
దుబాయ్: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీ సహా పలు వాణిజ్య నౌకలపై ఆదివారం దాడులు జరిగినట్లు అమెరికా పేర్కొంది. దాడికి కారణమెవరనే విషయం పెంటగాన్ తెలపలేదు. ఉదయం 10 గంటల సమయంలో యెమెన్ రాజధాని సనాలో మొదలైన ఈ దాడులు సుమారు 5 గంటలపాటు కొనసాగినట్లు ఓ అధికారి చెప్పారు.
ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడి, పేలుళ్లు సంభవించినట్లు అంతకుముందు బ్రిటిష్ మిలటరీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ఓడలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో దాడులకు తెగబడుతున్నారు. తాజా ఘటనలపై హౌతీలు స్పందించలేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం వేళ మధ్యప్రాచ్యంలో ఈ దాడులు ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.