
భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్థాన్.. పచ్చి అబద్ధాలతో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదంటూ బీరాలు పలికిన పాక్.. నిజాలను ఒక్కొక్కటిగా ఒప్పుకుంటోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ (Shehbaz Sharif) భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని స్వయంగా ఆయనే చెప్పారు.
భారత్ రావల్పిండిలోని ఎయిర్బేస్తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిదని.. తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందంటూ షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్లో పర్యటిస్తున్న షెహ్బాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత భారత్పై దాడి చేయాలని పాక్ ప్లాన్ చేసింది. అయితే, పాకిస్తాన్ చర్య తీసుకునే ముందే భారత్ మరో బ్రహ్మోస్ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని షెహ్బాజ్ చెప్పుకొచ్చారు. కాగా, దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చిన సంగతి తెలిసిందే. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని మూడు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ వేదికగా ప్రకటించారాయన.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటనను పాక్ పత్రిక ది డాన్ ప్రముఖంగా ప్రచురించింది.