిల్లాలోని రైతులు, ప్ర జలు తగిన జాగ్రత్తలు పాటించడం లేదని, ఇది దుష్పరిమాణాలకు దారితీస్తుందని అన్నారు. తాను ఈ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మూడు అంశాలను ప్రధానంగా గుర్తించినట్లు తెలిపారు. అందులో నీటిని సక్రమంగా విని యోగం చేయకపోవడం, చెరువుల, రాజకాలువల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగం పై పరిమితి లేకపోవడం అని స్పష్టం చేశారు. ఈ మూడు కారణాల వల్ల కోలారు జిల్లాలో తీవ్ర నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడం, మలినమైన నీటిని శుద్ధీకరించే వరకూ కోలారు జిల్లాలో భూగర్భ జలాలను రీఛార్జ చేయడం సాధ్యపడదని వివరించారు. కోలారు జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ర్టంలోనే నీటి వినియోగంపై రైతులు దృష్టి నిలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్, లాభాలపై చూపుతున్న ఆసక్తి నీటిని పొదుపుగా వాడుకోవడంపై అన్నదాతలు కనబరచడం లేదని అన్నారు. రాజస్తాన్లో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తారని తెలిపారు. దీని వల్ల ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని అన్నారు. నీటి మూలాలను అన్వేషించడంతో పాటు సద్వినియోగం చేసుకోవడం, వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చునని సూచిం చారు. రాజస్తాన్లో సగటు వర్షపాతం 300 మి.మీ ఉండగా, కోలారులో 500 మి.మీ ఉందని తెలిపా రు. అయితే రాజస్తాన్లో తీసుకున్న జాగ్రత్తల వల్ల అక్కడి పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలు ఆ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చెక్డ్యాంలు, ఇంకు డు గుంతలు (వాటర్ హార్వస్టింగ్) విధానాన్ని ప్రతి చోటా అమలు చేయాలని అన్నారు. ఉద్యాన పంట లకు బిందు సేద్యం తప్పనిసరిగా చేయాలన్నారు. రాజస్తాన్ తాను పడ్డ కృషి వల్ల దాదాపు ఏడు నదులను రీజనరేట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంత మాత్రం లేదని, కేవలం ప్రజలు చేయడం వల్లనే సాధ్యమైం దని అన్నారు. కోలారులో కూడా ప్రజలు నీటి రక్ష ణ, మిత వాడకంపై దృష్టి సారించాలని అన్నారు. చెరువులు, రాజకాలువలలో ఆక్రమణల తొలగింపు ప్రభుత్వం బాధ్యత కాదని ప్రజలే ముందుండి ఆక్రమణలు తొలగిస్తే చెరువులకు నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కలెక్టర్ త్రిలోక్చంద్ర, జెడ్పీ చైర్పర్సన్ రత్నమ్మ నంజేగౌడ, సీఈఓ పనాలీ, జెడ్పీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎడారిలో నందనవనం
వాది హనిఫా మధ్య సౌదీ అరేబియాలో రియాద్కి అతి సమీపంలో అత్యంత కాలుష్యానికి లోనైన లోయ ఒకటుంది. దానిని పునరుద్ధరించి ఇటీవలే పూర్వ వైభవం తీసుకువచ్చారు అక్కడి అధికారులు. ఎడారిలో ఆకుపచ్చని అందాలను విరబూయించారు. ఏ మాత్రం నివాసయోగ్యం కాని ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. ప్రతి పట్టణం ఈ ప్రాంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్.ఎన్.ఆర్ నీరు మనిషికి ప్రాణాధారం. నాగరికతలన్నీ నది తీరాననే ఊపిరిపోసుకున్నాయి. నీరు ఎంత తక్కువ ఉంటే అక్కడ అభివృద్ధి కూడా అంతగా కుంటుపడుతున్నది తెలిసినదే! సౌదీ అరేబియా ఎడారి దేశం. దీనికి రియాద్ ముఖ్య పట్టణం. రాజధాని కూడా! రియాద్ సమీపంలో 120 కిలోమీటర్ల వైశాల్యంలో ‘వాది హనిఫా’ ఒక లోయ ప్రాంతం. ఈ లోయ ప్రాంతంలో చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఉన్నాయి. సాంస్కృతిక పరంగానూ ఎంతో చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి. ప్రాచీన కాలంలో ఈ లోయలో విస్తారంగా వర్షాలు పడేవి. ఇక్కడ సారవంతమైన భూములు వ్యవసాయానికి అనువుగా ఉండేవి. మానవ ఆవాసాలకు అత్యంత యోగ్యంగా ఉండేది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదిగిన నగరంగా రియాద్ అభివృద్ధి ‘వాది హనిఫా’ వల్లే సాధ్యమైంది. అయితే అంతే వేగంగా ‘వాది హనిఫా’ కాలుష్యానికి లోనైంది. నీరు, గాలి కాలుష్యం వల్ల ప్రజల జీవనశైలి దెబ్బతింది. అనారోగ్యాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. 2001 నుంచి అపరిమిత కాలుష్యం కారణంగా ఇక్కడ అమితమైన వేడి పెరిగిపోవడంతో ఏడాదిలో కొన్ని వారాలు మాత్రమే ఇక్కడ జనం నివసించే పరిస్థితులు ఏర్పడాయి. ఈ విషమ పరిస్థితుల నుంచి ‘వాది’ని నివాస యోగ్యంగా మార్చడానికి ఎఆర్-రియాద్ అభివృద్ధి అధికార బృందం (ఎడిఎ) నడుం బిగించి, విజయవంతంగా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసింది. పర్యావరణాన్ని పునరుద్ధరించడంలో ఇప్పుడీ పట్టణం ఎన్నో దేశాలకు కొత్త దారులు చూపుతోంది. ఒక అందమైన నగరం... పరిశ్రమల నుండి విడుదలయ్యే మురుగుకు ‘వాది’ లోయ డంప్యార్డ్గా మారింది. నిజానికి ‘వాది’ అంటే అరబిక్ సాహిత్యంలో ‘తోట’ అనే అర్థం ఉంది. 14వ శతాబ్దపు అరబ్ యాత్రికుడు ఇబ్నె మటుటా తన సాహిత్య గ్రంథంలో ఈ లోయ ప్రాంతంలో ఉన్న నగరాన్ని ‘ఒక అందమైన నగరం’గా అభివర్ణించారు. ఆ అందమైన నగరమే ఆ తర్వాత కాలంలో అంధవికారంగా మారింది. ఎడిఎ పునరుద్ధరణ ప్రాజెక్టు అమలు వల్ల ఈ ప్రాంతానికి పూర్వవైభవం వచ్చింది. పూర్వ వైభవాన్ని ఇలా తెచ్చిన వైనం.. ఎడిఎతో పాటు మొరియా, తెషిమా, కెనడాకు చెందిన నెల్సన్ పర్యావరణ కేంద్రం రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కింద ‘వాది హనిఫా’ (డబ్ల్యుహెచ్ఆర్పి) పునరుద్ధరణ పనులను చేపట్టాయి. వర్షాకాలంలో వచ్చే వరద నీరు పల్లానికి పోకుండా ముందుగా అడ్డంకులు ఏర్పరిచారు. ఈ లోయ భూభాగం చుట్టూర 50,000 రకాల మొక్కలు నాటి తోట పనులు మొదలుపెట్టారు. చెత్తను తొలగించి, నీటి శుద్ధి కార్య క్రమాలను చేపట్టారు. మూడు పెద్ద కొలనులలో విషపదార్థాలు, హానికరమైన బ్యాక్టీరియాను ఆహారంగా స్వీకరించే జీవ మొక్కలను ఏర్పాటు చేశారు. మానవ నివాసానికి నీటిపారుదల వసతులు కల్పించడానికి సురక్షిత చర్యలు చేపట్టారు. రియాద్ నదికి 35 కిలోమీటర్ల దిగువన వరదలను అడ్డుకోవడానికి చిన్న చిన్న ఆనకట్టలను ఏర్పాటు చేశారు. గుర్రపు డెక్క ఆకారంలో కుటుంబాల కోసం ‘పిక్నిక్ ప్యాడ్లు’ ఏర్పాటు చేశారు. సబ్మెర్జిడ్ ఏరియేషన్ వ్యవస్థను, ఫౌంటేయిన్లను ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రతి పాడ్కు ఒక పెద్ద కోర్టు, నీడలో విశ్రాంతికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లతో కిలోమీటర్ల పరిధిలో ‘వాది’ లోయలో పట్టణ విస్తరణ పునరుద్ధరించబడింది. పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు వేగంవంతం చేశారు. దీంతో ఇక్కడకు పర్యాటకులు తమ కుటుంబాలతో సంవత్సరం పొడవునా సందర్శనకు వస్తున్నారు. అందవికారంగా మారిన లోయను అత్యద్భుతంగా మార్చడం వెనక జరిగిన కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘వాదీ హనిఫా’ పునరుద్ధరణ పనులు దాదాపు పదేళ్లలో అద్బుతమైన ఫలితాన్ని చూపెట్టాయి. ఇప్పుడు వాదిలో 62 ఎకరాలలో 30,000 పామ్ చెట్లు ఏపుగా పెరిగాయి. దారంతా పచ్చని పచ్చిక, తొమ్మిది పార్కులు, 7.4 కి.మీ లలో ఐదు సరస్సులతో నేడు వాది హనీఫా అందరూ నివసించడానికి యోగ్యతను పొందింది. పర్యాటకులకు ఆకర్షణీయ స్థలంగా మారింది. -
రాయలసీమ ఎడారిగాక తప్పదు
పుంగనూరు: ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోకపోతే రాయలసీమకు నీరులేక ఎడారిగా మారిపోతుందని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పుంగనూరు సమీపంలోని కృష్ణాపురంలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కోరారు. హంద్రీ-నీవా కాలువను వెంటనే పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శ్రీశైలం, కృష్ణా జలాల నీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం స్పందించి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. జన్మభూమి-మా ఊరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిపోయిందని దుయ్యబట్టారు. పింఛన్ రూ.వెయ్యి ఇస్తున్నట్లు చెప్పి వేలాది మందికి రద్దు చేయడం బాధాకరమన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను కొనసాగించాలని డిమాండు చేశారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం నిజ స్వరూపం బయటపడుతుందని, ప్రజలే గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, లిడ్క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి తది తరులు పాల్గొన్నారు. -
ఎడారిలో...అద్దాల మ్యాజిక్!
ఎటు చూసినా ఇసుకమేటలే... పచ్చదనం జాడ కనుచూపుమేరలో లేదు... ఎవరికీ పట్టకుండా ఉండిపోయిన ఆ ఎడారిలో కాస్తంత ఫన్ పండిస్తే అదొక పర్యాటక క్షేత్రం అవుతుంది కదా అనుకొన్నాడొక కళాకారుడు. అయితే... అలా అనుకుని ఊరుకోలేదు. సాధించాడు కూడా! ఒక భిన్నమైన ఐడియాతో అతడు రూపొందించిన ఒక ‘హౌస్’ ఆ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చింది. అతను చేసిందల్లా ఏమీ లేదు... చాలా సింపుల్. చెక్కలతో ఒక క్యాబిన్ నిర్మించాడు. వాటి మధ్యలో అద్దాలను పెట్టాడు. అంతే...ఆ అద్దాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ క్యాబిన్ను ఆసక్తికరమైన నిర్మాణంగా మార్చా యి. ఎడారి పరిసరాలు ఆ అద్దాలలో ప్రతిబింబిస్తుంటే... ఈ క్యాబిన్ ‘సీ త్రూ’ నిర్మాణమా? అనే అనుమానం వస్తుంది. తొలిసారి ఈ క్యాబిన్ను చూసిన వారికి ఆ అద్దాల్లో ప్రతిబింబం కనిపిస్తోందా? లేక క్యాబిన్ ఆవలనున్న నిర్మాణాలు కనిపిస్తున్నాయా? అనేది చెప్పడం కష్టం. దీంతో ఈ మిర్రర్ హౌస్ మ్యాజిక్ హౌస్గా మారింది. దీనికి ఎడారి పరిసరాలు ఒక విధమైన కారణం అయితే... ఈ నిర్మాణాన్ని చేపట్టిన ఫిలిప్ స్మిత్ ఐడియా మరో కారణం. కాలిఫోర్నియాలోని ఒక ఎడారిలో దీన్ని నిర్మించారు. రాత్రిపూట ఈ క్యాబిన్ హౌస్లో లోపలి వైపు వేసిన లైట్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఇది మరో ఆకర్షణ. ఈ విధంగా ఈ మిర్రర్ హౌస్ ఎడారికి పర్యాటక శోభను తీసుకువచ్చింది. -
ఎడారిగా మారనున్న సీమాంధ్ర
-
అరణ్యం: కుందేలుకు సంతోషం కలిగితే...?
మగ కుందేళ్లను బక్స్, ఆడ కుందేళ్లను డాస్ అంటారు! కుందేళ్లు ఎలాంటి ప్రదేశంలో అయినా జీవించగలవు. గడ్డి మైదానాలు, వర్షారణ్యాలు, చివరకు ఎడారుల్లో కూడా అవి బతగ్గలవు! ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి! కుందేళ్లు సంవత్సరంలో మూడుసార్లు బిడ్డల్ని కంటాయి. వీటి పిల్లలను కిట్స్ అంటారు. పుట్టినప్పుడు వీటికి చూపు ఉండదు. ఒంటిమీద బొచ్చు కూడా ఉండదు! వీటి దృష్టికోణం 360 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఇవి తమ వెనుక ఉన్నవాటిని కూడా తల తిప్పకుండానే చూడగలవు! కుందేళ్లకు ఇరవై ఎనిమిది పళ్లుంటాయి. ఇవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వీటి గుండె నిమిషానికి 130 నుంచి 325 సార్లు కొట్టుకుంటుంది! వీటికి ఆనందం వస్తే నానా హంగామా చేస్తాయి. ఎగురుతాయి, ఎత్తులెక్కి దూకుతాయి, అడ్డదిడ్డంగా పరుగులు తీస్తాయి, కాళ్లు నేలకేసి టపటపా కొడుతుంటాయి! కుందేళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. తోడు లేకపోతే విసిగిపోతాయవి! కొన్నిసార్లు ఆహారమే కుందేళ్ల పాలిట విషమవుతూ ఉంటుంది. ఎందుకంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే అదే విషమై ప్రాణాలు తీస్తుంది. అందుకే గట్టిగా ఉండే ఆహారాన్ని ముట్టవు కుందేళ్లు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే గడ్డి, కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి వాటినే తింటూ ఉంటాయి! మీసాలు మాకూ ఉన్నాయోచ్! పక్షులకు కూడా మీసాలుంటాయా అని ఆశ్చర్యం వేయడం లేదూ దీన్ని చూస్తుంటే! అయితే ఇవి మీసాలు కాదు... కొమ్ములు. పైగా ఒకటి, రెండు కాదు... మూడున్నాయి! అందుకే దీన్ని త్రీ వ్యాటిల్డ్ బెల్ బర్డ్ అంటారు. ఆడ బెల్ బర్డ్స్కి ఇలా కొమ్ములు ఉండవు. మగవాటికి మాత్రమే ఉంటాయి. దక్షిణ అమెరికాలో కనిపించే ఈ పక్షులు ముప్ఫై సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. వీటి ముక్కు చుట్టూ వచ్చే మూడు కొమ్ములు పది సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. సాధారణంగా ఈ కొమ్ములు కిందికి వేళ్లాడుతున్నట్టుగా ఉంటాయి. కానీ భయపడినప్పుడు, కోప్పడినప్పుడు, పాట పాడుతున్నప్పుడు నిటారుగా అవుతుంటాయి. అలాంటప్పుడు వాటి పరిమాణం కూడా కాస్త పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పక్షులన్నింటిలోకీ గట్టిగా అరవగలిగేవి ఇవే. వీటి అరుపు కిలోమీటరు దూరం వరకూ స్పష్టంగా వినిపిస్తుంది. తమ జంట విషయంలో వీటికి స్వార్థం చాలా ఎక్కువ. ఇతర మగ పక్షి కనుక తనతో జతకట్టిన ఆడపక్షి దగ్గరకు వస్తే, దాని చెవిలో గట్టిగా అరిచి వెళ్లగొట్టేస్తాయి మగ బెల్ బర్డ్స్. మనిషయినా పక్షి అయినా జెలసీ సహజమే అన్నమాట! -
రాష్ట్రం విభజిస్తే కృష్ణా డెల్టా ఎడారే!