
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్ష్యదీప్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మాల్దీవులలో ఉన్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని ఇండియాను కోరినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవుల దేశం సుమారు రెండు నెలల తర్వాత మరోసారి భారత్ను తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మాల్దీవులలో భారత్కు చెందిన 88 మంది మిలటరీ సైనికులు ఉన్నారు.
తమ ద్వీపదేశం నుంచి భారత భద్రతా దళాలను మార్చి 15 వరకు ఉపసంహిరించుకోవాలని మర్యాదపూర్వకంగా ఇండియాను కోరినట్లు మల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు. ఇక నుంచి భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉండరాదని తెలిపారు. తమ దేశ అధ్యక్షుడైన మహ్మద్ మొయిజ్జు పాలనాపరమైన విధానమని స్పష్టం చేశారు.
అయితే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం జరగ్గా భారత హైకమిషనర్ మును మహవర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాల్దీవుల నుంచి భారత్ భద్రతా బలగాలను మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల పబ్లిక్ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా ఇబ్రహీం కోరినట్లు మును మహవర్ తెలిపారు.
ఇక.. చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవంబర్లోనే భారత్ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే.
చదవండి: Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్కు ఫేవర్!
Comments
Please login to add a commentAdd a comment